ఆంధ్రప్రదేశ్‌

స్టార్ నిర్మాతలకు పుట్టినిల్లు ‘విజయా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16: సినీ నిర్మాతలకు స్టార్ గుర్తింపు రావాల్సి వుంది.. ఎన్నో ఉత్తమ విలువలు కలిగిన చిత్రాలను సమాజానికి అందించిన విజయా ప్రొడక్షన్స్ నుంచి బి.నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకోవడమంటే ఎంతో విశిష్టమైన గౌరవాన్ని పొందడమేనని సినీ హీరో జగపతిబాబు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో ఆదివారం జరిగిన విజయా ప్రొడక్షన్స్ బి.నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు ప్రదాన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, ఆ రోజుల్లో నిర్మాతలకు మంచి గుర్తింపు వుండేదని, ఈ రోజుల్లో నిర్మాతలు ఎవరూ అనే విధంగా తయారైందని, ఈ పరిస్థితి మారాలని, స్టార్ ప్రొడ్యూసర్స్ రావాలన్నారు. నిర్మాతలను ప్రోత్సహించినపుడే ఎన్నో ఉత్తమ చిత్రాలు వచ్చేందుకు అవకాశం వుందన్నారు. సమాజానికి విజయా ప్రొడక్షన్స్ ఎన్నో ఉత్తమ చిత్రాలను అందించిందన్నారు. సింగీతం శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు వంటి దిగ్గజాలు ఈ అవార్డును ఎంపిక చేయడమంటే అదొక ప్రత్యేక అవార్డుకింద లెక్కని అన్నారు. బి నాగిరెడ్డి స్మారక అవార్డుకు ఎంపికైన పెళ్లిచూపులు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి ఎంపిక కావడం స్ఫూర్తిదాయకమన్నారు. తనకు రాజమహేంద్రవరమన్నా, తూర్పు గోదావరి జిల్లా అన్నా చాలా ఇష్టమని, తన అత్తవారి జిల్లా అనే ప్రేమకంటే ఇక్కడ ఎవరికైనా అన్నం పెట్టే చేతులు వుండటం వల్ల చాలా ఇష్టమన్నారు. మరో ముఖ్య అతిధి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, నాగిరెడ్డి అవార్డు పొందడం ఒక ప్రత్యేక అర్హతని, జ్యూరీ సభ్యులు మనసుదోచుకున్న ఈ చిత్రం చిన్న చిత్రాలకు ఎంతో ప్రేరణను ఇస్తోందన్నారు. అనంతరం పెళ్ళి చూపులు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరికి బి నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని అందించారు. రూ.1.50 లక్షల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ, నాగిరెడ్డి అవార్డు దక్కిన తరువాత రెండు జాతీయ అవార్డులు కూడా తన చిత్రానికి లభించాయని, ఈ అవార్డులు తన బాధ్యతను పెంచాయన్నారు. అవార్డుకు దరఖాస్తు చేయకుండానే తనకు ఈ అవార్డు లభించడం గర్వకారణంగా ఉందన్నారు. త్వరలో మెంటల్ మదిలో అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విజయా ప్రొడక్షన్స్ సంస్థ వెంకటరామిరెడ్డి, భారతీ రెడ్డి, ఆనం ప్రేమ్‌కుమార్‌రెడ్డి, గొల్లపూడి మారుతీరావు, సింగీతం శ్రీనివాసరావు, మాధవపెద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బి.నాగిరెడ్డి అవార్డుతో ‘పెళ్లి చూపులు’ చిత్ర నిర్మాత
రాజ్ కందుకూరిని సత్కరిస్తున్న హీరో జగపతిబాబు, రోజా, తదితరులు