అంతర్జాతీయం
చైనా.. మళ్లీ ససేమిరా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బీజింగ్, నవంబర్ 7: భారత్ ఆశలపై చైనా మరోసారి నీళ్లు చల్లింది. అణు సరఫరా దేశాల కూటమి (ఎన్ఎస్జి)లో భారత్కు సభ్యత్వం కల్పించే విషయమై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మరో నాలుగు రోజుల్లో శుక్ర, శనివారాల్లో వియన్నాలో ఎన్ఎస్జి ప్లీనరీ సమావేశాలు జరుగనున్న తరుణంలో చైనా సోమవారం ఈ ప్రకటన చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పిటి)పై సంతకం చేయని దేశాలకు ఎన్ఎస్జిలో సభ్యత్వం కల్పించే విషయమై నియమాలను రూపొందించిన తరువాత మాత్రమే ఎన్ఎస్జిలో చేరికకు భారత్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించడం జరుగుతుందని చైనా స్పష్టం చేసింది. ‘వియన్నాలో శుక్రవారం ఎన్ఎస్జి ప్లీనరీ సెషన్ జరుగనుంది. ఇప్పటివరకు మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. భారత్, చైనా దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య ఈ నెల 4న జరిగిన సమావేశాన్ని ప్రస్తావిస్తూ, భారత్సహా సంబంధిత పక్షాలన్నింటితో చైనా ఎప్పటికప్పుడు లోతుగా సంప్రదింపులు జరుపుతోందని, నిర్మాణాత్మక చర్చలు జరుపుతోందని, ఈ అంశంపై సమన్వయం చేస్తోందని లుకాంగ్ వివరించారు. అయితే నవంబర్ 11, 12 తేదీల్లో ఎన్ఎస్జి ప్లీనరీ సమావేశాలు జరుగనున్న తరుణంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా జాతీయ భద్రతా సలహాదారు, స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జిచితో జరిపిన చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్పిటిపై సంతకం చేయని దేశాలకు రెండు దశల ప్రక్రియలో సభ్యత్వం కల్పించే అంశంపై ఈ ప్లీనరీ సమావేశాలలో ఎన్ఎస్జి చర్చిస్తుందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎన్ఎస్జి సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్న భారత్, పాకిస్తాన్లు ఇప్పటివరకు ఎన్పిటిపై సంతకం చేయలేదు. భారత్తో రెండోసారి చర్చలు జరిపిన తరువాత చైనా గత వారం.. ఎన్పిటిపై సంతకం చేయని దేశాలు ఎన్ఎస్జిలో చేరికకు మార్గాన్ని అనే్వషించిన తరువాత మాత్రమే భారత్ చేసుకున్న దరఖాస్తుపై నిర్దిష్టంగా చర్చిస్తామని ప్రకటించింది. ‘ఎన్ఎస్జిలో భారత్ చేరికకు సంబంధించి చైనా వైఖరి చాలా స్పష్టంగా, నిలకడగా ఉందని నేను చెప్పగలను’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియింగ్ ఇదివరకే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్పై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించకుండా చైనా అడ్డుకుంటోందన్న భారత్ ఆందోళనను సోమవారం నాటి మీడియా సమావేశంలో ప్రస్తావించగా, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలలో తలెత్తిన సమస్యలపై చర్చించారని లుకాంగ్ బదులిచ్చారు.