డైలీ సీరియల్

యాజ్ఞసేని-122

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిమవత్పర్వతము కదలాడినను, భూమి పగిలి ముక్కలైననూ, నక్షత్రములతోపాటు మిన్ను విరిగి నేలగూలిననూ నా మాట పొల్లుబోవదు. వమ్ముగాదు. శత్రువులను చంపి సంపదలను సమకూర్చుకొన్న నీ భర్తలను త్వరలోనే చూతువు’’ అని అన్నాడు. ద్రౌపదిని శాంతపరచాడు.
పాండవులందరూ చెప్పిన తమతమ అభిప్రాయాలను విన్న శ్రీకృష్ణుడు రాయబారము నరుప హస్తినకు పయనమయ్యాడు. తన వెంట సాత్యకిని, కృతవర్మను, యాదవ వీరులను తీసికొని వెళ్లటానికి సంకల్పించాడు.
పాండవులందరూ, ద్రౌపదీ తాము చెప్పవలసిన మాటలను శ్రీకృష్ణునికి విన్నవించారు. తదుపరి పాండవులు ఆ శ్రీకృష్ణుని ఆలింగనం చేసికొని సెలవు పుచ్చుకొని, ప్రదక్షిణం చేసి వెనుకకు వచ్చారు.
మరునాడు ప్రయాణానికి కావలసిన పదార్థాలను సమకూర్చుకొని శ్రీకృష్ణుడు సాత్యకిని పిలిపించాడు. హస్తినకు వచ్చేవారినందరినీ సన్నాహాలతో రావలసిందిగా చెప్పమని చెప్పాడు. సాత్యికిని తన వెంట నుండమని చెప్పి, దుర్యోధనాదులు బహుదుష్ట చిత్తులు. అతడు ఆదరించేవారు కూడా వంకరబఉద్ధి కలవారే కాబట్టి చక్రం, గద మొదలైన ఆయుధాలను రథమందుంచమన్నాడు. సాత్యకి యాదవ పరిజనులతో రాగా, మంగళవాద్యాలు, మ్రోగుతుండగా, ముత్తెదువులు అక్షింతలు చల్లుచుండగా హస్తినాపురానికి బయలుదేరాడు. పాండవులు వీడ్కోలు చెప్పవచ్చారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి
మాధవా! మా తల్లి కుంతీదేవి నీవు వచ్చావని తెలిసి ప్రాణం లేచి వచ్చినట్లయి చైతన్యవంతురాలౌతుంద. నీవు మా తల్లి కడకేగి మా అందరికి మారుగా నమస్కరించి కుప్పగూలిన ఆమె మనస్సులోని బాధను నివారించుము’’అని ప్రార్థించాడు.
శ్రీకృష్ణుడు యాదవ పరివారంతో హస్తినకు పోతుండగా మార్గమధ్యంలో నారదుడు, జమదగ్ని, కణ్వుడు మొదలైన మహర్షులు కనిపింపగా రథాన్ని దిగి వారివద్దకు వచ్చి వినయంతో వారికి నమస్కరించి వారి రాకకు కారణమడిగాడు. వారు వాసుదేవునితో.’’
‘‘వాసుదేవా! కౌరవ సభలో నీవు ఆదరంతో చెప్పే మాటలు వినటానికి, భీష్మాదులు వినే విధానము, చెప్పే సమాధానాలు తెలిసి కొనటానికి కుతూహలంగా వచ్చాము’’ అని అనగా శ్రీకృష్ణుడు ఆలకించి
‘‘మంచిది. అలాగే చేయండి’’ అని వారికి అనుమతి నివ్వగా వారు తాము విడిగా హస్తినకు చేరుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు.
శ్రీకృష్ణుడు హస్తినాపురానికి చేరుకొన్నాడు. భీష్మాదులు, ధృతరాష్ట్రుని ముందుంచుకొని యెదురు వచ్చారు. ధృతరాష్ట్రుడు విదుర, సంజయులతో నడిచి వచ్చి ముకుందుడిని సమీపించాడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని కౌగలించుకొని, విదురుడు మొదలగు పెద్దలను ఆదరమేదురమైన చూపులతో చూచి వారిని ఆలింగన మొనర్చుకొన్నాడు. ధృతరాష్ట్రుడు అంతకుముందే చేయించిన సన్నాహాల ప్రకారం శ్రీకృష్ణునికి అర్ఘ్యపాద్యాలను యిచ్చి మర్యాదలను జరిపించాడు. తదుపరి ధృతరాష్ట్రుని అనుమతితో శ్రీకృష్ణుడు విదురుని గృహానికి వెళ్ళాడు. పిమ్మట కుంతీదేవి వున్న యింటికి వెళ్ళి పాదాభివందనం చేసి ఆమెను ఓదార్చాడు. అనంతరం, కృతవర్మ సాత్యకిలతో కలిసి దుర్యోధనుని భవనానికి వెళ్ళాడు. దుర్యోధనుని సత్కారాలను స్వీకరించాడు. భోజన విషయంలో దుర్యోధనుని ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. దానికి దుర్యోధనుడు కౌరవ పాండవులు యిద్దరూ సమానమైనపుడు తన పట్ల పక్షపాత వైఖరి వద్దని అనగా శ్రీకృష్ణుడు ‘‘రాయబారానికి వచ్చినవారు వచ్చిన పని చూడకుండా మన్ముందుగా భుజించటం, వస్తువులను గైకొనటం మొదలైన పనులు చేయరాదు. అవన్నీ వచ్చిన పని నెరవేర్చిన తరువాత స్వీకరించవలసిన మర్యాదలు.’’ అని తెలియజెప్పి దుర్యోధనుని విందును వలదని తాను విదురుని యింట వుంటానని చెపుతాడు. భీష్మద్రోణ బాహ్లికులు మొదలైనవారిని ‘‘ఇంక మీరు ఆగండి’’ అని పలికి తాను సోదరులతో కలిసి విదురుని గృహానికి వెళ్ళాడు. అక్కడ తమ్ములతో, సహచరులతో భుజించి విదురునికి ఆనందాన్ని కలిగించాడు. ఆ రాత్రికి విదురుని ఇంట బసచేశాడు.
మరునాడు ధృతరాష్ట్రుడు సభదీర్చగా శ్రీకృష్ణుడు తన సహచరులైన సాత్యకి, కృతవర్మలతోపాటు సభలోనికి ప్రవేశించాడు. మునులు, మహర్షులు గూడా విచ్చేశారు.

....................................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము