మెయన్ ఫీచర్

పాలకులెవరైనా పాలన ఒక్కటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గాంధీ, నెహ్రూ పేర్లను తొలగించడం అభివృద్ధికి సూచికకాదు..’ అం టూ శివసేన అధికార పత్రిక సామ్నా మే 28 నాటి సంపాదకీయంలో మోదీ రెండేళ్ల పాలనపై ఓ కథనం రాసింది. దాదాపుగా ఇలాంటి మాటల్ని గత ఆరు దశాబ్దాలుగా ప్రతి ప్రధానమంత్రి ప్రస్తావించారని, చివరికి కొన్ని మాసాలు ప్రధానిగా ఉన్న దేవెగౌడ కూడా తన హయాంలోనే అభివృద్ధి జరిగినట్టు ప్రచారం చేసుకున్నాడంటూ ఆ పత్రిక ఉటంకించింది. పార్లమెంటులోనే గుర్రుపెట్టి నిద్రపోయిన దేవెగౌడనే విజయ్ మాల్యాను దేశముద్దు బిడ్డ అని పొగడడం గమనార్హం. ఇవే మాటల్ని మరే పత్రిక రాసినా..్భజపా గట్టిగా సమాధానం చెప్పేది.
ప్రతిపక్షాలు బలహీన పడడం, అవకాశవాద రాజకీయాలకు లొంగిపోవడంతో పాలకపక్షాలు తమ ముఖాల్ని తామే అద్దంలో చూసి మురిసిపోవడం జరుగుతున్నది. అయిదు సంవత్సరాల పాలనాకాలంలో సంవత్సరం సంవత్సరం నిలదొక్కుకోవడమే ఓ గొప్ప విషయంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కావచ్చు, లేదా అవసరానికి అనుగుణంగా ప్రకటించిన పథకాలు కావచ్చు-విధిగా పాలక పక్షాలు చేయాల్సిందే. అయితే చేయడాన్ని మరచిన పాలకులు చేసిన వాటి గూర్చి చెప్పుకోవడం, సంబరాలు చేసుకోవడం ఆధునిక ప్రజాస్వామ్య మార్కుగా మారింది. పాలకపక్షాల పాలన గూర్చి గతంలో ఓ పాకెట్ కార్టూన్‌లో దినపత్రికలు అద్దంలో చూపిన విధంగా చూపేవి. ఆ కార్టూన్లు జనాలను నిద్రలేపేవి. ఇలాటి కార్టూన్లు వేసిన శంకర్ పిళ్లై, ఆర్‌కె లక్ష్మణ్‌లు నేడు లేకపోగా, అసీ త్రివేది లాంటి వారి కార్టూన్లు రాజకీయాలకు బలి అవుతున్నాయి. అధవా అప్పుడప్పుడూ కనబడినా, ఇవి కంటిలో నలుసులుగా కూడా పనిచేయడం లేదు. కాలమిస్టులది, ఫ్రీలాన్స్‌లది, పత్రికారంగ అధిపతులది, రచయితలది ఇప్పుడతంతా ఒకే దృక్కోణం. పాలకుల దృష్టిలో పడాలనుకోవడం, పద్మ అవార్డుల చుట్టూ, సన్మానాల చుట్టూ తిరగడం. చివరికి న్యాయవ్యస్థ కూడా అప్పుడప్పుడూ స్వరం మార్చడం జరుగుతున్నది.
ఇలా పాలక పక్షాలకు వాలి లాగా బలం పెరుగుతున్నది. అందుకే వారిమాట ఎప్పుడూ చెల్లుబాటు అవుతున్నది. ఏడుపుకన్నా నవ్వు ఆరోగ్యకరమైనా, కృత్రిమ నవ్వులో ఆవేదన దాగి ఉంటుంది. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణలో పార్కుల్లో నవ్వడం లాంటి దృశ్యాలే కనబడుతున్నాయి. అయితే ఈ దృశ్యాల్ని కొన్ని పథకాలు కనబడకుండా చేసినా, అవి మరుగున పడడంలేదు. ఉన్న ఫళంగా మిషన్ కాకతీయ, రైతుల ఆత్మహత్యల్ని ఆపలేకపోవచ్చు. కాని తోడబడుతున్న మట్టి, ఉఫాది దొరికిన జెసిబిలు భవిష్యత్తులో రైతు ఆత్మత్యలుండవనే హామి ఇస్తాయా అనేది ప్రశ్న. దేశం మొత్తమైనా, తెలంగాణ అయినా వ్యవసాయిక దేశం. ఆర్థిక ప్రణాళికలు, పారిశ్రామిక విధానం, అభివృద్ధి, చివరికి విద్యారంగం కూడా వ్యవసాయాభివృద్ధి చుట్టే రూపొందాలి. నైజాం కాలంలో ఇది స్పష్టంగా కనబడుతుంది. అలాగే కులవృత్తులు, చేతివృత్తులు అభివృద్ధి చెందాలి. వీటిని గౌరవ ప్రదంగా చేయడమే కాదు- ప్రత్యేకతలు ఆయా కులవృత్తుల్ని, చేతి వృత్తుల్ని చేపట్టగలగాలి. దీనికనుగుణమైన విద్యారంగం ఏర్పడాలి. కాని, ఏ వృత్తిని చేయకూడదని, చేయ డం తప్పనే ఓ సూడో విద్యావిధానం ఈ దేశం లో, రాష్ట్రంలో బలంగా రూపొందింది.
మూతబడిన ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరవాలని, దాన్ని జాతీయం చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించిన కెసిఆర్‌కు వ్యవసాయ ఆధారిత నైజాం చక్కెర కర్మాగారం లే ఆఫ్‌కు గురైంది కనబడడంలేదు. గత ఆరునెలలుగా కార్మికులు జీతాలు లేక, ఇతర ఉపాధి లేక, పిల్లల చదువులు, పెళ్లిళ్లు లేక నిరసన కార్యక్రమాలు చేపడితే కనీస స్పందన లేదు. ఉద్యమకాలంలో, తెలంగాణ ఏర్పడిన 100 రోజుల్లోనే కర్మాగారాన్ని ప్రభుత్వం చేపడుతుందని, అడ్డువస్తే తలనరికి ఫ్యాక్టరీ గేటుకు నైజాంలా వేళ్లాడదీస్తానన్న కెసిఆర్ పూర్తిగా వౌనముద్ర వహించారు. నిజంగా మిషన్ కాకతీయ నీళ్లు వస్తే ఈ ప్రాంత రైతులు ఏం పండించాలో కెసిఆరే చెబుతారన్నమాట. అంటే, రాష్ట్రంలో చెరకు పంట అవసరం లేదన్నమాట. పదే,పదే నైజాంను ఉచ్ఛరించే కెసిఆర్, నైజాం ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలన్నింటికీ పూర్వ వైభవం తెస్తామన్న ఉద్యమకాల మాటలు నేడు వినబడడం లేదు.
ఇప్పుడు వినబడుతున్నదంతా ఐటి హబ్ మాటలే. అది కెటిఆర్ నోటనే. మరి ఇవి ఎక్కడ ఏర్పడుతున్నాయి? ఇప్పటికి ఎన్ని ఏర్పడ్డాయి? ఎందరికి ఉద్యోగాలు వచ్చాయి? ఎలాంటి ఉద్యోగాలు వచ్చాయి. శే్వతపత్రం ఏమీ లేదుకాని, 1691 కంపెనీలకు హైదరాబాద్ చుట్టూ భూపంపకం జరిగింది. ప్రభుత్వ మాటల ప్రకారం 883 కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయని. ఇందులో దొరికిన ఉద్యోగాల సంఖ్య ఎంతనో మాత్రం తెలిజెప్పలేదు. వీళ్ల అవసరాల్ని తీర్చడానికి మాత్రం హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తానంటున్నారు. చంద్రబాబు హయాంలో ఫ్లైఓవర్లు కట్టినప్పుడు, రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి ఎలాంటి ఆటంకం లేకుండా వుండటానికే నిర్మించబడ్డాయని విమర్శించాం. తర్వాత వచ్చిన వైఎస్‌ఆర్ వీటికి మెట్రోరైలును తోడు చేసి, విమానాశ్రయాన్ని శంషాబాద్‌కు మారుస్తే తిట్టాల్సినంతగా తిట్టాం. సుల్తాన్ బజారు గుండా మెట్రోరైలు నిర్మాణం జరుగుతే, ముందుగా తనపైనుండి రైలు పోవాలని కెసిఆర్ నినదించారు. ఇప్పుడు దీన్ని మార్చే ప్రసక్తి లేదనడమే కాదు, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు పేరున కెబిఆర్ పార్కుకు ఊపిరాడకుండా చేస్తూ ఐదు స్కైవేలను నిర్మించడం ఎవరి అవసరాలకు? అనేది ప్రధాన ప్రశ్న. ఇలాంటి అభివృద్ధి జరిగే ఢిల్లీ గాలి కాలుష్యాన్ని ఎదుర్కొంటుంటే అలాటి అభివృద్ధి నమూనాను కెసిఆర్ ఎందుకు ముందుకు తెస్తున్నారో తెలిసిందే. పాలకులు ఎవరైనా, పాలన రీతి అదే అనేది ప్రజాస్వామ్య నానుడిగా మారింది.
అవునుమరి. అవసరం ఉన్నవారికన్నా అవసరం లేని వారికే ప్రజా సంక్షేమం కింద ఆసరా పథకాలు అందుతుంటే, రెండు సంవత్సరాల కాలంలో 17 రకాల ఉద్యోగ ప్రకటనల్ని జారీ చేస్తే నిజంగా కెసిఆర్ ఘటికుడే. అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రే! అయితే ఎన్ని ఖాళీలకు ఎన్ని ఉద్యోగాలకై ప్రకటన నిచ్చారని, రెండు సంవత్సరాల కాలంలో నిజంగా నింపిన ఉద్యోగాలెన్నో తెలంగాణ సంబురాల సందర్భంగా ప్రకటిస్తే బాగుండేది. అలాగే రెండు పడక గదులు ఇండ్ల నిర్మాణం ఎందుకు ముందుకు సాగడం లేదో, సికిందరాబాద్ న్యూ బోయిగూడాలో ఇళ్లు దక్కించుకున్న వారి పూర్తి వివరాలు తెలియపరిస్తే వాస్తవం తెలిసేది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, వినోబా భావే భూదానోద్యం హైజాక్ చేసినట్లే, నక్సలైట్ల భూపంపిణీ అనే పథకాన్ని వైఎస్‌ఆర్ మొదలుపెడితే, కెసిఆర్ నక్సలైట్ల అజెండాను తన అజెండా అంటూ కొనసాగించినా, ఇప్పటివరకు పంచిన భూమి 7987 ఎకరాలు, కాగా, అందుకున్నది కేవలం 3041 కుటుంబాలే. ఈ లబ్దిదారుల వివరాలు కూడా బహిర్గతం చేయాల్సింది. కెసిఆర్ కోరినట్లు సాలీనా పదివేల కుటుంబాల చొప్పున ఐదేళ్లలో 50 వేల కుటుంబాలకు భూమి లభిస్తే, ఇది సాగుబడిలోకి వస్తుందా అనేది ప్రశ్న. ఇప్పటికే చిన్న కమతాల వ్యవసాయం దెబ్బతిన్నది. కాడెడ్లు కసాయికి చేరాయి. వ్యవసాయం చేయడమే ఓ నేరంగా మారిన పరిస్థితుల్లో ఈ మూడెకరాల లబ్దిదారులు ఎంతమంది వ్యవసాయం చేస్తారో తెలియదు. చదివిన ప్రతి వ్యక్తి ఉద్యోగం సంపాదించాలని, అమెరికా లాంటి దేశాలకు వలసపోవాలనే వ్యవస్థ మనది కాబట్టి!
ఉద్యమాల సందర్భంగా కెసిఆర్ అనుకున్న వాటిని నిజాయతీతోనే చెల్లిస్తున్నారు. వెంకన్న, దుర్గమ్మ, మీసాల స్వామిలకు మొక్కులు తీర్చి, తన సౌభ్రాతృత్వాన్ని తెలపడమే కాదు-సప్తగిరిని, యాదగిరిగా, యాదగిరిని యాదాద్రిగా మార్చడంలోనే కెసిఆర్ ఏ వర్గపు ప్రతినిధో తెలుస్తున్నది. యాగాలతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సమిధలుగా మార్చడం ఓ రాచరిక చిహ్నమే. తెలంగాణ ఉద్యమ చిరునామాల్లో కూడా లేని వారిని, ఉద్యమానికి అడ్డంకుల్ని సృష్టించిన వారిని అక్కున చేర్చుకొని కారెక్కించడం కెసిఆర్ విశాల హృదయానికి తార్కాణమే. తెలంగాణ ఉద్యమంలో కలిసివచ్చింది కొందరైతే, నిద్రావస్థలో ఉండి ఆయా కాలాలకు అనుగుణంగా జై కొట్టిన కొన్ని వర్గాలకు సన్మానాలు, సత్కారాలు చేయడం కెసిఆర్ చతురతకు నిదర్శనమే! అందరిని కలుపుకొనిపోవడం, ఓ రాజకీయ ఎత్తుగడనే అయినా, అసలు సిసలైన వారికే ఎసరు పెట్టడం ఏ రాజనీతో తెలియదు. శతృశేషం మంచిది కాదు అనే వ్యక్తే అయితే ఇది ఎంతకాలం కలిసివస్తుందో వేచి చూడాల్సిందే.
విద్యారంగం బాగుపడుతుందనుకున్నాం. కార్పొరేట్ విద్య కనుమరుగై ప్రజాతంత్ర విద్య ఊపందుకుంటుందని భావించాం. కార్పొరేట్ వైద్యం కోరలు ఊడుతాయి అనుకుంటే మర్రి ఊడల్లా వేళ్లూనుకుంటున్నది. సెజ్‌ల పేరున లాక్కొన్న భూమి తిరిగి లబ్ది దారులకు, లేదా ప్రభుత్వానికి దక్కుతుందని అనుకుంటే, టిహబ్ పేరున రంగారెడ్డి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లోని రైతుల భూములు లాక్కోబడుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలు బలోపేతమై, మరికొన్ని స్థాపించబడుతాయని కలలు కంటే, కల్లలుగా మారతాయి. కార్యాలయాల్లో మార్పు లేదు. అవినీతికి అంతం లేదు. అదే సాచివేత. అదే ప్రజావ్యతిరేక పాలన యంత్రాంగం. సిటిజన్ ఛార్టర్ అమలు కాదు-అసలు కనబడని వైనం. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడ్డ జనతాకాలంలో కొట్టొచ్చిన మార్పు చూసాం. అంతా స్వపాలనే. అధికారులు, మంత్రాంగం, యంత్రాంగం అణువణువు తెలంగాణననే. అయి ఏదో అభద్రత. తెలియని ఆందోళన. జరగాల్సిందేదో జరుగుతున్నదేదో అర్థంకాని అయోమయం. ఈ రెండేళ్లలో విన్నది ఎక్కువ, కన్నది తక్కువ. కెసిఆర్ మాటల్లో కారణాలు అనేక కావచ్చు. హరితహారం కింది నాటాల్సిన 230 కోట్ల మొక్కల్లో గత సంవత్సరం నాటినవి దాదాపు 20 కోట్ల పైనే. ఇందులో ఎన్ని పాదుకున్నాయి అంటే, వరుణుడే కారణం కావచ్చు. 2019 నాటికి ఇలాంటి సమాధానమే వస్తే? రైతుల రుణమాఫీ కింద 1700 కోట్లు కెసిఆర్‌కు ఒక లెక్క కాదు. కాని, నాలుగు దఫాలుగా ఎందుకు ఇస్తున్నాడనేది రహస్యమే. వీటన్నింటికీ సమాధానం దొరికితే, అలాగే గతంలో అన్నట్టు ఉపాధ్యాయ, ఉద్యోగ భర్తీ వెంటనే జరిగితే బంగారు తెలంగాణ అని అనడంలో తప్పు లేదు. ఇవన్నీ జరగాలని, జరుగుతాయని ఆశిద్దాం.