కడప

తహసీల్దార్ల ఇష్టం ... కుల సర్ట్ఫికెట్ కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 26: బీసీల్లో వర్గీకరణలు, ఏ వర్గీకరణకు కులం సర్ట్ఫికెట్ ఇవ్వాలనే విషయంపై జిల్లాలోని తహసీల్దార్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక మండలంలోని తహసీల్దార్ ఒక వర్గీకరణ బీసీకి కులసర్ట్ఫికెట్ ఇస్తే, మరో మండలంలోని తహసీల్దార్ అదే కులవర్గీకరణకు లేదని చెబుతున్నారు. కుల సర్ట్ఫికెట్లకోసం వచ్చే బడుగు బలహీనవర్గాలను, తహసీల్దార్లు కన్నీటి పర్యంతం చేస్తున్న అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నందలూరు మండలం గోపవరం గ్రామంలోని మొండిబండి కులాన్ని అక్కడి తహసీల్దార్ కుల సర్ట్ఫికెట్ ఇవ్వకుండా పక్కనపెట్టడంతో ఈ ఊరులోని ఆ కులానికి కులం ప్రభుత్వ సంక్షేమపథకాలకు దూరమైంది. గ్రామం గ్రామమే గురువారం కలెక్టర్‌ను కలిసి తమగోడు వెల్లబోసుకున్నారు. గ్రామంలో 50 కుటుంబాలు ఉన్నాయనీ, ఏ ఒక్కరికీ ఈ కులంపై సర్ట్ఫికెట్లు ఇవ్వడం కుదరదంటూ స్థానిక తహసీల్దార్ తెగేసి చెబుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కుగ్రామంలోని కుటుంబాలవారు వారి పిల్లలకు స్కాలర్ షిప్‌లకు, పెన్షన్లు, ఇళ్లు సైతం మంజూరు చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇటీవల బీసీ కార్పొరేషన్ ప్రవేశపెట్టిన రుణాల మంజూరుకు కూడా వీరు అనర్హులైపోయారు. గెజిట్‌లో వీరు బీసీ-ఏ గా ఉన్నారు. ప్రభుత్వం విడుదలచేసిన కులాల గెజిట్ అన్ని తహసీల్దార్ల కార్యాలయాల్లో అట్డడుగున మూలుగుతున్నాయి. ఏ తహసీల్దార్ ఈ గెజిట్లను చూడటం లేదు.
ఈ సమస్య ఈకుగ్రామానికి సంబంధించిన ఒక్క సమస్యేకాదు, జిల్లా వ్యాప్తంగా అనేకమంది తహసీల్దార్లు ఇష్టానుసారంగా కులసంఘాల సర్ట్ఫికెట్లు మంజూరులో నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నారు. తాము చెప్పిందే వేదమంటున్నారు. ప్రభుత్వం విడుదలచేసిన గెజిట్‌ను పరిశీలించకుండానే, కులం జాబితాలో ఉన్నా ఈప్రాంతంలో లేరని, తమ వీఆర్వో ధృవీకరించలేదని సాకులు చెబుతూ తిరస్కరిస్తున్నారు. కడప కేంద్రానికి అతి సమీపంలోని ఖాజీపేట మండలంలో సైతం బలిజకులం లేదంటూ ఖాజీపేట పంచాయతికి చెందిన వీఆర్వో ధృవీకరించిన సంఘటన కూడా ఉంది. ప్రస్తుతం కాపు కార్పొరేషన్ తరపున రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ మండలంలోని కాపులకు అవకాశం లేకుండా తహసీల్దార్ మోకాలడ్డుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో తహసీల్దార్లు వారి పరిధిలోని గెజిట్‌లను పరిశీలించకుండానే ఆయా పంచాయతీలకు చెందిన వీఆర్వోలు ఇస్తున్న తప్పుడు సమాచారంతో ఎంతోమంది పేదలు అటు రుణాలు, ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో కొంతమంది వీఆర్వోలు తాము అడిగిన సొమ్మునుఇస్తే తప్ప సర్ట్ఫికెట్లకు క్లియరెన్స్ ఇవ్వలేమంటూ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ పరిధిలో ఈనెల చివరినాటికి రుణాలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదుచేసుకోవాల్సి వుండగా, తహసీల్దార్ల అస్తవ్యస్త వైఖరివల్ల చాలామంది వాటికి దూరం కాబోతున్నారు.
కలెక్టర్ దగ్గరకు చేరిన పంచాయతీ
తహసీల్దార్ల నిరంకుశ, నిర్లక్ష్యవైఖరి కలెక్టర్ దృష్టికి గురువారం వచ్చింది. నందలూరు మండలంలోని గోపవరం గ్రామ మొండిబండ కులస్తులు మూకుమ్మడిగా కలెక్టర్ వద్దకు వచ్చి మొరపెట్టుకోవడంతో, కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అనేకమంది వివిధ మండలాల్లో ఇదే పరిస్థితి ఉందనీ, వారివారి కులాలను ఉటంకిస్తూ కలెక్టర్‌కు వౌఖికంగా ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ల తీరుపై కలెక్టర్ సైతం అసహనం వ్యక్తంచేశారు. దీనిపై పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చి పంపించారు.