ఆంధ్రప్రదేశ్‌

జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 18 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో అప్పుడే క్యాంపు శిబిరాలు ప్రారంభమయ్యాయి. వైకాపా అభ్యర్థిగా రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, టిడిపి తరఫున బిటెక్ రవి(రవీంద్రనాథ్‌రెడ్డి) బరిలో ఉన్నారు. వారిద్దరి తరఫున ఆయా పార్టీల అధిష్ఠానాలు రంగంలోకి దిగి ఓటర్లు, వారి కుటుంబ సభ్యులపై వత్తిడి తీసుకొచ్చి బేరసారాలు చేసుకుని ఓటుకు రూ. 5 నుంచి రూ. 10 లక్షలు ఇస్తామని హామీ ఇస్తూ అడ్వాన్స్‌గా కొంత ముట్టజెప్పి వారిని క్యాంపులకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆదివారం చాలా మంది ఓటర్లను తమకు అనువైన ప్రాంతాలకు, తాము ఏర్పాటుచేసిన శిబిరాలకు తరలించినట్లు సమాచారం. ముఖ్యంగా మహిళా ఓటర్లు అయితే వారికి భద్రతగా వారి భర్తతో పాటు కుటుంబ సభ్యులను కూడా శిబిరాలకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాపైనే టిడిపి అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లకు బాగా డిమాండ్ పెరిగింది. దాదాపు మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండల పరిషత్, జిల్లా పరిషత్, నగర పాలక సంస్థ, పురపాలక సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులందరికీ ఓటు హక్కు వుంది. నగర పాలక, పురపాలక సంఘాల్లోని ఓటర్లకు అరకొర ఆదాయం ఉన్నా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఓటర్లకు ఏమాత్రం ఆదాయం లేక ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్ముకు వడ్డీ కూడా గిట్టుబాటుకాక పలువురు డీలా పడ్డారు. ఇదిలా ఉండగా జిల్లాలో 70శాతం పైబడి స్థానిక సంస్థలు గెలుపొందిన ప్రజాప్రతినిధులందరూ వైకాపాకి చెందిన వారే. అయితే అధికారంలో టిడిపి ఉండటంతో ఆ పార్టీ నేతలు కేవలం తమ సత్తా నిరూపణకు, ఆధిపత్యం, అధిష్ఠానం వద్ద తమ గుర్తింపు కోసం వైకాపా ఓటర్లకు గాలం వేస్తున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష నేత జగన్ చీటికిమాటికి ప్రభుత్వం, సిఎం చంద్రబాబుపై కాలు దువ్వుతుండటం, ఈ ఎన్నికల్లో స్వయంగా తన బాబాయ్ రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో వైఎస్ ఇలాఖా నుంచే గతంలో వైఎస్ కుటుంబంతో అసెంబ్లీ ఎన్నికల్లో తలపడిన బిటెక్ రవిని టిడిపి బరిలోకి దింపి ఎలాగైనా గెలవాలని సర్వశక్తులు వడ్డుతున్నారు. కాగా వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రెండు పర్యాయాలు ఓటర్లను కలుసుకుని ఓటరును అభ్యర్థించి అనంతరం క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇక టిడిపి అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి(వాసు) నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌చార్జిలు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, ప్రభుత్వ విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, ఇటీవల వైకాపా నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, సి.జయరాములుకు బాధ్యతలు అప్పగించారు. ప్రతిపక్ష పార్టీ నేతల కంటే తెలుగుతమ్ముళ్లే బంపర్ ఆఫర్‌తో పాటు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తామని ఓటర్లకు గట్టి హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే తరహాలో వైకాపా నేతలు కూడా 2019 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పట్లో కావాల్సిన పదవులు ఇస్తామని ఓటర్లను నమ్మబలుకుతున్నట్లు సమాచారం. ఏదైమైనా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపు రాజకీయాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.