సబ్ ఫీచర్

విద్యారంగం- ప్రక్షాళనప్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఎన్నో కోణాల్లో పరిశీలిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. అది చాలా క్లిష్టంగానూ ఉంటుంది. అయితే, సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం సామర్థ్యం కూడా కనిపిస్తుంది. ఇందుకు ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ సమస్యను ఎదుర్కోవటంలో తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన వైఖరే తార్కాణం. నేటి విద్యారంగం ఊహించనంత అవినీతి కూపంలో కూరుకుపోయింది. ఈ లీకేజీ తాత్కాలిక సమస్య. గత పాతిక ఏళ్ళుగా ప్రశ్నాపత్రాలు లీక్ అయిన సందర్భాల్లో నామమాత్రపు ఎంక్వయిరీలతో దాటవేయటంతో నేరస్థులకు అది పరోక్ష ప్రోత్సాహంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగులోనే తన వైఖరిని, పట్టుదలను ప్రదర్శించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ కేసును డిజిపి అనురాగ్ శర్మకు త్వరితగతిన అప్పగించారు. వృత్తిరీత్యా అనుభవం, విద్యారంగంపై తనకు ఉన్న అనుబంధం దృష్ట్యా పట్టుదలతో డిజిపి విచారించాడు. సమస్యను సులువుగా వెలికితీయగలిగాడు. కేసిఆర్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి అటు న్యాయస్థానంలో లీగల్ వ్యవహారాలు చూస్తూ, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమస్య పరిష్కారానికి జాగ్రత్తగా అడుగులు వేశారు.
ఈ సమస్యను గత ప్రభుత్వాల మాదిరి దాటవేసే అవకాశం తీసుకోకుండా, విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే తలంపు తెలంగాణ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. విచారణ ఎంత నిజాయితీగా జరిగిందో, ప్రభుత్వ నిర్ణయం కూడా అంతే పట్టుదలతో జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. విధాన నిర్ణేతలను అభినందించాలి. మీడియాను అభినందించాలి. గతంలో కార్పొరేట్ విద్యా రంగానికి అనుగుణంగా మీడియా ప్రచారం చేసింది. కానీ మీడియా ఇపుడు సమస్యను పరిష్కరించే వాతావరణాన్ని సృష్టించింది. ముఖ్యంగా రెండుసార్లు పరీక్ష రాసిన విద్యార్థుల త్యాగం వారి నిజాయితీకి నిదర్శనం. తల్లిదండ్రుల ఆవేదనతో కొంత అలజడికి గురైనా దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో మూడోసారి ఎంసెట్ రాసేందుకు పిల్లలు సిద్ధం కావటం విద్యార్థుల, తల్లిదండ్రుల మానసిక పరిపక్వతను అభినందించాలి. ఇలాంటి లీకేజీ సమస్య తెలంగాణలో చివరిది కావాలన్నదే నా కోరిక.
వైద్య విద్య అత్యంత కీలకమైనది. నేడు అదొక పెద్ద పరిశ్రమగా తయారైంది. మేనేజ్‌మెంట్ కోటాలో మెడిసిన్ సీటు కోటి రూపాయల ధర పలుకుతుంది. మేనేజ్‌మెంట్ సీట్లపైన ఏదో ఒక నియంత్రణ లేకుంటే కాబోయే డాక్టర్లు తమ సీటు కోసం ఖర్చు చేసిన డబ్బును ఏ విధంగానో భర్తీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. మేనేజ్‌మెంట్ సీట్ల వ్యవహారం జనరల్ కేటగిరీపై కూడా పడుతుంది కాబట్టి యాజమాన్య కోటా సీట్లను సంస్కరించుకోకుంటే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశం ఉంది. అడ్మిషన్ల సమయం సమీపించినందున ఇపుడు యాజమాన్య కోటా సీట్ల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాలుగు దశాబ్దుల క్రితం ఎంసెట్‌కు ఏ ప్యాట్రెన్ ఇచ్చారో ఈనాటి వరకూ అదే పద్ధతి కొనసాగుతుంది. 3 గంటల్లో 160 ప్రశ్నలను చేస్తే 159 మార్కులు వస్తున్నాయి. విద్యార్థులు సమాచారం అడిగే ప్రశ్నలకు కంఠస్తం చేస్తేనే సమాధానాలు రాయగలుగుతారు. ఇది పిల్లల మెదళ్ళపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల విద్యార్థులలో సహజత్వం దెబ్బతింటుంది. ఈ విధానం వల్ల రొటీన్‌గా ఆలోచించే డాక్టర్లే తయారవుతారు. మెడిసిన్ విద్య ప్రపంచంలో వేగవంతంగా మార్పులకు గురవుతోంది. కానీ డాక్టర్‌గా తయారయ్యే వ్యక్తి మార్పులను అందుకునే పదును కలిగి ఉండాలి. అడ్మిషన్ పాలసీ మారనంతవరకూ మన డాక్టర్లు మారుతున్న వైద్యరంగం వేగాన్ని అందుకోలేరు. కంటెంట్ సహా ఆలోచించేవారిగా పిల్లలను తయారుచేయాలంటే ఎంట్రెన్స్ విధానంలోనే సంపూర్ణ మార్పులు చేయాలి. ఒక కమిటీని నియమించి అడ్మిషన్ పాలసీని కూడా మార్చాలి. దానికై వివిధ దేశాల్లో ఏ పద్ధతి అవలంబిస్తున్నారో దానిపై అధ్యయనం జరగాలి. ఈ పనిని చేయకలేకపోతే ‘నీట్’ వ్యవస్థకైనా అప్పగిస్తే మంచిది. మెడికల్ అడ్మిషన్లలో కూడా మార్పులు రావాలి. ‘నీట్’ పట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించాలి.
ఇంటర్మీడియట్‌లో బోధనా పద్ధతులను కూడా సంస్కరించుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిస్తూ చేయవల్సిన ఈ కార్యక్రమంపై సత్వర చర్యలు తీసుకుంటేనే మెరుగైన డాక్టర్లు తయారవుతారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య చాలావరకూ భ్రష్టుపట్టింది. ఇంజనీరింగ్ , డిగ్రీ కాలేజీల వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలి. విద్యారంగ సమస్యల తీగను కదిలించారు. ఈ పనితో మొత్తం విద్యారంగం డొంకంతా కదిలింది. ప్రక్షాళన జరగాలి. అప్పుడే సమర్థ తెలంగాణ సాధ్యం.

-చుక్కా రామయ్య