ఆంధ్రప్రదేశ్‌

కొండవాలు ఇళ్ళకు పట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 9:విశాఖ నగర పరిధిలో కొండవాలు ప్రాంతాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్ళంటినీ రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి 269 జిఓను విడుదల చేసింది. నగర పరిధిలో వివిధ కొండలపై ఉన్న ఇళ్ళంటినీ సర్వే చేయాల్సిందిగా గత కలెక్టర్ యువరాజ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాకాలం కిందటే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు యువరాజ్ సర్వే నిర్వహించినా, ఆ సర్వే ఆధారంగా అతికొద్ది మంది మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉండటంతో స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ప్రవీణ్ కుమార్ కలెక్టర్‌గా వచ్చిన తర్వాత సర్వేను సరళతరం చేశారు. దీంతో సుమారు లక్ష మంది వరకూ లబ్ధిపొందే అవకాశం ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 20 నుంచి 30 వేల మంది, తూర్పు నియోజకవర్గంలో 30 వేల మంది వరకూ లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంది.
వంద గజాలలోపు స్థలాన్ని ఆక్రమించుకుని ఇళ్ళు నిర్మించుకున్న వారి ఇళ్ళను రెగ్యులరైజ్ చేయనున్నారు. అయితే, లబ్ధిదారుడు విధిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్న పట్టాలపై సదరు లబ్ధిదారుడు నివసిస్తున్న ఇంటిని జియోట్యాగ్ చేసి దాన్ని ముద్రిస్తారు. పట్టాను రిజిస్టర్ చేయించుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. పట్టా పొందిన లబ్ధిదారుడు తన ఇంటిని వేరొకరికి విక్రయించుకునే సదుపాయం కూడా కల్పించారు. ఒక వ్యక్తి పేరున ఒక్క పట్టా మాత్రమే ఇస్తారు. ఇంటి యజమాని పిల్లలకు వేర్వేరుగా రేషన్ కార్డులు ఉంటే, ఆ ఇంటి యజమానికి కొండవాలుపై ఒకటికి మించి ఇళ్లు ఉన్నా, దాన్ని ఆయన పిల్లలకు ఇచ్చుకునే అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యేలు పట్టుపడుతున్నారు. ఈ నెలాఖరులోగా తొలివిడత సుమారు 30 వేల మందికి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశల వారీగా సుమారు లక్ష మందికి పట్టాలు ఇవ్వనున్నారు. లబ్ధిదారుడు సుమారు 500 రూ.లు చెల్లించి ఈసేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవలసి ఉంది. ఈ నెలాఖరులోగా సుమారు 30 వేల మందికి తొలివిడత పట్టాలు అందబోతున్నాయి.
పివి వద్దంటే
బాబు ఓకె అన్నారు
పివి నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఓసారి విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంగా కొండలమీద నిర్మించిన ఇళ్ళను చూసి, అవి ప్రమాదకరమని భావించి, వాటిని ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అప్పటి కలెక్టర్‌ను ఆదేశించారు. కానీ ఆ పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. ఆనాడు కొండలపై వందల సంఖ్యలో ఉన్న ఇళ్ళు ఇప్పుడు లక్షకు చేరుకున్నాయి. ఆనాడు ప్రధాని పివి తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.