మెయన్ ఫీచర్

విపక్షం ప్రేక్షకపాత్ర ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు గ్రామాలు స్వ యం సమృద్ధంగా ఉండేవి. ప్రతి ఇంటి ముందు చింత చెట్టు, పెరట్లో కూరగాయలు, పొలంలో వడ్లు, కందులు పం డేవి. ఎవరి ఇంట్లో చూసినా పాడిపశువులు ఉండేవి. కులవృత్తులు బలంగా ఉండటంతో కుండలు, బుట్టలు, తట్టలు, బట్టలు, కట్టెలు అన్నీ ‘వస్తుమార్పిడి పద్ధతి’ (బార్టర్ సిస్టం)లో దొరుకుతూ ఉండేవి. ఉప్పు మాత్రమే జనం కొనుక్కోవలసి వచ్చేది. మామిడి, అరటి, పనస, కొబ్బరి.. ఇలా పెరటి మొక్కలు పెంచి బార్టర్ పద్ధతిలో పరస్పరం పంచుకునేవారు. వైద్యం, విద్య, వ్యాయామ శిక్షణ వంటివి దేవాలయ ప్రాంగణాల్లో లభించేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో రూపాయికి ఒక డాలరు ఇచ్చేవారు. ఇపుడు డాలరు మారకం విలువ 70 రూపాయలు. ఇలా ఎందుకు జరిగిందో ఆర్థిక నిపుణులు చెప్పాలి. ఆర్థిక సంస్కరణలు అవసరమేనని అన్ని రాజకీయ పార్టీలూ చెబుతుంటాయి. కానీ, ప్రధాని మోదీ వాటిని ఆచరణలో పెట్టేసరికి విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. నల్లధనాన్ని అరికట్టాలని నీతికబుర్లు చెప్పే బిఎస్‌పి, ఎస్‌పి, టిఎంసి, డిఎంకె వంటి రాజకీయ పార్టీల ఆవిర్భావం ఆ నల్లధనం అనే బురద నుండే జరిగింది. అవినీతిని నిర్మూలిస్తామన్న నినాదంతో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈరోజు అవినీతికి కేర్‌ఆఫ్ అడ్రసుగా ఎందుకు మారిపోయిందో కేజ్రీవాల్ చెప్పాలి.
ఈ దేశంలో పేదవాడు రూపాయి రూపాయి కూడబెట్టుకోవడం కష్టం అవుతుండగా, బడాబాబులకు సంబంధించి వందల కోట్ల రూపాయల బకాయిలను బ్యాంకు యాజమాన్యాలు మాఫీ చేస్తుంటాయి. మన ఆర్థిక వ్యవస్థలో అడుగడుగునా లోపాలే. ఇలాంటి సమయంలో మోదీ అవినీతిపై, నల్లధనంపై కొరడా ఝళిపించాడు. నల్లకుబేరుల అక్రమార్జనకు సంబంధించి 2014లో 52 కేసులు నమోదు కాగా, మోదీ అధికారంలోకి వచ్చాక 2015లో 2,200 నమోదయ్యాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లకుబేరుల జాతకాలు బయటపడుతున్నాయి. గాలి జనార్దనరెడ్డి వంటి బడాబాబులపై నమోదైన కేసులు కొలిక్కివచ్చేందుకు కొనే్లళ్లు పట్టవచ్చు. పాతనోట్లను డిపాజిట్ చేసేందుకు గడువు ముగిసినప్పటికీ ఇంకా నల్లధనం వెలుగు చూస్తూనే ఉంది. పెద్దనోట్ల రద్దుతో తాత్కాలికంగా కొన్ని సమస్యలను జనం ఎదుర్కొన్నారు. అయినా వారు సహనం, సంయమనం కోల్పోలేదు. మోదీ నిర్ణయం వల్ల తమకు మేలు జరుగుతుందని నిరీక్షిస్తున్నారు. నోట్లరద్దు తర్వాత భవన నిర్మాణం పనులు ఆగిపోయాయి. భారతీయ మార్కెట్ నుండి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని విదేశీ ఇనె్వస్టర్లు ఇంతవరకూ ఉపసంహరించుకున్నారు. మరోవైపు కొత్త 2,000 రూపాయల నోట్లు కట్టలు కట్టలుగా వెలుగు చూస్తున్నాయి. ఇపుడు కొత్తనోట్లు భారీగా నల్లకుబేరుల వద్దకు చేరుతున్నాయని పలు ఉదంతాలు రుజువు చేశాయి. నల్లధనానికి మోదీ కళ్లెం వేయడంతో కాంగ్రెస్, బిఎస్‌పి, కమ్యూనిస్టు పార్టీల నాయకులు కువిమర్శలకు దిగుతున్నారు. గడువు ముగియడంతో పాతనోట్లు చిత్తుకాగితాలుగా మారాయని మరికొందరు లబోదిబో మంటున్నారు.
ఉద్యోగులు తమ వార్షికాదాయంలో మూడవ వంతు డబ్బును పన్ను రూపంలో చెల్లిస్తూనే ఉన్నారు. ఆదాయానికి మించి ‘ఆమ్యామ్యాలు’ పొందేవారే ఇపుడు ప్రభుత్వ కార్యాలయాల్లో దిక్కుతోచక గిలగిలలాడుతున్నారు. ధనం సంపాదించి దాచిపెట్టుకోవటం తప్పుకాదు. సంపాదించిన ధనానికి చట్టబద్ధంగా కట్టవలసిన పన్ను కట్టకపోవటం అక్రమం. ఇలా అనైతికంగా పోగుచేసిన మొత్తానే్న నల్లధనం అని అంటున్నాము. ఆంగ్లేయులు తెల్లగా ఉంటారు. అందుకని తాము మంచివారమని, అక్రమార్జనకు నల్లధనం అని పేరుపెట్టారు. ఈ సంగతి ఇలా ఉంచితే విదేశీ బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేవారిలో కొన్నివర్గాలున్నాయి. ఒకటి ఎన్‌ఆర్‌ఐ సంతతి. వారు భారతీయులే అయినా ఏ అమెరికాలోనో, కెనడాలోనో ఉంటారు. వారి బ్యాంకు ఎకౌంట్లపై భారత ప్రభుత్వానికి అదుపుఉండదు. ఎందుకంటే వారికి ఆయా దేశాల పౌరసత్వం లభించి ఉంటుంది. ఇక రెండవ వర్గం వారు ధనాన్ని విదేశీ బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నా లెక్కలు చూపి పన్నుకట్టి ఉంటారు. వీరితో కూడా ఎలాంటి పేచీ లేదు. స్విట్జర్‌లాండ్, పనామా, కోస్టారికా, వర్జిన్ ఐలండ్స్, మారిషస్, సింగపూర్, బ్రిటన్, దుబాయి వంటి దేశాల్లో అరవై ఏళ్లుగా దొంగ డబ్బు మూలుగుతూ ఉంది. ఉదాహరణకు సైనిక హెలికాప్పర్లు, ఆయుధాల కొనుగోళ్లలో ‘కమీషన్లు’ అనబడే ముడుపులు కొంతమంది భారతీయులకు ముట్టాయి. ఆ డబ్బు బినామీ పేర్లతో ఇటలీ, పనామా, కోస్టారికా బ్యాంకుల్లో జమచేయబడ్డాయి. ఈ నల్లధనాన్ని ఇండియాకు రప్పించటంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సమస్యలున్నాయి. నిబంధనలు అడ్డం వస్తాయి. భారత్‌లో బ్యాంకు లోన్లు తీసుకోని లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను ఇక్కడికి రప్పించడం సాధ్యం కాలేదు. లోగడ ఖత్రోచీ అనే ఇటలీ ఆయుధాల వ్యాపారి సోనియా కుటుంబానికి సన్నిహితుడు కావటంలో రాత్రికిరాత్రి ప్రత్యేక విమానంలో దేశం దాటించారు. రుణాలు ఎగవేసేవారు, కోట్లలో కమీషన్లు పొందేవారు చట్టానికి దొరకరు.
కాగా, నోట్ల రద్దు వ్యవస్థీకృత దోపిడీ అని, దీని వల్ల జిడిపి రెండు శాతం పడిపోతుందని మాజీ ప్రధాని, ఆర్థిక శాస్తవ్రేత్త మన్మోహన్‌సింగ్ మాట్లాడటం విచారకరం. ఆయన తన పాలనాకాలంలో చేసిన సంస్కరణలేమిటి? అమెరికన్ మాల్స్‌కు ఇండియాలో తలుపులు తెరిచి భారతీయ చిల్లర వ్యాపారస్థుల నోట్లో మట్టికొట్టిన మహాపురుషుడీయన. విదేశీ బ్యాంకుల్లో మూ లుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు గత ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఆ పని మోదీ చేస్తానంటే విపక్షాలు దాడికి దిగుతున్నాయ.
స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడిచేస్తే 50 శాతం పన్ను విధిస్తామని, ఐటి శాఖ దాడుల్లో పట్టుబడితే 90 శాతం పన్ను తప్పదని కేంద్రం ప్రకటించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం లభించిన గణాంకాలను చూస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంది. కార్పొరేట్ విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలపై జరిపిన దాడులలో 32వేల కోట్లు వెలుగులోకి వచ్చినట్లు సంతోష్‌కుమార్ గాంగ్వర్ లోక్‌సభలో తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జరిపిన ఐటి దాడుల్లో 445 ప్రదేశాలలో 11,066 కోట్ల రూపాయలు దొరికాయి. 712.68 కోట్ల రూపాయల ఆస్తులు జప్తుఅయినాయి. 2014-15లో జరిగిన 548 దాడుల్లో 10,288 కోట్ల నల్లధనం వెలుగులోకి వచ్చింది. 761.70 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. 2013-14లో జరిగిన దాడుల్లో 10,791 కోట్ల అక్రమార్జన వెలుగులోకి వచ్చింది. 807.84 కోట్ల ఆస్తి జప్తుచేయబడింది. ఇకమీదట 20 వేల రూపాయలకు మించిన అన్ని లావాదేవీలు నగదు రహితంగానే ఉండాలన్న నిబంధన విధించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. 2 లక్షలకు పైగా జరిగే లావాదేవీల్లో ‘పాన్’ నెంబరు తప్పనిసరి. ఇలాంటి చర్యల వల్ల అక్రమాలు తగ్గి, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదుటపడే అవకాశం ఉంది. పెద్దనోట్ల రద్దు తర్వాత అనేక హిందూ దేవాలయాల్లో హుండీ ఆదాయం పెరిగింది. హుండీల్లో నల్లడబ్బును భారీగా వేస్తున్నారని కొందరు అంటున్నా, ఈ ఆదాయానికి మూలాలను అనే్వషించటం అసాధ్యం. ఇదే పద్ధతిలో ఇతర మతాల ప్రార్ధనాలయాలకు సంబంధించిన ఆస్తులపై విచారణ జరుగుతుందా?
నోట్లరద్దు ఫలితంగా భారీగా నల్లధనం బయటపడినా, ఇంకా కొంతమంది బడాబాబుల వద్ద, రాజకీయ నేతల వద్ద నిగ్గుతేలని సంపాదన భారీగానే ఉంది. అది నగదు రూపంలో కాదు. షేర్ల రూపంలో, సేవింగ్స్ సర్ట్ఫికెట్లుగా, రియల్ ఎస్టేట్ రంగంలో, బంగారంగా, సినీ పరిశ్రమలో పెట్టుబడిగా ఉంది. గతంలో వలే ఇపుడు భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసేందుకు నిర్మాతలు అంతగా సాహసించరు. అంటే భారీ బడ్జెట్ సినిమాల మీద కూడా ‘సర్జికల్ స్ట్రయిక్’ జరిగిందని అర్థం. ఇది చిన్న చిత్రాలకు లాభసాటి నిర్ణయమే. దావూద్ ఇబ్రహీం వంటి మాఫియా లీడర్లు బాలీవుడ్‌లో పెట్టే రహస్యపు పెట్టుబడులన్నీ ఇకపై వెలుగులోకి రాగలవు. హైదరాబాద్, విశాఖ, అమరావతి ప్రాంతాలల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దాదాపు స్తంభించిపోతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా వీరు బంగారం మీద దృష్టిపెట్టవచ్చు.
ప్రస్తుతం చైనాలో ఒక ఆర్థిక సంక్షోభం నెలకొని ఉంది. అందరూ భ్రమిస్తున్నట్లు చైనా ఆర్థిక పరిస్థితి ఏమీ దివ్యంగా లేదు. 80 ట్రిలియన్ డాలర్ల సంక్షోభంలో చైనా కార్పొరేట్ సెక్టార్ చిక్కుకుంది. దానివల్ల వారి బాంకింగ్ వ్యవస్థ గందరగోళంలో పడుతుంది. ఈ 80 ట్రిలియన్ డాలర్ల మొత్తం చైనా జిడిపి అభివృద్ధిలో 70 శాతానికి సంబంధించిన ద్రవ్యం. కార్పొరేట్ రంగం మూతబడితే చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడుతుంది. ఈ దశలో చైనా ప్రధాని లి పిక్వెంగ్ హామీలు ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి. చైనా క్రెడిట్ జిడిపి తారతమ్యం 30.1 శాతానికి చేరింది. సారాంశమేమంటే ఇదంతా కలిసి చైనా ఎగుమతులపై ప్రభావం చూపబోతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేస్తున్న నిపుణులకు అక్కడి పరిణామాలు ఆశాజనకంగా లేవని తెలుస్తున్నది. చైనా ఎగుమతులను మన దేశమే భారీగా కొంటోంది. చైనా వస్తువులను మనం బహిష్కరిస్తే వారి ఉత్పత్తులకు గండి పడుతుంది. వ్యూహాత్మకంగా మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో చైనా ఆర్థికవ్యవస్థపై ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలు పడబోతున్నాయి. దొంగనోట్లపై కట్టడితోపాటు ఇండియాకు దిగుమతులు తగ్గవచ్చు. దక్షిణాసియాలో చైనా ఆధిపత్యానికి ఇది ఇబ్బంది కల్గించే అంశం. ఈ ఆర్థిక వైఫల్యాల నుండి తమ ప్రజల దృష్టి మళ్లించేందుకు చైనా పాకిస్తాన్ సాయంతో భారత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టించేందుకు సాహసించవచ్చు.

- ముదిగొండ శివప్రసాద్