ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మరోసారి ఆశ్చర్యపరిచిన ఓటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు మరోసారి ఊహించిన దానికి విరుద్ధంగా తమదైన తీర్పు ఇవ్వటం ద్వారా రాజకీయ నాయకులకు గుణపాఠం నేర్పించారు. జాతీయ వాదంతోపాటు ఆర్థిక అంశాలు, ప్రాంతీయ సమస్యలు, కుల రాజకీయాలకు పెద్ద పీట వేశారు. బి.జె.పికి మరోసారి అధికారం ఇచ్చినట్లే ఇచ్చి మెజారిటీ తగ్గించటం ద్వారా బాధ్యతలను విస్మరిస్తే ఓడించి తీరుతామనేది స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్.సి.పిలకు మరిన్ని సీట్లు ఇవ్వటం ద్వారా బి.జె.పి ఆశించిన విధంగా పని చేయటం లేదు కాబట్టే ప్రతిపక్షాన్ని బలపరుస్తున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం జాతీయ వాదం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఆర్థికాభివృద్ది, ఉపాథి కల్పన, ప్రాంతీయ సమస్యలు, రాజకీయ సమీకరణాలను విస్మరిస్తే సహించేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓటర్లు స్పష్టం చేశారని భావించకతప్పదు. మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల్లో కులం మరోసారి కీలక పాత్ర నిర్వహించిందనేది మరోసారి స్పష్టమైంది. లోకసభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా లోకసభ, శాసనసభల ఎన్నికల విషయంలో తమకు స్పష్టత ఉన్నదనేది వెల్లడించారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసిన నేపథ్యంలో హర్యానాలో తమకు భారీ మెజారిటీ లభిస్తుందని బి.జె.పి అధినాయకత్వం అంచనా వేసుకుంది. హర్యానా శాసనసభలోని మొత్తం 90 సీట్లలో నుండి 75 సీట్లు గెలుచుకోవాలన్నది బి.జె.పి అధినాయకత్వం వ్యూహం. హర్యానా యువత పెద్ద సంఖ్యలో సైనిక దళాలు ముఖ్యంగా పదాతిదళంలో చేరుతారు. హర్యానాలో ప్రతి కుటుంబం నుండి ఒక్కరైనా సైనిక దళాల్లో ఉండటం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. అందుకే జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయటం వలన వీరి కుటుంబాలన్నీ తమకే ఓటు వేస్తారని బి.జె.పి భావించింది. దీనికితోడు పోలింగ్‌కు రెండు రోజుల ముందు భారత, పాకిస్తాన్ దేశాల మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు చోటు చేసుకోవటం కూడా తమకు కలసి వస్తుందని బి.జె.పి నాయకులు అనుకున్నారు. అయితే స్థానిక సమస్యలు ముఖ్యంగా కుల రాజకీయం ముందు ఇవేవీ పని చేయలేదు. హర్యానా రాజకీయాల్లో జాట్ కుల రాజకీయం కీలక పాత్ర నిర్వహిస్తుందనేది అందరికి తెలిసిందే. హర్యానా పి.సి.సి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి భుపేందర్ సింగ్ హుడ్డా మూలంగానే కాంగ్రెస్‌కు 31 సీట్లు వచ్చాయనేది పచ్చి నిజం. అదే విధంగా జననాయక జనతా పార్టీ (జె.జె.పి)కి లభించిన పది సీట్లు కూడా దుష్యంత్ చౌతాలాకు పడిన జాట్ ఓట్లే. జాట్ ఓట్లు కాంగ్రెస్, జె.పి.పి పడతాయనే మిగతా కులాల వారు బి.జె.పికి తమ మద్దతు పలికారు. గత ఎన్నికల్లో జాట్‌లు కూడా లభించటం వల్లనే బి.జె.పికి భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా జాట్ ఓట్లు తమకు పడతాయి కాబట్టే తమకు 75 సీట్లు వస్తాయని బి.జె.పి నాయకులు అంచనా వేసుకున్నారు. జాట్ ఓట్లు భుపేందర్ సింగ్ హుడ్డా, దుష్యంత్ చౌతాలా మధ్య చీలిపోయాయి. దీని వలన బి.జె.పికి కొంత లాభం కలిగిందనేది నిజం. హర్యానాలో కాంగ్రెస్‌కు లభించిన ఓట్లు కేవలం భుపేందర్ సింగ్ హుడ్డా ఓట్లే తప్ప కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓట్లు కావు. సోనియా గాంధీ హర్యానాలో అసలు ప్రచారమే చేయలేదు. ఆమె ఆఖరు క్షణంలో మహేందర్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభకు కూడా హాజరు కాలేకపోయారు. అనారోగ్యం మూలంగా ఆమె దానికి హాజరు కాలేకపోవటంతో ఆమె స్థానంలో రాహుల్ గాంధీ మహేందర్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల సభకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ అంతకు ముందు హర్యానాలో ఒకటి, రెండు సభలకు మాత్రమే హాజరయ్యారు. హర్యానాలో తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం భావించలేదు. బి.జె.పి భారీ మెజారిటీతో గెలుస్తుందని వారు భావించారు. అందుకే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు హర్యానా ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఒక్కరే కాలికి బలపం కట్టుకుని రాష్టమ్రంతా ఎన్నికల ప్రచారం చేశారు. భుపేందర్ సింగ్ హుడ్డా ఈ ఎన్నికలను తమ వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని పోరాడారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయటం వలన నష్టం కలుగుతుందని అనుమానించిన హుడ్డా ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారం చేయకపోవటం గమనార్హం. హర్యానాలో కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకోవటానికి భుపేందర్ సింగ్ హుడ్డా జాట్ రాజకీయం కీలక పాత్ర నిర్వహించింది తప్ప కాంగ్రెస్ పార్టీ విధానాలు, అధినాయకత్వం పేరు, ప్రతిష్టలు ఎంత మాత్రం కాదు. మహారాష్టల్రో మరాఠా ఓట్లు గంపగుత్తగా పడటం వల్లనే ఎన్.సి.పి సీట్లు గణనీయంగా పెరిగాయి. ఆజీత్ పవార్ బారామతిలో లక్షన్నరపైగా మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నిక కావటానికి ప్రధాన కారణం మరాఠా రాజకీయం. ప్రాంతీయ నాయకత్వం, ప్రాంతీయ పార్టీలు రెండు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర వహించాయనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అంత మాత్రాన నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పలేము. హర్యానాలో బి.జె.పికి గత ఎన్నికల్లో 47 సీట్లు లభిస్తే ఈ ఎన్నికల్లో అవి 40కి తగ్గిపోయాయి. అంటే బి.జె.పి సీట్లు ఏడు మాత్రమే తగ్గాయి. అదే విధంగా మహారాష్టల్రో గత ఎన్నికల్లో బి.జె.పికి 122 వస్తే ఈసారి 20 సీట్లు తగ్గి 102 సీట్లు వచ్చాయి. శివసేనకు గత ఎన్నికల్లో 63 సీట్లు రాగా ఈసారి ఏడు సీట్ల తగ్గింపుతో 56 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో 42 సీట్లు వస్తే ఈసారి ఒక సీటు పెరిగి 43 అయ్యాయి. శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్.సి.పికి గత ఎన్నికల్లో 41 సీట్లు లభిస్తే ఈ సారి ఇవి 13 సీట్లు పెరిగి 54 సీట్లు అయ్యాయి. ప్రాంతీయ అంశాలు, కుల రాజకీయ కీలక పాత్ర వహించినప్పుడు బి.జె.పికి కొన్ని సీట్లు తగ్గటం పెద్ద విషయమేమీ కాదు. లోకసభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎం.ఐ.ఎం మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోవటంతోపాటు బీహార్, ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో రెండు శాసన సభ సీట్లు గెలుచుకోవటం మైనారిటీల ఏకీకరణానికి నిదర్శనం. మహారాష్టల్రో మరాఠాలు, హర్యానాలో జాట్లు తాము అనుకున్న వారికి ఓట్లు వేసుకున్నట్లే కొన్ని చోట్ల మైనారిటీలు ఎం.ఐ.ఎంకు ఓటు వేసినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. శాసనసభ ఎన్నికలు కాబట్టే ఓటర్లు తమ ప్రాంత సమస్యలు, ప్రాంతీయ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారని భావించవలసి ఉంటుంది. స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినంత మాత్రాన ప్రజలు ముఖ్యంగా జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు, ట్రిపుల్ తలాక్ తొలగింపునకు ప్రాధాన్యత ఇవ్వలేదని భావించేందుకు వీలు లేదు. నరేంద్ర మోదీ హవా తగ్గిపోతోంది, జాతీయతకు ప్రాధాన్యత ఇవ్వటం తగ్గుతోందని ఘంటాపథంగా చెప్పలేము. 2019 లోకసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు జాతీయ స్థాయి ఆర్థికాంశాలు, ముఖ్యంగా నిరుద్యోగం, ఆర్థిక రంగం కుదేలు కావటం, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి అంటూ నరేంద్ర మోదీపై ఎంత దుమ్మెత్తిపోసినా ప్రజలు మాత్రం ఎన్.డి.ఏకు బ్రహ్మరథం పట్టారు. జాతీయ స్థాయిలో పటిష్టమైన నాయకత్వం అవసరమని భావించిన దేశ ప్రజలు నరేంద్ర మోదీ బలమైన నాయకుడని భావించి భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రతిపక్షం తరపున బలమైన నాయకుడు కనిపించకపోవటం, రాహుల్ గాంధీ బలమైన నాయకుడుగా ఎదగలేకపోవటం, ప్రతిపక్షంలో సమైక్యత లోపించటం వంటి పలు కారణాలు నరేంద్ర మోదీ విజయానికి సోపానాలయ్యాయి. నరేంద్ర మోదీ ఐదు సంవత్సరాల పాటు జాతీయ స్థాయిలో అవినీతి రహిత పాలనను అందజేసినట్లే మహారాష్టల్రో దేవేంద్ర ఫడ్నవీస్, హర్యానాలో మనోహర్ లాల్ కట్టర్ అవినీతి రహిత పాలనను ప్రజలకు ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో జరిగినట్లు కేంద్రంతో పాటు రెండు రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేల లేదు. అయినా రెండు రాష్ట్రాలలోని కొన్ని వర్గాల ప్రజలు ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం వలన బి.జె.పికి ఆశించిన ఫలితాలు లభించలేదు. ఉల్లి పాయల ధరలు పెరిగినందుకు నిరసనగా ఢిల్లీ తదితర ప్రభుత్వాలను ఓటర్లు దింపివేసిన విషయం మరవరాదు.