సంపాదకీయం

‘చొఱబడ లేని’ చైనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన అండమాన్, నికోబార్ దీవుల సమీపంలోని సముద్ర జలాలలో గూఢచర్య కలాపాలను నిర్వహిస్తుండిన చైనా నౌకను మన నౌకాదళం వారు తరిమివేయడం చైనా దురాక్రమణ వ్యూహానికి ఎదురుదెబ్బ! చైనా ప్రభుత్వం కవ్వింపు చర్యలను మానలేదనడానికి ఇది మరో నిదర్శనం. మనదేశాన్ని యుద్ధంలో ఓడించడం వీలుకాదన్నది చైనా గ్రహించిన వాస్తవం. అందువల్లనే క్రీస్తుశకం 1962లో వలె పెద్దఎత్తున మరో దురాక్రమణ సాగించడానికి చైనా పూనుకొనడం లేదు. మన దేశం కూడ ప్రస్తుత పరిస్థితులలో చైనాతో తలపడి ఓడించడం కష్టం! ఈ ‘సమర పాటవ సమానస్థితి’ చైనాకు అనుకూలంగా ఉండడం విచిత్రమైన పరిణామం. ఉభయ దేశాల మధ్య మరో యుద్ధం జరుగనంతవరకు లడక్‌లో దురాక్రమించిన మన భూభాగంలో చైనా తిష్ఠవేసి ఉండవచ్చు! పాకిస్తాన్ 1963లో చైనాకు అప్పగించిన మన కశ్మీర్ భూభాగంలో కూడ చైనా తిష్ఠ కొనసాగుతూనే ఉండగలదు. ఈ యథాతథ స్థితి చైనాకు అనుకూలంగా ఉండడం కాల వైపరీత్యం! అందువల్లనే చైనా ‘సరిహద్దు వివాదం’ చర్చల ద్వారా పరిష్కారం కావాలని పదేపదే ప్రకటిస్తోంది! ఈ సరిహద్దు చర్చలు జరుగుతున్నంతకాలం నిరంతరం చొఱబాట్లను కొనసాగించాలన్నది చైనా వ్యూహం. ఈ ‘చొఱబాట్ల’పట్ల మన ప్రభుత్వం ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకోవడం చైనా వ్యూహం! ‘స్థల’ సరిహద్దులలో జరిగిన చైనా చొఱబాట్లను మన ప్రభుత్వం 2014 వరకు పెద్దగా ప్రతిఘటించలేదు. 2014 మే 26 తరువాత మన ప్రభుత్వ విధానం మారింది. చైనా సైనికులు ‘స్థల’సరిహద్దులను అతిక్రమించినప్పుడల్లా మన భద్రతా దళాలవారు, ‘్భరత టిబెట్ సరిహద్దు దళం-ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్- ఐటిబిపి-వారు చైనా సైనికులతో తలపడుతుండడం గత ఐదేళ్ల చరిత్ర! 2014 తరువాత ‘స్థల’ సరిహద్దులలో, మన ఉత్తరపు సరిహద్దులలో చైనీయుల ‘చొఱబాట్ల’ సంఖ్య క్రమంగా తగ్గుతోంది! ‘జల’ సరిహద్దులను అతిక్రమించి చైనా దళాలు మన ‘సార్వభౌమ సముద్ర ఆర్థిక మండలం’- ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్- ఇఇజెడ్-లోకి చొఱపడుతుండడానికి ఇదీ నేపథ్యం. ‘స్థల’ అతిక్రమణల పట్ల మన ప్రభుత్వ ప్రతిఘటన స్థాయిని చైనా గత ఐదేళ్లలో అంచనా వేయగలిగింది. అందువల్ల ఇప్పుడు ‘జల’ అతిక్రమణలకు పూనుకొంది! అండమాన్ సమీపంలోని మన ‘ఆర్థిక సముద్ర జల మండలం’లోకి చైనా నౌక దూసుకొని రావడానికి ఇదీ నేపధ్యం. చైనావారి ‘్ఛయాన్’ అన్న నౌక కొన్ని వారాల క్రితం మన ఆర్థిక సముద్ర మండలంలోకి చొఱబడింది. అక్రమ కలాపాలను నిర్వహిస్తుండిన ఈ నౌకను పసికట్టిన మన నౌకాదళం ఆ నౌకను మన ‘ఆర్థిక సముద్ర మండలం’ నుంచి ఆవలకు, అంతర్జాతీయ సముద్ర జలాలలోకి నెట్టివేయడం శుభ పరిణామం!
తమ దళాలు జరిపే ‘స్థల’ అతిక్రమణలను కాని, ‘జల’ అతిక్రమణలను కాని మన దళాలు తిప్పి కొట్టడం ఖాయమన్నది ఇప్పుడు చైనా గ్రహించిన పాఠం. 1962 నాటి చైనా దురాక్రమణ తరువాత లడక్‌లో ఉభయ దేశాల మధ్య ‘వాస్తవ అధీనరేఖ’- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్- ఎల్‌ఏసి- ఏర్పడి ఉంది. యాబయి ఏళ్లకుపైగా చైనా దళాలు ఈ ‘రేఖ’ను దాటి వచ్చి మన వైపున వారాల తరబడి నెలల తరబడి తిష్ఠవేయడం పరిపాటి అయిపోయింది. మన ప్రభుత్వపు మెతక విధానం కారణంగా మన ‘ఐటిబిపి’ దళాలవారు చైనీయ సైనికులతో తలపడలేదు. ఫలితంగా 2012 నాటికి ఈ ‘వాస్తవ అధీన రేఖ’ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర మన వైపునకు జరగడం ప్రచారం కాని వైపరీత్యం. 1962నాటికి ఈ ‘ఎల్‌ఏసి’కి ఈవల మనవైపున ఉన్న ‘‘ఐదు కిలోమీటర్ల వెడల్పున ఉన్న ప్రాంతం’’ 2012నాటికి ‘రేఖ’కు ఆవలకు చైనా వైపునకు మారిపోవడం ‘చొఱబాట్ల’ ఫలితం. ఈ చొఱబాట్లను ప్రతిఘటించకపోయిన ఫలితం!! జమ్మూ కశ్మీర్‌లో పడమటి వైపున పాకిస్తాన్ దురాక్రమిత ప్రాంతానికీ మన దేశం అధీనంలో ఉన్న ప్రాంతానికీ మధ్య 1949నుంచి ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి ఏర్పడి ఉంది. ఈ ‘అధీన రేఖ’ పొడవునా అప్పటి నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ దళాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. 2003లో కుదిరిన ‘కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని 2012లో పాకిస్తాన్ ఉల్లంఘించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ప్రతిరోజూ పాకిస్తాన్ దళాలు కవ్వింపు లేని కాల్పులు జరుపుతున్నాయి. అయినప్పటికీ 1949నాటి ‘అధీన రేఖ’ యథాతథంగా కొనసాగుతోంది. కానీ జమ్మూ కశ్మీర్ తూర్పుభాగాన చైనాకూ మనకు మధ్య ఏర్పడి ఉన్న ‘వాస్తవ అధీన రేఖ’మాత్రం మన వైపునకు జరిగింది. ‘కాల్పులు జరపని’ చైనా దాదాపు ఐదు కిలోమీటర్లమేర దూసుకొని వచ్చింది! కొన్ని జనావాసాలు సైతం ‘వాస్తవ అధీనరేఖ’ ఆవలికి జరిగాయి. ‘రేఖ’కు మనవైపున ఉండిన ఈ జనావాసాలలో త్రివర్ణ భారతీయ సార్వభౌమ పతాకం రెపరెపలాడింది. కానీ చైనా చొచ్చుకొని రావడంతో ‘రేఖ’కు ఆవలికి జరిగిన ఈ జనావాసాలలో భారతీయ సార్వభౌమ పతాకం రెపరెపలను చైనా నిరోధించడం చరిత్ర..
గత ఐదేళ్లుగా మన ప్రభుత్వం ఈ మెతకతనాన్ని విడనాడి కరకుతనాన్ని ప్రదర్శిస్తోంది. అందువల్ల చైనా ‘స్థల’ సరిహద్దుల నుంచి ‘జల’ సరిహద్దుల వైపు వ్యూహాన్ని మరలించింది. లడక్‌లోని ఉత్తరపు సరిహద్దులలోని ఇతర ప్రాంతాలలోకి చైనా ‘చొఱబాట్లు’ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 2014వ సంవత్సరం వరకు జరిగిన ‘చొఱబాట్ల’ సంఖ్యతో పోల్చినప్పుడు ఈ ఐదేళ్లలో ఈ ‘సంఖ్య’ బాగా తగ్గింది. చైనాను ప్రతిఘటిస్తున్న మన ‘కరకు’ విధానం ఇందుకు కారణం. 2013 ఆగస్టులో చైనా దళాలు మన అరుణాచల్‌లోకి చొఱబడినాయి, గుడారాలు నిర్మించి, వంటలు చేసి భోంచేసి నాలుగు రోజులు తిష్ఠవేయడం చరిత్ర. మన దళాలు ప్రతిఘటించి తరిమివేయలేదు. ఐదవ రోజున చైనా సైనికులు తిరిగి వెళ్లారు. 2013 మే నెలలో లడక్‌లోని ‘దీపసంగ’ ప్రాంతంలోకి చొఱబడిన చైనా దళాలు అనేక రోజులపాటు దాదాపు ఏడువందల యాబయి చదరపు కిలోమీటర్లమేర సంచరించాయి. గుడారాలు నిర్మించి తిష్ఠవేశాయి. తరువాత తిరిగి వెళ్లాయి! ఇలా ‘చొఱబాటు’ జరిపిన చైనా దళాలను మన దళాలు ప్రతిఘటించలేదు, మరింత ముందుకు రాకుండా వలయాలుగా ఏర్పడినారు. ఈ మెతక విధానం 2014 తరువాత మారిపోయింది, కరకు విధానం మొదలైంది. 2014 జూలైలో చైనా దళాలు లడక్‌లోని ‘దేమ్‌చోక్’, ‘చమూర్’ ప్రాంతాలలోకి చొఱబడినాయి. మన ‘ఐటిబిపి’వారు వెంటనే ప్రతిఘటించారు, చైనా సైనికులతో తలపడి మెడలు పట్టుకొని గెంటుతూ వెళ్లారు, చైనావారిని ‘రేఖ’ఆవలకు గెంటేశారు. ఇది మన విధానంలో వచ్చిన మార్పు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! 2017 జూన్, జూలై నెలల్లో సిక్కింలోని ‘డోక్‌లా’-డోక్‌లామ్- ప్రాంతంలో చైనా దళాలను మన దళాలు ప్రతిఘటించి నిరోధించిన తీరు మన ‘కరకు’ విధానానికి మరో ఉదాహరణ..
గత ఐదేళ్లుగా ‘స్థల’దురాక్రమణ వ్యూహాన్ని మందగింపచేసిన చైనా ‘జల’ దురాక్రమణను విస్తరిస్తోంది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నుంచి, పాకిస్తాన్‌లోని గ్వాడార్ వరకు, బర్మా, సింహళము, మాల్‌దీవుల మీదుగా ఆఫ్రికాలోని ‘జిబౌటీ’వరకు చైనా నౌకాదళాలు బరితెగించి బహిరంగ విన్యాసాలు చేస్తున్నాయి. అండమాన్ సముద్ర జలాలలోకి చైనా నౌక చొఱబడడం ఈ ‘దురాక్రమణ’ విన్యాసాలలో భాగం! సముద్ర తీరం నుంచి సముద్రంలోకి పనె్నండు మైళ్ల వెడల్పున విస్తరించిన ప్రాంతం ప్రతి దేశానికీ ‘సార్వభౌమ జల మండలం’- టెర్రిటోరియల్ వాటర్స్-! సముద్ర తీరం నుంచి రెండువందల మైళ్ల మేర విస్తరించిన సముద్ర ప్రాంతం ‘ఆర్థిక జల మండలం’-! మన ‘ఆర్థిక జల మండలం’లో మన ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాల వారు ఎలాంటి ‘అనే్వషణలు’ ‘పరిశోధనలు’ ‘కలాపాలు’ జరుపరాదు. చైనా ఈ ఆర్థిక మండలంలోకి చొఱబడి ‘గూఢచర్య’ కలాపాలకు పాలుపడడం మన ప్రతిక్రియను పరీక్షించడానికి కావచ్చు. ప్రతి క్రియ జరిగింది... చైనా నౌక పలాయనం చిత్తగించింది!!