ఆంధ్రప్రదేశ్
ఎక్స్ప్రెస్ హైవేకు భూముల సర్వే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గుంటూరు, ఫిబ్రవరి 14: రాజధాని ఎక్స్ప్రెస్ హైవే వెంట పారిశ్రామిక హబ్లు ఏర్పాటు కానున్నాయి.. అనంతపురం నుంచి అమరావతి వరకు 598.830 కిలోమీటర్ల మేర 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో ఈ ఎక్స్ప్రెస్ హైవే రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 26వేల 890 ఎకరాల భూములను సేకరించేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ, అటవీ భూముల సర్వే నిర్వహించి అవసరమైతే సేకరణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతపురం జిల్లాలో 1268 హెక్టార్లు, కర్నూలులో 2281, ప్రకాశంలో 3351, గుంటూరులో 1600, కడపలో 824.25 హెక్టార్ల భూముల్లో రహదారి ఏర్పాటుకు డిజైన్లు రూపొందించారు. కాగా అటవీ భూములకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు సాధించే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంతో సహా పలుచోట్ల అభయారణ్యం మీదుగా రోడ్డు ఏర్పాటు కావాలి. అభయారణ్య ప్రాంతంలో అనుమతులు కష్టసాధ్యం. దీంతో అలైన్మెంట్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. రహదారికి 1518.75 హెక్టార్ల అటవీ భూములు సేకరించాలి. అనంతపురం జిల్లాలో 86, కర్నూలులో 582, ప్రకాశంలో 742, కడపలో 108.75 హెక్టార్ల భూముల అవసరాన్ని ఎన్హెచ్ఎఐ అధికారులు గుర్తించారు. అనంతపురం జిల్లాలో ముత్సుకోట రిజర్వు ఫారెస్టు, కర్నూలు జిల్లాలో సిర్వెల్, ఉయ్యాలవాడ, కంభం అటవీ ప్రాంతం ప్రకాశంలో అంబవరం, సోమిదేవిపల్లి, గానుగపెంట, పమిడిపాడ రిజర్వు ఫారెస్టు ప్రాంతాల భూములను డీ నోటిఫై చేయాల్సి ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 421.5, ముత్సుకోట రిజర్వు ఫారెస్టులో మరో 25.5 హెక్టార్లకు కేంద్రం అనుమతించాలి. అనంతపురం- అమరావతి ఆరులైన్ల రహదారికి 9540 ఎకరాలు, కర్నూలు నుంచి నాలుగు లైన్ల రహదారికి 3581, కడప నుంచి 96 కిలోమీటర్ల మేర 3586 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. మార్కెట్ ధరగా ప్రభుత్వం ఎకరానికి 9లక్షలు నిర్ణయించింది. మొత్తంగా 2072 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇదికాక భూ సమీకరణ కింద రైతుల వద్ద నుంచి సమీకరించే భూములకు నష్టపరిహారం, పునరావాసాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కల్పించాల్సి ఉంది. కడప నుంచి నాలుగు లైన్ల రహదారి గిద్దలూరు- మార్కాపూర్ మధ్యన, అనంతపురం నుంచి మొదలయ్యే నాలుగులైన్ల రహదారి దర్శి సమీపంలో ఆరు లైన్ల రహదారితో అనుసంధానమవుతుంది. అక్కడి నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేట మీదుగా అమరావతికి ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాటవుతుంది. ఇందుకయ్యే ఖర్చు 27వేల 635 కోట్లు కాగా, భూ సేకరణకు మరో 2072 కోట్లు అవసరమవుతుందని ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అనంతపురంలో 68.65 కిలోమీటర్లు, కర్నూలు జిల్లాలో 160.600, ప్రకాశంలో 226.950, గుంటూరులో 80.430, కడప జిల్లాలో 62.200 కిలోమీటర్ల మేర ఈ రహదారి సౌలభ్యంగా ఉంటుంది. అనంతపురం జిల్లా అనంతపురం, తాడిపత్రి, కర్నూలు జిల్లా కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, ప్రకాశం జిల్లా గిద్దలూరు, కందళ్లపల్లె, దర్శి, అద్దంకి, గుంటూరు జిల్లా వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు, కడప జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, బద్వేల్, గిద్దలూరు మండలాల మీదుగా ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాటువుతుంది. అనంతపురం నుంచి అనుములపల్లె, కర్నూలు ఫీడర్ రోడ్డు నుంచి అనంతపురం- అమరావతి వరకు 150మీటర్లు( నాలుగులైన్లు) అనుమాలపల్లె- బడేపురం-అమరావతికి 193 కిలోమీటర్ల మేర 200 మీటర్ల (ఆరులైన్ల) నిర్మాణం జరుగుతుంది. ఎక్స్ప్రెస్ హైవే వెంట మాన్యుఫ్యాక్చరింగ్, పారిశ్రామిక హబ్లు నెలకొల్పే ప్రాంతాలను గుర్తించాల్సిందిగా కూడా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. వీటితో పాటు పర్యాటక ప్రాధాన్యత, మతపరమైన సుప్రసిద్ధ ప్రదేశాలను కూడా గుర్తించి అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. హైవేకు అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.