కొత్త ఏడాదిలో హీరోలు బిజీ బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తేడాది కోలాహలం జోరందుకుంది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి టాలీవుడ్ హీరోలు అప్పుడే సన్నాహాలు ప్రారంభించారు. ఇద్దరు పెద్ద హీరోలు చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగి ఘన విజయాలను సాధించారు. వారితోపాటు యువనటుడు శర్వానంద్ ‘శతమానం భవతి’ అంటూ మంచి విజయానే్న అందుకున్నాడు. ముఖ్యంగా ఎనిమిదేళ్ళ గ్యాప్ తరువాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన 150వ సినిమా ఖైదీ నెం.150 వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు తెలుగు వీరుడు శాతకర్ణి జీవిత కథ ఆధారంగా చారిత్రాత్మక చిత్రంతో గౌతమిపుత్ర శాతకర్ణి అంటూ వచ్చిన నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇక మిగిలిన హీరోలు ఈ ఏడాది మంచి విజయాలు అందుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌లతో బిజీగా వున్న మన హీరోలు ఎవరు ఎక్కడ షూటింగ్ జరుపుకుంటున్నారో చూద్దాం..
**
ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు. కిశోర్ పార్థసాని (డాలి) దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. గ్లామర్ భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*ప్రముఖ నటుడు మహేష్‌బాబు 23వ చిత్రంగా రూపొందుతోన్న సినిమా హైదరాబాద్‌లో జనవరి 7 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. సంచలన దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చిలో పూర్తికానుంది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌తోపాటు వారం రోజులు అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుతారని తెలిసింది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తారని సమాచారం.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బాహుబలి-2 చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ను హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరిస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సీక్వెల్‌ను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు. ఇప్పటికే బిజినెస్ పరంగా భారీ హైప్ నెలకొంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న దువ్వాడ జగన్నాధం చిత్రం ఈనెల 4 నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. సరైనోడు వంటి కమర్షియల్ విజయం తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్‌లోనే విభిన్నతను ప్రదర్శిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నాచురల్ స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న నాని ప్రస్తుతం ‘నేను లోకల్’ చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తరువాత డి.వి.వి.దానయ్య బేనర్‌లో శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జనవరి 6 నుండి హైదరాబాద్‌లో జరుగుతోంది.
‘అ ఆ’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న యువ హీరో నితిన్, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. గత వారం మొదలైన ఈ చిత్రం హైదరాబాద్‌లో జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగచైతన్య కళ్యాణకృష్ణ దర్శకత్వంలో బిజీగా ఉన్నాడు. సాయి ధరమ్‌తేజ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘విన్నర్’తో బిజీగా ఉన్నాడు. మరోవైపు వరుణ్‌తేజ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాతో బిజీగా మారాడు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరూ వారి వారి సినిమాలతో బిజీగా మారి ప్రేక్షకులను అలరించడానికి సమాయత్తమవుతున్నారు. మరి ఎవరు ఎలాంటి విజయాల్ని అందుకుంటారో చూడాలి.

-శ్రీ