జనాంతికం - బుద్దా మురళి

పాలకులపై దోమల విశ్వాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్వేగపూరితమైన వాతావరణం.. ‘కమాండర్’ గతంలో ఎప్పుడూ లేనంత సీరియస్‌గా ఉన్నారు.. ఆగస్టు దాటి రెండు నెలలు అవుతోంది.. టెన్షన్‌కు కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో టీవీలో బ్రేకింగ్ న్యూస్‌లు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు.. ముష్కరులను మట్టుపెట్టిన భారత సైన్యం. భారత్‌కు బాసటగా నిలిచిన అనేక దేశాలు. మేము సైతం భారత్ వెంటే అని ప్రకటించిన ఇరాన్.. అంటూ టీవీ పగిలిపోయేలా బ్రేకింగ్ న్యూస్‌లు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో చీఫ్ కమాండర్ యుద్ధతంత్ర రచనలో మునిగిపోయారు. ‘దేశంలో కీలక నిర్ణయం ఏదైనా మన చీఫ్ కమాండర్‌ను అడిగిన తరువాతే చేస్తారు కదా?’ అని బయట నాయకులు మాట్లాడుకుంటుండగానే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఒక దోమ రయ్.. రయ్.. మంటూ బయటకు దూసుకెళ్లింది.
***
సైరన్ మోగడంతో ముఖ్య దోమలు పరుగు పరుగున వచ్చాయి. ‘మన జాతి మొత్తం ప్రమాదంలో పడింది..’ అంటూ గూఢచారి దోమ ఆందోళనగా చెప్పింది. అసలేం జరిగిందో ముందు చెప్పి చావమని దోమల రాణి చిరాగ్గా అంది. మేకప్ వేసుకుంటుంటే సైరన్ విని ఇక్కడికి రావలసి వచ్చినందుకు ఆమెకు కోపంగా ఉంది. మనమంటూ ఉంటేనే కదా మేకప్ వేసుకునేది. ఇప్పుడు కావలసింది కోపం కాదు వ్యూహం.. అని గూఢచారి దోమ చెప్పింది. దోమల గుంపులో ముఖ్యులంతా చేరడంతో అసలు విషయం ఏమిటో చెప్పమని అడిగారు. సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ? ఏం జరిగిందో కళ్లతో చూసి చెవులతో విన్న మన గూఢచారి దోమనే చెబుతుంది.. అని వృద్ధదోమ మైకును అప్పగించింది.
‘ఎప్పటి మాదిరిగానే కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నేను విధి నిర్వహణలో ఉన్నాను. కమాండర్ ఉపన్యాసం వింటూ నిద్ర పోయే వారి రక్తం పీలుస్తూ ఉన్నాను. కాస్త నలతగా అనిపించడంతో కునుకు తీశాను. మేల్కొనే సరికి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అంతా ఆందోళనగా ఉన్నారు. ఏంటా? అని చూస్తే ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టు అయింది. మన జాతిని నిర్మూలించేందుకు నడుం కట్టారు. 2018 నాటికి దోమల రహిత రాజ్యంగా తమ రాజ్యాన్ని తీర్చిదిద్దాలని కమాండర్ నిర్ణయించారు. దీన్ని అల్లాటప్పాగా తీసుకోవడానికి వీలు లేదు. ఓ కొత్త రాజ్యం రాజు గారేమో గతేడాది- ‘దోమల నివారణకు ఔషధ మొక్కలు పెంచండి’ అని చెప్పి ఊరుకున్నారు. అనుభవం గల ఈ రాజు అలా వదిలేయలేదు. తానే చీఫ్ కమాండర్‌ను అని ప్రకటించి దోమలపై యుద్ధానికి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమాలోచనలు జరుపుతున్నారు. దోమలపై యుద్ధానికి సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకోవడానికి కార్పొరేట్ కంపెనీకి బాధ్యత అప్పగించారు. కార్పొరేట్ కంపెనీలో మేధావులంతా సమావేశం అయి దోమల జాతి నిర్మూలనకు సెన్సర్లు ఉపయోగించవచ్చునని నివేదిక ఇచ్చారు. సెన్సర్ల ద్వారా ఎక్కడెక్కడ దోమలు ఉన్నాయి, వాటిలో మగ దోమలు ఎన్ని, ఆడ దోమలు ఎన్ని, ఏ దోమలకు ఏ బ్లడ్ గ్రూప్ ఇష్టం. పిజ్జాలు తినే దోమలు ఎన్ని, శాఖాహార దోమలెన్ని, మాంసాహార దోమలు ఎన్ని? పెళ్లయిన దోమలు, పెళ్లి కాని దోమలు, పెళ్లీడుకు వచ్చిన దోమలు, అసలు పెళ్లే వద్దనుకున్న దోమలు, పునరుత్పత్తి శక్తి ఉన్న దోమలు, ఆ శక్తి లేని దోమలు అంటూ.. దోమల చరిత్ర మొత్తం సెన్సర్లు చెప్పేస్తాయట! సెన్సర్లు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో చీఫ్ కమాండర్‌కే నివేదిక ఇచ్చేస్తాయట! మనకిప్పుడు దిక్కెవరు?
ఇక్కడ నేను సీరియస్ విషయం చెబుతుంటే- ఆ మూలన కుర్ర దోమ పక్కనున్న కుర్రదాన్ని గీకుతున్నాడు. ఏరా! నీకిప్పుడు ఆ పోరిని గీకడం అంత ముఖ్యమా? మనం ఉంటామో? పోతామో? తెలియక మేమేడుస్తుంటే, మనలో ఐక్యత లేకపోవడం వల్లనే మన జీవితాలు ఇలా తగలబడ్డాయి. చివరకు అంతా చిరాకు పడే ఈగ మీద సినిమా తీశారు కానీ దోమ మీద తీయలేదంటే ఈ మనుషులకు మనమీద ఎంత చిన్నచూపో అర్ధం అవుతోంది’’ అని గూఢచారి దోమ తన ఉపన్యాసం ముగించింది.
హాలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. 2018 అంటే.. ఇంకా రెండేళ్లయితే మన జాతి అంతిరించినట్టే అని ముసలి దోమ నిరాశగా పలికింది. ‘ఓయ్ ముసలీ.. నువ్వు తాగని రక్తం లేదు. జీవితంలో అన్నీ అనుభవించావు. నువ్వు ఉన్నా లేకున్నా తేడా లేదు. మేం మాట్లాడేది మా గురించి..’ అని మిగిలిన దోమలు కోరస్‌గా పలికాయి. హైదరాబాద్‌లో మనకూ హక్కుంది. చలో హైదరాబాద్.. రెండేళ్ల తరువాత అప్పటి పరిస్థితిని బట్టి తిరిగి వద్దాం- అని దోమల సైన్యాధ్యక్షుడు ప్రకటించాడు. హైదరాబాద్ సచివాలయంలో మనకూ వాటా ఉంది. చాంబర్ ఉంది. అక్కడ అంతా తల దాచుకుందాం. అటు వైపు నర మానవుడు ఎవరూ రారు. మనకెలాంటి ప్రమాదం లేదు’ అని చెప్పింది.
‘‘మేం సీరియస్‌గా మాట్లాడుకుంటే ముసి ముసిగా నవ్వుకుంటూ ఏమీ పట్టనట్టు ఉన్నావేంటి? కొంపదీసి నువ్వు మనుషుల గూఢచారివా? ’’ అని బలిష్టంగా ఉన్న మధ్య వయసు దోమ వైపు అనుమానంగా చూశాయి.
‘‘పిచ్చి సన్నాసుల్లారా? మీకు కనీసం చీమకున్నంత బుర్ర కూడా లేదు. మనకేమీ కాదు ఇక్కడే ఉందాం. నాదీ హామీ. మా తాతల కాలం నుంచి చూస్తునే ఉన్నాను దొమలపై యుద్ధం అని స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈయనకు పబ్లిసిటీ యావ కాస్త ఎక్కువ కాబట్టి దోమ తెరలు కప్పుకొని రోడ్లపై ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం చేసే యుద్ధంలో ఎప్పుడూ మనదే పై చేయి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. కొత్త హామీ నిలబెట్టుకుంటాడని ఎలా అనుకుంటున్నార్రా! ఇంటికో ఉద్యోగం, 2018లో పోలవరం పూర్తి వంటి హామీలన్నీ అమలు చేస్తే- అప్పుడు 2018లో మనల్ని నిర్మూలిస్తాడని భయపడండి.. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి.’’ అని మధ్యవయసు దోమ చెప్పిన మాటలతో అంతా ఊపిరి పీల్చుకున్నాయ. భయం భయంగా వచ్చిన దోమలు- పాలకులపై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి ధైర్యంగా తమ దారిన తాము వెళ్లిపోయాయి.

- బుద్దా మురళి