బిజినెస్

పేదలకూ ఆకాశహర్మ్యాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక శైలిలో నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీలో సైబర్‌సిటీ బిల్డర్స్

విజయవాడ, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఆకాశ హ ర్మ్యాలు రానున్నాయి. వీటిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని, అంతేగాక వీటిని ఆధునిక శైలిలో నిర్మించాలని భావిస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర నిర్మాణాన్ని భుజానికెత్తుకు న్న ముఖ్యమంత్రి చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని పేద వర్గాలకు కూడా సౌకర్యవంతమైన గృహ నిర్మాణాలను చేపట్టే ఉద్దేశంతో ముందుకొచ్చినట్టు సైబర్‌సిటీ ప్రతినిధులు చెప్పారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో లక్షకు పైగా ఫ్లాట్లను నిర్మించిన అపారమైన అనుభవం తమకుందని, ఈ అనుభవంతో ఏపీలో పేదలకు అన్ని సదుపాయాలున్న ఇళ్లను అందుబాటు ధరలో నిర్మించి ఇస్తామని వీరు తెలిపారు. నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇంటీరియర్ డిజైన్ చేసి ఫర్నిచర్‌తో సహా లైఫ్‌స్టైల్ ఇళ్లను అందివ్వడమే తమ ప్రాజెక్టు ప్రత్యేకత అని వివరించారు. విట్రిఫైడ్ టైల్స్, లిఫ్టు సౌకర్యాలతో బహుళ అంతస్థుల భవనాలను తమ సొంత పెట్టుబడితో ప్రభుత్వ సహకారంతో నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. పేదల ఇళ్లంటే స్లమ్ హౌసెస్‌గా కడతారనే ముద్రను చెరిపేసి ఆధునిక శైలిలో గృహ నిర్మాణం చేస్తామని, అక్కడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేస్తామని వివరించారు. కాగా, ఏపీలో ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన గృహ నిర్మాణంలో ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చి భాగస్వాములు కావడం ఆహ్వానించతగ్గ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అందుబాటులో వుండేలా ఇళ్లను నిర్మించడానికి ఇంకా మరిన్ని సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. అధునాతన సాంకేతిక పద్ధతులు, నాణ్యమైన నిర్మాణ సామగ్రి ఉపయోగించి సాధ్యమైనంత వేగంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వచ్చే నెలలో విశాఖలో జరిగే పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు పూర్తి ప్రతిపాదనలతో వస్తే అక్కడ చర్చించి మరికొన్ని సంస్థలను కూడా కలుపుకుని కార్యరూపం దాల్చేలా నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి సైబర్‌సిటీ డెవలపర్స్‌కు చెప్పారు. ప్రభుత్వ ఇంటర్నల్ ఆర్కిటెక్ట్ బాధ్యతలను ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు అప్పగిస్తామని సిఎం చెప్పారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ కార్యదర్శి లవ్ అగర్వాల్, సంస్థ ప్రతినిధులు కె మురళీకృష్ణ, శ్రీవర్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఉన్నారు.