ఆంధ్రప్రదేశ్‌

సేవల్లో జాప్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: సులభం, వేగం అనే ప్రధాన నినాదంతో అమల్లోకి వచ్చిన మీ-సేవా కేంద్రాలు ఆచరణలో విఫలమవటంతో జనంలో నిరాసక్తత నెలకొంటోంది. ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండగా, అదే సమయంలో చేతి చమురు కూడా అధిక మొత్తంలో వదులుతోంది. రెవెన్యూ శాఖ పరంగా అందిస్తున్న సేవలు ప్రజలకు చేరువ చేసి రైతులు, విద్యార్థులు, ఇతర వర్గాలకు అవసరమైన ధ్రువపత్రాలు సత్వరం అందించటానికి ప్రభుత్వం మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అడంగల్ పత్రం, ఆర్‌ఓఆర్, ఎఫ్‌ఎంబి, గ్రామపటం, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ తదితర పలు రకాల సేవలందించాలనే ఉద్దేశ్యంతో మీసేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా ప్రస్తుతం అందిస్తున్న సేవలు రైతులకు, విద్యార్థులకు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు వారం రోజుల్లోపు ఇవ్వాలి. కాని అది అమలు జరగటం లేదు. అధికారుల నిర్లక్ష్యంతోపాటు అంతర్జాల సాంకేతిక సమస్యలు అడుగడుగునా వేధిస్తుండటంతో సమస్య రానురాను తీవ్రమవుతున్నది. వ్యయం కూడా తడిసి మోపెడవుతోంది. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలకు ఒక్కోదానికి రూ.30లు చెల్లించాలి. విద్యార్థులందరికీ ఈ మూడు అవసరం ఉండటంతో రూ.90ల వ్యయం చేయాల్సి ఉంటుంది. నోటరీకి రూ.150 వరకు ఖర్చు అవుతుంది. పదేళ్లకు పనికి వచ్చే కుల ధ్రువీకరణ పత్రానికి మాత్రమే నోటరీ చేయాల్సి ఉండగా అధికారుల అవగాహన లోపం వల్ల అందరికీ, అన్నింటికీ నోటరీ కావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారు. రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే సమయంలో వారికి ధ్రువపత్రాలు వెనువెంటనే అవసరం. ఉన్నతాధికారులు అనేకసార్లు కిందిస్థాయి సిబ్బందికి ప్రయోగాలు చేయకుండా ధ్రువపత్రాలు సత్వరమే అందేటట్లు చూడాలని చెబుతున్నా కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవటం లేదని రాష్ట్ర పెన్షన్‌దారుల చర్చావేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య ఆంధ్రభూమితో అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ధ్రువపత్రాల జారీలో జాప్యాన్ని నివారించి అంతర్జాలంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడటంతోపాటు ప్రజలకు మీసేవా కేంద్రాల పట్ల ఆసక్తి పెరిగే విధంగా సేవలందించాలని కోరారు.