మెయన్ ఫీచర్

కన్నడ ఫలితం.. ఆరెస్సెస్ విస్మయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటకలో చాలామంది ‘హంగ్’ అసెంబ్లీ ఏర్ప డుతుందని ఊహాగానాలు చేస్తూ వచ్చినా మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరం వరకు వచ్చి బిజెపి ఆగిపోతుందని, సంక్లిష్టమైన రాజ్యాంగపర ప్రశ్నలకు దారితీస్తుందని మాత్రం ఎవ్వరు ఊహించనే లేదు. ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి కావడం కోసం విశేషంగా ప్రయత్నం చేసిన బిఎస్ యడ్యూరప్ప వరుసగా మూడోసారి బిజెపిని అతిపెద్ద పార్టీగా చేయగలిగినా సంపూర్ణ ఆధిక్యత సాధించడంలో మాత్రం విఫలం అయ్యారు. 2008లో సంపూర్ణ ఆధిక్యతను ముగ్గురు మాత్రమే తక్కువగా ఉండగా, ఇప్పుడు ఎనిమిది మంది తగ్గారు. గతంలో ముగ్గురు తక్కువగా ఉన్నా ఇతర పక్షాల నుండి 20 మందిని వరకు ఫిరాయింపులకు ప్రోత్సహించి ఐదేళ్లపాటు బిజెపి అధికారంలో ఉండేటట్లు చేసుకోగలిగారు. ఇప్పుడూ అదే ధీమాతో తమకు ప్రభుతం ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే పూర్తికాలం అధికారంలో కొనసాగగలమని బిజెపి నేతలు విశ్వసిస్తున్నారు. ఫిరాయింపు రాజకీయాలలో ఆరితేరిన పార్టీ నాయకులకు ఆ మాత్రం నమ్మకం ఉండడంలో ఆశ్చర్యం ఉండదు. అయితే ఈ ఎన్నికలలో కీలక పాత్ర వహించిన ఆర్‌ఎస్‌ఎస్ కు మాత్రం బిజెపి విజయం 104 సీట్ల వద్ద ఆగిపోవడం మాత్రం ఆశ్చర్యంగానే ఉన్నట్లు తెలుస్తున్నది.
భారతీయ జనసంఘ్ రోజుల నుండి రాజకీయ పార్టీ నిర్వహణలో బిజెపికి తగు సహకారం అందించండం, కొందరు ప్రచారక్ లను ఇచ్చి సంస్థాగత వ్యవహారాలలో అండగా ఉండడం, ఎన్నికల సమయంలో తమ కార్యకర్తలు సహకారం అందించేటట్లు చేయడం ఆర్‌ఎస్‌ఎస్ చేస్తూనే ఉన్నది. అయితే ఆ సంస్థ ఎన్నికల ప్రచారంలో ఎన్నడూ నిమగ్నం కాలేదు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఒక సంస్థగా ఎప్పుడు చేపట్టలేదు. కేవలం 1977లో మాత్రమే ఆర్‌ఎస్‌ఎస్ మొత్తంగా ఎన్నికల ప్రచారంలోకి దిగింది. అత్యవసర పరిస్థితి అమలులో ఉండడం, ఆర్‌ఎస్‌ఎస్ అప్పుడు నిషేధంలో ఉండడం, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం జరగడంతో ఆర్‌ఎస్‌ఎస్ మొత్తం తన శక్తీసామర్ధ్యాలను కాంగ్రెస్‌ను ఓడించి, జనతాపార్టీ ని అధికారంలో నిలబెట్టడం కోసం ధారపోసింది. ఆ తర్వాత మరెప్పుడు ఆ విధంగా చేయలేదు. అయితే ప్రచారపు ఎత్తుగడలో, అభ్యర్థుల ఎంపికలో, ఎన్నికల అంశాలను ఖరారు చేయడంలో సలహాలు ఇవ్వడం, సమాలోచనలు జరపడం, బిజెపి అవసరమని భావించిన చోట్ల కొన్ని కీలక బాధ్యతలు చేపట్టడం కోసం కొందరు కార్యకర్తలను ఆర్‌ఎస్‌ఎస్ అందుబాటులో ఉంచడం చేస్తూ ఉంటుంది. కానీ ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రలో మొట్టమొదటిగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్ష పాత్ర వహించింది. హిందూ వ్యతిరేకిగా మారిన సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఓడించడం కోసం పోలింగ్ బూత్ స్థాయిలో యాజమాన్య బాధ్యతను మొత్తం ఆర్‌ఎస్‌ఎస్ చేపట్టింది. బిజెపి నాయకుల మధ్య సఖ్యత లోపించడం, వారి సంస్థాగత సామర్ధం పట్ల తగు నమ్మకం లేకపోవడం కూడా అందుకు కారణం కావచ్చు.
అయితే బిజెపి నాయకుల వ్యవహార శైలిలో పలు అంశాలపై పలువురు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులకు ఎప్పుడు అభ్యంతరాలు ఉంటూనే ఉంటాయి. వాటిని నిర్మొహమాటంగానే వారి ముందు ప్రస్తావిస్తూ ఉంటారు. ఉదాహరణకు యడ్యూరప్ప అహంకారపూరిత వ్యవహార సరళి పట్ల అసంతృప్తిని స్పష్టంగానే వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. ముఖ్యంగా పార్టీ మరో సీనియర్ నాయకుడు కెఎస్ ఈశ్వరప్పను కలుపుకుపోవాలని, ఆయన పట్ల బహిరంగంగా అవమానకరంగా ప్రవర్తింపరాదని స్పష్టం చేశారు. సిద్దరామయ్య వల్లే ఈశ్వరప్ప కుర్బీ కులానికి చెందిన వారు. ఈశ్వరప్ప పట్ల అవమానకరంగా వ్యవహరిస్తే ఆ మొత్తం కులం పట్ల వ్యవహరించినట్లు ప్రచారం జరిగే ప్రమాదం లేకపోలేదని వారించారు.
సిద్దరామయ్యకు బలమైన మద్దతుగా నిలిచిన ప్రధాన సామాజిక వర్గాలైన ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసి), దళిత ఓటర్లను ఆకట్టుకోవడం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని బిజెపి నేతలకు ముందుగానే స్పష్టం చేశారు. ఈ వర్గాలలో తగు మద్దతును సమీకరించుకోకుండా సిద్దరామయ్యను ఓడించడం సులభం కాదని స్పష్టం చేశారు. కర్నాటక ఎన్నికలలో అవినీతిని ప్రధాన అంశంగా చేయడం పట్ల ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకంటె అంతులేని అవినీతికి మారుపేరుగా నిలిచిన గాలి సోదరులతో బిజెపి చేతులు కలపడం, మూడు జిల్లాల్లో ప్రచారాన్ని వారికే అప్పచెప్పడంతో అవినీతి గురించి మాట్లాడే నైతికత బిజెపి కోల్పోయిన్నట్లు స్పష్టం అయింది.
బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌ను నాగపూర్‌లో స్వయంగా కలసి ఎన్నికల ప్రచారంలో సంఘ్ సూచించే మార్గదర్శక సూత్రాలు అన్నింటిని అనుసరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో ప్రచారంలో సంఘ్ కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొన్నారు. ముఖ్యంగా బిజెపి బలహీనంగా ఉన్న దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక, ఉడిపిలలోని కోస్తా జిల్లాల్లో కీలక పాత్ర వహించారు. ఆ విధంగా కన్నడ రాజకీయలలో ఆర్‌ఎస్‌ఎస్ మొదటిసారిగా అధికారికంగా ప్రవేశించనదని చెప్పవచ్చు. సిద్దరామయ్య పాలనలో 24 మంది సంఘ్ పరివార్ సంస్థల కార్యకర్తలు హత్యకు గురికావడాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించాలని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2019 ఎన్నికలకు కర్ణాటక ఎన్నికలను ప్రీ-ఫైనల్స్ గా భావిస్తూ ఉండడం, ఉత్తర ప్రదేశ్ ఉపఎన్నికలలో బిజెపి పరాజయం అనంతరం ఈ ఎన్నికలలో గెలుపొందడం కీలకమని భావిస్తూ ఉండడంతో ఇక్కడ ఓటమిని ఆస్కారం లేకుండా చాల ముందునుండే పకడ్బందీగా ప్రణాళికలు వేస్తూ వచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ సహకారంతో ఎన్నికలలో గెలుపొందడం కోసం పోలింగ్ బూత్ స్థాయి వరకు సవివరమైన ప్రణాలికను రూపొందించారు.
సుమారు సంవత్సరం క్రితమే జూన్ 2017లో క్రియేటివ్ సెంటర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ అనే ఏజెన్సీ ద్వారా జరిపించిన ముందస్తు సర్వే లో బిజెపికి 113 సీట్లు - అంటే స్పష్టమైన మెజారిటీ రాగలదని అంచనా వేశారు. ఆ తర్వాత పరిస్థితిని మరింతగా మెరుగు పరుచుకోవాలని పలు విధాలుగా ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, జేడీ ఎస్ లకు కలిపి 108 సీట్లకు మించి రాబోవని కూడా తేల్చారు. అందుకనే బిజెపికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ మొదటి నుండి ధీమాతో ఉంటూ వచ్చింది. అయితే ఎన్నికల ఫలితాలు రాగానే జరిగిన రెండు ఫలితాలు ఆర్ ఎస్ ఎస్ వర్గాలను విస్మయానికి గురి చేసినట్లు తెలుస్తున్నది. మొదటగా 104 వద్ద బిజెపి ఆగిపోతుందని ఊహించనే లేదు. పైగా జేడీ ఎస్ కు 37 వరకు సీట్లు రావడం కూడా ఊహించ లేదు. మరో ప్రధానమైన అంశం ఎన్నికల ఫలితాలు రావడం పూర్తి కాకముందే కాంగ్రెస్ - జేడీఎస్ లు కలసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం కావడం అందరికి దిగ్బ్రాంతి కలిగించింది. ఆ రెండు పార్టీల మధ్య అకస్మాత్తుగా ఇటువంటి బంధం ఏర్పడే అవకాశం లేదని, ముందు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం అవుతున్నది. అంత జరుగుతున్నా బిజెపి నాయకులు ఎవ్వరు పసిగట్టలేక పోవడం వారి బలహీనతగానే భావించవలసి ఉంటుంది.
మొత్తం ఎన్నికల ప్రచారంలో బిజెపి-జేడీఎస్‌ల మధ్య రహస్య అవగాహన ఉన్నట్లు ప్రచారం జరిగింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రెండు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని కూడా కథనాలు వెలువడ్డాయి. మొదటగా ఒక సభలో అటువంటి కథనాలకు బలం చేకూర్చే విధంగా మాజీ ప్రధాని దేవెగౌడ పట్ల సానుభూతితో ప్రధాని నరేంద్ర మోదీప్రసంగించారు. అయితే ఆ తర్వాత స్వరం మార్చారు అనుకోండి. కేవలం బిజెపి నాయకత్వం ద్రుష్టి మళ్లించడం కోసమే ఇటువంటి కథనాలను వ్యాప్తి చేసిన్నట్లు భావించవలసి ఉంటుంది.
కాంగ్రెస్, జేటీఎస్‌లు కలసి ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చినా ప్రధానికి సన్నిహితుడైన గవర్నర్ వజుబాయ్ వాలా సహకారంతో, పూర్తి మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగలిగారు. 2008లో ఫిరాయింపులను అడ్డదిడ్డంగా ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వాన్ని నిలబెట్టుకో గల్గిన అనుభవం ఉండడంతో ఇప్పుడు కూడా అదే చేయచ్చు.
దేవెగౌడ, సిద్దరామయ్యల మధ్య వ్యక్తిగతంగా ఉన్న విద్వేష భావనల కారణంగా ఆ రెండు పార్టీలు కలిసే ప్రసక్తి ఉండబోదని బిజెపి నాయకులు ధీమాతో ఉంటూ వచ్చారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన కొద్దీ సేపటికే విధాన సౌధ వద్ద నిరసన దీక్ష జరుపుతున్న కాంగ్రెస్ వారి వద్దకు స్వయంగా దేవెగౌడ రావడం, సిద్దరామయ్య పక్కనే కూర్చోవడం, ఇద్దరు సమాలోచనలు జరపడం అందరికీ విస్మయం కలిగించింది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు రావని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం సమయంలోనే గ్రహించారు.
సిద్దరామయ్య కారణంగా దేవగోడతో సంబంధాలకు ఇబ్బంది కలుగవచ్చని ముందుగానే సహచర పార్టీ నాయకులను హెచ్చరించారు. కర్ణాటక హంగ్ అసెంబ్లీ వైపు వెడుతున్నట్లు గమనించిన వెంటనే ప్రియాంక గాంధీ తన అన్న రాహుల్ తో మాట్లాడి దేవెగౌడ మద్దతు కోసం పధకం రచించారు. బెంగళూరులో ఉన్న గులాం నబీ ఆజాద్ వెంటనే కుమారస్వామి, దేవెగౌడలతో ఫోన్ లో మాట్లాడారు. మరి కొద్దీ నిముషాలకే సోనియా గాంధీ స్వయంగా వారిద్దరితో ఫోన్‌లో మాట్లాడారు. గోవా, మణిపూర్‌లలో కొంచెం ఆలస్యం చేయడంతో బిజెపి అవకాశంగా తీసుకొన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కాంగ్రెస్ వేగంగా అడుగులు వేయడం బిజెపికి షాక్ కలిగించింది.
కేవలం 37 సీట్లు గెలుపొందిన పార్టీకి 78 సీట్లు పొందిన పార్టీగా ముఖ్యమంత్రి పదవిని బేషరతుగా ఇవ్వజూపడం ద్వారా కాంగ్రెస్ దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు ఒక గొప్ప సందేశం పంపింది. ఈ సందేశమే 2019 ఎన్నికలలో బిజెపి పాలిట సంకటంగా మారే ప్రమాదం లేకపోలేదు. బిజెపిని ఓడించడం కోసం కాంగ్రెస్ ఇంకేమాత్రం పెద్దన్న పాత్ర వహింపబోదని, బిజెపికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలబెట్టడం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమనే సంకేతం ఇచ్చినట్టయ్యింది. ఇపుడు కుమారస్వామికి మమత, అఖిలేశ్, చంద్రబాబు,కేసీఆర్, పినరయ్ విజయన్ వంటి వారంతా మద్దతు తెలుపుతున్నారు. అంటే 2019 ఎన్నికల్లో ఇతర ప్రాంతీయ పార్టీలతో కలసి (నాయకత్వం కోరుకోకుండా, ప్రధాని పదవి కోసం పట్టుబట్టకుండా) నడవడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని రాహుల్ ఇచ్చినట్టయ్యింది. ఇప్పటికే యూపీలో ఆ ప్రయోగం చేసి కొంత విజయం సాధించారు. అక్కడ ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డి మరి కొన్ని పార్టీలు ఒకటవుతాయి. ఈ పార్టీలు కలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు యూపీ నుంచి రెండంకెల సీట్లు కూడా కష్టమని భావిస్తున్నారు. కర్నాటకలో ఇకముందు కాంగ్రెస్,జేడీఎస్ జత కడితే- వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఆరు సీట్లను మాత్రం గెలిచే అవకాశం ఉంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 31శాతం ఓట్లను సాధించి మోదీ ప్రధాని పదవిని చేపట్టారు. అప్పట్లో ఇతర పక్షాల మధ్య వైరుధ్యాలు భాజపాకు వరంలా మారాయి. కర్నాటకలో భాజపా నేతల వైఫల్యాల వల్లే ఆ పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు దక్కలేదు. కాంగ్రెస్, జేడీఎస్‌లు చేతులు కలపాల్సిన అవకాశాన్ని భాజపా ఇచ్చిందనే చెప్పాలి. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి చోట్ల తప్ప మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధిక స్థానాల్లో పోటీ చేసేలా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవల్సి ఉంటుంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలకు మించి పోటీ చేసే అవకాశం ఉండదు. భాజపా వ్యతిరేక పక్షాలన్నీ కాంగ్రెస్‌తో చేతులు కలిపితే 2019 నాటికి రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాలకు భాజపా వేసే ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.

- చలసాని నరేంద్ర 98495 69050