రాష్ట్రీయం

కాల్‌మనీ కాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోరెత్తిన అసెంబ్లీ
దుమ్మెత్తి పోసుకున్న టిడిపి, వైకాపా
నిందితులతో బాబు, జగన్ ఉన్న ఫోటోల పరస్పర ప్రదర్శన
ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్
మూడుసార్లు సభ వాయిదా *నేడు ప్రభుత్వ ప్రకటన

నిజంగా ఈ సభను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. రాజకీయ అవసరాల కోసం అంబేద్కర్ మహాశయుడిని ఉపయోగించుకుంటున్నారు. సాక్షాత్తూ నిందితులతో మీ పార్టీ ఎమ్మెల్యే విదేశాలకు వెళితే, ఎమ్మెల్యే తిరిగి వస్తాడు. నిందితుడు తిరిగి రాడు. ఎమ్మెల్యేను విచారించరు. ఇంత దారుణం జరుగుతోంది.
- జగన్

సాక్ష్యాధారాలు తెస్తే వాటిని బేస్ చేసుకుని దోషులెంతటి వారైనా, ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటాం. సభలో వైకాపా ఎమ్మెల్యేలు హుందాగా ప్రవర్తించాలి. వీరి ప్రవర్తన చూస్తుంటే నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకుంటుంది.
- చంద్రబాబు

హైదరాబాద్, డిసెంబర్ 17: ఆంధ్ర ప్రదేశ్‌లోని పలునగరాల్లో సంచలనం కలిగిస్తున్న కాల్‌మనీ వడ్డీ వ్యాపారుల ఆగడాల ప్రకంపనలతో శాసనసభ అట్టుడికింది. శీతాకాల సమావేశాల తొలి రోజు గురువారం సభ ప్రారంభమైన వెంటనే అధికార టిడిపి,ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యేలు ఈ అంశంపై తీవ్రస్ధాయి వాగ్వాదానికి దిగారు.కాల్‌మనీ వడ్డీవ్యాపారుల ఆగడాలపై సభలో వెంటనే చర్చకు అనుమతించాలని వైకాపా పట్టుబట్టడంతో సభలో ప్రతిష్టంభన కొనసాగింది. సభను నియంత్రించేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు పలుసార్లు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. దీంతో గందరగోళం మధ్య సభను మూడుసార్లు వాయిదావేసి నడిపించేందుకు స్పీకర్ ప్రయత్నాలు ఫలించలేదు. కాల్‌మనీ నిందితులతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధాలున్నాయంటూ వారితో ఫోటో దిగారంటూ ఆ ఫోటోలను వైకాపా ఎమ్మెల్యేలు ప్రదర్శించగా, జగన్‌తో కాల్‌మనీ నిందితులు ఫోటో దిగారని, ఆ ఫోటోలను టిడిపి ఎమ్మెల్యేలు ప్రదర్శించారు. పరస్పరం నినాదాల హోరుతో సభ దద్దరిల్లింది. దీంతో నాల్గవ సారి సభ ప్రారంభమైన వెంటనే సభను శుక్రవారానికి వాయిదా వేశారు. సభా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఉపయోగించే కెమెరాలకు అడ్డుగా ఉన్నారనే అభియోగంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుగుణగా ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శివప్రసాదరెడ్డి, రామలింగేశ్వర రావు అలియాస్ రాజా అనే ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్ చేయాల్సిందిగా మంత్రి యనమల సిఫార్సు చేయగా, రెండురోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడం గమనార్హం. శాసనసభ ప్రారంభమైన వెంటనే కాల్‌మనీ వడ్డీవ్యాపారుల ఆగడాలపై చర్చించేందుకు అనుమతించాలని వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో వైకాపా ఎమ్మెల్యేలు పోడియం వద్దకు దూసుకెళ్లి కాల్‌మనీ సిఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని, ఈ అంశంపై 18వ తేదీన రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేస్తుందని, అలాగే చర్చకు కూడా సిద్ధంగా ఉందని ప్రకటించారు. సభ సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్షం సహకరించాలని, బిఏసి సమావేశంలో చేసిన తీర్మానానికి అనుగుణంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా సభలో చర్చిస్తామని, రాజ్యాంగ నిర్మాత దేశానికి చేసిన సేవలపై ఈ రోజు చర్చించేందుకు ప్రతిపక్షం అంగీకరించిందని గుర్తు చేశారు. మంత్రి యనమల విజ్ఞప్తితో సంతృప్తి చెందని వైకాపా ఎమ్మెల్యేలు పోడియం వద్దనే నిలబడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే రోజా కూడా ఈ అంశాన్ని చర్చించాలని 340 నిబంధన కింద నోటీసు ఇచ్చారని, దీనిని అనుమతి ఇచ్చామని, 18న సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించినందు వల్ల సభ నిర్వహణకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా టిడిపి సభ్యుడు బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలతో పాటు పరిటాల రవి హత్య తదితర అంశాలపై సిట్ వేయాలని కోరారు. సభను అడ్డుకోవడం వైకాపాకు తగదన్నారు. కాల్‌మనీ వ్యాపారుల్లో వైకాపా నేతలు ఎక్కువ మంది ఉన్నారన్నారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ చర్చకు అంగీకరించినా, సిఎంను శాసించే విధంగా వైకాపా వ్యవహరించడం తగదన్నారు. సిఎం చంద్రబాబు మీద బురదచల్లే విధంగా వైకాపా ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారన్నారు. అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పొడవరాదన్నారు. ఈ సందర్భంగా మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మాట్లాడుతూ అంబేద్కర్‌పై చర్చంటే వైకాపాకు ఇష్టం లేదని, దళితులను అవమానపరుస్తున్నారంటూ విమర్శించారు. బిఏసిలో ఆమోదించిన విధంగా అంబేద్కర్ పై చర్చ తర్వాత కాల్‌మనీపై చర్చిద్దామన్నారు. దీంతో గందరగోళం మధ్య సభ వాయిదా పడింది. సభ మళ్లీ సమావేశమైన తర్వాత మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, జగన్‌కు అసెంబ్లీ సంప్రదాయాలు తెలియవని, చరిత్ర తెలియదని విమర్శించారు. ప్రతిపక్షనేతకు కమ్యూనికేషన్ సమస్యకాదని, అండర్ స్టాండింగ్ సమస్యని అన్నారు. కెమెరాలకు అడ్డుపడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్‌ను కోరారు. 11 చార్జిషీట్లతో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు జగన్ అని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అంకితమయ్యే విధంగా అసెంబ్లీ నుంచి సందేశమిస్తామన్నారు. టిడిపి సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ జగన్ తీరును దుయ్యబట్టారు. ఒక వైపు పోడియంను చుట్టుముట్టిన వైకాపా ఎమ్మెల్యేల నినాదాల హోరుతో సభను స్పీకర్ రెండవ సారి వాయిదా వేశారు. మూడవ సారి 12.15 గంటలకు సమావేశమైనప్పుడు కూడా ఇదే పరిస్ధితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కాల్‌మనీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అంబేద్కర్‌పై చర్చించి మంచి సందేశం పంపుదామని సభను నడిపేందుకు సహకరించాలని కోరారు. అయినా సభ సర్దుమణగలేదు. జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి రెండు సార్లు మైక్ కట్ చేయడంతో వైకాపా ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి నినాదాలను కొనసాగించారు. దీంతో సభను మరోసారి వాయిదా వేశారు. తిరిగి సభ మళ్లీ ప్రారంభమైనప్పుడు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు చేసే కెమెరాకు అడ్డుగా ఉన్నారన్న కారణంపై ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు శివప్రసాదరెడ్డి, రామలింగేశ్వరరావు అలియాస్ రాజును సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకు ముందు కెమెరాకు అడ్డుగా నిలబడవద్దని వైకాపా ఎమ్మెల్యేలను స్పీకర్ రెండుసార్లుహెచ్చరించారు. వైకాపా ఎమ్మెల్యేల సస్పెండ్‌తో సభలో గందరగోళం పెరిగింది. బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సభను సజావుగా నిర్వహించేందుకు వైకాపా సభ్యులు సహకరించాలని కోరారు. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.