మెయిన్ ఫీచర్

సద్బుద్ధినిచ్చే సంధ్యా దేవత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాభి హృత్కంఠ రసన నాసాదుల యందు
ధర ఋక్సామాదులలో వరగాయత్రీ హృదయమున...
-నాదయోగి త్యాగరాజస్వామి
అగ్నిరూపుడు, తేజోరూపుడు అయిన పరబ్రహ్మలోనున్న శక్తి, జలరూపముగా ప్రాదుర్భవించింది. ఆ శక్తికి సంబంధించిన సత్వ రజస్తమో గుణములే- ‘్భర్భువస్సువః’ అనే మూడు వ్యాహృతులుగా భాసించినాయి. ఆ శక్తియే గాయత్రీమాత.
ప్రాణవాయువు, అగ్ని సంయోగము చేత, ఇంద్రియాధిష్టాతమైన దేవతలచే వాక్కు, నాదముగా సృజింపబడింది. అది వ్యవహార యోగ్యమగునట్లు ‘అ’కారాది స్వర రూపమునొంది, ప్రణవనాదముగా ఉద్భవిస్తుంది. అకార, ఉకార మకారములు- మూడక్షరముల కలయికతో ఓంకార ప్రణవనాదము ఏర్పడుతుంది. ఆ ప్రణవనాదమే వేదపురాణాగమ శాస్త్రాదులకు ఆధారం. ‘అగ్ని’ అధిదేవత అయిన నాదం- వేదాలకు ఆధారమయితే, శబ్దతః అర్థతః నిత్యములైనవి వేదములు. వేదమాత ‘గాయత్రి’. గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరించేటపుడు నిశితంగా దర్శిస్తూ ఆ మంత్రంలో, స, రి, గ, మ, ప, ద, ని సంగీత సప్తస్వర సుందరులు గోచరిస్తారని పేర్కొంటూ గాయత్రీ మంత్ర విశిష్టతను, జగన్మోహినీ రాగ కీర్తనలో అద్భుతంగా వివరించాడు- నాదయోగి సద్గురు శ్రీ త్యాగరాజస్వామి.
దీర్ఘాయుష్షు, సత్సంతానం, గోవులు కీర్తి ద్రవ్యము, బ్రహ్మవర్చస్సు ప్రసాదించి అంత్యమున మోక్షమును అనుగ్రహించు కరుణామయి గాయత్రీ మాత అని అధర్వణవేదం పేర్కొన్నది.
స్వార్థరహితంగా, అందరి యోగక్షేమముల కొరకు శక్తి ఆరాధన, మంత్రజపం, ఉపాసనా చేయాలనే సద్బుద్ధినిచ్చే తల్లి గాయత్రీమాత.
గాయత్రీ మంత్రంలోని ఇరువది నాల్గు అక్షరములను, మూడు భాగములుగా చేస్తే, ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు- సృష్టి స్థితి లయలకు సూచితం. మొదటి ఖండం ఋగ్వేదం, రెండవది సామవేదం, తృతీయ ఖండం- యజుర్వేదం అవుతాయి. ఇది వేద మాత గాయత్రీ మంత్ర అంతరార్థం.
కాలమే ‘కాళి’. సూర్యచంద్రులు కాలానికి సారథులు. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనస్సుకు అధిపతి. కాల కళా స్వరూపిణి- జగన్మాత. ప్రపంచానికే ప్రాణమయిన కాలస్వరూపిణిగా వెలుగొందుతుంది. సంధ్యా దేవత గాయత్రి. చారు రూపంలో చంద్ర మండలంలో, భైరవాకారంలో సూర్య మండలంలో ఉండి ‘చంద్ర సూర్యాగ్ని సర్వాభా..’గా వెలుగొందే జగన్మాత గాయత్రి.
వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రీ మంత్రాక్షరాన్ని చేర్చి యిరువది నాలుగువేల శ్లోకాలతో శ్రీమద్రామాయణాన్ని రచించాడు. గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణం సర్వశక్తి సమన్వితమయి, కల్యాణప్రదమయింది. అందుకనే ఇహ పర సాధకమయి, జీవన్ముక్తికి సోపానమయింది- శ్రీరామకథ.
గాయత్రీ మహా మంత్రం- జ్ఞాన సముపార్జనకు ప్రార్థించటం జరుగుతుంది. గాయత్రీ దేవి దర్శన మాత్రంగా, తనలోని అహంకారము అసూయను తొలగించుకొని, విశ్వరథుడు, విశ్వకళ్యాణద్రష్ట అయిన విశ్వామిత్రుడైనాడు. ఎవ్వరూ సాధించలేని సర్వశక్తులను ఆ గాయత్రీ మాత అనుగ్రహంతో పొంది, వాటిని లోకోపకారమునకు వినియోగించి ధన్యత నొంది, శ్రీరామచంద్రుని కృతముగా లోక కల్యాణం గావించాడు- బ్రహ్మర్షి విశ్వామిత్రుడు.
ఓంకారంతో ఆరంభించి, భూః భువః సువః మహః జనః తపః సత్యం- సప్త వ్యాహృతులతో సప్తలోకాల సంపద ఇమిడి యున్నది. పగలు- రాత్రి, వెలుగు-చీకటి, జాగృతి-సుషుప్తి, వీటికి సంబంధియైన సంధ్యలో గాయత్రి ప్రవేశిస్తుంది. ‘గతా భగవతీ రాత్రిః’ అహశ్శివముపస్థితం’ అని సాంధ్యా రాగంలోని శివ శక్తి సాయుజ్యం దర్శనమవుతుంది. ఉదయం సాయంత్రం సంధ్య వెలుగు గోచరించగానే, గూళ్లలోని పక్షులు సహితం, గలగలా ధ్వని చేస్తూ సంధ్యదేవిని కిలకిలారావంతో కీర్తిస్తాయి. సర్వుల హృదయాలను ఉద్దీపింపచేసే సమయం సంధ్యా సమయం. సంధ్య దేవత గాయత్రి.
‘న గాయత్య్రాః పరమం మంత్రం నీమాతుః పరదైవతమ్’ గాయత్రికి మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దేవత లేదన్నది దివ్యసూక్తి. ‘గాయత్రీ ఛందసా మహమ్’ అని ఋక్కులలో గాయత్రీ మంత్రమును నేనని భగవద్గీత పదవ అధ్యాయంలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించడంలో గాయత్రీ మహిమ విశేషం విశదమవుతుంది.
కాలచక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు- సూర్యుడు. చండ మార్తాండ మండల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి, సూర్యునికి కూడా సత్తాస్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్య రూపిణి గాయత్రి.
ప్రత్యక్ష కర్మ సాక్షి సూర్యభగవానుడు. మనకంటికి కనిపించే ఈ భౌతిక ప్రకాశమే ఆయన భర్గస్సు. ‘సవిత’ అంటే మానవబుద్ధి. బుద్ధిలో ప్రతిఫలించే జ్ఞాన తేజః కిరణాలే- భర్గస్సు. ‘సవిత’ అంటే పరబ్రహ్మ స్వరూపం. చైతన్యవంతమైన నామరూపాది రుూ విశ్వమే- భర్గస్సు. అదే శక్తి స్వరూపం. ఆ శక్తే గాయత్రీమాత. ప్రాణుల దేహ గోళములందు కుండలినీ శక్తిగా మూలాధారాది షట్చక్రములలో ఉంటుంది. ప్రాతఃకాలంలో కుండలినీ శక్తితో సవితృ తేజస్సును ధ్యానించినా జపించినా, విశ్వ కళ్యాణం జరుగుతుంది. ఇది గాయత్రీమాత సర్వజనావళికి యిచ్చే రక్ష.
గాయత్రీ మంత్రం సూర్యపరంగా ఉంటుంది, కాని ఉపాస్య దేవత గాయత్రి. సూర్యశక్తిని గాయత్రీ మంత్రం ద్వారా జపించి, ఆదిత్యుని గాయత్రీ తత్త్వంలో ఆరాధిస్తే, ఉపాసిస్తే- ఆరోగ్యప్రదం మోక్షప్రదం.
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నపుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులొస్తాయి. అవి మానవ శరీరం మీదా, మనస్సుమీదా ప్రభావం చూపుతాయి. అయితే పుట్టినవాడు ఏ రాశిలో సూర్యుడు ఉన్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. స్థితికారకుడైన విష్ణుమూర్తి నాభి కమలం నుండే జనించాడు- సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. అలాగే, గర్భస్థ శిశువు నాభి, తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువుకు ప్రాణశక్తినిచ్చేది. బయటకు వచ్చిన తరువాత వేరు చేస్తారు. వేరవగానే సూర్యశక్తి ప్రాణశక్తిగా పుట్టిన పిల్లవానికి సమకూరుతుంది. ఈ శక్తియే గాయత్రీమాత.
రోజూ మూడుసార్లు త్రిసంధ్యావేళల్లో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యా దేవతే గాయత్రిమాత.
శ్రీదేవీ శరన్నవరాత్రుత్సవములలో, శ్రీ దుర్గా సప్తశతీ పారాయణ ముఖ్యంగా చేస్తారు. ఇది గాయత్రీ మంత్ర స్వరూప, తత్త్వమే. గాయత్రీ మంత్రంలోని మూడు పాదములు, శ్రీ దుర్గా సప్తశతిలోని మూడు చరిత్రలకు స్ఫూర్తి. గాయత్రీ మంత్రంలోని మొదటి చరణమైన ‘తత్సవితుర్వరేణ్యం’- శ్రీ దుర్గా సప్తశతిలోని మొదటిభాగం. దానికి అధిష్ఠాన దేవత- మహాకాళి. కాళి - కాల స్వరూపం. అన్నీ కాలంలోంచి ప్రభవించి, ప్రళయకాలంలో లయమవుతాయి. గాయత్రీ మంత్రంలోని ప్రథమ పాదాన్ని సాధకుడు సంపూర్ణంగా తెలిసికుంటే ఆధ్యాత్మిక సూర్యోదయం కలిగి, ప్రతి ప్రభావం ఒక సుప్రభాతం అవుతుంది.
గాయత్రీ మంత్రంలోని రెండవ పాదం ‘్భర్గోదేవస్య ధీమహి’ అన్నదానికి, శ్రీ దుర్గాదేవీ సప్తశతిలో, రెండవ చరిత్రలో ఉన్నది. దీనికి అధిష్ఠాన దేవత- శ్రీ మహాలక్ష్మి, స్థితికర్తయైన విష్ణుపత్ని. భక్తులు పోషణా సామర్థ్యం కలిగి, విజ్ఞానం, ఐశ్వర్యం సత్వగుణ సంపత్తి ప్రాప్తిస్తాయి. అనుదినం, సుదినమవుతుంది.
గాయత్రీ మంత్రం యొక్క మూడవ చరణం ‘్ధయోయోనః ప్రచోదయాత్’- దీని వివరణ శ్రీ దేవీ సప్తవతిలోని మూడవ చరిత్రలో విశదీకరింపబడింది. దీనికి మహాసరస్వతి అధిష్ఠాన దేవత. ‘నేనెవరు?’ అనేదానికి సంపూర్ణమైన అర్థాన్ని తెలిసికోగలుగుతాడు- భక్తుడు. హృదయంలో సూర్యచంద్రుల ప్రకాశం ఎప్పుడూ ఉంటుంది. బాహ్య ప్రపంచంలో సూర్యచంద్రులు కలిసి కాని, గాయత్రీ ఉపాసకులకు సూర్యచంద్రులిద్దరూ ఎప్పుడూ కలిసి ఉంటారు. ఇది మహోదాత్తమైన గాయత్రీ ఆరాధనా విశేషం.
‘‘విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయ జననీ
త్వమర్థానాం మూలం ధనద నమనీ యాంఘ్రికమలే
త్వమాదిః కామానాం జనని కృత కందర్ప విజయే
సతాం ముక్తేర్బీజం త్వమసి పరబ్రహ్మ మహిషే
-ఆనందలహరి
తల్లీ వేదమాతా... నీవు వేద ధర్మాలను విధించు జగన్మాతవు. అఖిల ధర్మాలకు మూలం వేదములు. ‘వేదో ఖిలో ధర్మమూలం..’ వేద మాతవు నీవే. అనగా గాయత్రీ మాతవు. మా బుద్ధులను చక్కగా వికసింపజెయ్యి; ధర్మబుద్ధిని ప్రసాదించు. ధర్మబుద్ధి కోసం నిన్ను అర్చిస్తాను, ఉపాసిస్తాను. మొదటి పాదం ధర్మాన్ని రెండవ పాదం అర్థాన్ని, మూడవ పాదం, కామాన్ని, నాల్గవ పాదం మోక్ష పురుషార్థాన్ని ప్రతిబింబిస్తోంది. చతుర్విధ పురుషార్థాల్ని కటాక్షించి, ధర్మంతో అర్థ, కామాల్ని అనుభవిస్తే మోక్షం లభిస్తుందని గాయత్రీమాత విశేషాన్ని, ఆదిశంకరాచార్యులవారు వేదమాత గాయత్రిని స్తుతిస్తూ ఆనంద లహరిలో మనకందించిన శ్లోకం, గాయత్రీ మాత పూజకు స్ఫూర్తినిస్తుంది.
‘సంధ్యా దేవీం, సావిత్రీం, వరగాయత్రీం, సరస్వతీం భజేహం..’- సంధికాలములు మూడు. ప్రాతఃకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము. ఇదే జీవితములో జన్మ, మధ్యమ, అస్తమయ కాలములు. సంధ్యా సమయంలో ప్రకృతిలో ఒక తెలియని ‘శక్తి’ అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో చేసిన జప ధ్యానాదులు విశేష ఫలితాల్నిస్తాయి. ఉదయం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయం సమయంలో సరస్వతీ రూపంలో ధ్యానిస్తారు అని సంధ్యాదేవత గాయత్రీ మాతను గురించి, దేవక్రియ రాగంలో, హృద్యంగా వర్ణించాడు ముత్తుస్వామి దీక్షితులు. ఇది వేదమాత, సంధ్యాదేవి గాయత్రీ పూజకు దీప్తినిస్తుంది.
కాల స్వరూపాన్ని ప్రాముఖ్యాన్ని తెలిసికొని, సకాలంలో సత్కార్యాల్ని ఆచరించి సత్ఫలితాలు పొంది, ఫలసిద్ధిని లోక కళ్యాణానికి ఉపకరించాలని హెచ్చరిస్తోంది- సంధ్యాదేవత గాయత్రీమాత.

-పసుమర్తి కామేశ్వర శర్మ 94407 37464