ఖమ్మం

మిర్చి రైతు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 28: గిట్టుబాటు ధర కోసం పలుమార్లు నిరసనలు తెలిపిన రైతన్న కనె్నర్ర చేశాడు. వ్యాపారులు కనీస ధర కూడా చెల్లించకుండా తమను ఇబ్బందులు పెడుతున్నారని, ప్రభుత్వం స్పందించటం లేదని దుయ్యబట్టారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా రెండున్నర లక్షల మిర్చి బస్తాలు శుక్రవారం మార్కెట్‌కు వచ్చాయి. గురువారం టిఆర్‌ఎస్ సభ సందర్భంగా సెలవు ప్రకటించిన మార్కెట్ కమిటీ శని, ఆది, సోమవారాల్లో కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలో తమ పంట అమ్ముకునేందుకు రైతులంతా శుక్రవారం మార్కెట్‌కు చేరారు. తెల్లారేలోగా మార్కెట్‌కు ఎటు చూసినా కిలోమీటర్ దూరం వరకు మిర్చి బస్తాలు రోడ్లపైనే ఉన్నాయి. గరిష్ట ధర 6 వేల వరకు పలికినప్పటికీ వ్యాపారులు కొంత మంది వద్ద 3 వేలకే క్వింటా మిర్చి కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రోడ్లపైనే కాంటాలు వేశారు. కనీసం మార్కెట్‌లోకి వెళ్ళకుండానే రోడ్లపైనే కాంటాలు వేస్తూ రైతులకు తక్కువ ధర ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఖమ్మం అర్బన్, రూరల్, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన కొందరు రైతులు వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు పట్టించుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. అనంతరం కొందరు ప్రభుత్వం, వ్యాపారులు అనుసరిస్తున్న విధానాల వల్లనే గిట్టుబాటు ధర దక్కటం లేదంటూ కాంటాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పత్తి, మిర్చి, అపరాల మార్కెట్ కార్యాలయాలపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరికొందరు ఫర్నిచర్‌ను, కాంటాలను ఒక దగ్గరికి చేర్చి దగ్ధం చేశారు. ఈ సమయంలో మార్కెట్ కార్యదర్శితో పాటు సిబ్బంది తమ ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు పెట్టారు. మరి కొంతమంది రైతులు మార్కెట్ కమిటీ చైర్మన్ చాంబర్‌లోకి వెళ్ళి ఫర్నిచర్, ఫైళ్ళు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతులతో కలసి ఆందోళన చేశారు. ఆస్తులను ధ్వంసం చేయవద్దని, ఆందోళన ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని వెంకట వీరయ్య చెప్పినప్పటికీ రైతులు వినిపించుకోలేదు. ఒకానొక సమయంలో సండ్రపై కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకుండా ఎప్పుడో 4 వేలు ఇస్తామని చెప్పటం సరైంది కాదని, కనీసం 10 వేల రూపాయలకు క్వింటా మిర్చి కొనుగోలు చేయాలని, రైతుల పరిస్థితిపై స్పందించకుండా వచ్చే ఏడాది అండగా ఉంటామని చెప్పటం దురదృష్టకరమని, కనీసం ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా కూడా స్పందించటం లేదని వెంకటవీరయ్య దుయ్యబట్టారు.
ఈ సమయంలో మార్కెట్‌కు ఎసిపి గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిస్థితి అదుపులోకి తేచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్‌కు గాయం కావటంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు మార్కెట్‌కు చేరుకుని రైతులకు అండగా ఉంటామని, ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధరకు మిర్చిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న పోలీస్ కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఇదిలా ఉండగా రైతులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టిడిపి నేత స్వర్ణకుమారి, సిపిఎం నాయకుడు నున్నా నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ కొన్ని నెలలుగా రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత రైతులకు మరెన్నో కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. కనీసం క్వింటా మిర్చికి 10 వేల రూపాయలు చెల్లించకపోతే రైతు తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం వెంటనే రైతులను అదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా రైతుల నుండి పంట కొనుగోలు చేసేందుకు శనివారం మార్కెట్‌ను తెరిచి ఉంచుతామని చైర్మన్ కృష్ణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మార్కెట్‌ను సందర్శించి రైతులకు సంఘీభావం తెలుపుతామని ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.
మార్కెట్‌పై దాడి ప్రతిపక్షాల కుట్ర
* టిఆర్‌ఎస్ నేతల ఆరోపణ
ఖమ్మం(ఖిల్లా), ఏప్రిల్ 28: ఖమ్మం వ్యవసాయమార్కెట్‌పై శుక్రవారం జరిగిన దాడి ప్రతిపక్షాల కుట్రని, టిఆర్‌ఎస్ సభ సక్సెస్‌ను జీర్ణించుకోలేని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన వారు కావాలనే దాడికి పాల్పడ్డారని జడ్పి చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఎఎంసి చైర్మన్ జి కృష్ణ ఆరోపించారు. టిఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం వ్యవసాయమార్కెట్‌లో ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరగలేదని, దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. కెసిఆర్ ముమ్మాటికి రైతు పక్షపాతేనని ఆ దిశగానే పాలన సాగుతోందన్నారు. రాజకీయ లబ్దికోసమే రైతు ముసుగులో దాడులకు పాల్పడ్డారన్నారు. ఈ సమావేశంలో నాయకులు నల్లమల వెంకటేశ్వర్లు, పోట్ల నాగేశ్వరరావు, కమర్తపు మురళీ తదితరులు పాల్గొన్నారు.
జెఏసి చైర్మన్ కోదండరాం అరెస్టు
ఖమ్మం(ఖిల్లా), తెలంగాణ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను కూసుమంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం మిర్చిమార్కెట్‌ను సందర్శించేందుకు శుక్రవారం సాయంత్రం ఖమ్మం వస్తున్న ఆయనను పాలేరు వద్ద అదుపులోకి తీసుకొని కూసుమంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారమే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళనలు జరిగాయని, ఇప్పుడు ఖమ్మం వెళ్ళడం సరైంది కాదంటూ ఆయనను సూర్యాపేట వైపుకు తరలించారు. కాగా కోదండరాం అరెస్టును అన్ని రాజకీయ పక్షాలు, యువజన, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోవాలని, కోదండరాంను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.