జనాంతికం - బుద్దా మురళి

ప్రజాస్వామిక నల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలా నవ్వుతూనే పోయేట్టుగా ఉన్నావ్? మరీ అంతగా పగలబడి నవ్వకు..’’
‘‘హా..హా..హా...’’
‘అదేంటో మాకూ చెప్పు.. మేమూ నవ్వుతాం’’
‘‘మూడ్ బాగా లేదు. మంచి అడల్ట్ జోక్ చెప్పమన్నాను’’
‘‘ఏం జోక్ చెప్పాడు? నాకూ చెబితే నవ్వుకుంటాను.’’
‘‘విలువలతో కూడిన రాజకీయాలు అని ఏకవాక్య జోకు చెప్పాడు.’’
‘‘జోక్ అంటే సంక్షిప్తంగా ఉండాలి. బోలెడు నవ్వు పుట్టించాలి. ఏక వాక్యజోకు ఇంతకు మించింది ఉండదు.’’
‘‘ఏకవాక్య జోక్‌లు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనే మాట విన్నావుకదా? ఇదెలా పుట్టిందో నీకు తెలుసా?’’
‘‘ఉమ్మడి రాష్ట్రంలో, విడివిడి రాష్ట్రాల్లో సమావేశాలు జరిగిన ప్రతి సారీ, ప్రతి రోజూ ఎవరో ఒకరు ఈ మాట అంటారు. కానీ నిజంగా ఇది ఎలా పుట్టిందో తెలియదు.’’
‘‘ఈ మాట సమావేశంలోనే పుట్టింది. ఈ మాట పుట్టుక చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. అనగనగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజు.. సభలో ఒకాయన లేచి అధ్యక్షా.. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని కూర్చున్నాడు. అప్పుడేమో అసెంబ్లీలో సంతాప తీర్మానం సందర్భంగా మరణించిన సభ్యులకు నివాళి అర్పిస్తున్నారు. ఇంత అద్భుతంగా ఏకవాక్య నివాళి ఎవరూ అర్పించలేదని కొందరు సభ్యులు అతడిని అభినందించారు. ఆయన పార్టీ సభ్యులు దగ్గరకు వచ్చి భుజం తట్టారు. మరణించిన సభ్యుల గురించి చాలామంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అసెంబ్లీలో దివంగత సభ్యుడు ఎలా మాట్లాడేవాడో, నియోజకవర్గం ప్రజలతో అతని సంబంధాల గురించి అంతా మాట్లాడారు. కానీ సభలో ఏనాడూ నోరుమెదపని ఆ ఒక్క సభ్యుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని అద్భుతంగా నివాళి అర్పించాడని రాజకీయ పక్షాలకు అతీతంగా అంతా అభినందించారు. ఏం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. నిద్రమబ్బుతో ఆయోమయంగా పక్కనున్న సభ్యుడిని అడిగాడు.. ఏం జరిగింది? అంతా నన్ను ఎందుకు అభినందిస్తున్నారు అని. అదేంటి..? ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని నివాళి అర్పించి, ఏం జరిగిందని అడుగుతున్నావని పక్క సభ్యుడు సమాధానం ఇచ్చాడు. ‘ఓ అదా- మంచి నిద్రలో ఉన్నాను. నల్లి కుట్టింది. అసెంబ్లీ సీట్లలో కూడా నల్లులా? అని కోపం వచ్చింది. మంచి నిద్ర పాడుచేసిన నల్లిని చంపేసి, అసెంబ్లీలో నల్లులా? ఇదేం అసెంబ్లీ? ఇదేం ప్రజాస్వామ్యం? హాయిగా నిద్ర పోనివ్వరా? అని కోపంతో ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు- అన్నానని వివరించాడు. అందుకే సభ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనగానే ఈ సంఘటన గుర్తుకు వస్తుంది. ’’
‘‘ అది సరే.. ఇంతకూ విలువలతో కూడిన రాజకీయాలు అనే ఏకవాక్య జోక్ ఇప్పుడు నీకెందుకు గుర్తుకు వచ్చింది?’’
‘‘కర్నాటక రాజకీయాలు చూసి.. ప్రజాస్వామ్యం గెలించింది అని ఒకరు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఇంకొకరు, ధర్మమే గెలిచింది అని మరొకరు.. ఇలా ఒకరిని మించిన ప్రకటనలు ఒకరు చేస్తూ కన్నడ నాటకంతో దేశంలో అందరికీ బోలెడు వినోదాన్ని పంచుతున్నారు’’
‘‘నువ్వెన్నయినా చెప్పు- కర్నాటక రాజకీయంతో దేశానికి గొప్ప సందేశం ఇచ్చినట్టు అయింది?’’
‘‘ఏంటీ? ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టవచ్చునో నేర్పడమా?’’
‘‘అదేదో ఎమ్మెల్యేలను దేశంలో మొదటిసారి కొంటున్నట్టు, ప్రభుత్వాలను ఇప్పుడే పడగొడుతున్నట్టు, రాజకీయాలు ఇప్పుడే చెడిపోయినట్టు మాట్లాడకు. ఇప్పుడు జరుగుతున్నవి అన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే. అనేక సార్లు జరిగినవే’’
‘‘మరి- దేశానికి ఏం నేర్పినట్టు?’’
‘‘మా ఐదుగురు అన్నదమ్ముల్లో ఆ ‘కర్రోడే’ కాస్త తెలుపు- అని ఏదో సామెత చెప్పినట్టు మార్కెట్‌లో ఇప్పుడున్న రాజకీయ పక్షాల్లో విలువలు పాటించేది తామేనంటూ ఎవరికి వారే చెప్పుకునే వారు. కొందరు మెల్లగా చెప్పుకుంటే, కొందరు సిగ్గుపడుతూ చెప్పుకునే వారు. ఒకరు మాత్రం గోడెక్కి గట్టిగా తామే పవిత్రులం అని చెప్పుకునే వారు. కర్నాటక రాజకీయాలతో ‘కర్రోళ్లు’ అంతా కారునలుపే వారిలో ఏ ఒక్కరూ తెలుపుకాదు అని తేలిపోయింది. దేశానికి ఇంత కన్నా గొప్ప సందేశం ఇంకేం కావాలి?’’
‘‘కర్రోళ్లంతా కారు నలుపు.. వారిలో తెల్లగా ఎవరూ లేరని తేలడం ఇదే మొదటి సారేం కాదుకదా? చిన్నాచితక రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే విపక్షం అధికార పక్షంగా మారిపోవడం జరిగింది కదా? ’’
‘‘మండపేటకు చెందిన పిల్లాడిని ఎవరు కిడ్నాప్ చేశారు? తమ టీవీలో వార్తల హోరు చూసే కిడ్నాపర్లు వదిలివేశారని అన్ని టీవీ చానళ్లవారు ఎవరికివారు కథనాలతో హోరెత్తిస్తున్నాయి. పిల్లకాయలను కిడ్నాప్ చేయడం ఇదే మొదటిసారా? వదిలి వేయడం మొదటిసారా? టీవీలో ఆ వార్తలు రావడం మొదటిసారా? కాదు కదా? మరెందుకలా హోరెత్తించారు. ప్రతిరోజూ డజన్ల కొద్దీ పిల్లలు కనిపించకుండా పోతారు. మళ్లీ దొరుకుతారు. కానీ ఇదెందుకు అంత హైలైట్ అయిందంటావ్?’’
‘‘కర్నాటక రాజకీయాలకు, మండపేట కుర్రాడి కిడ్నాప్‌కు సంబంధం ఏమిటి?’’
‘‘అక్కడికే వస్తున్నాను. ప్రతి గల్లీలోనూ కిడ్నాప్‌లు జరగవచ్చు. కానీ మండపేట కుర్రాడు ముద్దుగా ఉన్నాడు. అందంగా ఉన్నాడు. అందమైన ముఖం ఉన్నప్పుడు టీవీలకు చక్కటి వార్త అవుతుంది. ముక్కు చీమిడి కారుతూ చినిగిపోయిన దుస్తులతో పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న పిల్లలు తప్పిపోతే అది టీవీలకు వార్త కాదు. అలాగే చీమిడి ముక్కంత రాష్ట్రాల్లో ఏదో జరిగితే దేశం పెద్దగా పట్టించుకోదు. కానీ కర్నాటక లాంటి పెద్ద రాష్ట్రం ఐటీ రంగానికి పేరు పొందిన రాష్ట్రం కాబట్టి దేశంలోని మీడియా దృష్టి ఉంటుంది. గోవా అనగానే బీచ్‌లు గుర్తుకు వస్తాయి కానీ రాజకీయ పరిణామాలు గుర్తుకు రావు. కర్నాటక అంటేనే రాజకీయ నాటకాలు గుర్తుకు వస్తాయి. ఆ పెద్ద రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల పుణ్యమాని మార్కెట్‌లోని రాజకీయ పక్షాలన్నీ ఒకటే అని అంటే- కర్రోళ్లంతా కర్రోళ్లే.. నల్లటివాళ్లలో తెల్లవాడు ఉండడు అని దేశానికి గొప్ప సందేశం లభించింది.’’
*

buddhamurali2464@gmail.com