అక్షర

నిజంగా... చాలా చెప్పేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నీ చెప్పేస్తున్నా
(పోలీస్ పొలిటీషియన్ స్వ‘గతం’)
-రావులపాటి సీతారాంరావు
వెల: రూ.90/-
ప్రతులకు: సాహితి ప్రచురణలు
29-13-53, కాళేశ్వరరావురోడ్డు
సూర్యారావుపేట, విజయవాడ-2
0866-2436642/43

ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి, పదవీ విరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి. ‘అన్నీ చెప్పేస్తున్నా...’అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత రావులపాటి సీతారాంరావు కేవలం, ఒక పోలీసు అధికారి. ఓ రాజకీయ పార్టీ నాయకుడు మాత్రమే కాదు. చదువుకునే రోజులనుంచీ చేయి తిరిగిన రచయిత కూడా. కలం పట్టిన చేత్తో లాఠీ పట్టుకున్నా, తొలుత పట్టుకున్న కలాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ప్రభుత్వ సర్వీసులో ఉన్నత పదవులను నిర్వహించి తదనంతరం రాజకీయాల్లో చేరి రాణించిన వాళ్ళు ఎంతోమంది వున్నారు. కాకపోతే అటు ఉద్యోగ పర్వంలో, అటు పిదప రాజకీయ రంగంలో వృత్త్ధిర్మంగా పలువురు రాజకీయ ప్రముఖులతో అత్యంత సన్నిహితంగా మెలిగే సావకాశం బాగావున్న రావులపాటి వంటివారు, ఏదైనా పుస్తకం రాస్తే, అందులోనూ ‘అన్నీ చెప్పేస్తున్నా’ అనే పేరుపెట్టి పుస్తకం రాస్తే ఇక అందులో ఏం రాశారో, ఏం చెప్పారో అన్న ఆసక్తి సర్వత్రా కలగడంలో విడ్డూరం ఏమీలేదు. పోలీసు ఇంటలిజెన్స్ విభాగంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కాలంలో రావులపాటి సీతారాంరావుకు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషులు ఎన్టీరామారావుతోనూ, అలాగే తరువాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన చంద్రబాబునాయుడుతోనూ అతి సన్నిహితంగా మెలగ గలిగే వీలూసాలూ వృత్తిరీత్యా లభించింది. ఎనె్నన్నో ఆంతరంగిక విషయాలకు, బయటకు పొక్కని సందర్భాలకు, సన్నివేశాలకు ప్రత్యక్ష సాక్షిగా వుండే వెసులుబాటు రావులపాటికి కలిగింది. అంచేత వారిరువురికీ సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు ఈ పుస్తకంలో చోటుచేసుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అయితే ఆ విషయాల్లో రచయిత పాటించిన సంయమనం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. సంచలనంకోసం కూడా తనకు తెలిసిన నిజాలను, తనకు మాత్రమే తెలియగల వాస్తవాలను, ప్రత్యేకించి కించపరిచే సంచలన అంశాలను పక్కనబెట్టి రాసిన తీరు మెచ్చతగింది. ఈ పుస్తకంపైన తన అభిప్రాయం రాస్తూ ప్రసిద్ధ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అదే అన్నారు.
‘గతంలో ఆత్మకథలు అనేకం వచ్చాయి. అయితే ఈ పుస్తకంలో కనబడే విశిష్టత రచయిత నిజాయితీ. పుస్తకం కమ్మర్షియల్‌గా సక్సెస్ అవడంకోసం పేరున్నవారిని తిట్టడం, వారి బలహీనతల్ని భూతద్దంలో చూపడం మొదలైనవి ఇందులో కనబడవు’అంటూ, రావులపాటి వారు ఎన్నో తెలియని విషయాలు చెబుతారని కొందరు పెట్టుకునే ఆశలపై ముందస్తుగానే ఇన్ని నీళ్ళు చల్లేశారు.
మరి ఇంత నిజాయితీతో, నిబద్ధతతో రాసే పుస్తకంలో చదివించే అంశాలు ఏమీ లేవా అంటే, వున్నాయి. అందులో ముందుగా చెప్పాల్సింది రాసిన తీరు. ఎంతో సరళంగా, గందరగోళాలు లేకుండా హాయిగా ఏకబిగిన చదువుకునే విధంగా వుంది రచయిత శైలి. ఆయన స్వయానా రచయిత కావడంవల్ల, ఆత్మకథ అనండి, లేదా ఆయనే చెప్పుకున్నట్టు పోలీసు పొలిటీషియన్ స్వ‘గతం’ అనండి, ‘చదివించే గుణం’ ఈ పుస్తకంలో పుష్కలంగా వుంది. అనేక దశాబ్దాలపాటు ప్రభుత్వ సర్వీసులో వుండి తాను గమనించిన విషయాలను సమగ్రంగా, సందేహాలకు తావులేకుండా, రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా, ముందు వెనుకల సన్నివేశాలను ఒక క్రమపద్ధతిలో ఏర్చికూర్చి, ఒక పుస్తకంగా రాయడం అనేది అంత సులభమైన విషయం కాదు. పైగా జీవించి వున్న వ్యక్తులను, వారి వ్యక్తిత్వాలను అంచనావేస్తూ రచన చేయడం అనేది నిజంగా కత్తిమీద సామే. ఈ విషయంలో రావులపాటి పూర్తిగా కృతకృత్యులయ్యారు అనడానికి యండమూరివారి కితాబే సాక్షి.
నిజానికి ఈ పుస్తకం మొదటి నుంచి చివరివరకు ఒక రాజకీయ గ్రంథమే. రాజకీయాల్లో చేరాలనే ఆసక్తిఉన్నవారికి ఒక పాఠ్యాంశంగా ఈ పుస్తకం నిలిచిపోతుందని యండమూరి వీరేంద్రనాథ్ అన్న మాట ఏదో మెచ్చుకోలుకోసం చెప్పింది కాదని పుస్తకం చదివిన వారికి ఇట్టే తెలిసిపోతుంది.
సుదీర్ఘకాలం పోలీసుశాఖలో పనిచేసి, అటు సమర్ధుడయిన అధికారిగా, ఇటు ఆహ్లాద రచయితగా మంచి పేరుతెచ్చుకున్న రావులపాటి సీతారాంరావు అనే వ్యక్తి. ఉద్యోగ విరమణ అనంతరం, అంత మంచి పేరులేని రాజకీయ రంగప్రవేశం చేస్తానని ప్రకటించడం ఇంటాబయటా ఎంతో ఉద్వేగాన్ని కలిగించింది. ఈ పుస్తకాన్ని తన అర్ధాంగి శ్రీమతి శారదకు అంకితమిస్తూ రావులపాటి అదే పేర్కొన్నారు. రాజకీయాలు నాకు సరిపడవని మా ఆవిడ ప్రగాఢ విశ్వాసం. అయినా సరే, ఆ రాజకీయాలు నాకు కలిసి రావాలని ఆమె నిరంతరం ప్రార్ధిస్తూనే వుంటుంది. సరే! రాజకీయాల్లో చేరాలంటే ఏదో ఒక పార్టీలో చేరక తప్పదు. మరి ఆ పార్టీ ఏమిటి?
తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన్ని గురించి బాగా తెలిసిన వారందరికీ మరింత ఆశ్చర్యం కలిగించింది. అదేమీ అంటరాని పార్టీకాదుకదా! పైగా ఆరోజుల్లో ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో వుంది. పైపెచ్చు టీడీపీ అధినేత కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్న రోజులాయే! మరి ఆశ్చర్యాలు, అభ్యంతరాలు ఎందుకోసం? ఎందుకంటే, రావులపాటి వారి ఇలాకా అంతా కాంగ్రెస్ మయం. వాళ్ళ స్వగ్రామాలు ఒకనాటి కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం జిల్లాలో వున్నప్పటికీ, వారి నరనరాన కాంగ్రెస్ సంస్కృతి జీర్ణించుకుని వుంది. తెలుగుదేశం పార్టీలో చేరాలని సీతారాంరావుగారి నాన్నగారు రావులపాటి సత్యనారాయణరావుగారు ప్రముఖ కాంగ్రెస్ వాది. పాలేరు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక బంధుగణం అంతా కాంగ్రెస్ పార్టీ మనుషులే. రక్తపరీక్ష చేస్తే కాంగ్రెస్ రక్తం కనబడుతుందని హాస్యోక్తిగా చెప్పుకునేవారు. అలాంటిది ఒక పోలీసు ఆఫీసరుగా పనిచేసి రాజకీయాల్లో చేరాలని అనుకోవడమే ఒక సంచలనం అయితే, చేరేది తెలుగుదేశం పార్టీ కావడం చుట్టపక్కాల్లో పెనుసంచలనం అయింది. అయినా టీడీపీ పడవ ఎక్కాలనే నిర్ణయానికి రావులపాటి వారిని ప్రోద్బలపరచిన అంశం ఒక్కటే.
చంద్రబాబునాయుడు అనే ఒకే ఒక వ్యక్తికి మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సమర్ధత వుందని ఆయన మనసావాచా నమ్మడమే. అందుకే ఆ పార్టీ అధికారంలో వున్నప్పుడు అందులో చేరి, దరిమిలా ఒక దశాబ్దంపాటు ఆ పార్టీ అధికారానికి దూరంగావున్నా ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీకి దూరంకాలేదు. ఆ పార్టీని, దాని నాయకుడిని నమ్ముకునే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. పైపెచ్చు ‘అండా దండా నాకు నాయకుడే’ అని ఈ పుస్తకంలో బల్లగుద్ది చెప్పుకున్నారు. నడుమలో తమవైపు రమ్మని వై.ఎస్.ఆర్. వైపునుంచి పరోక్ష సంకేతాలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం టీడీపీని వదలలేదు. రాజకీయాల్లో విలువలు వుండి తీరాలని, లేకపోతే వాటికి ఏమాత్రం విలువ వుండదన్నది తన నమ్మకం అని ఆయన రాసుకున్నారు. ‘పార్టీ మారాలనే ఆలోచన చేయకపోవడానికి కారణం బహుశా నేను ఏ అధికార పదవిని అంతవరకూ చవిచూడకపోవడం కూడా ఒక బలమైన కారణం కావచ్చు. ఆ రుచి నాకు తెలియకపోవడంవల్లనే నేను ఈ నడవడికకు కట్టుబడి వుండి వుండొచ్చు.’అని రాసుకోవడంలో వున్న నిజాయితీయే యండమూరిని ఆకర్షించిందేమో!
1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పరాజయం తరువాత, కాంగ్రెస్ విజయయాత్రలో పాల్గొన్న వారిలో కొందరు అతి ఉత్సాహానికిపోయి ఆబిడ్స్‌లోని రామారావు నివాసం వెలుపల ‘ముఖ్యమంత్రి’ అని రాసి వున్న నేమ్‌ప్లేటును తీసి కింద పారేశారు. అప్పుడు ఆ ఏరియా పోలీసు అధికారి సీతారాంరావు. ఒక జూనియర్ అధికారి ‘నేమ్‌ప్లేట్’ విషయాన్ని ఎన్టీఆర్‌కి నొచ్చుకుంటూ చెప్పబోతే, ‘నేమ్‌ప్లేట్ దేముంది బ్రదర్, పదవే పోయిన తరువాత’ అని ఆయనే సర్దిచెప్పిన తీరు తనని కదిలించి వేసిందని రావులపాటి రాసుకున్నారు.
పోలీసు అధికారిగా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించారని మంచి పేరు తెచ్చుకున్న సీతారాంరావు, చంద్రబాబు విషయంలో భావోద్వేగాన్ని దాచుకోలేకపోయారు. అది ఆయన మాటల్లోనే:
‘మే, 2014’
‘పోటాపోటీగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకోసం అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆ క్రితం రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. ఫోన్లలో వచ్చే రకరకాల మెసేజ్‌లు చాలా చీకాకు పెట్టాయి. కొందరు ఫారిన్‌నుంచి కూడా ఫోను చేసారు. ‘ఏమవుతుంది? జగన్ గెలుస్తాడా? ఏదో సర్వే చెప్పిందట కదా!’ మరికొందరు భయంభయంగా చంద్రబాబు రావాలి సార్, రాకపోతే యెట్లా? ఇలాంటి పలకరింపులు ఆందోళనను మరింత పెంచాయి. అర్ధరాత్రి దాటిన తరువాత మరో ఫోను. ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన ఓ అధికారి. ‘ఇంత రాత్రివేళా’ అన్నాను. ‘ఇప్పుడే చాలా నమ్మకంగా తెలిసింది. తెలంగాణాలో భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్, ఆంధ్రాలో కొద్ది తేడాతో జగన్ గెలుస్తారని, అయినా మనసు మూలల్లో ఏదో నమ్మకం, అలా జరగదనీ, చంద్రబాబు గెలుస్తారనీ.
‘ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు ఇంట్లో వున్నాం. ఫలితాలు వస్తున్నాయి. ఒక్కో సీటు గెలుస్తుంటే ఉత్సాహం, కేకలు, తొంభయ్ సీట్లు రాగానే చంద్రబాబునాయుడు దగ్గరకు వెళ్లి అభినందనలు చెప్పబోయాం. ‘వంద రానివ్వండి. అప్పుడు చెబుదురు కాని’ అన్నారు ఆయన నిబ్బరంగా. రాత్రంతా పడ్డ ఆందోళన దూదిపింజలా యెగిరి పోయింది.’
ఈ పుస్తకం చివర్లో ఒక చమత్కార పూరితమైన ఒక వాక్యం వుంది. ఉద్యోగపర్వంలో కడకంటా తన పేరును అంటిపెట్టుకుని వున్న ఐ.పీ.ఎస్. (ఇండియన్ పోలీసు సర్వీసు) అనే మూడు ఇంగ్లీష్ పొడి అక్షరాలు, రాజకీయ రంగప్రవేశం దరిమిలా కూడా ‘ఇండియన్ పొలిటికల్ సర్వీసు’గా తనతోనే సహచర్యం చేస్తున్నాయని ఒక చమత్కార బాణం సంధించారు. అంతేకాదు ఈ రెండో ఉద్యోగానికి రిటైర్‌మెంటు లేదని కూడా అంటూ, తన రాజకీయ ప్రయాణం సుదీర్ఘమైనదన్న సంకేతాన్ని కూడా ఇచ్చారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన రావులపాటి సీతారాంరావు, ఈ పుస్తకంలో రాసిన ఓ ఆసక్తికరమైన విషయంతో దీన్ని ముగిస్తాను.
‘మా నాన్న తొంభయ్ సంవత్సరాల వృద్ధుడు. తెలంగాణా రాష్ట్రాన్ని డిక్లేర్ చేసిన సందర్భంగా హైదరాబాదు అంతా పండుగ వాతావరణంలో మునిగి తేలుతోంది. మా తమ్ముడి కూతురు ‘జై తెలంగాణా’అంటూ ఆయన మంచం దగ్గరికి వెళ్లి, ‘తాతయ్యా! తెలంగాణా వచ్చింది. జై తెలంగాణా అను’ అని ఆయన చేయి అతి కష్టంమీద పైకెత్తింది. అప్పటికే ఆయన చాలా అస్వస్థతతో వున్నారు. అయినా ఆయన తన చేతిని బలవంతంగా ఎత్తి పెట్టుకుని, ‘జై విశాలాంధ్ర’ అని కళ్ళుమూసుకున్నారు. ఈ చిన్న పిల్లకు అర్థం కాలేదు. ఆ మాట కొత్తగా విన్నది. విశాలాంధ్ర కోసం శ్రమించిన వ్యక్తి ఆయన. విలువలను మార్చుకోలేని అశక్తుడు.

-భండారు శ్రీనివాసరావు