మెయన్ ఫీచర్

అనుభూతి కాదు..ఇది జీవనరీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశద్రోహులతో భరతమాత వరాల బిడ్డలు సహజీవనం చేయవలసిన దుస్థితి దాపురించి ఉండడం వర్తమాన వాస్తవం. ఈ వాస్తవం జమ్మూకశ్మీర్ ‘వసం త’ రాజధాని శ్రీనగర్‌లోని జాతీయ సాంకేతిక ఉన్నత విద్యాలయం- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-నిట్- ప్రాంగణంలో మరోసారి ప్రస్ఫుటించింది. ఈ మహావిద్యాలయ ప్రాంగణంలో ముప్పయిశాతం స్థానిక కశ్మీరీ విద్యార్థులు ఇతర ప్రాంతాలవారు. మార్చి 31న భారత జట్టువారు క్రికెట్ ఆటల పోటీలో ఓడిపోయారు. వెస్ట్ ఇండీస్ జట్టు గెలిచింది. నిట్ ప్రాంగణంలోని కశ్మీరీ విద్యార్థులలో అత్యధికులు ఈ భారత పరాజయాన్ని ఉత్సవంగా జరిపి ఆనందోత్సాహాలతో ఊరేగారట. మిగిలిన ప్రాంతాలకు చెందిన డెబ్బయి శాతం విద్యార్థులు ఈ దేశద్రోహ చర్యను నిరసించారు. భరతమాతకు జయనాదం చేశారు. జాతీయతా నిష్ఠ జయకేతనులై ఊరేగింపులు జరిపారు. కానీ ఇలా దేశద్రోహాన్ని నిరసించిన విద్యార్థుల తలలను జమ్మూకశ్మీర్ పోలీసులు పగలగొట్టారు. ముప్పయి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారట. మూడు వందల మంది పోలీసుల విద్రోహపు లాఠీలకు బలయ్యారు.
భారతదేశంలో భరతమాత పరాజయాన్ని హర్షించే వారిని శిక్షించే వ్యవస్థ లేదు. భరతమాత భక్తులపై ప్రభుత్వ దమనకాండ సాగిపోయింది. ఇది రోగలక్షణం మాత్రమే. రోగం దశాబ్దుల తరబడి వ్యాపిస్తోంది..జిహాదీలను ఉసిగొలిపి మన మాతృభూమిని బద్దలు కొట్టడానికి యత్నిస్తున్న బీభత్స విదేశీయ వ్యవస్థలతో మన ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి చర్చలు జరపడం రోగం..చైనీస్ ఫుడ్ అన్న పదజాలం పట్ల మక్కువ ప్రదర్శిస్తున్న తిండిపోతులు ఈ రోగం వివిధ రూపాలు. ప్రీమియర్ లీగ్ పేరుతో ఇతరేతర వికృత నామాలతో కిరాయి క్రికెట్టు ఆటలాడిస్తున్న వారు ఈ రోగ విస్తారకులట. భారత జట్టు గెలిస్తే జయ్ కొట్టగలం..ఓడితే బాధపడగలం... వివిధ దేశాల-అమ్ముడు పోయిన ఆటగాళ్లతో కూడిన కిరాయి జట్టు ఆడుతున్న ఆటలలో ఎవరికి జయ్ కొట్టాలి? కిరాయి క్రికెట్ పరిధిలో జాతీయతకు దేశభక్తి స్థానం ఎక్కడిది? ఇలాంటి కిరాయి క్రికెట్ జట్లను క్రీస్తుశకం 1970వ దశకంలోనే ఏర్పాటు చేసి ఆడించారట. సాకర్ సిరీస్ లేదా ‘జోకర్ సిరీస్’ కావచ్చు. అప్పుడు ఈ కిరాయి ఆటలకు ఏ దేశంలో కూడ ఈ ఆదరణ లభించలేదు. కానీ ఇప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్ జట్టుకంటె ఈ కిరాయి జట్లకు ప్రాధాన్యం, ప్రాబల్యం ప్రచారం పెరిగిపోయాయి. ఎందుకు? 1970వ దశకం నాటికి వాణిజ్య ప్రపంచీకరణ ఆరం భం కాలేదు.. క్రీస్తుశకం 1994 నుంచీ వాణిజ్య ప్రపంచీకరణ మననెత్తికెక్కి మన జాతీయతను తొక్కివేస్తోంది. భారతీయతను ప్రపంచీకరణ కబళిస్తున్న తీరునకు కిరాయి క్రికెట్ ఒక ఉదాహరణ మాత్రమే!
మనకు తెలియకుండానే మన దృక్పథం జాతీయతా వ్యతిరేక భావనతో ప్రభావితం అయిపోతోంది... ప్రపంచీకరణ కల్పించిన మారీచ మృగయా మాయాజాలం ఇది...‘‘మా అమ్మాయి జపాన్‌లోని ఫలానా కంపెనీలో పనిచేస్తోంది. ఆమె భర్తకూడా అదే కంపెనీలో ఉద్యోగే. అది అమెరికా వాళ్లు జపాన్‌లో పెట్టిన కంపెనీ. యాబయి ఎనిమిది దేశాలలో ఈ మల్టీ నేషనల్ కంపెనీకి బ్రాంచీలు ఉన్నా యి. ‘‘మావాళ్లకు థాయ్‌లాండ్ నుండి ఈమధ్యనే జపాన్‌కు బదిలీ అయింది. ఈ కంపెనీవారు ఉద్యోగులకు క్వార్టర్స్ ఇస్తున్నారు. కంపెనీవారు ఏర్పాటు చేసిన స్టోర్స్‌లో సరకులు సమస్తం సబ్సిడీ ధరలకు కొనుక్కోవచ్చు. కంపెనీ బ్రాంచి ఉన్న చోట ఉద్యోగుల పిల్లలకు స్కూళ్లకు కూడా కంపెనీవారు ఏర్పాటు చేస్తున్నారు. రిక్రియేషన్ క్లబ్, ప్లేగ్రౌండ్, ఇలా ఉద్యోగులకు సమస్తం కంపెనీ సమకూర్చిందట..ఇంక ఉద్యోగులకు ప్రభుత్వాలతో పనేముంది? దేశాలతో పనేముంది? అని ఒక మేధావి చెప్పుకు పోయాడు. జాతీయ సార్వభౌమ అధికారం పరమావధి కాదు. అని బ్రిటన్ మాజీ విదేశాంగ మంత్రి డేవిడ్ మిలిబాండ్ 2012లో వర్ధమాన దేశాలకు చెప్పినపాఠం. ఈ మేధావి విశే్లషణకు ప్రాతిపదిక! మిలిబాండ్ చెప్పిన దేశాల సరిహద్దులు చెరగిపోయే సిద్ధాంతాన్ని బ్రిటన్ వోటర్లు మాత్రం అంగీకరించడం లేదు.
వేళ్లను తెగనరికి ఆకులపై నీళ్లు గుమ్మరించడం వల్ల చెట్టు చిగురించడదు. అందువల్ల వేరును రక్షించడం ప్రధానం..వేరు జీవవంతమై ఉన్నట్టయితే శతాబ్దులపాటు సహస్రాబ్దుల పాటు కొమ్మలను తెగనరికినప్పటికీ మళ్లీ మళ్లీ చెట్టు చిగురిస్తూనే ఉంటుంది. వాణిజ్య ప్రపంచీకరణ భారతీయతా మహావృక్షపు ‘వేరు’ పాలిటి ‘గొడ్డలి’గా పరిణమించి ఉండడం నడుస్తున్న చరిత్ర... అమృతం వంటి మజ్జిగను తాగడం మాని పెప్సీకోలాను గుటగుట లాడిస్తున్న వారు ఈ గొడ్డలికి వివిధ రూపాలు. కొబ్బరి కాయ ‘ఎలనీరు’ రుచి తెలియని వాడు ‘కోకాకోలా’ను మరిగి ఉండడం ప్రపంచీకరణ నిలబెట్టిన వికృత దృశ్యం. కిరాయి క్రికెట్టు ‘కాడ్‌బరీ చాక్లెట్లు కొంపకు నిప్పటిస్తున్న దృశ్యమిది. కిరాయి క్రికెట్టుతో మన దేశపు సరిహద్దులు చెరిగిపోతున్నాయి. సరిహద్దులు తెలియని వారికి మాతృదేశపు స్వరూపం తెలియదు. స్వభావం తెలియదు. భారతమాతాకీ జయ్-అన్నది క్రమంగా భావోద్వేగంగా మారిపోతోంది. భరతమాత తాత్కాలిక భావోద్వేగపు అనుభూతి కాదు. సనాతన జాతీయ జీవన వాస్తవం. ఈ వాస్తవానకి ప్రబల శత్రువు ప్రపంచీకరణ.
దేశభక్తి, జాతీయయత, మాతృభూమి పట్ల మమకారం వంటివి జీవన వాస్తవాలు కాదని, అవి కేవలం తాత్కాలిక అనుభూతులు మాత్రమేనని ఐరోపా తత్వం వంట బట్టిన మన మేధావులు బ్రిటిష్ పాలన కాలంలో నిర్ధారించుకున్నారు. అందువల్ల సాహిత్యంలో ఐరోపా వారికి మనవారు అనుకరణ విన్యాసాలను సృష్టించారు. ‘‘మాతా భూమిః పుత్రోహం ఫృథివ్యాః’’ అని వేదఋషులు ఘోషించిన నాటి నుంచి మాతృదేశభక్తి హైందవ జాతీయ జీవన స్వభావమైంది. కాగా దేశభక్తి ఇగ్లాండ్‌లో పుట్టి మనదేశానికి వచ్చిందని, కాదు ఫ్రాన్స్ దేశభక్తికి జన్మస్థానమని కొందరు మనవారు ఆకాశవాణిలో ప్రసంగాలు చేశారు. ఫ్రాన్స్ పక్షీయులు, ఇంగ్లాండ్ పక్షీయులు ఈ దేశభక్తి గురించి విభేదాలను వెదజల్లడం బ్రిటన్ పాలన నాటి మాట! ఆ తరువాత వారి వారసత్వం. సకల వైవిధ్య రీతులు సమాంతరంగా ఒకే సమయంలో వికసించడం అనాది భారతీయత. ఒకవైవిధ్యాన్ని నాశనం చేసి మరో వైవిధ్యం...అలా ఒకదాని తరువాత మాత్రమే మరొకటి బతకడం ఐరోపావారి జీవన రీతి. దీన్ని బ్రిటిష్ భావదాసులు మనదేశంలో కొనసాగించడం కొనసాగుతున్న వైపరీత్యం. ‘క్లాసికల్ పొయిట్రీ’ యుగం నశించిన తరువాత ‘రొమాంటిక్ పొయిట్రీ’ పుట్టిందట- ఐరోపాలో! మన సాహిత్యవేత్తలు కూడ ‘సంప్రదాయ కవిత్వ’ యుగం నశించిన తరువాత ‘్భవకవిత్వ’ యుగం అవతరించిందని సిద్ధాంతీకరించారు. జాతీయతలో మతా లు, భాషలు, సంప్రదాయాలు, విజ్ఞాన రీతుల, ఇంకా అసంఖ్యాక వైవిధ్యాలు అనాదిగా మనదేశంలో భాగం. కానీ ఈ మొత్తం జాతీయ తత్వాన్ని, భావకవిత్వంలో ఒక అంశంగా బ్రిటిష్ భావదాసులు ప్రచారం చేశారు. దేశభక్తి కవిత్వం భావకవిత్వంలో ఒక చిన్న ముక్క, అని ప్రచారం చేశారు. కమ్యూనిస్టులు నడుం బిగించి ఈ వక్రీకరణకు పరాకాష్టను సాధించారు..ఒక ఉద్యమాన్ని తొక్కి మరొక సాహితీ ఉద్యమం వచ్చిందట. భారతదేశమంతటా కమ్యూనిస్టులు ఇదే ఐరోపా అనుకరణ విన్యాసాలు కొనసాగించారు. భావ కవిత్వ యుగం నశించిన తరువాతనే అభ్యుదయ కవిత్వయుగం మొదలైందట. ఆ తరువాత దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వాలు, స్ర్తివాదం, అనుభూతి వాదం వంటివి ఐరోపాకు ‘మక్కీకి మక్కీ’’...
అనాదిగా వికసించిన సర్వసమగ్ర జాతీయతత్వం కేవల ఒక భావోద్వేగం అన్న ప్రచారం జరిగిన సమయంలోనే సనాతన జాతీయతత్వాన్ని యధాతథంగా ఆవిష్కరించే ప్రయత్నాలు జరిగాయి. వందేమాతరం నిర్మాత బంకించంద్రుడు మొదలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్మాత డాక్టర్ కేశవరావ్ బలిరామ్ హెడ్గేవార్ వరకు వివేకానందుడు మొదలు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ వరకు సనాతన జాతీయ తత్వాన్ని భావదాస్య గ్రహణ ముక్తం చేయడానికి యత్నించారు. కానీ అప్పటికీ ఇప్పటికీ భావదాస్య ప్రభావమే ప్రబలంగా ఉంది. జాతీయతా నిష్ఠకల మహాకవి రాయప్రోలు వంటి వారు సైతం ‘మాతృదేశ భక్తి’ కేవలం ఆధునిక సమాజంలో వికసించిన తత్వమన్న భ్రాంతిని కలిగించే రచనలు చేశారు.
‘‘కానబడక అనుమాన ప్రమాణమునకె
అందిఅందని పరతత్వమవల నుంచి
పంచభూత భాసితమైన ప్రకృతి కళనె
సన్నిహిత లక్ష్యమనియె వచస్వి నేడు!
అందు ఈ విలక్షణ జీవయాత్ర కొదవు
పృథివినే ‘నవ్వులు’ సమాశ్రయింతు
భక్తి తల్లిగా దేవతామతల్లిగా
సమస్త పరాపర కామ్యములకు!’’
అని రాయప్రోలు వారు ఆవిష్కరించిన మాతృభూమి తత్వం సనాతన వాస్తవం. కాని ‘‘నవ్వులు’’ మాత్రమే ఈ భూమిని తల్లిగా దేవతగా ఆరాధిస్తారన్న భావం చారిత్రక వాస్తవానికి విరుద్ధం...‘‘ప్రమాదోధీమతామపి’’ అని అన్నట్టుగా జాతీయతా వాదులు సైతం బ్రిటిష్ భావదాస్య ప్రభావితులు అయ్యారు. ప్రచారం అంత తీవ్రంగా జరిగింది మరి. అనాదిగా ఈ జాతీయులు భూమిని తల్లిగా భావిస్తున్నారు, దేవతగా భావిస్తున్నారు. జాతీయతా స్వభావం ఇది.
‘‘సముద్ర వసనే దేవి
పర్వతస్తన మండలే
మాతృభూమి నమస్త్భ్యుం
పాదస్పర్శం క్షమస్యమే..’’
అని చెప్పడం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.

చిత్రం... భారత్ మాతాకీ జై అని నినదిస్తున్న విద్యార్థులపై జమ్మూకశ్మీర్ పోలీసుల లాఠీచార్జ్

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352