ఆటాపోటీ
ఫుల్ జోష్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫుల్ జోష్ కొనసాగించడం అభిమానులను ఉర్రూతలూగించింది. కోహ్లీ అద్వితీయ ప్రతిభను కనబరిస్తే, అతనిని స్ఫూర్తిగా తీసుకొని యావత్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. రికార్డుల మీద రికార్డులు సృష్టించిన ఈ సిరీస్ కోహ్లీకి చిరస్మరణీయ అనుభూతులను మిగిల్చి ఉండవచ్చు. అదేవిధంగా భారత్ జట్టుకు కూడా ఈ సిరీస్ ఒక తీపి గుర్తుగా నిలిచిపోవచ్చు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్న టీమిండియా ఏ విధంగా ఆడుతుందో చూడాలి. వరుస సిరీస్లను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా అక్కడ కూడా అదే ఒరవడిని కొనసాగిస్తుందా అనేది ఆసక్తిని రేపుతున్నది. మొత్తం మీద గత ఏడాది జూలైలో మొదలైన భారత్ టెస్టు సిరీస్ల వేట నిరాటంకంగా కొనసాగింది. వరుసగా తొమ్మిది సిరీస్లను తన ఖాతాలో వేసుకొని, ఆస్ట్రేలియా రికార్డును సమం చేసింది. 2005 అక్టోబర్ నుంచి 2008 జూన్ మధ్య ఆస్ట్రేలియా వరుసగా తొమ్మిది టెస్టు సిరీస్లను గెల్చుకుంది. 1884-1890 మధ్యకాలంలో ఎనిమిది వరుస సిరీస్లను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. కెప్టెన్ కోహ్లీతో పోటీపడుతూ అతని నాయకత్వంలో 2015 టెస్టు సిరీస్లో శ్రీలంకను, శ్రీలంకలోనే 2-1 తేడాతో భారత్ ఓడించింది. అదే ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాను 3-0 తేడాతో చిత్తుచేసింది. అనంతరం 2016లో వెస్టిండీస్ టూర్కు వెళ్లింది. ఆ జట్టుపై 2-0 ఆధిక్యంతో విజయభేరి మోగించింది. అదే ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్ను 3-0, ఇంగ్లాండ్ను 4-0 ఆధిక్యంతో ఓడించి, తనకు తిరుగులేదని నిరూపించింది. ఈ ఏడాది స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టును సొంతం చేసుకుంది. అనంతరం పటిష్టమైన ఆస్ట్రేలియాను ఢొని, 2-1 తేడాతో సిరీస్ను గెల్చుకుంది. అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అక్కడ 3-0 తేడాతో ఆ జట్టుకు వైట్వాష్ వేసింది. తిరిగిన స్వదేశంలో శ్రీలంకతోనే జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0 తేడాతో విజయం సాధించింది. లంకతో చివరి టెస్టు జరిగిన న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 1988 నుంచి ఇప్పటివరకూ భారత్ ఒక్క పరాజయాన్ని కూడా చవిచూడకపోవడం విశేషం. అప్పటినుంచి మొత్తం 12 టెస్టులను ఈ స్టేడియంలో ఆడిన భారత్ పది విజయాలు సాధించింది. రెండు మ్యాచ్లు డ్రా అయ్యాయి.
టాప్ స్కోరర్ కోహ్లీ
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో విరాట్ కోహ్లీ మ్తొం 610 పరుగులు సాధించి, టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని స్కోరులో రెండు డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. 57 ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. రెండో స్థానంలో ఉన్న శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ 366 పరుగులు చేశాడంటే, కోహ్లీ బ్యాటింగ్ ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించడం కష్టం కాదు. మురళీ విజయ్ 292 పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ల జాబితాలో మొదటి రెండు స్థానాలను కోహ్లీనే ఆక్రమించాడు. నాగపూర్ టెస్టులో 213 పరుగులు చేసిన అతను ఢిల్లీ టెస్టులో 243 పరుగులతో కదంతొక్కాడు. నాగపూర్లో 267 బంతులు ఎదుర్కొన్న అతను ఢిల్లీలో 287 బంతులు ఆడాడు. దినేష్ చండీమల్ ఢిల్లీలో 164 పరుగులు చేసి, ఈ జాబితాలో మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు. సెంచరీలు సాధించిన వారి జాబితాలో కోహ్లీ కూడా ఉన్నాడు. కోల్కతా టెస్టులో అతను అజేయంగా 104 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో శతకాలు సాధించిన బ్యాట్స్మెన్ జాబితాలో కోహ్లీ, చండీమల్తోపాటు మురళీ విజయ్ (155/ ఢిల్లీ, 128/నాగపూర్), చటేశ్వర్ పుజారా (143/నాగపూర్), ధనంజయ డిసిల్వ (119 నాటౌట్/ ఢిల్లీ), ఏంజెలో మాథ్యూస్ (111/ ఢిల్లీ), రోహిత్ శర్మ (102 నాటౌట్/ నాగపూర్) ఉన్నారు. సగటుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మురళీ విజయ్ మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు.
ఒక టెస్టులో అత్యధిక స్కోర్ల జాబితాలో మొదటి, రెండు స్థానాలు టీమిండియానే దక్కించుకుంది. నాగపూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్ను 6 వికెట్లకు 610 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత్, ఢిల్లీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ను 7 వికెట్లకు 536 పరుగులకు డిక్లేర్ చేసింది. శ్రీలంక అత్యధికంగా ఢిల్లీ టెస్టులో 373 పరుగులు సాధించింది.
బౌలింగ్ విభాగంలోనూ భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 12 వికెట్లు కూల్చగా, రవీంద్ర జడేజా 10 వికెట్లు పడగొట్టాడు. మూడో స్థానంలో ఉన్న మహమ్మద్ షమీకి ఎనిమిది వికెట్లు లభించాయి. శ్రీలంక తరఫున సురంగ లక్మల్ ఎనిమిది వికెట్లను సాధించగలిగాడు. ఒక బౌలర్, ఒక ఇన్నింగ్స్లో అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టిన సంఘటనలు ఏడు ఉన్నాయి. అశ్విన్, భువనేశ్వర్ కుమార్ చెరి రెండు పర్యాయాలు ఈ ఫీట్ను సాధించారు. సురంగ లక్మల్, మహమ్మద్ షమీ, సండాకన్ ఒక్కోసారి చొప్పున ఒక ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు దక్కించుకోగలిగారు. ఏ రకంగా చూసినా శ్రీలంకపై భారత్ ఆధిపత్యం స్పష్టమైంది.
కెప్టెన్ దూకుడు
కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీ దూకుడు మరింత పెరగింది. ఢిల్లీ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేసిన అతను రెండో టెస్టులో అర్ధ శతకం సాధించి, ఈ ఫీట్ను అందుకున్న ఆరో బ్యాట్స్మన్గా చరిత్ర పుటల్లో చోటు సంపాదించాడు. సునీల్ గవాస్కర్, గ్రాహం గూచ్, మార్క్ టేలర్, స్టెఫెన్ ఫ్లెమింగ్, గ్రేన్ స్మిత్, రికీ పాంటింగ్ ఇంతకుముందు ఈ ఘనతను అందుకున్నారు.
కాగా, ఈ ఏడాది కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 2,818 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాట్స్మెన్లో మొదటి స్థానాన్ని సంపాదించాడు. కెప్టెన్గా తొమ్మిది వరుస టెస్టు సిరీస్ల్లో జట్టును గెలిపించి రికీ పాంటింగ్ రికార్డును సమం చేసిన అతను కెప్టెన్గా తన మొదటి మూడు టెస్టుల్లో మూడు శతకాలు నమోదు చేసిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. మూడు మ్యాచ్ల ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు (610) సాధించిన భారత క్రికెటర్గా మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించిన మరుక్షణం నుంచి ఇప్పటివరకూ అతను ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. భారత బ్యాట్స్మెన్లో వనే్డల్లో అత్యంత వేగంగా (52 బంతులు) సెంచరీ, అత్యంత వేగంగా 1,000, 5,000, 6,000, 7,000, 8,000, 9,000 పరుగుల మైలురాళ్లను చేరుకున్న భారత క్రికెటర్గా రికార్డులు అతని ఖాతాలో ఉన్నాయి. అంతర్జాతీయ కెరీర్లో 10, 15, 20, 25 సెంచరీలను వేగంగా పూర్తి చేసిన భారత బ్యాట్స్మన్ కూడా అతనే. అంతర్జాతీయ రికార్డులు కూడా అతని పేరుమీద ఉన్నాయి. కెరీర్లో వేగంగా 30 వనే్డ సెంచరీలు, టి-20 ఫార్మాట్లో 1,000 పరుగులు, అంతర్జాతీయ క్రికెట్లో 15,000 పరుగులు చేసిన బ్యాట్స్మన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్స్లో కలిపి 50 శతకాలను వేగంగా పూర్తి చేసిన రికార్డును హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా/ 348 ఇన్నింగ్స్)తో కలిసి పంచుకుంటున్నాడు. టెస్టు, వనే్డ, టి-20 ఫార్మాట్స్లో సగటున యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్మన్ కోహ్లీ. కెప్టెన్గా 2,000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన వారిలో అతనే నంబర్ వన్.
ఒక కేలండర్ ఇయర్లో 10 అంతర్జాతీయ శతకాలు చేసిన కెప్టెన్ కూడా కోహ్లీనే. టెస్టుల్లో భారత కెప్టెన్లు అందరి కంటే అతను ఎక్కువగా 12 సెంచరీలు చేశాడు. అదే విధంగా కెప్టెన్గా టెస్టుల్లో ఎక్కువ డబుల్ సెంచరీలు కూడా అతనివే. కోహ్లీ మొత్తం ఆరు డబుల్ సెంచరీలు చేశాడు. ఈ ఏడాది 11 సెంచరీలు చేసి, ఒక కేలండర్ ఇయర్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్గా మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగిన మరుక్షణం నుంచే రికార్డులు సృష్టిస్తున్న కోహ్లీ శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల ఫార్మాట్ సిరీస్ల్లో ఆడడం లేదు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న అతను వచ్చేనెల దక్షిణాఫ్రికా సిరీస్లో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.