కథ

నిజాయితీ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో ఎంపికైన రచన
.......................................
అది ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల. ఆదర్శ పాఠశాలగా ఎంపికైంది. హెచ్.ఎం. రాజేంద్రప్రసాద్ గారు చాలా ఆదర్శ భావాలున్నవారు. వృత్తిపట్ల అంకిత భావం ఉన్నవారు. ఆయన తండ్రి స్వాతంత్య్ర సమరయోధులు, అందుకే కుమారునికి ఆ పేరు పెట్టుకున్నారు. పాఠశాలలో విలువలు, ఉప విలువలు మొత్తం ‘108’ గురించీ పాఠశాల ప్రార్థనలో బోధిస్తూ పిల్లల చేత స్వచ్ఛందంగా రెండు మూడు నిమిషాలు ఉపన్యసింపజేస్తారు. ఉపాధ్యాయ బృందం, పిల్లలు అంతా వాటిని పాటించేలా కృషి చేస్తున్నారు. అలాంటి పాఠశాలలో ఆ సోమవారంనాడు ప్రార్థన అయ్యాక, హెచ్.ఎం.గారు ‘ప్రియ విద్యార్థులారా! ఈ రోజు ‘నిజాయితీ’ అనే ఉపవిలువ గురించీ మన ఏడో తరగతి విద్యార్థి ‘రాజు’ ఉపన్యసిస్తాడు’ అని అనౌన్స్ చేశారు. తెల్లని పైజామా లాల్చీ ధరించిన, ఒతె్తైన రింగుల జుత్తున్న రాజు చిరునవ్వుతో చేతులు జోడిస్తూ వచ్చి ప్రధానోపాధ్యాయుని పక్కనే నిల్చుని, నిదానంగా స్పష్టంగా మాట్లాడసాగాడు.
‘ఉపాధ్యాయ బృందానికి నా నమస్సులు! నా సోదర విద్యార్థి బృందానికి శుభోదయం!
‘ని’జాయితీ అనేది మనలను మనం.. ‘జా’గ్రత్తగా.. ‘యి’న్స్‌పెక్ట్ చేసుకునే.. ‘తీ’రు.. అని నా అభిప్రాయం.
దురుసుతనం, అబద్ధం, మోసం, దొంగతనం వంటి దుర్గుణాలు లేకపోవడమే నిజాయితీ. అంతేకాకుండా నిజాయితీ అంటే నమ్మకం, విధేయత, నిష్పక్షపాతం, చిత్తశుద్ధి, యధార్థం అని కూడా చెప్పవచ్చు. తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసిన వ్యక్తి తన తప్పును తాను గ్రహించి సరిదిద్దుకునే ప్రయత్నాన్ని నిజాయితీ అనవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నిజాయితీగా వ్యవహరించడమే ‘నిజాయితీ’ అంటే. మనల్ని మనం ప్రతిక్షణం పరిశీలించుకుంటూ, పరిశోధించుకుంటూ పవిత్రమైన గుణాలను పాటించడమే నిజాయితీ. ఈ ఒక్క గుణాన్నీ పాటిస్తే మానవుడు ఉన్నత స్థితిని పొందడం తథ్యం. మన బళ్లో ప్రతి ఒక్కరూ ఈ విలువలను పాటించను ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇలా ప్రతి భారతీయుడూ ముఖ్యంగా ప్రతి రాజకీయ నాయకుడూ, వ్యాపారీ, ప్రభుత్వోద్యోగీ, ప్రతి పౌరుడూ నిజాయితీ పాటిస్తే మన దేశం అగ్రస్థానంలో నిలుస్తుంది. బాలురుగా ఉన్నపుడు గాంధీజీ, ఆరు సంవత్సరాల వయస్సులో జార్జ్ వాషింగ్టన్, రిటైరవబోతున్న రోజున కూడా మోక్షగుండం విశే్వశ్వరయ్యగారు పాటించిన నిజాయితీ, తిలక్ మహాశయుడు, వల్లభాయ్ పటేల్, ఆయన కుమార్తె మణిబెహెన్... ఇంకా ఎందరో మహానుభావులు నిజాయితీ పాటించినవారే! అందుకే వారిని మనం ఈనాడూ గుర్తుంచుకున్నాం. నిజాయితీ అనేది ఉపన్యాసాల్లో చెప్పేది కాదు, పాటించేది మాత్రమే అని నా ఉద్దేశం. అందుకే ‘ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ’ అన్నారు. నా మాటల్లో తప్పులుంటే మన్నించవల్సిందిగా ఉపాధ్యాయ బృందాన్ని కోరుకుంటూ, అందరికీ సెలవు’ అని చెప్పిన రాజు భుజం తట్టి గర్వంగా చూశారు హెచ్.ఎం. రాజేంద్రప్రసాద్‌గారు.
ప్రార్థన పూర్తయి అంతా తరగతి గదుల్లోకి వెళ్లారు. రాజును చూసి గర్వంగా ఫీలవుతూ రాజేంద్రప్రసాద్ గారు తన గదిలోకి వచ్చి కూర్చున్నారు. ఆయన ఆలోచనలు ఒక్కసారి గతంలోకి మళ్లాయి.
ఆ రోజు రాజేంద్రప్రసాద్ మధ్యాహ్న భోజనం తర్వాత స్కూల్‌కి వేగంగా నడచి వెళ్తున్నారు. తన వీధి తిరగ్గానే మెయిన్‌రోడ్ మీద ఒక ఫంక్షన్ హాల్ ముందున్న కుప్పతొట్లోని ఎంగిలి విస్తరాకుల్లోని స్వీట్లు, అన్నం ఏరుకు తింటున్న సుమారు ఐదారేళ్ల పిల్లవాడిని చూశాడు. కుక్కలను తన ఎడంచేతిలోని పెద్ద కర్రతో అదిలిస్తూ కుడిచేత్తో ఇడ్లీ ముక్కలు, గారె మ్కులూ, స్వీట్లు ఏరుకు తింటున్నాడు. రాజేంద్రప్రసాద్ మనస్సు జాలితో నిండిపోయింది. ‘వ్యాస భగవాన్ అంతటివారే ఆకలికి ఆగలేక తల్లి లాంటి కాశీ నగరాన్ని శపించబోయారు. ఇహ ఈ పసివాడు ఇలా ఆకలికి ఆగలేక ఎంగిలి మెతుకులు ఏరుకు తినడం విశేషం కాకున్నా భారతదేశంలోని పసి బాలలు ఇలా ఎంతమంది ఆకలికి ఆగలేక, మెతుకు దొరక్క క్రమేపీ సంఘ విద్రోహాలకు పాల్పడుతున్నారో కదా! ఎన్ని పసిప్రాయాలు ఇలా ఎండబారిపోతున్నాయో కదా! లోపలేమో తిన్నంత తిని ఎక్కువై పారేసేవారూ, బయట కుప్పతొట్లో ఎంగిలి మెతుకులు ఏరుకు తినే పసివారూ.. ఎంత దౌర్భాగ్యం? తన చిన్నతనం ఆయనకు గుర్తొచ్చింది. అమ్మానాన్నా ఒక యాక్సిడెంట్‌లో మరణించడంతో అనాథ ఐన తనను తన స్కూల్ మాస్టారుగారు వారాలు ఏర్పాటు చేసి చదువుకోను సహకరించారు. లేకపోతే తాను ఎలా మారిపోయి ఉండేవాడో కదా! తాను అలా చదువుకున్న విషయం ఆయనెన్నడూ మరువడు. ఆ రోజుల్లో అలా తిండి, బట్ట, పుస్తకాలు దొరకబట్టే తాను ఈ రోజు ఇలా ఉపాధ్యాయుడు కాగలిగాడు. అందుకే ఇలాంటి బాలలను చూస్తే తన మనసు బాధతో నిండిపోతుంది...’ అని ఆయన మనస్సు ఆవేదన చెందింది.
వెంటనే వాడి రెక్క పుచ్చుకు లాగాడు. వాడు విదిలించాడు. ఆ విదిలింపునకు వాడి చేయి తగిలి ఆయన కళ్లజోడు కిందపడి పగిలిపోయింది కూడా. ఐనా ఆయన బలంగా వాడిని లాగి లేపి, రెక్క గట్టిగా పట్టుకుని ఐదు నిమిషాల దూరంలో వున్న తన ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడే వెళ్లిన భర్త అంతలోనే తిరిగిరావడం, పక్కనే గోచీగుడ్డతో ఉన్న పసివాడినీ చూసి ‘ఏమైంది?’ అన్నట్లు కళ్లతోనే పలకరించింది ఆయన సతీమణి అరుణ.
‘అరుణా! ఇంట్లో అన్నమేమైనా ఉందా? ఉంటే పట్రా!’ అంటూ ఆయన వాడి రెక్క పట్టుకుని గేటు వద్ద ఉన్న ట్యాప్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ట్యాప్ తిప్పి వాడి వొంటి మీద నీరు పడుతుంటే, తోటలో పనిచేసి చేతులు కడుక్కోను ఉంచుకున్న సబ్బు బిళ్ల ఇచ్చి రుద్దుకోమని సైగ చేశారు. వాడు భయంభయంగానే వొంటికి సబ్బు నురగ పట్టించుకుని, స్నానం ఐందనిపించాడు. అక్కడే దణ్ణెం మీద ఆరేసి ఉన్న తువ్వాలు తీసిచ్చి తుడుచుకోమని చెప్పారు. ఇంతలో అరుణ ఒక ప్లేటులో కూర, పప్పు అన్నం పెట్టుకుని వచ్చింది. వరండలా టవల్ కట్టుకునున్న వాడిని కూర్చోబెట్టి అన్నం తినమని సైగ చేశారాయన. వాడు ఆబగా అన్నం తీసుకుని క్షణంలో తినేశాడు. ‘కడుపు నిండిందా?’ అడిగింది అరుణ. నిండిందని వాడూ సైగ చేశాడు.
‘నీ పేరేంటీ?’ అడిగింది అరుణ. తెలీదన్నట్లో, లేదన్నట్లో తల తిప్పాడు.
‘ఏం చేద్దాం?’ అన్నట్లు భర్త వైపు చూసింది. ‘ఏముందీ బళ్లో వేస్తాను. వీళ్ల ఇల్లెక్కడో కనుక్కుందాం. సరే మన సత్యం, చిన్నప్పటి చొక్కా నిక్కరూ తెచ్చివ్వు వీనికి, బయల్దేరుతాను బడికి’ అంటూ లేచాడాయన. ఆయన ఒక్కగానొక్క కొడుకు ఆ ఊర్లో ఉన్న ఏడోక్లాస్ చదువయ్యాక వాళ్ల అమ్మమ్మగారి ఊర్లో హైస్కూల్లో చేరి చదువుతున్నాడు. అరుణ లోపలికెళ్లి బట్టల జత ఒకటి తెచ్చి వాడికిచ్చింది. వేసుకోను సాయం చేసింది. వాడిని తన వెంట రమ్మంటూ రాజేంద్రప్రసాద్ బడివేపు నడిచాడు. కడుపు నింపి, బట్టలిచ్చిన ఆయనంటే వాడికి తెలీకుండానే అభిమానం ఏర్పడింది.
బడి స్వీపర్, అటెండర్ సాయంతో ఊరి చివర ఉన్న గుడిసెల్లోని వాళ్ల అమ్మను పిలిపించారు. ఆమె జబ్బు మనిషి. ఒంటరి. పనిచేసి బువ్వపెట్టేవారు లేక వాడు అలా తింటున్నాడని ఆయనకు అర్థమైంది.
‘సారూ! నాకూ ఎవ్వరూ లేరు గదా! నేను వాళ్లను నా ఇంట్లో ఉంచుకుంటాను సారూ!’ అంది స్వీపర్ సానమ్మ. సుమారుగా 50 పైన వయసున్న ఆమెకు నా అన్నవాళ్లెవ్వరూ లేరు.
‘మంచిది సానమ్మా! నీకు భారం కాకుండా నీకు బియ్యం, పప్పు వగైరాలు నేను వారి కోసం ప్రతి నెలా పంపుతాను’ అన్నారాయన. ఉపాధ్యాయులంతా ఈయన కిదో పిచ్చి’ అని మనసులో అనుకున్నారు.
అలా వాడిని ‘రాజు’ అనే పేరుతో బళ్లో నమోదు చేశారు రాజేంద్రప్రసాద్. స్వీపర్ ఇంటికి వారి మకాం మార్చి, వాడి తల్లికి వైద్యం చేయించసాగారాయన.
కొద్దిరోజుల్లోనే వాడు బడి వాతావరణానికి అలవాటు పడిపోయి, బళ్లో మధ్యాహ్న భోజనం, రాత్రులు స్వీపర్ వాడికీ, తల్లికీ వండి పెట్టే అన్నం తింటూ, తల్లి వద్దే పడుకుంటూ, స్వీపర్ మనవడుగా గుర్తింపు పొంది, చక్కగా చదువుకోసాగాడు. వాడి విద్యా ప్రస్థానం అలా సాగి ప్రస్తుతం ఏడో తరగతిలోకి వచ్చాడు. రాజేంద్రప్రసాద్‌గారు, తన ప్రయాస వృథా కానందుకూ, ఒక పసివాడు చక్కగా తాను కోరుకున్న విధంగా ఎదుగుతున్నందుకూ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. ఐతే ఆయన ఊహించని సంఘటన ఒకటి జరుగబోతోందని, దాంతో తన మనసుకు అశనిపాతం లాంటి దెబ్బ తగలబోతోందనీ అప్పుడాయనకు తెలీదు.
* * *
‘నేను నమ్మలేను నాగేష్! అతడిలా చేశాడంటే!’
‘మరి ఏమైందంటారు సార్! మరెవ్వరూ ఇక్కడికి రాలేదు’ టీచర్ నాగేష్ సందేహం.
‘ఔను. ఎవ్వరూ రాలేదు. అతడు కవరు ఇచ్చి వెళ్లాక ఎవ్వరూ రాలేదు’ రాజేంద్రప్రసాద్ గారి మాట.
‘అసలు అతడు కవరు ఎక్కడ పెట్టాడు? మీ చేతికే అందించాడా?’ టీచర్ వనజ అడిగింది.
‘లేదు వనజా! నేను గుమ్మం వద్ద నిల్చుని పిల్లలంతా లైన్‌గా వెళ్తుంటే చూస్తూ ఉన్నాను. నా టేబుల్ డ్రాయర్ సొరుగులోనే వేయమని చెప్పాను’
‘వెళ్లిరానా మాస్టారూ!’ అని అడిగాడు లోపలికొచ్చాక, టేబుల్ మీది రిజిస్టర్లన్నీ లోపల పెట్టి తాళం వేసేసి, కీ నా జేబులో వేసుకుని వెళ్లాను’
‘నాకు మతిపోతోంది. అసలా కవరెలా మాయమైందాని. మనం రోజూ ప్రార్థనలో చెప్పే విలువలూ, ఉపవిలువలూ వాటి వివరాలూ అన్నీ ఏమవుతున్నాయి!’ ఆశ్చర్యమూ విచారమూ కలివిడికాగా హెడ్‌మాస్టర్ రాజేంద్రప్రసాద్ గారు విచారంగా కూర్చుండిపోయారు. ఉపాధ్యాయ బృందమంతా ఆయన గదిలో సమావేశమై, ఆ కవరు గురించీ, అది మాయమైన తీరు గురించీ చర్చ జరుపుతోంది.
‘పోనీ అతడ్ని పిల్చి మా అందరి ముందూ ప్రశ్నిస్తారా?’
‘వద్దు వద్దు. పసి మనసు బాధపడకూడదు’
‘మరేమైనట్లు మాస్టారూ! అసలు అతడా కవరు మీకు చూపి సొరుగులో వేయకుండానే వెళ్లిపోయి ఉంటాడు. రేపు విహార యాత్రకు వచ్చేవాళ్లనందరినీ వంద రూపాయలు తెచ్చుకోమన్నాం కదా! వాడు కవర్ మీకు చూపి జేబులో వేసేసుకుని వెళ్లి ఉండవచ్చు కదా! మీరేమో ఇచ్చాడనుకుని ఉంటారు!’ డిటెక్టివ్ నవలలు బాగా చదివే దినేష్ అన్నాడు.
‘లేదు అతడు తెచ్చాడు. ఏమైనా నేనతన్ని అనుమానించలేను. సరి దీన్నింతటితో వదిలేద్దాము. ఆ సొమ్మంతా నేనే ఆ సంస్థకు చెక్ పంపుతాను. మీరెవ్వరూ ఎవ్వరితోనూ ఈ విషయం గురించీ ఇహ మాట్లాడకండి. అంతా మర్చిపోండి. పదండి వెళదాం’ అంటూ లేచారు హెచ్.ఎం. రాజేంద్రప్రసాద్‌గారు.
ఉపాధ్యాయులంతా ఆయన ఛాదస్తానికీ, ఒక అనామకుని నమ్మిన ఆయన తీరుకూ నవ్వుకుంటూ, విమర్శించుకుంటూ వెళ్లారు. ఇంటికెళుతున్న ఆయన మనసు ప్రార్థనలో అతడు చేసిన ప్రసంగం వైపు మళ్లింది. ‘ఎంత బాగా చెప్పాడు! స్వంతంగా వార్తాపత్రికలూ, గ్రంథాలయంలో పుస్తకాలూ చదువుతూ బాగా విజ్ఞానం పెంచుకున్నాడు. మంచి విద్యార్థి. ‘ఇది అతడి పని కాదు. ఎక్కడో పొరపాటు జరిగింది’ అనుకుంటూ ఇల్లు చేరారాయన.
ఇల్లు రాగానే ఆయన ఆలోచనల్లోంచి బయటపడి, ఇంట్లో అడుగుపెట్టారు.

మంచినీళ్ల గ్లాసుతో వచ్చిన ఆయన అర్ధాంగి అరుణ, ‘ఏంటండీ అలా ఉన్నారు. ఆరోగ్యం బావుంది కదా!’ అంటూ పలకరించింది.
‘అరుణా! ఈ రోజు ఒక సంఘటన నా మనసును కలచివేస్తున్నది’ అంటూ మంచినీళ్లు తాగి గ్లాసు అందించాడామెకు.
‘ఏమైందండీ?’ అంటూ పక్కనే కుర్చీలో కూర్చుందామె.
‘అరుణా! మా స్కూల్ పిల్లలను మా ఉపాధ్యాయులు ప్రోత్సహించి, ప్రతి సంవత్సరం ఏదైనా ప్రమాదాల పాలైన వారికి ఉడతాభక్తిగా సాయం అందించే అలవాటు చేశాం. పిల్లలకు ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలనే ఉద్దేశం కలిగించాలనే ఈ పని. ప్రతి మార్చి నెలలో రెండో వారంలో పిల్లలు తమ పాకెట్ మనీ వారి తరగతిలోని కిడ్డీ బ్యాంకుల్లో వేస్తారు. శనివారంనాడు చిల్లరంతా కలిపి లెక్కించి నోట్లు తీసుకుని అంతే సొమ్ము ఉపాధ్యాయులమంతా తలా కొంచెం కలిపి దాన్ని ఆయా వ్యక్తులకు లేదా సంస్థకు పంపుతాం. అలా ఈ శనివారంనాడు మన రాజు ఆ సొమ్ము 4,915 రూ. లెక్కించి, చిల్లరకు సరిపడా పచారీ దుకాణం నుంచీ నోట్లు తెచ్చి ఒక కవర్లో నా గదిలో ఉంచాడు. ఆ కవరు ఈ రోజు కనిపించలేదు. ఇది ఎవరి పనో అంతుచిక్కడంలేదు. రాజు తప్ప నా గదిలోకి ఎవ్వరూ రారు. ఉపాధ్యాయులంతా అతడినే అనుమానిస్తున్నారు. నాకు మాత్రం అతడలా చేయడని అనిపిస్తోంది. వాని మీద నాకు సంపూర్ణ విశ్వాసం. మనస్సేమీ బావోలేదు అరుణా!’ విచారంగా అన్నారు రాజేంద్రప్రసాద్‌గారు.
‘ఏమండీ! మీరూ మరిచిపోయి ఉండరు. నాకైతే నినే్న జరిగినట్లుగా ఉంది. ఆ రోజు, ఆ కుర్రాడ్ని మనింటికి తేడం.. అదంతా ఇంకా నా కళ్లల్లో మెదల్తూనే ఉంది. మీరు మన సత్యం చదువు కంటే రాజు చదువుకుంటున్నందుకు సంతోషించడం నాకు తెల్సు కదా! ఇది అతడు చేసి ఉండడు. ఏదో పొరపాటు. నిదానంగా బయటపడుతుంది కానీ రాజునేం అడక్కండి. వాడి మనసు అసలే చాలా మెత్తన...’ అంది ఆయనకు సరైన జోడీ ఐన అరుణ.
* * *
మరునాడు విజ్ఞాన యాత్రకు బయల్దేరారు. ఉపాధ్యాయులు, పిల్లలు అంతా కల్సి. రాజు రాలేదు. రాజేంద్ర ప్రసాద్‌గారు స్వీపర్ సానమ్మను అడగ్గా వాడి తల్లికి వొంట్లో బావోలేదనీ, ఆమెకు తోడుగా ఉంటానని చెప్పాడంది. మూడు రోజులకు విహార యాత్ర నుంచీ తిరిగొచ్చిన రాజేంద్రప్రసాద్ గారికి సానమ్మ ‘సారూ! ఇదేందో కవరు మీ బల్లకింది సెత్త బుట్టలో ఉండాది సారూ!’ అంటూ ఒక కవరు ఆయనకు ఇచ్చింది. అదే కవరు! అది చూడగానే ఆయన ముఖం వికసించింది. అంటే అంటే.. ‘తాను రిజిస్టర్లు లోపల పెట్టేప్పుడు సొరుగులోంచీ కింద ఉన్న చెత్త బుట్టలో ఆ కవరు పడింది. తాను పదిసార్లు సొరుగు చూశాడు తప్ప, కింది బుట్టలో వెతకలేదు. పైగా మరునాడు చెత్త కాగితాలన్నీ ఆ బుట్టలో విసిరేయడం వల్ల అవి కవర్ను ముంచేసి కనిపించకుండా చేశాయి. ఇదీ జరిగింది’ అని ఆయనకు అర్థమైంది. ఏది ఏమైతేనేం సమస్య వీడిపోయింది. తన నమ్మకం వమ్ము కాలేదు. ఇది వాడి పని కాదు. గుండె నిండా గాలి పీల్చుకుని రాజేంద్ర ప్రసాద్‌గారు వెంటనే రాజు గురించీ సానమ్మను అడిగారు.
‘అన్నట్లు సారూ! రాజు, వాడి తల్లీ అదేదో ఊరు సెప్పిండ్రు సారూ! మరిసినా, ఆడ ఆమె నాయినున్నడంట. ఆడనే ఉందమని ఎల్లిండ్రు మీరెల్లిన్నాడే!’ అంటూ చావుకబురు చల్లగా చెప్పినట్లు చెప్పింది.
‘అదేంటి సానమ్మా! వాడు బాగా చదువుకుంటున్నాడు కదా! ఇలా పరీక్షల ముందు వెళితే ఎలా? ఆపకపోయావా?’ అన్నారాయన.
‘నేనూ శానా సెప్పిన్నయ్యా! ఆడు పట్టుబట్టిండు. తాతకాడే ఉందమని, తాతనీ ముసలొయసులో వొంటరిగొదిలుండకూడదని అల్లమ్మ కాదనే్లక ఆడితో పాటెల్లింది’ అని చెప్పిందామె.
ఉపాధ్యాయులంతా తాము రాజును అనుమానించడం పొరపాటని అన్నారు. రాజేంద్రప్రసాద్ గారి మనసు బాధతో మూల్గింది. ‘తాను వాడిని అనుమానించా ననుకుని వాడు తాను ఊళ్లో లేనపుడు మెల్లిగా వెళ్లిపోయాడు. తానెంతో తప్పు చేశాడు’ అని ఆయన చాలా బాధపడ్డారు. తన వల్ల ఒక బాలుని చదువు మధ్యలోనే కుంటుపడింది.. అని తరచూ ఆలోచిస్తూ, భార్యతో అంటూ ఉండేవారు.
* * *
కాలచక్రం ఎవ్వరికోసమూ ఆగదు కదా! ఆగకూడదు కూడానూ. సంవత్సరాలు గడిచిపోయాయి. రాజేంద్రప్రసాద్ కొడుకు సత్యం ఇంజనీరై, మంచి ఉద్యోగం సంపాదించి, తల్లిదండ్రులు చూసిన తనలా ఇంజనీరైన అందాల భామను వివాహమాడి ఉద్యోగంలో పెంపుదలతో అమెరికా వెళ్లిపోయాడు.
ఇంకా ఉద్యోగంలో ఉన్న రాజేంద్రప్రసాద్, అరుణ అక్కడే ఉండిపోయారు.
ఆ రోజు రాజేంద్రప్రసాద్ గారి పదవీ విరమణ రోజు. సాయంకాలం నాలుగైంది. ఆయనకు సన్మానం చేయను ఉపాధ్యాయులంతా వేదికను అందంగా అలంకరించారు. ప్రోగ్రాం మొదలయ్యే ముందుగా స్కూల్ ముందు ఒక పోలీసు జీపు వచ్చి ఆగింది. పోలీసులు జీపు దిగి వేదిక వద్దకు వచ్చారు. ఊళ్లో వారంతా స్కూల్‌లోని వేదిక వద్ద కూర్చుని ఉన్నారు. పోలీసు జీపు రావడం అంతా చూసి, ఏదైనా ఆపద లేక, ఎవరైనా తప్పు చేసి ఉంటారేమో ఎందుకొచ్చిందీ పోలీసు జీపని అంతా గుసగుసగా అనుకోసాగారు.
‘సారేమి తప్పు చేసినరబ్బా?’
‘ఎందుకూ పెద్దసారు రిటేరయ్యే యేల్టికి పోలీసులొచ్చిండ్రు?’
‘సార్ కొడుకేమైనా తప్పు సేసి ఉంటడా?’
‘అబ్బే ఆ బాబు అమేరికెల్లిపోయిండు గదా!’
‘మనూళ్లో ఎవురైనా ఏదైనా తప్పు సేసి ఉంటరా? ఆ సారు అట్టాంటి మడిసికాదే!’
ఇలా ఎవరి బుద్ధికి తోచిన విధంగా వారు అనుకోసాగారు.
వేదిక మీద ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరకి ఆ పోలీసు ఆఫీసర్ వెళ్లి ‘బావున్నారా సారూ!’ అంటూ వంగి పాదాలకు నమస్కరించాడు.
కంగారుగా ఆయన పైకి లేచి ‘మీరెవరండీ?’ అన్నారు.
ఆ పోలీసాఫీసర్ తన తలపైనున్న హ్యాట్ తీసి ‘ఒక మారు పద్యం తప్పు చెప్పానని ఈ రింగుల జుత్తే పట్టుకుని బుగ్గ మీద కొట్టారు. ఈ చేయి పట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్లి ట్యాప్ కింద స్నానం చేయించి కడుపునిండా అన్నం పెట్టారు. నాకో జీవితాన్ని ప్రసాదించిన దేవుడు సార్ మీరు. ‘నిజాయితీ’ అంటే ఏంటో నేర్పారు, ఎలా జీవించాలో చూపారు. నేను సర్ మీ రాజును’ అంటూ ఆయన పాదాల మీద పడిపోయాడతను. రాజేంద్రప్రసాద్‌గారు, అతడెవరో తెల్సుకుని ఇహ ఉండలేక ‘రాజూ! నా రాజూ!’ అంటూ అతడ్ని ఆలింగనం చేసుకున్నారు.
ఆ పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్న అరుణ ‘ఏమై పోయావు బాబూ! సార్ నిన్ను తలంచని రోజు లేదంటే నమ్ముతావా? సారంటే ఇంత ప్రేమ, గౌరవం ఉన్న వాడివి అలా చెప్పాపెట్టకుండా ఎక్కడికెళ్లిపోయావు? తనకెవరూ లేరని మీ అమ్మ చెప్పింది. మరి మీ తాత ఎక్కడి నుంచీ వచ్చాడు. అదంతా అబద్ధమని మా ఇద్దరికీ తెల్సు. ఆ రోజు పరీక్షల ముందు వెళ్లావని సారు నీ కోసం ఎంత బాధపడ్డారో నీకు తెలీదు. నీ కోసం చాలా వెతికించారు కూడా’ అందామె.
ఆ పోలీసు ఆఫీసర్ అరుణ పాదాలు పట్టుకుని నమస్కరించి ‘నాకు సంస్కారం నేర్పిన దేవత మీరు. నాకో జీవితాన్ని నిర్దేశించిన దయామయులు మీరిద్దరూ! ఆ రోజు నేను విహార యాత్రకు రాననీ, మా అమ్మకు జ్వరం రావటాన ఆ విషయం చెప్పేందుకు ఆఫీసు రూం వద్దకు వచ్చాను. ఆ కవర్ కనపడటం లేదని ఉపాధ్యాయులంతా చర్చిస్తున్నారు. సారు తప్ప అంతా నా మీద అనుమానం వ్యక్తపరిచారు. ఆ కవరు దొరక్కపోతే అంతా ననే్న అనుమానిస్తారు. నా మనసుకు బాధ కలిగింది. ఇప్పుడిప్పుడే నిజాయితీగా ఉండటం నేర్చుకుంటున్న నాపై నింద పడితే నేనెలా మారిపోతానో, వారంతా నన్ను అనుమానంగా చూస్తే సహించలేనేమో అనే భయంతో, నేను సార్‌గారు విహారయాత్రకు వెళ్లగానే మా అమ్మతో కల్సి సానమ్మకు ఏమీ చెప్పవద్దని ప్రామిస్ చేయించుకుని దూరంగా ఉన్న టౌన్‌కెళ్లాను. అక్కడ ఒక స్కూల్‌లో చేరి సార్ ఆశీర్వాద బలంతో చదువుకుని పోలీసు ఆఫీసర్ నయ్యానమ్మా! నాకు తర్వాత కలిసినప్పుడు సానమ్మవ్వ కవరు దొరికిందని చెప్పింది. ఐనా ‘నిజాయితీ’ పోలీసు ఆఫీసర్‌గా అవార్డు అందుకుని మిమ్ము కలవను వచ్చాను. ఆ రోజే మీ రిటైర్మెంట్ కావడం విశేషం. ఇంకో మాటమ్మా. సానమ్మ అవ్వను రిటైరయ్యాక నా దగ్గరికి పిలిపించుకున్నాను. ఇప్పుడామె నా దగ్గరే ఉంది. పెద్దదైంది’ అంటూ మైక్ అందుకుని ‘అందరికీ నమస్కారం! అయ్యా! మీ ఊర్లో ఇలాంటి ఉపాధ్యాయులు ఉండటం అదృష్టం. నా తల్లి పుట్టుక నిస్తే ఈ సారు నాకో జీవితాన్నిచ్చారు. ఈ ఊర్లోనే ఈ బళ్లోనే నన్ను చేర్చి, సద్గుణాలు నేర్పి చదువంటే ప్రేమ పెంచి నాకో దిశా నిర్దేశం చేసిన నాదేవుడీయన. వందకొకరు ఇలాంటి వారు ఉంటే దేశమంతా బాగైపోతుంది’ అంటూ తాను తెచ్చిన పూలమాల వారిద్దరి మెడల్లో వేస ఇద్దరికీ వస్త్రాలు బహూకరించి నమస్కరిస్తున్న రాజు తలపై ప్రేమగా నిమిరారు ఇద్దరూనూ.

హైమా శ్రీనివాస్
201/ఎ, 15వ క్రాస్, 8వ మెయిన్, బాలాజీ టెంపుల్ దగ్గర,
బిఇఎంఎల్ లేఅవుట్, తుంబర్‌హళ్లి -560 066

హైమా శ్రీనివాస్