మెయిన్ ఫీచర్

ఆరోగ్యయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.....

నేటి ఉరుకుల, పరుగుల జీవితంలో కాలానికి పోటీపడుతూ, ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునేవరకు క్షణం తీరిక లేకుండా లక్ష్యం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో శారీరక అలసటకు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ ఒత్తిడి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు.. భారతదేశం పురుష ప్రధాన దేశం. సంఖ్యలో సగం, ఆకాశంలో సగం ఉన్నా, మన సమాజంలో స్ర్తీలకంటే పురుషులకే పా ధాన్యం ఎక్కువ. ఇక హక్కులు, అధికారాల విషయం అందరికీ తెలిసిందే.. ఒక మహిళ సాధారణంగా ఇంట్లో పనులన్నింటినీ చేసి భర్తను ఆఫీసుకి, పిల్లలను పాఠశాలలకి పంపించి తను ఆఫీసుకు వెళుతుంది. అక్కడ తను విధులను పూర్తిచేసుకుని ఇంటికి చేరుకుని తిరిగి ఇంటిపనుల్లో మునిగిపోతుంది. ఇలా మహిళ ఇంట్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించాలి. ఆఫీసులో ఎక్కడా ఎలాంటి లోటూ కనిపించకుండా సమర్థంగా పనిచేయగలగాలి. పిల్లలను చక్కగా చదివించాలి. వారికి సంబంధించిన అన్ని బాధ్యతల్ని ప్రేమగా, ఓర్పుగా నిర్వహించాలి. అధికపని, శారీరక అలసట వల్ల కలిగే చిరాకు, కోపం వంటి వాటిని వారు ఇతరులపై చూపించలేరు. వాటిని తమలోనే తొక్కి పెట్టడం వల్ల ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు నేటి మహిళలు. ఈ ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యం, ఊబకాయం, డయాబెటిస్, థైరాయిడ్, గైనిక్ సమస్యలు.. ఇలా ఎన్నో రకాల సమస్యలు.. అలా కాకుండా మనలోని ఒత్తిడిని బయటకు పంపిస్తే ఇలాంటి అనారోగ్య సమస్యలేవీ దరిచేరవు. మరి ఒత్తిడిని బయటకు పంపించడమెలా? అని బుర్రలు బద్ధలు కొట్టుకోవాల్సిన పనిలేదు. ఒత్తిడిని చిత్తుచేసేందుకు యోగా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇటీవలి కాలంలో ఒత్తిడిని దరిచేరనివ్వకుండా యోగాను ఆశ్రయించే మహిళల సంఖ్య పెరుగుతోంది. భారత ప్ర భుత్వం చొరవతో యోగా ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహిళలు ఎదుర్కొనే ప్రతి ఆరోగ్య సమస్యకు ప్రత్యేకమైన యోగాసనాలు చేయడం ద్వారా ఆ వ్యాధుల నుండి బయటపడొచ్చని చెబుతోంది ప్రముఖ యోగా గురువు మంజరి. అవేంటో చూద్దాం!
ఊబకాయం
ఊబకాయం నేటి మహిళల ప్రధానసమస్య. పెళ్లికాకముందు, పెళ్లి అయిన కొత్తలో ఎంతో అందంగా, కోమలంగా ఉండే అమ్మాయిలు ఇద్దరు పిల్లలు పుట్టగానే వారి రూపం మారిపోతుంది. చిన్నవయస్సులోనే వయసు మళ్లిన వారిలా కనిపిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి సూర్యనమస్కారాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని రోజుకి వంద నుండి రెండు వందల సార్లు చేయనవసరం లేదు. రోజుకి పది నుండి ఇరవై సార్లు చేస్తే సరిపోతుంది. సమయం లేనివారు ఉదయం పది, సాయంత్రం పదిగా విభజించుకుంటే సమయానుకూలంగా సరిపోతుంది. సూర్య నమస్కారాల వల్ల శరీరంలోని ప్రతి భాగమూ కదులుతుంది. ఫలితంగా శరీర భాగాల్లో పేరుకున్న కొవ్వు కరగడం మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో పవర్ అని ఒకటి వచ్చింది. అంటే యోగానే ఎక్సర్‌సైజ్‌లా చేస్తూ దాన్ని పవర్ యోగా అంటున్నారు. ఇది చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ నడుము నొప్పి ఉన్నవారిని ఈ యోగా ఇబ్బంది పెడుతుంది.
ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి సూర్యనమస్కారాలతో పాటు నౌకాసనం, పాదహస్తాసనం, ఉత్థానుపాదాసనం, శ్రీలింగముద , కపాలభాతి వంటి ఆసనాలు వేసుకోవచ్చు. వీటితో పాటు భస్ర్తికా ప్రాణాయామం కూడా చేస్తూ ఉండాలి.
థైరాయిడ్
పనితీరుకు..
ఈ మధ్యకాలంలో బీపీ, మధుమేహంలతో పాటుగా థైరాయిడిజం కూడా బాగా పెరిగిపోయింది. కారణం అధిక ఒత్తిడి. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని అన్ని గ్రంథులకు మధ్య సంధానకర్తగా పనిచేస్తుంది. చాలామంది మహిళలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి పెరిగిపోయి థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. ఒత్తిడి వల్ల గ్ర ంథుల మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతిని శ్వాసవేగం పెరిగిపోతుంది. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా అవయవాలకు సరిపడినంత ఆక్సిజన్ లభించదు. హార్మోనుల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది. ఫలితంగా రుతుచక్రం దెబ్బతినడం, ఊబకాయం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి వల్ల కలిగే ఈ సమస్యలను యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. విశుద్ధచక్రాసనం వేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి థైరాయిడ్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. అలాగే ఈ ఆసనం పిట్యూటరీ, ఇతర గ్రంథుల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. దీనితోపాటు సూర్యనమస్కారాలు, విపరీతకర్ణి, నౌకాసనం, మత్య్సాసనం, భ్రమరీ ప్రాణాయామం, అంతర్ముఖ ముద్రలు వేయాలి. ఫలితంగా ఒత్తిడి దరిచేరనివ్వకుండా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.
గైనిక్ సమస్యలు
పీసీఓడీ, సిస్టులు, నీటి బుడగలు వంటి సమస్యల బారిన పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సమస్య వచ్చిన తర్వాత తీసుకునే చికిత్స కన్నా సమస్య రాకుండా చూసుకోవడమే మంచిది. అందుకునే ప్రతినిత్యం సూర్యనమస్కారాలతో పాటు ఉష్ట్రాసనం, భుజంగాసనం, ధనురాసనం, శుప్తగోరక్షాసనం, పక్షిక్రియ, పశ్చిమోత్తాసనం, హలాసనం, చక్రాసనం, సర్వాంగాసనం, నాడీ శోధన ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామాలు ఉపయోగపడతాయి.
వెన్ను సమస్యలు
ఉద్యోగరీత్యాకానీ, ఇంటి పనుల వల్ల కానీ మహిళలు ఎక్కువ సమయం కూర్చునే ఉంటారు. ఫలితంగా వెన్నుపాముపై ఒత్తిడి ఎక్కువ పడుతుంది. పైగా నేడు అన్నీ కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలే కావడంతో చిన్న వయస్సులోనే నడుము నొప్పి, మెడనొప్పి, స్పాండిలైటిస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వీటికి మేరుదండాసనాలు చక్కటి పరిష్కారం. అలాగే మార్జాలాసనం, వాఘ్రాసనం, భుజంగాసనాలు ఉత్తమమైనవి. కొన్ని రకాల ముద్రల వల్ల కూడా వెన్ను సమస్యలు తీరుతాయి. అంటే పృష్ణ ముద్ర, మేరు దండ ముద్రల్లాంటివి అన్నమాట.
రక్తపోటు
ఈకాలంలో బీపీ అనేది కామన్ అయిపోయింది. పద్దెనిమిదేళ్ళు మొదలుకొని ఏ వయస్సు వారైనా దీని బారిన పడొచ్చు. కాబట్టి చిన్నవయస్సు నుండే ఒత్తిడికి లోనుకాకుండా సూర్యనమస్కారాలను చేయాలి. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి. భుజంగాసనం కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది.
మధుమేహం
రక్తంలో ఇన్సులిన్ శాతం పెరగడం వల్ల మధుమేహం వస్తుందని అందరికీ తెలిసిందే. రక్తపోటు, ఇదీ జంట జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులు. మధుమేహానికి ప్రధాన కారణం క్లోమగ్రంథిపై ఒత్తిడి ప్ర భావం పడటమే.. దీనివల్ల క్లోమగ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తిపై నియంత్రణను కోల్పోతుంది. డయాబెటిస్ రావడానికి కారణమవుతుంది. రక్తంలోకి విడుదలయ్యే ఇన్సులిన్‌ను నియంత్రించడానికి కూడా కొన్ని యోగసనాలున్నాయి. అర్థమత్స్యేంద్రాసనం, మండూకాసనం, పశ్చిమోత్తాసనం, వక్రాసనంతో పాటుగా సూర్యనమస్కారాలు కూడా చేయాలి. అనులోమ, విలోమ ప్రాణాయామాలు చేయడం వల్ల మధుమేహాన్ని అదుపు చేయవచ్చు.

గర్భిణులకు..
కడుపుతో ఉన్నా ఉద్యోగాలకు వెళుతూనే ఉన్నారు నేటి మహిళలు. ఈ సమయంలో హార్మోన్ల ఇన్‌బాలెన్స్, కార్యాలయంలో పని, ఇంట్లో పని, వాంతుల వల్ల మహిళ ఒత్తిడికి గురవుతోంది. ఈ ప్రభావం బిడ్డపై పడే అవకాశం ఎక్కువ. అందుకని గర్భం దాల్చిన మొదటినెల నుండే డాక్టరు, యోగా గురువు ఆధ్వర్యంలో యోగాసనాలు వేయడం చాలా మంచిది. వీరు మార్జాలాసనం, త్రికోణాసనం, పార్శ్వకోణాసనం, ఉత్క్ఠాసనం, విపరీత పవన ముక్తాసనం, వృక్షాసనంతో పాటు ప్రణవ ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం, సరళ ప్రాణాయామం వంటివి చేయాలి. ఫలితంగా గర్భం దాల్చినప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలు, ఒత్తిడులను తగ్గించుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ కేవలం యోగా నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి సుమా!

ప్రసవం తర్వాత
ప్రసవం తర్వాత మహిళ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. చాలామంది మహిళలు తమ శరీరాన్ని పూర్వ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. దీనికి యోగా బాగా సహకరిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి! సుఖ ప్రసవం జరిగిన వారు మూడు నెలల తరువాత, సిజేరియన్ జరిగినవారు ఐదు నెలల తర్వాత మాత్రమే యోగాను చేయడం మొదలుపెట్టాలి. ముందు డాక్టరును సంప్రదించిన తరువాతే యోగాను ప్రారంభించాలి. వారు ఒప్పుకుంటే యోగా నిపుణుల సహాయంతో వ్యాఘ్రాసనం, శలభాసనం, ఉష్ట్రాసనం పాదోత్తాసనం, సేతు బంధాసనం, ధనురాసనం, భుజంగాసనం వంటివి చేయడం వల్ల శరీరం పూర్వస్థితిని సంతరించుకుంటుంది.
ఇలా యోగాను క్రమం తప్పకుండా చేయడం వల్ల మహిళలు తమ శరీరంలోకి ప్రవేశించనున్న వ్యాధులను ముందుగానే తరిమేయవచ్చు. ఒత్తిడి దరిచేరనివ్వకుండా యోగా నిపుణుల సలహాలు, సూచనలతో యోగాసనాల సాధన చేస్తూ అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటూ మహిళలు ఇంకా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ..

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి