ఆంధ్రప్రదేశ్‌

ప.గో.కు ఎమ్మెల్సీల పంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 2: పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీల పంటతో కళకళలాడనుంది. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఉండగా వాటికి ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కూడా పూరె్తైంది. ఈ రెండు స్థానాలతోపాటు మరో ఎమ్మెల్సీ స్థానం కూడా జిల్లాకు అదనంగా లభించనుందనే చెప్పాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోటాలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పేరును ప్రకటించడం గమనార్హం. దీనితో ఎన్నికలు జరగనున్న రెండు స్థానాలతోపాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కూడా జిల్లాకు లభించనుందనే చెప్పాలి. ఇప్పటికే జిల్లాలో టిడిపి నుండి షరీఫ్, యుటిఎఫ్ నుండి రాము సూర్యారావు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అధికార పార్టీ అభ్యర్ధులు ప్రకటించిన అనంతరం ఆ అభ్యర్థులకు భిన్నంగా మరో వర్గానికి చెందిన ఆళ్ల నానిని అభ్యర్థిగా నిలబెట్టడం వెనుక ఉభయగోదావరి జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తున్న ముద్రగడ ప్రభావం కూడా ఉందనే చెప్పవచ్చు. ముద్రగడ ఉద్యమం వెనుక వైసిపి ఉందన్న ప్రచారం ముందునుంచీ జరుగుతుండటం తెలిసిందే. తాజా పరిణామాల్లో అదే వర్గానికి చెందిన నానికి ఎమ్మెల్యే కోటా కట్టబెట్టడం రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికార పార్టీ ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను ఒకటి బిసిలకు, మరొకటి ఓసిలకు కేటాయించింది. ఈ విషయంలోనే అధికార పార్టీలో అభ్యర్థుల విషయంలో అసంతృప్తి లేకపోయినా ఎంపిక చేసిన వర్గాలకు సంబంధించి మాత్రం కొన్ని రకాల అసంతృప్తులు వ్యక్తమవుతూనే వస్తున్నాయి. మరోవైపు ఉభయగోదావరి జిల్లాల వేదికగా ముద్రగడ పద్మనాభం తన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వారికి ఒక స్థానాన్ని కేటాయించి, ఆ వర్గాన్ని కొంత శాంతపరుస్తారన్న ప్రచారం జరిగినా చివరకు అభ్యర్థుల ప్రకటన అనంతరం ఆ ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసిపి తనకున్న పరిమిత ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి ఉభయగోదావరిలో బలీయమైన శక్తిగా వున్న వర్గానికి కేటాయించి రాజకీయం ముందడుగు వేసినట్లు చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్యే కోటాకు సంబంధించి అధికార పార్టీ ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించనందున ఆ సమయంలో టిడిపి దీనికి ప్రతిగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సివుంది. ఏదేమైనా ఉభయగోదావరి జిల్లాల రాజకీయ సమీకరణాలు, వర్గ సమీకరణాల నేపథ్యంలో టిడిపి తీసుకునే నిర్ణయం రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుందనే చెప్పుకోవాలి. అది కూడా వైసిపి ముందుగానే ఎమ్మెల్యే కోటాలో ఆ వర్గానికి చెందిన అభ్యర్థికి స్థానం కేటాయించడం విశేషంగానే చెప్పుకోవచ్చు. ఆ అంశాలను అలా ఉంచితే వైకాపా ఎమ్మెల్యేల కోటా అభ్యర్ధిగా ఎంపికైన ఆళ్ల నాని ప్రస్తుతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. 2004, 2009 సంవత్సరాల్లో వరుసగా రెండు సార్లు ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏలూరు నుంచి వరుసగా రెండుసార్లు ఎంపికైన ఎమ్మెల్యే ఆళ్ల నాని మాత్రమే కావడం గమనార్హం. నియోజకవర్గం, జిల్లాకు సంబంధించి ఆళ్ల నాని బలమైన నాయకునిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయ ఎత్తుగడల్లో చురుగ్గా వ్యవహరిస్తూ, ప్రత్యర్థులను అలవోకగా అధిగమించడంలో ఆళ్ల నానిది అందెవేసిన చెయ్యి అనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బలమైన నాయకునిగావున్న ఆళ్ల నాని వంటి నేత విపక్షం తరపున జిల్లాలో ఎమ్మెల్సీగా ముందుకువస్తే రానున్న రోజుల్లో సమీకరణల్లో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.