ఆంధ్రప్రదేశ్‌

హడలెత్తిస్తున్న ఈదురు గాలులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23: ఒకపక్క వేసవి ఎండలు మండిపోతుంటే, మరోపక్క ఈదురు గాలులు గోదావరి జిల్లాలను హడలెత్తిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈదురు గాలులు, అక్కడక్కడా భారీ వర్షాలతో రైతాంగం బెంబేలెత్తిపోతోంది. ఈదురు గాలులకు పలుచోట్ల వరి పంట నేలనంటుతోంది. అలాగే మామిడి, జీడిమామిడి, మిర్చి, మొక్కజొన్న, అరటి, కోకో తదితర పంటలకు నష్టం వాటిల్లుతోందని రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఇక అక్కడక్కడా కురస్తున్న భారీ వర్షాలకు ధాన్యం తడిచిపోతోంది. రేయింబవళ్లు శ్రమించి సాగుచేసిన దాళ్వా పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గత మూడు రోజులుగా చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో దాళ్వా పంట మాసూళ్ల దశలో ఉంది. కొన్ని చోట్ల పనలపై ఉండగా, మరికొన్ని చోట్ల ధాన్యం రాశులుగా ఉండటంతో అకాల వర్షాలకు తడిసిపోతోంది. ఈదురు గాలుల కారణంగా కోత దశలోని పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కోతలు పూర్తయి పనలపై ఉన్న పంట తడిస్తే గింజలు రాలిపోతాయని, ధాన్యం రంగు మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాగా ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈదురు గాలులకు మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో గొల్లప్రోలు-పిఠాపురం వెళ్లే రహదారిపై బైపాస్ రోడ్డు సమీపంలో చెట్లుకూలి రహదారికి అడ్డంగా పడిపోవడంతో గంటల తరబడి ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోయాయి.
పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలులకు భారీ చెట్లు నేలకూలాయి. భారీ వర్షం కూడా కురవడంతో కళ్లాల్లో పోసిన మిర్చి పంట తడిసి ముద్దయింది. ఇక పలు గ్రామాల్లో ఇళ్లు కుప్పకూలాయి. రేపాకగొమ్ము, కోయిదా వెళ్లే రహదారుల్లో పెద్దపెద్ద వృక్షాలు నేలకూలడంతో రాకపోకలు స్తంభించాయి. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిసరాల్లో మంగళవారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా నిలచిపోయింది. లక్కవరం - దేవులపల్లి గ్రామాల మధ్య చెట్లు కూలిపోవడంతో రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. చక్రదేవరపల్లి గ్రామంలో ఆటో రిక్షాపై చెట్టు కొమ్మ విరిగిపడటంతో ధ్వంసమయ్యింది. పుట్లగట్లగూడెంలో జుజ్జూరి లక్ష్మి ఇంటిపై భారీ వృక్షం పడి, పాక్షికంగా ధ్వంసమయ్యింది.
చిత్రాలు.. ప.గో. జిల్లా పుట్లగట్లగూడెంలో ఇంటిపై కూలిన భారీ వృక్షం
* తూ.గో. జిల్లా గొల్లప్రోలులో తడిసిన వరి పనలు