మెయన్ ఫీచర్

ఉత్తరాంధ్ర ఎజెండా ఇదీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధి పట్ల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్న నేరమయ నిర్లక్ష్యం పట్ల ఈ ప్రాంతాల ప్రజలలో నానాటికీ అసహనం పెరుగుతోంది. నేతలు మాటలే తప్ప చేతలలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదనే ఆగ్రహం జనంలో వ్యక్తం అవుతున్నది. హామీల వర్షం కురిపించడం తప్ప ఆచరణలో పట్టించుకొనక పోవడం పట్ల ఆవేదన కలుగుతున్నది. ఇప్పటికైనా ప్రజల ఆవేదనను, ఆగ్రహాన్ని అర్థం చేసుకొని కనీసం ప్రస్తుత ఎన్నికల సందర్భంగా వారు లేవనెత్తుతున్న అంశాలను తమ ఎన్నికల ప్రణాళికలలో చేర్చేందుకు రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి. లేని పక్షంలో సమీప భవిష్యత్‌లోనే ఈ ప్రాంతాల ప్రజలలో చెలరేగుతున్న అసంతృప్తి తీవ్రమైన నిర్ణయాలు తీసుకొనే దిశకు మారే ప్రమాదం లేకపోలేదు.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలు అనడంలో ఎవ్వరికీ సందేహం ఉండనవసరం లేదు. పుష్కలమైన సహజ వనరులు ఉన్నప్పటికీ వెనుకబడి ఉండటం, కనీసం వౌలిక సదుపాయాలకు నోచుకోలేకపోవడం ఈ ప్రాంత ప్రజల దుస్థితి. ఈ విషయానే్న గతంలో శ్రీకృష్ణ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది. అయితే రాష్ట్రంలో జరిగిన అన్యాయం, నిర్లక్ష్యం అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగుతున్నది. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఉత్తరాంధ్ర ‘ఉత్త ఆంధ్ర’గా మారిపోయే ప్రమాదం ఉన్నది.
ఈ వివక్షను నివారించి వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించవలసిన సమయం ఆసన్నమైనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దారితీసిన ‘నీళ్లు, నియామకాలు, నిధుల’ విషయాలలో ఆ రాష్ట్రం కన్నా ఎన్నోరెట్లు తీరని అన్యాయం ఈ ప్రాంతానికి జరుగుతోంది.
ఉత్తరాంధ్ర నుండి కొనసాగుతున్న వలసలను అరికట్టే ప్రయత్నాలే జరగడం లేదు. మొత్తం 24 లక్షల ఎకరాల సాగు భూములు ఉండగా 8 లక్షల ఎకరాలకు మించి సాగునీటి వసతి లేదు. కనీసం ఒక్క పంటకైనా మొత్తం వ్యవసాయ భూములకు సాగు వసతి కల్పించడం కోసం నిర్దిష్ట కార్యాచరణ పథకాలను చేపట్టాలి. అదే విధంగా మిగతా రంగాలలో ఈ ప్రాంత ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు.
‘ఉత్తరాంధ్ర ఎజెండా-2019 ఎన్నికలు’ అనే అంశంపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ‘ఉత్తరాంధ్ర చర్చావేదిక’ ఆధ్వర్యంలో సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసాము. ఒక అజెండాను తయారుచేసి అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చాము. తమ తమ ఎన్నికల ప్రణాళికలలో వాటిని పొందుపరచమని కోరాము. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమి చేయాలో సూచించడం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా విశేషంగా కృషిచేస్తున్న నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటుచేసాము.
ఈ కమిటీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ కె.ఎస్.చలం వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీ రమణ, మాజీ ఎంపీ డా.శంకరరావు, రిటైర్డ్ ఇంజనీర్ సత్యనారాయణ, నన్నయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముత్యాల నాయుడు ఉన్నారు. ఈ నిపుణుల కమిటీ త్వరలోనే ఒక నివేదికను, ఉత్తరాంధ్ర డిక్లరేషన్‌ను రూపొందిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలకు అందజేస్తాము.
ముఖ్యంగా నిధులు, నీళ్లు, నియామకాలలో ఉత్తరాంధ్రకు నిర్దిష్టమైన వాటాను కేటాయించవలసి ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో 15నుండి 20 శాతం నిధులను ఉత్తరాంధ్రకు కేటాయించాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ఖండ్, బోలంగీర్-కలహండి-కోరాపుట్ తరహా ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న విధంగా ఈ రెండు ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తిగల అభివృద్ధి మండళ్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. విద్య, ఉపాధి తదితర రంగాలలో స్థానికుల హక్కులను కాపాడాలి. అందుకోసం వారికి తగిన రిజర్వేషన్లను కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసి ఈ ప్రాంతంలోఉన్న స్థానికులు, స్థానికేతరుల సంఖ్యను ముందుగా తేల్చాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
విశాఖపట్నంలో పూర్తిస్థాయి రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో, లాభదాయకంగా పనిచేసేందుకు వీలుగా క్యాప్టివ్‌మైన్‌లను ఏర్పారచాలి. హైకోర్ట్ బెంచ్‌ని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలి. ఉత్తరాంధ్ర భాష, పలుకుబడి, సంస్కృతి వంటివి పరిరక్షించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఉత్తరాంధ్ర భాష, యాసలను కించపరిచే విధంగా వస్తున్న సినిమాల, ఇతర ప్రచార, ప్రసార మాధ్యమాలపై తగుచర్యలు తీసుకోవాలి.
2012లో ప్రకటించిన అరకు గిరిజన డిక్లరేషన్‌ను పూర్తిగా అమలుచేయడం కోసం తక్షణమే తగు చర్యలు చేపట్టాలి. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు ఉత్తరాంధ్రలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని తక్షణమే ఏర్పాటుచేయాలి. గిరిజనుల వనరులను కొల్లగొట్టకుండా తగు చర్యలు తీసుకోవాలి. అటవీ హక్కుల చట్టం పూర్తిగా అమలు చేసేలా పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుచేయాలి. ఈ చట్టం ప్రకారం గిరిజనుల భూముల హక్కులకు సంబంధించిన వివాదాలన్నింటినీ సానుకూలంగా తక్షణం పరిష్కరించాలి. గిరిజనులు రోగాల బారిన పడి మరణించకుండా వైద్య సేవలను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలి.
మత్స్యకారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి. ముఖ్యంగా వారికి కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీనపరచుకొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉత్తరాంధ్రలో రెల్లి కులస్థులు అధిక శాతంలో ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం రెల్లి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాలి. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను వెనుకకు తీసుకోవాలి. భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
విశాఖపట్నం వంటి చోట్ల ఇతర ప్రాంతాల నుండి వచ్చిన రాజకీయ నాయకులకే సీట్లలో అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దానితో స్థానిక ప్రజల మనోభావాలను, ఈ ప్రాంత అభివృద్ధి అవసరాలను వారు పట్టించుకోవడంలేదు. అందుకనే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు స్థానికులకే సీట్లుఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.
విశాఖలోని విమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్ వలే అభివృద్ధి చేయాలి. విశాఖ మెట్రోరైల్ పనులను వెంటనే చేపట్టాలి. విశాఖపట్నం ప్రముఖ పారిశ్రామిక కేంద్రం కూడా కావడంతో ఈ ప్రాంతం మరో భోపాల్ కాకుండా పర్యావరణ పరిరక్షణకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. విశాఖ సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనులు నత్తనడకలోనే జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను సత్వరం పూర్తిచేయడం కోసం సంవత్సరానికి కనీసం రూ.5,000 కోట్లు నిధులను కేటాయించాలి. గోదావరి, మహానదుల అనుసంధానం చేసి, ఈ ప్రాంతానికి న్యాయమైన నీటి వనరులను కేటాయించాలి. వంశధార, జంఝావతి, బాహుదా నదులతో పాటు ఉత్తరాంధ్రలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు అన్నింటిని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను చేపట్టాలి.
ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఒడిశా రాష్ట్రంతో ఉన్న జలవివాదాలను సత్వరం పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు వెంటనే ప్రారంభించాలి. విశాఖ పోర్ట్‌కు అనుబంధంగా భావనపాడు, నక్కపల్లిల్లో శాటిలైట్ పోర్ట్‌లను నిర్మించాలి. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను వెంటనే కల్పించాలి. పోలవరం ప్రాజెక్ట్‌ను సత్వరం పూర్తిచేయడానికి తగుచర్యలు తీసుకోవడంతోపాటు నిర్వాసితులకు తగు పరిహారం, పునరావాసం పనులను సత్వరం చేపట్టాలి. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కావు. న్యాయబద్ధమైనవి. సహేతుకమైనవి. చట్టబద్ధమైనవి. కాబట్టి వీటిని తమతమ ఎన్నికల ప్రణాళికలలో జోడించడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధిని, నిజాయితీని ప్రకటించడంలో అన్ని రాజకీయ పార్టీలు ముందడుగు అడుగువేయాలని కోరుతున్నాము.

-కొణతాల రామకృష్ణ కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చావేదిక