హైదరాబాద్
అవినీతి జలగలు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఆగస్టు 5: మహానగర పాలక సంస్థ అవినీతి జలగలకు నిలయంగా మారుతోంది. లంచాలు డిమాండ్ చేసినపుడు బాధితులు ఫిర్యాదు చేసినపుడు, గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదులు చేసినపుడు దాడులు నిర్వహిస్తున్న ఏసిబి అధికారులు వీరి అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం శానిటరీ సూపర్వైజర్ కృపదానం సికిందరాబాద్ సర్కిల్లో ఏసిబికి పట్టుబడిన కొద్దిరోజులకే మరో టౌన్ప్లానింగ్ అసిస్టెంటు సిటీ ప్లానర్ ఇంటిపై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించటం అవినీతి పరులైన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ హోదా అధికారి పట్టుబడినా, కోట్ల రూపాయల ఆస్తులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా సర్కిల్ 10ఏ,బి అసిస్టెంటు సిటీ ప్లానర్ సంతోష్ వేణు ఇంటిపై శుక్రవారం ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు.
నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లపై కూడా అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించి దాదాపు రూ. 15 కోట్ల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, 30 తులాల బంగారం, రూ. 3లక్షల నగదుతో పాటు ఇతర ఆస్తులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, గడిచిన ఏడాది కాలంలో లంచాలు తీసుకుంటూ ఏసిబికి చిక్కటం, ఆదాయానికి మించి ఆస్తులున్న ఆరోపణలతో విధులకు దూరమైన వారు దాదాపు 21 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది టౌన్ప్లానింగ్ అధికారులే ఉన్నారు. ఒక వైపు అరకొర సిబ్బంది ఉన్న టౌన్ప్లానింగ్ విభాగంలో ఈ రకంగా అధికారుల సంఖ్య తగ్గుతుండటం గమనార్హం.
ఏడాది కాలంలో...
జిహెచ్ఎంసి ప్రజలకు ఎంతో పారదర్శకతతో సేవలందించేందుకు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెడుతున్నా, అవినీతి మాత్రం అదుపుకావటం లేదు. గడిచిన సంవత్సర కాలంలో పది మంది అధికారులు ఏసిబికి చిక్కటమే ఇందుకు నిదర్శనం.
గత సంవత్సరం జూలై 10న ఎల్బీనగర్ సర్కిల్లోని హార్టికల్చర్ విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న భాస్కర్ ఏసిబికి చిక్కిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ విభాగం ఇన్స్పెక్టర్ శివానంద్, సర్కిల్ 14 రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్కుమార్, అసిస్టెంటు ఇంజనీర్ వెంకటేష్, సర్కిల్ 12లో డిఇఇ ఎంపి సింగ్, సికిందరాబాద్ సర్కిల్లో శానిటరీ సూపర్వైజర్ కృపదానంలు ఏసిబికి చిక్కగా , ఆ తర్వాత సర్కిల్ 3 ఏసిపి భానుచందర్, ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో సర్కిల్ 18 టిపిఎస్ డి.జె. మహేశ్, ఆ తర్వాత శ్రీనివాస్యదాస్, కె.ఎన్. మెహ్రా, ఏఎంవోహెచ్ మనోహర్ వివిధ కారణాలతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఆ తర్వాత శివార్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఎస్వోటి పోలీసులకు చిక్కిన ఏడుగు ట్యాక్సు సిబ్బందిపై, ఫీల్ఖానాలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేకపోయిన టౌన్ప్లానింగ్ సూపర్వైజర్ బి. గోపాల్, సీతారాంబాగ్లో అక్రమ నిర్మాణానికి బాధ్యుడైన బాలానందస్వామితో పాటు ఇదే ప్రాంతంలో గ్యాస్ గోదాంకు నిబంధనలకు విరుద్దంగా అనుమతిచ్చిన ఏఎంవోహెచ్ డా. టి. దామోదర్లపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే!