మెయిన్ ఫీచర్

స‘కాలమ్’లో స‘కలం-విహారి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

"WRITING COLUMNS- AND GAINING COMPETENCE AND PROFICIENCY-IS A MATTER OF PATIENCE AND PERSEVERANCE. THE ONLY WAY TO PERSIST IS TO LIKE AND LOVE WHAT THEY DO. FOR A COLUMNIST THE JOURNEY IS FAR MORE INTERESING AND FULFILLING THAT THE DESTINATION.''
- LUKE KOELMAN
(DUTCH WRITER & JOURNALIST)
*
అవిరామ కృషి, అభినివేశము అందరికీ పట్టుబడే గుణాలు కాదు. ప్రతిభావంతులు అయినా, కొందరు క్రమరాహిత్యంతో ఉంటారు. కవులు, రచయితలు నిజానికి తమ రచనల ద్వారా సమాజానికి ఒక సరియైన దిశానిర్దేశం చేయగలవారుగా, బాధ్యతాయుతమైన వారిగా పాఠకలోకం భావిస్తూంటుంది. రచయిత రచనను చూసి మాత్రమే పాఠకుడు అభిమానించడు. తద్వారా ఆ రచయిత వ్యక్తిత్వాన్నీ, వ్యక్తిత్వంతో కూడిన వారి రచనల వల్ల కలిగిన ప్రభావాన్నీ అనుసరించి ఆ రచయిత పట్ల గౌరవాదరాలు పెంచుకుంటాడు. అందుకే రచనకూ, జీవితానికీ పొత్తు కుదరని రచయిత తాత్కాలిక కీర్తిప్రతిష్టలు ఆర్జించగలడేమోగానీ, కాలానికి నిలిచే మహనీయునిగా మనలేడు. పాఠకుని వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించేదే ఉపయుక్త రచన. అలాంటి రచనలు చేసేవారే ఉత్తమ రచయితలుగా సార్వకాలికులు కాగలుగుతారు.
పత్రికా రచయిత ఒక నిత్య యాత్రికుడు. అలా నిరంతర అధ్యయనంతో, సమాజమమేకమై, ఏ విషయం మీదనయినా తన సాధికారిక ప్రభావోపేత వ్యాఖ్యనూ, సదసద్వివేచననూ కలిగించగల విషయ వ్యక్తీకరణను చేయగల పట్టు, నిరంతర శ్రమచేయగల రచయితయే ఒక ‘కాలమిస్టు’గా రాణించగలుగుతాడు. అందుకే ఒక రచయిత కాలమిస్టుగా రాణించ గలగడమనేది అందరి విషయంలోనూ సాధ్యంకాదు. అలాంటి విశిష్ట శేముషీ సంపన్నులు విహారిగారు. ‘విహారి’ అన్న కలం పేరున సుప్రతిష్టులయిన శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిగారు తెలుగు సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేసినవారు. ప్రధానంగా ఒక కథకుడుగా ఆయన కీర్తినెరిగిన వారెందరో. కానీ ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదనడం అతిశయోక్తికాదు. కవిగా సంప్రదాయవాదులు సమాదరించే- 6500 పద్యాలలో ‘శ్రీపద చిత్ర రామాయణం’వెలయించారు. అభ్యుదయవాదులు, వచన కవితాభిమానులుమెచ్చే ‘చలనమ్’, ‘కలంకన్ను’, ‘చీకటి నాణెం’, ‘మనం మనం’, ‘‘మధ్య’మా‘గతి’’ వంటి అయిదు కవితా సంకలనాలు వెలువరించారు. ఛందస్సుందర మహాకావ్యంగా రామాయణం రచించినవారే ‘వ్యక్తి-త్వం-వికసనం’ పేరున వినూత్న దీర్ఘ వచన కవితాకావ్యం విరచించారు. సమశ్రుతి, నవతరం, ప్రణయా‘నలం’ అనే మూడు నవలలు రాసారు. ఇప్పటికి ‘స్పృహ’తో మొదలిడి ‘కూకటి’ వరకు పదిహేను కథల సంపుటాలు వెలయించిన కథకునిగా పాఠక జనాదరణకు పాత్రులయ్యారు.
తానొక మహోన్నత కథాభూజంగా విస్తరించినా ఎందరో, నవ, యువ కథకులను భుజంతట్టి ప్రోత్సహించుతూ, వారి ఎదుగుదలకు సారవంతమైన తమ సమీక్షాసత్త్వాన్ని అందిస్తూ ఇప్పటికి అయిదు ‘కథాకృతి’ సంపుటాలను, సమీక్షాకృతులను ప్రకటించారు. మూర్తిదేవి పురస్కార గ్రహీతలయిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత అయిన సలీం, విశాల సాహితి అధినేత, తెలంగాణ బి.సి.కమీషన్ ఛైర్మన్ బి.ఎస్.రాములుగార్ల సాహిత్య వైశిష్ట్య విశే్లషణా గ్రంథాలు, ‘సాహిత్య జీవి శారద’, ‘కథానిక వస్తు రూపాలు’ వంటి గ్రంథాలు సాహిత్య విమర్శకుడిగా విహారిగారి వైభవదీప్తులను వెలార్చేవిగా ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీకై ‘రాయప్రోలు’ వారిపై రాసిన మెమోగ్రాఫ్ వెలుగుచూడబోతున్న గ్రంథం.
ఇవన్నీ ఒక ఎత్తుకాగా ఇప్పటికీ ఇంకా గ్రంథస్థంకానీ ఆయన సాహిత్య కృషి అపారంగా ఉంది. అందులో ఆయన వివిధ పత్రికలలో నిర్వహించిన- ‘కాలమ్స్’ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆయన దృష్టికిరాని కథగానీ, కథకులు గానీ నాటి నుంచీ నేటివరకూ ఎవరూ వుండకపోవచ్చు. ఆయన అధ్యయనశీలత అంత విస్తారమైనది. దాదాపు నాలుగువందల మంది కథకులను వారి కథారచన గుణవిశేషాలను విశే్లషిస్తూ ఆయన తమ ‘కాలమ్స్’ ద్వారా వివిధ పత్రికలలో రాసిన పరిచయవ్యాసాలు తెలుగు కథాసాహిత్యంలో ‘నభూతో నభవిష్యతి’ అనదగినదిగా మన్ననలందుకొన్నది. ఒకనాటి ‘్భరతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికలనుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు అనేక దిన, వార, మాస పత్రికలలో వందలాది గ్రంథసమీక్షలు చేశారు. ఆయన వివిధ పత్రికలలో నిర్వహించిన ‘కాలమ్స్’ కూడా వైవిధ్యభరితమైనవి.
విహారిగారు వృత్తిరీత్యా ఎల్.ఐ.సీ హౌసింగ్ ఫైనాన్స్ నుండి జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. మధ్యతరగతి జీవులకు ఉపయుక్తమైన ఆర్థిక అంశాలనెన్నింటినో 2007-2008 సంవత్సరంలో ‘వార్త’ దినపత్రికలో ‘్ధన’ పేరిటి కాలమ్‌లో ప్రతి మంగళవారం ఆయన రాసిన వ్యాసాలు కుటుంబ రక్షణకు వలసిన ఆర్థిక విధానాలనూ, ఆదాయానికి అనువుగా పొదుపుచేసుకుంటూనే నిధిని సమకూర్చుకోవాలనీ, మన జీవనపథంలో సమంజసమైన, సరళమైన ఆర్థికప్రణాళికా గమనం అని ప్రబోధిస్తూ సాగిన ఉపయుక్త వ్యాసాలు. విహారిగారు గతానుగతిక భావాలకు, ‘మూస’కు భిన్నంగా నిరంతరం ఆలోచించే సృజనశీలి. కాలానుగుణంగా వస్తున్న పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా వుండటం మాత్రమేకాదు. ఆ నవ్యతను, సరికొత్త తరం ఆలోచనా ధారను అందిపుచ్చుకుని తన అనుభవంతో సానబెట్టి యువతకు సరియైన దిశానిర్దేశం చేసే రచనలను చేయడం బాధ్యతగా భావించే రచయిత. యువతకు వ్యక్తిత్వ వికాసం మీద ఆయా పత్రికా సంపాదకుల కోరిక మేరకు ఆంధ్రభూమి, చినుకు, ఆంధ్రప్రభ వంటి పలు పత్రికలలో ‘కాలమ్’ రూపేణా వ్యాసాలుగా రాసారు. యువ(త) రంగం శీర్షికన యువ కవులను, రచయితలను, కళాకారులను పరిచయంచేస్తూ వారి కృషిని వెన్నుతడుతూ ప్రోత్సాహకర వ్యాసాలు రాసారు. అనేక మెళకువలను ఆయా వ్యాసాల రూపంలో వారి పురోగమనానికై ఉపాయనం చేశారు. ఆంధ్రప్రభలో నాలుగు సంవత్సరాలకు పైగా ‘పరిచయాలు-పరామర్శలు’ శీర్షిక నడిపారు. అది ఒక రికార్డు.
ఆంధ్రభూమి దినపత్రిక వారానికి ఒకరోజు కేటాయించిన ‘యువ’ పేజీతో 2009 నుండి రెండు మూడేళ్ళ పర్యంతం జె.ఎస్. మూర్తి (విహారి)గారు రాసిన వ్యాసాలు నిజంగా ‘పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పాఠాలే! ‘మేధోపరిణతే వ్యక్తిత్వ దర్పణం’ అనీ ఆలోచనా ధోరణి, భావవ్యక్తీకరణ, అంగవిన్యాసం, ప్రవర్తనావిధానం వంటి అనేక అంశాలను యువతలోని నిరాశానిస్పృహలూ, వ్యతిరిక్త్భావనలూ తొలగిపోయే రీతిగా ఆ వ్యాసాలను సంతరించారు. ‘పరిష్కారం (2) సమస్య.కామ్’, ‘గురిపెట్టండి..’, ‘మాట కలపటమే మనసు విప్పటం’ వంటి వ్యాసాలు యువతలో సాఫ్ట్‌స్కిల్స్‌ను, టీన్‌టామిక్‌ను, హెల్త్‌కేర్‌ను, భాషానైపుణ్యాన్ని, భావదీప్తిని ప్రచోదితం చేసేవిగా రాసారు. అవి గ్రంథ రూపేణా వెలువడవలసిన అవసరం ఎంతయినా వుంది. ఇవాళ జంక్‌ఫుడ్ వంటి వాటి ప్రభావాలను హెచ్చరిస్తున్న విషయాలను గురించి ఆనాడే విహారిగారు యువతను అప్రమత్తం చేశారు. ‘చిత్ర’మాసపత్రికలోనూ, ‘్ధర్మశాస్త్రం’ అనే మాసపత్రికలోనూ కూడా 2015, 2016లలో ‘యువ(త)రంగం’ పేర ఇలాంటి వ్యాసాలు రాసిన విహారిగారు ‘చినుకు’ మాసపత్రికలో ‘తేజోరేఖలు’ పేర 2013లో నిర్వహించిన కాలమ్ యువతకు జీవన నైపుణ్యాన్ని నేర్పిన మరో విశిష్ట వ్యాస పరంపర. ‘ఎదగడానికెందుకురా తొందర’అనే సినీ గీతం పల్లవి పట్టుకుని ‘ఎదగటం’మీదే యువత భవిత ఆధారపడివున్న వైనాన్ని, అందుకు వలసిన సదాచరణను విశే్లషించారు. రామాయణం, మహాభారతంలోని అంశాలను ఉపపత్తులుగా స్వీకరించి నవ సమాజ పథ ఫణుతులను యువతకు ఉపయుక్తంగా మలచిచెప్పిన ప్రజ్ఞ ‘తేజోరేఖలు’లో కానవస్తుంది. జీవికకూ, జీవనానికీ, అనివార్యమైన వాహికగా ‘మాటతీరు’ గురించీ, అన్నిరకాల సామాజిక, నైతిక నియమ నిబంధనలకూ అతీతంగా ‘నలుపు’ని ఆశించి ఆరాధించే వైఖరినుండి యువత నీతినిజాయితీలవైపు చిత్తశుద్ధితో ఎదగవలసిన తీరుతెన్నులను, ‘వ్యక్తిత్వ వికాసం - రేపటి తరం అవసరాలు’ కూడా అందిపుచ్చుకునేలా విహారిగారు విశే్లషించిన తీరు యువతకే కాదు ఆబాల గోపాలానికి విభ్రమ కలిగిస్తూనే వివేచన కలిగించేదిగా భాసిస్తోంది.
ఆంధ్రభూమి దినపత్రిక విజయవాడ ఎడిషన్‌లో ఆదివారాల్లో ‘మెఱుపు’ అనే పేజీలో యువతరం కవులూ-రచయితలను పరిచయంచేసే ‘కాలమ్’ను నిర్వహించారు. ప్రతిభావంతులైన యువతరాన్ని జల్లెడపట్టి కవులుగా రయితలుగా రాణించగలవారిలోని ప్రతిభను గుర్తిస్తూ ఆయన రాసిన ఆ ధారావాహిక శీర్షికారచన తెలుగు సాహిత్య ప్రపంచంలో అప్పుడప్పుడే విచ్చుకుని పరీమళిస్తున్న కొత్త పుష్పాలను ఏర్చికూర్చి మాలకట్టిన మనోజ్ఞ కదంబం. ఆయన ఆ కాలమ్‌లో పరిచయంచేసిన యాభై మందికి పైగా ‘కవులూ రచయితలు’లో చలపాక ప్రకాష్, జమదగ్ని, కోసూరి రవికుమార్, కె.విల్సన్‌రావ్, వంశీకృష్ణ, సాదనాల వెంకటస్వామినాయుడు, నియోగి, అమ్మిన శ్రీనివాసరాజు, షేక్‌అబ్దుల్ హకింజాని, కోటమర్తి రాధాహిమబిందు వంటి వారెందరో నేటి కథాప్రసంగంలో ఎదిగి రాణిస్తున్నవారున్నారు. ఒక సంగమనం, నిష్పక్షపాత విశే్లషణ, యువభావ ప్రశంసావైఖరి ‘విహారి’ గారి ఈ పరిచయ వ్యాసాలలో ద్యోతకమైందని కొందరు ప్రముఖ విమర్శకులే ప్రశంసించారు.
అలాగే 2013లో ఆంధ్రభూమి ‘మెరుపు’ పేజీలోనే ‘ఆనాటి కథలు- ఆణిముత్యాలు’ శీర్షికన ఇవాల్టితరం విధిగా చదవవలసిన అపురూప కథకుల ఆణిముత్యాల వంటి కథలను పరిచయం చేశారు. విహారిగారు పరిచయంచేసిన కథలు కాలానికి నిలిచే ఉదాత్త విలువల ప్రోది అయిన కథలు. శ్రీపాద - ‘కలుపుమొక్కలు’, సురవరం ప్రతాపరెడ్డిగారి ‘సంఘాల పంతులు’, విశ్వనాథవారి - ‘ముగ్గురు బిచ్చగాళ్ళు’, వట్టికోట ఆళ్వారుస్వామి - ‘పరిగె’, చలం - ‘యవ్వనవనం’, కనపరి త- ‘కుటీరలక్ష్మి’, మధురాంతకం - ‘పొద్దుచాలని మనిషి’ వంటి కథల వైభవ ప్రాభవాల గురించి మునుపెవరూ చూపని మంచి కథలనూ, వాటి కోణాలను విహారిగారు ఈ ‘కాలమ్’లో పరిచయం చేశారు. నిజానికి కథకులు ప్రసిద్ధులే. అయినా వారి విస్మృత అపురూప కథలను పరిచయం చేయడం విహారిగారికే చెల్లింది. ఈ అపురూప కథాసంపుటిని నిజానికి ఏ సాహిత్య అకాడమీ లాంటి సంస్థలో పూనుకుని ప్రచురించాలి. ‘చినుకు’ మాసపత్రికలో 2014లో విహారిగారు ‘అక్షర జీవులు- ఆణిముత్యాలు’ అనే కాలమ్‌లో ఇప్పటితరం కథకుల మంచి కథలను విశే్లషిస్తూ పరిచయం చేశారు. శ్రీపతి, రంగనాథ రామచంద్రరావు, అదృష్టదీపక్, నాయని కృష్ణమూర్తి, డా.చింతకింది శ్రీనివాసరావు, గంటి భానుమతి వంటి వారి కథానికలు గురించి ఈ వ్యాసాలలో విశదీకరించారు. సాహితీ స్రవంతి మాసపత్రికలో కథావాఙ్మయ లహరి శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు.
ముందే చెప్పుకున్నట్లు విహారిగారు చేపట్టని ప్రక్రియ లేదు. శ్రీశ్రీ, ఆరుర్రు వంటివారు నిర్వహించిన ‘పదబంధ పారిజాతం’ వంటి గళ్ళ నుడికట్టును కూడా విహారిగారు ‘చిత్ర’ మాసపత్రిక సంపాదకుల అభీష్టంమేరకు 2012-2013లో ‘పదప్రజ్ఞ’ శీర్షికన పదిగళ్ళ పదక్రీడగా నిర్వహించారు. విరిగిపడబోదులెండి(మిన్ను) భాగం త్రాగవచ్చు (పాలు) గోదావరిచే సుతజల పూరితంబులు... వడ్లు పండేదిక్కడే (వరిచేలు), మిమ్మల్నేమీ అడ్డగించం (ఆపం), ‘గాలివాన’కథకుని పొట్టిపేరు (పాప), మరమరాల్లో లక్ష్మి(రమ) వంటి చమత్కార ఆధారాలతో ఈ ‘పదప్రజ్ఞ’ 300/- రూ. బహుమతి మొత్తంతో పోటీగా సాగింది. భాష మీద విహారిగారికి ఉన్న పట్టుగొప్పది. ఆయన ‘పదచిత్ర రామాయణం’లోని పద సంపదనంతా ఒక ‘వాఙ్మయ సంచిక’గా సంతరించవచ్చును.
2018నుండి ఏడాదికి పైగా విశ్వామిత్ర, మధుర, అనసూయ, శూర్పణఖ, లాంటి వ్యాసాలు ‘్భక్తి’ మాసపత్రికలో ‘రామాయణ పాత్రలు’ అనే ధారావాహికలో వ్రాశారు. ఆయన రాసిన ఆ వ్యాసాలు వాల్మీకి హృదయాన్ని చూపుతూ ఆ పాత్రల వైశిష్ట్యంపై కొత్తవెలుగులు ప్రసరింప చేసేవిగా భాసించాయి. ‘‘కథాగతిని అనుసరించి పాత్రపోషణ జరగాలనే పాఠాన్ని అందించారు మహర్షి. ప్రతి పాత్ర చిత్తవృత్తిని స్పష్టంగా ఎరిగిన కవి ఆయన. ఆయా పాత్రల మనస్తత్వ వైరుధ్యాలను, వైచిత్రిని అపూర్వంగా దర్శనం చేసినవాడు ఆయన’’అని వాల్మీకిని విశే్లషించిన విహారిగారూ తామూ ఆ బాటనే అనుసరించి అడుగడుగునా చూపారు. విహారిగారి కథారచనలోని పాత్రలకు కూడా వర్తించే అంశమే అది. ‘్ధర్మసూక్ష్మ ప్రసారం’ శీర్షికన హిందూ ధర్మ ‘శంఖారావం’ మాసపత్రికలో ఆరు కాండల సంక్షిప్త వివరణగా ‘సంపూర్ణ రామాయణం’ను శీర్షికారచనగా విహారిగారు 2019లో అందించారు.
ఇలా విహారిగారు ‘సకాలంలో సకలం’ అన్నట్లుగా తమ కాలమ్స్‌లో కలం జీవులకు బాసటగా నిలుస్తూ, ఎందరో కథకుల వైభవ ప్రాభవాలకు సముచిత దర్పణం పట్టారు. యువ రచయితల వెన్నుతట్టారు. యువతకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పారు. మధ్యతరగతి జీవుల ఆర్థికావసరాలకు సలహాదారుగా నిలిచారు. వయోధికులు ‘అల్జీమర్స్’ జారిపడకుండా మెదడుకు మేతపెట్టే ‘పదప్రజ్ఞ’లు చూపారు. వాల్మీకి హృదయాన్ని రామాయణ పాత్రల విశే్లషణతో భక్త్భివ శబలతతో ఆవిష్కృతం చేశారు. ఆయనలోని సమ్యక్‌దృష్టి, విషయ విశే్లషణా నైపుణ్యం, సకాలానికి రచన అందించే సమయపాలన, రచనలోని పఠనీయత ఒక ‘కాలమిస్టు’గా విహారిగారిని సంపాదకులెవరయినా సమాదరించగల సహృదయ శేముషీ వైభవశీలిగా నిల్పుతున్నాయి.
ఆయన ‘కాలమ్స్’రచనలన్నీ కూడా పుస్తక రూపందాల్చి భావితరాలకు అందే ‘విహారి సమగ్ర సాహిత్య సర్వస్వం’ వెలువడాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ వీటి అజో-విభొ-కందాళం సాహిత్య జీవనసాఫల్య పురస్కారం విహారిగారిని వరించి సఫలత చెందిందని ఆనంద కందళిత హృదయారవిందంతో జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి (విహారి) గారికి మనసా, శిరసా అభినందనలందిస్తున్నాను.

- సుధామ, 98492 97958