సంపాదకీయం

పైశాచిక పరాకాష్ఠ ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విస్మయానికి గురి అయి ఉన్న దేశం మాటలుడిగి ఉంది. మాటలుడిగిన జాతి వౌనం పాటిస్తోంది. వౌనంలో ఇమిడి ఉన్న వ్యథల కథను వినిపించగల మాటలు లేవు, మృతుల కుటుంబాల గుండెలలో బద్దలవుతున్న విషాద విస్ఫోటనాలను వివరించే మాధ్యమాలు లేవు. విదేశ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ పార్లమెంటులో ప్రకటన చేసేవరకు మిణుకు మిణుకు మంటుండిన ‘ఆశ’ మంగళవారం ఆవిరైపోయింది. ఇరాక్‌లోని మోసుల్ ప్రాంతంలో దాదాపు నాలుగేళ్ల క్రితం అపహరణకు గురైన ముప్పయి తొమ్మిది మంది భారతీయుల జీవన శ్వాస ఆగిపోయింది! ఈ ముప్పయి తొమ్మిది మందిని ‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం’- ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా- ఐఎస్‌ఐఎస్- ఐసిస్- జిహాదీ బీభత్స సంస్థకు చెందిన మతోన్మాద హంతకులు ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని ‘మోసుల్’ నుంచి అపహరించుకొని వెళ్లినట్టు 2014 జూన్ పదిహేడవ తేదీన వెల్లడైంది. మొత్తం నలబయి మంది భారతీయులను ‘ఐసిస్’ దుండగులు అపహరించారు. అపహరణకు గురైన వారందరూ నిర్మాణ రంగంలో పనిచేస్తూండిన- పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, బిహార్, బెంగాల్ ప్రాంతాలకు చెందిన శ్రామికులు. అపహరణకు గురైన వారిలో హర్‌జిత్‌మాసీ అనే కార్మికుడు తప్పించుకొని బయటపడడం అద్భుతమైన దైవఘటన. ‘మోసుల్’ లోని ఒక ‘బందిఖానా’ నుంచి మరో ‘బందిఖానా’కు బందీలను ‘ఐసిస్’ దుండగులు తరలించారు. ‘ఐసిస్’ బీభత్సకారులకు, ఇరాక్ ప్రభుత్వ దళాలకు ‘మోసుల్’ ప్రాంతంలో భయంకర యుద్ధం జరుగుతుండిన సమయమది. ఒక పాఠశాలలో ఈ భారతీయులను దుండగులు బంధించారు. బాంబుల దాడికి ఆ పాఠశాల కూలిపోయే ప్రమాదం ఉందన్న భయంతో ‘ఐసిస్’ ముఠావారు బందీలను మరోచోటికి తరలించారు. ఇలా తరలింపులు పదే పదే జరిగిన సమయంలో హర్‌జిత్‌మాసీ స్పృహతప్పి ఉన్నాడు. ఆయన మరణించాడని భావించిన దుండగులు ఆయనను వదలిపెట్టి మిగిలిన ముప్పయి తొమ్మిది మందిని వేరే ప్రాంతానికి తరలించుకొని పోయారు. అలా బతికి బయటపడిన హర్‌జిత్‌మాసీ ఇరాక్ నుంచి మన దేశానికి చేరుకోగలిగాడు. మిగిలిన ముప్పయి తొమ్మిది మందిని ‘ఐసిస్’ జిహాదీలు ఎప్పుడు హత్యచేశారన్నది, హతులను ఎవరు ఎప్పుడు ఖననం చేశారన్నది ఇప్పటికీ స్పష్టం కాడం లేదు..
ఇరాక్‌లో ‘ఐసిస్’ దళాలకు, ప్రభుత్వ దళాలకు మధ్య ‘యుద్ధం’ తీవ్రతరమైన సమయంలో మన ప్రభుత్వం మన దేశస్థులను అక్కడి నుంచి తరలించుకొని రావడానికి యత్నించింది. దళాబ్దుల తరబడి పశ్చిమ ఆసియా దేశాలు సంఘర్షణగ్రస్తమై ఉన్నాయి. ఈ సంఘర్షణలు తీవ్రతరమైనప్పుడల్లా మన ప్రభుత్వం భారీ సంఖ్యలో మన జాతీయులను ఆయా పశ్చిమ ఆసియా దేశాల నుంచి తరలించుకొని వచ్చింది. లెబనాన్, లిబియా, యెమెన్, ఇరాక్‌ల నుంచి నౌకల ద్వారా, విమానాల ద్వారా మన దేశస్థులను స్వదేశానికి రప్పించగలిగింది. 2014లో ఇరాక్‌లో ‘ఐసిస్’ బీభత్సకాండ ఉద్ధృతమైన నాటికి ఇరాక్‌లో వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. తెలుగు ప్రాంతాలకు చెందిన దాదాపు రెండువేల మంది 2014లో ఇరాక్‌లో ఉండినారు. ‘ఐసిస్’ దాడులు ఉద్ధృతం కాగానే 2014 జూన్‌లో మన ప్రభుత్వం హెచ్చరికలను జారీచేసింది. భారతీయులందరూ ఇరాక్ నుంచి తిరిగి స్వదేశానికి వచ్చేయాలని, కొత్తగా ఎవ్వరూ ఉద్యోగ ఉపాధుల కోసం ఇరాక్‌కు వెళ్లరాదని మన ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఈ సలహాను పాటించి వేల మంది స్వదేశానికి వచ్చేశారు. మరికొన్ని వేల మంది ఇరాక్‌లోనే ఉండిపోయారు. ఉద్యోగాలను మానుకొని వస్తే ఆర్థికంగా ఇబ్బందులు పాలుకావలసి వస్తున్న కారణంగా, ఋణగ్రస్తులు కావల్సి వస్తుందన్న భయంతో అనేక మంది అక్కడే ఉండిపోయారు. ఇరాక్ ప్రభుత్వ దళాలు కాని, ‘ఐసిస్’ హంతకులు కాని తమ నివాసాలపై దాడులు జరుపబోరన్న ధీమాతో మరికొందరు అక్కడే ఉండిపోయారు..
కొన్ని వందల మంది భారతీయులు ‘మోసుల్’ తదితర యుద్ధక్షేత్రాలలో ఉభయ దళాల మధ్య చిక్కుపడిపోయారు. స్వదేశానికి తిరిగి రాదలచుకున్న వారందరినీ ఇరాక్ ప్రభుత్వ సహాయంతో మన దౌత్య కార్యాలయం వారు క్షేమంగా బయటికి తీసుకొని రాగలిగారు. కానీ ‘మోసుల్’ప్రాంతంలో చిక్కువడిన ఈ మప్పయితొమ్మిది మందిని ఇరాక్ ప్రభుత్వం కాని, మన దౌత్య ప్రతినిధులు కాని తప్పించలేకపోయారు. ఫలితంగా ‘ఐసిస్’ ముఠా ఈ ముప్పయి తొమ్మిది మందిని అపహరించుకొని వెళ్లగలిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ అభాగ్యుల గురించి రకరకాల కథనాలు ప్రచారమయ్యాయి. ఈ భారతీయులను ‘ఐసిస్’ జిహాదీలు హత్యచేశారన్న కథనాలు 2015 ఆరంభం నుంచి వినబడుతున్నాయి. ‘మోసుల్’ ప్రాంతం ఇరాన్‌కు సమీపంలో, టర్కీకి దగ్గరలో ఉంది. ‘బంధితుల’ను ‘ఐసిస్’ ముఠా వారు సిరియాలోని తమ స్థావరాలకు తరలించుకొని పోయారని కూడా కథనాలు వెలువడినాయి. మన దేశానికి వచ్చిన హర్‌జిత్‌మాసీ కూడ బందీలను దుండగులు హత్యచేశారని నిర్ధారించాడు. కానీ మన ప్రభుత్వం మాత్రం మన పౌరులు ‘ఐసిస్’ నిర్బంధ గృహాలలో క్షేమంగా ఉన్నారన్న ఆశను వదులుకోలేదు. 2014 జూలైలో ‘ఐసిస్’ అపహరించిన నలబయి ఆరు మంది వైద్య సహాయక- ‘నర్సు’-లను మూడురోజుల తరువాత విడిపించుకోగలగడం ఈ విశ్వాసానికి ప్రాతిపదిక. మూడేళ్లు ‘మోసుల్’ ఐసిస్ అధీనంలో ఉంది. 2017 జూలై తొమ్మిదవ తేదీన ఇరాక్ ప్రభుత్వ దళాలు మోసుల్ నగరాన్ని ‘ఐసిస్’ అధీనం నుండి విముక్తం చేయగలిగాయి. వెంటనే మన విదేశాంగ సహాయమంత్రి విజయకుమార్ సింగ్ ఇరాక్ వెళ్లి మనవారి క్షేమ సమాచారం గురించి ఆరా తీశాడు. మోసుల్ సమీపంలోని బాదుష్‌లోని నిర్బంధ గృహాలలో మన బంధితులు ఉండవచ్చునన్నది అప్పుడు సుషమా స్వరజ్ ప్రకటించిన ఆశాభావం!
కానీ ఈ ఆశాభావం దశాబ్దుల జిహాదీ హంతకుల స్వభావానికి, జీవనప్రవృత్తికి విరుద్ధమని ఇప్పుడు ధ్రువపడింది. ప్రపంచంలోని మిగతా మతాలను నిర్మూలించి ‘ఇస్లాం’ను ఏకైక మతంగా ప్రతిష్ఠించడం ‘జిహాదీ’ల లక్ష్యం. జిహాదీ బీభత్సకాండను ఇస్లాం మతస్థులలో అధిక సంఖ్యాకులు వ్యతిరేకిస్తున్నారు. ఇస్లాం మతస్థులను సైతం హత్యచేయడం జిహాదీ హంతకుల కార్యక్రమంగా మారింది. అప్ఘానిస్థాన్, ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా, టర్కీ వంటి దేశాలలో జిహాదీలకు, ప్రభుత్వ దళాలకు మధ్య పోరాటాలు జరుగుతుండడానికి ఇదీ కారణం! స్వమతస్థులనే మట్టుపెడుతున్న జిహాదీలకు అన్యమతస్థులను చంపడం మరింత ఇష్టమైన కార్యక్రమం. అందువల్లనే ఇస్లామేతర మతాలవారు అత్యధిక సంఖ్యలో ఉన్న మన దేశాన్ని ధ్వంసం చేయాలన్నది జిహాదీల శతాబ్దుల కార్యక్రమం! ఈ కార్యక్రమంలో జిహాదీలు సాధించిన ‘పాక్షిక’ విజయం జిహాదీ స్వభావం కల పాకిస్తాన్ ఏర్పడడం. ఇలా మన దేశాన్ని బద్దలుకొట్టిన జిహాదీలు సర్వమత సమభావ వ్యవస్థకల ‘అవశేష భారత్’ను ఇస్లాం మత రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో బీభత్సకాండను కొనసాగిస్తూనే ఉన్నారు. క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ కాసిమ్ అనే అరేబియా జిహాదీ మొదలుపెట్టిన ‘కార్యక్రమం’ ఇది. బీభత్సకాండ ఇది, పాకిస్తాన్ నిర్మాత మహమ్మదాలీ జిన్నా కొనసాగించిన బీభత్సం ఇది. ‘ఐసిస్’ పైశాచిక వికృత బీభత్సం ఈ ‘జిహాద్’కు కొనసాగింపు.. ‘మోసుల్’లో పరాజయం పాలై పారిపోయిన ‘ఐసిస్’ పిశాచాలు భారతీయతను హత్యచేసి పోయాయి.. సర్వమత సమభావ భారతీయతపై ఏక మతోన్మాద జిహాదీ తత్వం జరిపిన మరో దాడి ఇది!