మెయన్ ఫీచర్

ముఖ్యమంత్రుల ‘ఇంటి’ ముచ్చట్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు నుంచి హైదరా బాదుకు మారగానేఆయన మొదట్లో ప్రస్తుతం రాజభవన్ పక్కన ఉన్న దిల్‌కుష భవనంలో ఉండేవారు. ‘కర్నూలు రాజధానిలో డేరాలు వేసుకుని ఉండి వచ్చారు కదా! ఇప్పుడు హైదరాబాదులో జీవితం ఎలా ఉంద’ని ఒక విలేకరి ముఖ్యమంత్రి సంజీవరెడ్డిని అడిగారు. ‘ఏం చెప్పనబ్బా! ఈ ఇల్లు ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా! మా ఆవిడ ఏ గదిలో ఉందో కనుక్కోవడానికి అర గంట పడుతోంది’ అని నవ్వుతూ ఆయన బదులిచ్చారని ఆ నాటి రోజులకి, ఈనాటి కాలానికీ ఒక వారధిలా ఉన్న సీనియర్ పాత్రికేయులు, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు జీ.ఎస్. వరదాచారి మాటల సందర్భంలో చెప్పారు. తరువాతి కాలంలో సంజీవరెడ్డి బేగంపేటలోని గ్రీన్ లాండ్స్‌ప్రభుత్వ అతిధి గృహాన్ని తన అధికార నివా సంగా ఎంచుకున్నారు. ప్రైవేట్ బస్సుల జాతీయకరణ విషయంలో న్యాయస్థానం తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినందుకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేవరకు ఆయన అదే భవనంలో నివాసం ఉన్నారు. ఆయన తర్వాత దామోదరం సంజీవ య్య ముఖ్యమంత్రి అయ్యారు. సంజీవరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు సంజీవయ్య ఖుర్షిద్ జా అనే ఒక ప్రైవేటు భవంతిలో నివాసం ఉండేవారని సంజీవయ్య బావమరది డాక్టర్ సి.బి. శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వైపు వెళ్ళే రహదారిలో ఆ భవంతి ఉండేది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మకాం గ్రీన్‌లాండ్స్ కి మారింది. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాల కారణంగా రెండేళ్ళ తర్వాత సంజీవరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు.
తదుపరి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చాలా రోజులు ప్రస్తుతం విద్యుత్ సౌధకు సమీపంలోని ఏరువాక ప్రభుత్వ భవనంలో ఉండి, ఆ తరువాత బేగంపేటలో గ్రీన్‌లాండ్స్ ఎదురుగా, రోడ్డుకు ఆవలవైపు ఉన్న మరో ప్రభుత్వ భవనాన్ని (ఇప్పుడు మంజీరా గెస్ట్ హౌస్) తన అధికార నివాసంగా ఎంచుకున్నారు. ముఖ్య మంత్రికి శాశ్వత అధికార నివాస భవనం ఉండాలనే బ్రహ్మానందరెడ్డి ఆలోచన ఫలితంగా ఆనంద నిలయం రూపుదాల్చింది. తిరుపతి ఆనంద నిలయం మనసులో ఉందేమో తెలవదు, బ్రహ్మానందరెడ్డి ఆ భవనానికి అదే పేరు పెట్టారు. వాస్తు చూసి ఏర్పాటు చేసుకున్నా ఎక్కువ రోజులు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. రాష్ట్ర విభజన ఉద్యమాల ఫలితంగా ఆయన పదవి నుంచి దిగిపోవడంతో పీవీ నరసింహా రావు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. జై ఆంధ్ర ఉద్యమం కార ణంగా రాజీనామా చేసి తప్పుకునేంతవరకు ఆయన కూడా ఆనంద నిలయంలోనే కొనసాగడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం రాష్ట్రం రాష్టప్రతి పాలనలో ఉంది.
తదనంతరం జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అ య్యారు. అంతకుముందు హోం మంత్రిగా ఉన్న సమ యంలో పంజాగుట్ట ప్రాంతంలోని ద్వారకాపురి కాలనీ లో ముచ్చటపడి కట్టుకున్న చిన్న భవంతిలోనే ఆయన కొనసాగారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన వసతులు లేక, అరకొరగా ఉన్నప్పటికీ చివరి వరకు ఆయన ఆ ఇంట్లోనే కాలక్షేపం చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి వ్యవహార శైలి విభిన్నం. ఆయన తార్నాకలోని సొంత ఇంట్లోనే ఉండి, దానికి అన్నిరకాల హంగులు సమకూర్చుకున్నారు. బహుశా సొంత నివా సాలకు ప్రభుత్వ ఖర్చుతో వసతులు ఏర్పాటు చేసుకునే సాంప్రదాయానికి అప్పుడే బీజం పడిందని అనుకోవాలి. ఆ రోజుల్లో మొత్తం హైదరాబాదులో లిఫ్ట్ సౌకర్యం ఉన్న ప్రైవేటు గృహాలు రెండే ఉండేవని, వాటిల్లో ఒకటి చెన్నారెడ్డి తార్నాక నివాసం అని జనం చెప్పుకునేవారు.
తదుపరి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పరిస్థతి దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయనకు బర్కత్‌పురాలో రెండు గదుల సొంత ఇల్లు ఉండేది. మామూలుగానే చాలా ఇరుకు. ఇక ముఖ్యమంత్రి అయితే ఆ తాకిడి తట్టుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. దాంతో ఆయన గతంలో సంజీవ రెడ్డి నివాసం ఉన్న గ్రీన్‌లాండ్స్ గెస్ట్ హౌస్‌ను అధికార నివాసంగా చేసుకుని, దానికి జయ ప్రజా భవన్ అనే పేరు పెట్టారు. అంజయ్య గారి ఇంటికి సంబంధించి ఒక ఆసక్తికరమైన ముచ్చట చెప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తనయుడు రాజీవ్ గాంధీ విమానాల పైలట్‌గా పనిచేసేవారు. ఓ రోజు ముఖ్యమంత్రి అంజ య్య సచివాలయంలో నలుగురితో మాటామంతీ సా గిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. అంజయ్య గారు తత్తరపడుతూ లేచి, ఉన్నపాటున బర్కత్‌పురాలోని తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య అధికార నివాసం గ్రీన్ లాండ్స్‌కి మకాం మార్చలేదు. బర్కత్‌పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టీ ఆర్ టీ ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా ఉంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా లేవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి టీవీ చానళ్లకు దొరికి ఉంటే పండగే పండగ! రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నారు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు జరిగిన విషయం ఏమిటంటే- రాజీవ్ గాంధీ పైలట్‌గా హైదరాబాదు వచ్చిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం ఉన్నట్టుంది. ఎందుకు అనిపించిందో తెలియదు కాని, ఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్‌లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బర్కత్‌పురాలోని అంజయ్య నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది- ముఖ్యమంత్రి ఆగమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను...!
అంజయ్య తర్వాత ముఖ్యమంత్రి అయిన భవనం వెంకట్రాం మాత్రం తాను అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్‌లోనే ఉండిపోయారు. భవనం వెంకట్రాం తర్వాత ముఖ్యమంత్రి అయిన కోట్ల విజయ భాస్కరరెడ్డి లోగడ పీవీ ముఖ్యమంత్రిగా నివసించిన ఆనంద నిలయానికి మారారు. ఇంతవరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఇంటి ముచ్చట్లు.
ఇక, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు ఆబిడ్స్ లోని తన సొంత ఇంట్లోనే ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అధికార నివాసాలు ఒకటికి మించి గుర్తించి అందుకు తగిన సదుపాయాలు కల్పించే పద్దతి ఆయన హయాంలోనే మొదలైంది. గండిపేటలోని తన ఆశ్రమాన్ని కూడా ఆయన రెండో అధి కార నివాసంగా మార్చుకున్నారు. కొన్నాళ్లు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత- వాస్తు బాగుందని భావించారేమో తెలియదు, బంజారా హోటల్ సమీపంలోని తన కుమార్తె పేరిట ఉన్న ఒక చిన్న భవ నంలో నివాసం ఉన్నారు. పక్కనే ఉన్న మరో భవనాన్ని ప్రభుత్వం అద్దెకు తీసుకుని ముఖ్యమంత్రి అవసరాలకు తగిన విధంగా వసతులు సమకూర్చింది. కేవలం నెల రోజులపాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు జూబిలీ హిల్స్‌లోని తన సొంత ఇంట్లోనే ఉన్నారు. 1995లో ముఖ్యమంత్రి అయిన నారా చంద్ర బాబు నాయుడు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే నివాసం ఉన్నారు. హోదాకు, అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వమే కొన్ని వసతులు సమకూర్చింది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్నిమాసాలపాటు నాగార్జున సొసైటీలోని తన కుమార్తె ఇంట్లో నివాసం ఉన్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత నివాస భవనం ఉండాలనే కాసు బ్రహ్మానంద రెడ్డి ఆలోచనను ఆయన మళ్ళీ ఆచరణలోకి తీసుకువచ్చారు. బేగంపేటలోని మంత్రుల క్వార్టర్స్‌లో కొన్ని భవనాలను తొలగించి, అన్ని వసతులతో కూడిన విశాలమైన ఒక మంచి భవనాన్ని ప్రభుత్వ ఖర్చుతో కొద్ది నెలల కాలంలోనే నిర్మించారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేవరకు వైఎస్ అందులోనే నివాసం ఉన్నారు.
వైఎస్ స్థానంలో ముఖ్యమంత్రి అయిన కొణిజేటి రోశయ్య ఆ భవనంలో చేరడానికి ఇష్టపడలేదు. అమీ ర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయం దాపునే తాను నిర్మించున్న భవంతిలోనే ఉండిపోయారు. ముఖ్య మంత్రిగా రోశయ్య నుంచి బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా కాలం జూబిలీ హిల్స్ లోని సొంత ఇంట్లోనే ఉన్నారు. ఆ తరువాత తన నివాసాన్ని బేగం పేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసానికి మార్చుకున్నారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్నాళ్లు సొంత ఇంట్లో నివసించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్ది కాలం పాటు వైఎస్ హయాంలో నిర్మించిన నివాసంలోనే ఉన్నారు. అక్కడ ఉన్న సోఫాలను కానీ, ఫర్నిచర్‌ను కానీ మార్చకుండా అందులో నివసిం చారని కేసీఆర్ వ్యక్తిగత అధికారులు చెబుతుంటారు. అక్కడే ఉంటూ, పక్కనే కొత్తగా విశాలమైన ఆధునిక వస తులు కలిగిన సీఎం క్యాంపు కార్యాలయ సముదా యాన్ని (ప్రగతి భవన్) ఏర్పాటు చేశారు.
అటు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు- అమరావతి నిర్మాణం అనే భారీ ప్రాజెక్టు భుజాలకు ఎత్తుకోవడం వల్ల నూతన రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అంటూ ఒక అధికార నివాస భవనం ఏర్పాటు చేసుకోలేక పోయారు. అంచేత తాత్కాలికంగా కృష్ణానదీ తీరాన ఒక ప్రైవేటు గెస్టు హౌస్‌ను తన అధికార నివాసంగా మార్చుకున్నారు. దానికి పక్కనే ఉన్న స్థలంలో ప్రజావేదిక పేరుతో ప్రభుత్వమే మరో సదుపాయాన్ని కల్పించింది. అధికారంలో ఉన్నంతకాలం చంద్రబాబు దానే్న తన నివాసంగా ఉపయో గించుకున్నారు. ఇప్పుడదే ఒక వివాదానికి కేంద్ర బిందు వుగా మారింది. ఇందుకు ఓ నేపథ్యం లేకపోలేదు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్న అయిదేళ్లు- కృష్ణానది కరకట్ట మీద అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా కొందరు విలా సవంత మైన భవనాలను నిర్మించారని, ఈ కట్టడాలు పర్యావరణానికి మేలు చేయవనీ, వాటిని తొలగించాలని కోరుతూ వచ్చింది. వైకాపా అధికారంలోకి రాగానే వీటిని కూల్చివేయడం జరుగుతుందని గట్టిగా చెబుతూ వచ్చారు. ఇలా ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే ఆంధ్ర ప్రదేశ్‌లోఅధికార మార్పిడి జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షనేత జగమ్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమిత మయ్యారు.
ఈ దశలో చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి ఒక లేఖ రాశారు. తాను నివాసం ఉంటున్న భవనాన్ని మళ్ళీ కొంతకాలం వాడుకోవడానికి నిర్ణయిం చుకున్నట్టు తెలిపారు. పక్కనే నిర్మించిన ప్రజావేదికను కూడా ప్రతిపక్ష నేత హోదా కలిగిన తనకే కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ ఇంకా కొత్త ముఖ్య మంత్రి దృష్టికి వెళ్లిందో లేదో తెలవదు కానీ మీడియాలో ఇది పెద్ద వివాదాస్పద చర్చనీయాంశంగా తయారయింది. ఒకప్పుడు కరకట్ట మీద నిర్మించిన అక్రమ భవనాలను కూల్చివేయాలని డిమాండ్ చేసిన వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ఇప్పుడు అదే భవనాలలో ఒకదాన్ని చంద్రబాబుకు అధికారికంగా కేటాయిస్తే ఆ అక్రమ కట్టడాన్ని సక్రమ నిర్మాణంగా ప్రభుత్వమే అంగీ కరించినట్టు కాగలదని ఆ పార్టీలోనే కొందరు ఆక్షేపిస్తున్నారు, అభ్యంతర పెడుతున్నారు. ఈ సంద ర్భంలో ఓ పాత సంగతి ప్రస్తావన అసందర్భం కాబోదు.
అప్పుడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. ఒకప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మంత్రుల నివాసాలు అన్నీ ఒకేచోట ఉండాలనే ఉద్దేశంతో బంజారాహిల్స్ రోడ్ నెంబరు పనె్నండులో మంత్రుల నివాస ప్రాంగణాన్ని నిర్మించారు. అందులో ఒక భవనాన్ని ప్రతిపక్షనేతగా తనకు కేటాయించాలని వై.ఎస్. కోరారు. నాటి ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని త్రోసిపుచ్చింది. అప్పటి నిబంధనల ప్రకారం నెలకు పదిహేను వేల రూపాయలకు మించని అద్దె కలిగిన భవనానికి కిరాయి చెల్లిస్తామని తెలియచేసిందని వై.ఎస్. వ్యక్తిగత సహాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన భాస్కర శర్మ చెప్పారు.
ఇప్పుడు పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా ఏర్పాటు అయింది కాబట్టి, జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి ఇంతవరకు ముఖ్యమంత్రుల నివాసాల అంశం ఆసక్తికరంగా సాగుతూనే వస్తోంది. ముఖ్య మంత్రులు మారినప్పుడల్లా వారి నివాసాల మీద ప్రభు త్వాలు ఖర్చు చేసే వ్యయాన్ని తగ్గించే దిశగా ఏమైనా ఆలోచనలు చేస్తే బాగుంటుంది.

-భండారు శ్రీనివాసరావు 98491 30595 http://bhandarusrinivasarao.blogspot.com