బిజినెస్

జియో ఉచిత ఆఫర్లపై ఎయిర్‌టెల్ న్యాయపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లపై దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఇన్ఫోకామ్.. తమ కస్టమర్లకు ఉచిత కాల్స్, డేటా ఆఫర్‌ను ఇచ్చినది తెలిసిందే. అయితే తొలుత ఈ నెల 31 వరకే ఈ ఆఫర్‌ను ప్రకటించిన జియో.. ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చి 31దాకా ఈ ఆఫర్‌ను పొడిగించింది. దీనికి టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ అనుమతిచ్చింది. దీంతో దీన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం టెలికామ్ వివాదాల ట్రిబ్యునల్ టిడిశాట్‌కు వెళ్లింది భారతీ ఎయిర్‌టెల్. జియో ఉచిత ఆఫర్‌తో ఇప్పటికే ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్, ఐడియా సంస్థలు తీవ్రంగా నష్టపోయినది తెలిసిందే. ముఖ్యంగా దేశీయ టెలికామ్ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా వెలుగొందుతున్న ఎయిర్‌టెల్ ఆదాయానికి జియో ఉచిత ఆఫర్ భారీగానే గండికొట్టింది. వినియోగదారులను కోల్పోకుండా, మార్కెట్ వాటాను రక్షించుకోవడానికి ఎయిర్‌టెల్ కూడా కాల్స్, డేటా చార్జీలను తగ్గించింది. కాగా, ఇప్పటిదాకా 4జి కస్టమర్లకే పరిమితమైన జియో సేవలు.. ఇకపై 3జి కస్టమర్లకూ అందుతాయన్న వార్తల మధ్య ఎయిర్‌టెల్ జియో తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ క్రమంలోనే టిడిశాట్‌కు సమర్పించిన 25 పేజీల పిటిషన్‌లో జియో ఉచిత ఆఫర్ పొడిగింపునకు అనుమతించరాదని ట్రాయ్‌ని ఆదేశించాలంటూ కోరింది. జియో ఫ్రీ కాల్ ఆఫర్‌తో లైన్లు బిజీగా మారుతున్నాయని, దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌ల వినియోగదారులకు అసౌకర్యం ఏర్పడుతోందని అందులో చెప్పింది. అంతేగాక జియో ఆఫర్లు.. ట్రాయ్ టారీఫ్ ఆర్డర్లను ఉల్లంఘించి ఉన్నాయని పేర్కొంది. ట్రాయ్ తీరుపైనా ఎయిర్‌టెల్ అసహనం వ్యక్తం చేసింది. కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తోందని, ఓ నియంత్రిత వ్యవస్థ ఇలా ఉండకూడదంది. ఇక ఓ ఇంప్లీడ్‌మెంట్ అప్లికేషన్‌ను దాఖలు చేయాలని జియోకు సూచించిన టిడిశాట్.. ట్రాయ్ స్పందనను కోరింది. ఇందుకు 10 రోజుల సమయాన్ని ఇవ్వాలని ట్రాయ్ అభ్యర్థించింది. ఈ క్రమంలో ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది టిడిశాట్. ఈ ఏడాది సెప్టెంబర్ 4న రిలయన్స్ జియో 4జి సేవలు మొదలైయ్యాయి. తొలుత సంస్థ సిబ్బందికి ఉచితంగా 4జి సేవలను అందించిన జియో.. ఆ తర్వాత మూడు నెలలపాటు వినియోగదారులందరికీ సేవలు ఉచితమని ప్రకటించింది. తర్వాత డిసెంబర్ 31 వరకు, మళ్లీ మార్చి 31 వరకు పొడిగించింది. దీంతో మొదట ప్రకటించినట్లు డిసెంబర్ 3 వరకే జియో ఉచిత సేవల గడువు ముగిసిందని ఎయిర్‌టెల్ వాదిస్తోంది. జియో రాకతో దేశీయ టెలికామ్ రంగంలో పెను సంచలనాలే చోటుచేసుకున్నాయి. జియో ఉచిత కాల్స్, డేటా ఆఫర్‌తో ఇతర సంస్థలన్నీ కూడా తమ కాల్స్, డేటా చార్జీలను భారీగా తగ్గించాయి. స్వల్ప ధరలకే ఉచిత ప్యాకేజీలనూ ప్రకటించాయి. అయినప్పటికీ పూర్తిగా ఉచితమైన జియోకే మొబైల్ వినియోగదారులు మారిపోవడంతో ఎయిర్‌టెల్‌సహా అన్ని ప్రధాన టెలికామ్ సంస్థల కస్టమర్ల సంఖ్య తగ్గిపోయింది. ఆదాయం కూడా గణనీయంగా క్షీణించింది. దీంతో టెలికామ్ మంత్రిత్వ శాఖకు, ట్రాయ్‌కి ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఇలా న్యాయపోరాటానికి ఎయిర్‌టెల్ సిద్ధమైంది.