ఆంధ్రప్రదేశ్‌

నిలువునా ముంచిన నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం/పోలవరం/దేవీపట్నం : అధికారుల నిర్లక్ష్యం, బోటు యజమానుల కాసుల కక్కుర్తి, డ్రైవర్ల అనుభవరాహిత్యం వెరసి సుమారు 50 మందికి పైగా పర్యాటకులను నిలువునా గోదావరిలో ముంచేశాయి. అనుభవం లేని డ్రైవర్లతోనే బోటును నడిపించడం ప్రమాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే గోదావరికి ప్రమాదకర స్థాయిలో వరద సంభవించింది. ప్రస్తుతం కాస్త తగ్గినప్పటికీ, ఇంకా వరద ప్రవాహం ఉద్ధృతంగానేవుంది. వరదల నేపథ్యంలో గోదావరిలో అన్నిరకాల లాంచీలు, బోట్ల రాకపోకలకపై అధికారులు నిషేధం విధించారు. అయినా కాసుల కక్కుర్తితో వరద ప్రవాహంలోనే పర్యాటక బోట్ల రాకపోకలు జరిగిపోతున్నాయి. శనివారం కూడా ఒక పర్యాటక బోటు విహారయాత్రకు వెళ్లివచ్చింది. ఈ విషయం ఆదివారం రాయల్ వసిష్ఠ బోటు ప్రమాదం అనంతరం వెలుగుచూసింది. నిషేధం సమయంలో బోట్ల రాకపోకలు సాగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఆదివారం ప్రమాదానికి గురైన రాయల్ వసిష్ఠ బోటుకు అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. అలాగే బోటులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు నూకరాజు, తామరాజుకు గోదావరి నదిలో నడిపిన అనుభవం తక్కువ అని చెబుతున్నారు. వారి అనుభవరాహిత్యం కారణంగానే బోటు ప్రమాదానికి గురయ్యిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద భారీ రాళ్ల కారణంగా గోదావరిలో మామూరు సమయంలోనే సుడిగుండాలు ఉద్ధృతంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇక వరద సమయంలో ఆ ఉద్ధృతి మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బోట్లను పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని తూటిగుంట వైపునుండి నడుపుతారని, అయితే ఆదివారం నాటి ఘటనలో అనుభవంలేని డ్రైవర్లు ఈ పద్ధతిని పాటించకపోవడంతో బోటు నేరుగా సుడిగుండాల్లో చిక్కుకుందని సమాచారం. సుడిగుండాల తీవ్రతకు బోటు స్టీరింగ్ అదుపుతప్పి, సాంకేతిక లోపం ఏర్పడి, ఒకపక్కకు ఒరిగిపోయి, ప్రమాదానికి గురయ్యిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరూ కూడా గల్లంతయ్యారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా రెండు ప్రమాదాలు జరిగినట్టు చెబుతున్నారు. 1964లో జరిగిన ప్రమాదంలో 60 మంది మృతిచెందారని, మరో ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారని చెబుతున్నారు.
కాగా పర్యాటక బోటు ప్రమాదం నేపథ్యంలో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాపికొండలు పర్యాటకానికి బోటుకు ఎవరు అనుతిచ్చారనే విషయమై ఆరా తీయడం ప్రారంభించారు. గతంలో విజయవాడ వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన సంఘటన నేపధ్యంలో అప్పటి వరకు ఇరిగేషన్ శాఖ అనుమతిలో వుండే అనుమతి అధికారాలను పోర్టుల శాఖకు బదలాయించారు. ఫిట్‌నెస్‌ను బట్టి, పర్యాటక శాఖ సిఫార్సులను బట్టి పోర్టుల శాఖ బోట్లకు, లాంచీలకు అనుమతి మంజూరుచేస్తుంది.ప్రమాదానికి గురైన రాయల్ వశిష్టా-1 లాంచీకి వాస్తవానికి ఏడాది కాలానికి లైసెన్స్ ఉండాల్సివుంది. కానీ లైసెన్స్ అనుమతి లేదని తెలిసింది. ఈ విషయాన్ని పర్యవేక్షించే యంత్రాంగం కూడా లేదు. రాయల్ వశిష్ఠ-1 బోటుకు కాకినాడలోని పోర్టుల శాఖ బోట్ కన్జర్వేజర్ అనుమతి ఇవ్వాల్సివుంది. కేవీఆర్, అమరావతి ట్రావెల్స్ సంస్థలకు రాయల్ వసిష్ఠా-1, రాయల్ వసిష్ఠా-2, శ్రీవశిష్ఠా అనే మూడు పర్యాటక బోట్లున్నాయి. ఇందులో రాయల్ వసిష్ఠా-1 ప్రమాదానికి గురైంది. ఇక్కడ సిండికేట్ విధానంలో లాంచీలను, బోట్లను నడుపుతున్నారు. మూడు యూనియన్లుగా ఏర్పడి పర్యాటకులను లాంచీలకు ఆకర్షించేందుకు పోటీ పడుతున్నట్టుంది. ప్రమాదానికి గురైన లాంచీలో రాజమహేంద్రవరంలోని అమరావతి లాంచీ ట్రావెల్స్ నుంచి 34 మంది, కేవీ ఆర్ ట్రావెల్స్ నుంచి 16 మందిని, ఇలా ఒక్కొక్క ట్రావెల్స్ నుంచీ ఇద్దరూ, నలుగురూ చొప్పున సమీకరించుకుని సీరియల్ పద్ధతిని రాయల్ వసిష్ఠా-1 బోటులో ఎక్కించి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ బోటును కోడిగుడ్ల వెంకటరమణ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
గుంటూరు: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాపికొండలకు పర్యాటకులు, సిబ్బందితో వెళుతున్న పడవ ప్రమాదానికి గురికావడం బాధాకరమన్నారు. జిల్లా యంత్రాం గం యుద్ధప్రాతిపదికన స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, గాలింపు చర్యలు ముమ్మరం చేయాలన్నారు. పాపికొండలకు వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటన తమను కలచివేసిందని, గోదావరిలో వరద పోటెత్తుతుంటే బోటును ఎలా అనుమతించారని, నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ పర్యాటకులను ఎలా ఎక్కించారని ప్రశ్నించారు. టూరిజం, జలవనరుల శాఖ మధ్య సమన్వయం లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే ఈ దుర్ఘటనకు కారణమన్నారు. జిల్లా యంత్రాంగం హుటాహుటిన స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.
సహాయక చర్యలు
వేగవంతం చేయాలి: గవర్నర్
విజయవాడ: గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. కాగా, గోదావరిలో పాపికొండలు విహారయాత్రకు వెళ్లిన బోటు ప్రమాదానికి గురైన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాద వార్త తెలియగానే అక్కడి తమ పార్టీ నేతలతో మాట్లాడి సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిందిగా సూచించానన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. దేవీపట్నం సమీపంలో పడవ మునక ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తెలిపారు. ఇలాంటి దుర్ఘటనలు తరచూ జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వ చర్యలు శూన్యమన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. మొత్తం 61మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ గోదావరిలో ప్రమాదానికి గురికావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు తెలిపారు. నదిలో గల్లంతైన ప్రయాణికులను రక్షించడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
*చిత్రాలు..నది నుండి వెలికి తీసుకు వస్తున్న బాలిక మృతదేహం
* వెలికితీసిన మూడు మృతదేహాలు
*గాలింపు చర్యలకు హెలికాఫ్టర్‌లో తరలివెళుతున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం