మెయన్ ఫీచర్

పురోగమనమా? తిరోగమనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్నించేందుకే పార్టీ పెడుతున్నానని మూడేళ్ల క్రితం తెరపైకి వచ్చిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మూడేళ్ల సంబరం సందర్భంగా చేసిన ట్వీట్ ముచ్చటేసింది. ‘మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలు పెట్టిన నాకు దారంతా గోతులు. చేతిలో దీపం లేదు. ధైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలుపెట్టా. నేను స్పందించిన ప్రతి సమస్యకి మేమున్నామంటూ ప్రతిస్పందించి, ఈరోజు 20 లక్షల దీపాలతో దారంతా వెలుగునిచ్చిన మీ అభిమానానికి శిరసు వంచి కృతజ్ఞత’లంటూ కల్యాణ్‌బాబు ట్వీటారు. బాగుంది! ఈ మూడేళ్లలో ఆయన చేసిన ట్విట్టర్ పోరాటాలకు, సమస్యలపై అదే ట్విట్టర్ స్పందనలకు 20 లక్షల మంది ప్రతిస్పందించి ఆయన ఖాతాదారులుగా చేరడం సంతోషమే. కానీ, తన స్పందించిన 20 లక్షల మందికి శిరసు వంచి కృతజ్ఞతాభివందనాలు తెలిపిన పవన్.. ఉన్న వాళ్లలో 20 మందిని టిడిపి లాగేసుకోగా, ఇంకా 40 పైచిలుకు ఎమ్మెల్యేలున్న జగన్ ఎన్నిసార్లు పోరాడినా పట్టించుకోకుండా, తాను చెప్పిందే తడవుగా తు.చ. తప్పకుండా స్పందించి తనకు ఉచిత ప్రచారం కల్పించిన తెలుగుదేశం పార్టీకి గానీ, చంద్రబాబు నాయుడుకు గానీ కనీస కృతజ్ఞతలు చెప్పకపోవడం అన్యాయం! ఉద్దానం ఎపిసోడ్‌లో తనకు రాష్టస్థ్రాయి పొలిటికల్ ఇమేజ్ తెచ్చిపెట్టిన టిడిపికి మాటవరసకయినా ధ్యాంక్స్ చెప్పకపోవడం అన్యాయమున్నర! మరి పవన్ ప్రకటించిన ఆ 20 లక్షలమంది ప్రతిస్పందకులలో బాబు ఉన్నారేమో కల్యాణ్‌బాబే చెప్పాలి.
నిజం చెప్పాలంటే పవన్ ట్వీటినట్లు ఇప్పుడు ఆయన పార్టీ గోతుల దారి నుంచి బయటకేమీ రాలేదు. చేతిలో దీపం ఉన్నా అది వెలుగుతుందో లేదో కూడా అర్ధం కాని అయోమయ పరిస్థితి. ఇప్పుడు తనకు దారినిచ్చిన ఆ 20 లక్షల మంది దీపాల్లో, రేపు ఎన్నికల్లో పోలింగు బూత్‌లోకి వెళ్లి జనసేనను వెలిగించే దివిటీలెంతమందో తెలియదు. గబ్బర్‌సింగ్ వస్తే ఊపిరిపోయేలా ఉత్సాహంగా ఈలలు వేసి, గోలచేసే చిరంజీవులేనా? అందులో ఓటు హక్కున్న వాళ్లు ఎంతమంది? ఇలాంటి కూడికలు, తీసివేతలు వేసుకోకుండా ట్వీటిన 20 లక్షల మందీ ఓటర్లే అనుకుంటే ఈ ‘తమ్ముడు’ మరో ‘అన్నయ్య’ అవుతారేమో?!
ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ టిడిపి పెట్టిన తర్వాత ఆయన సభలకు హాజరైన జనవాహినే ఇప్పటివరకూ పెద్ద రికార్డు. మళ్లీ ఆ స్థాయిలో అశేష జనవాహిని ఆకర్షించిన రెండో వ్యక్తి చిరంజీవి మాత్రమే. సామాజిక న్యాయం, ప్రేమే మార్గం- సేవే లక్ష్యం ట్యాగ్‌లైన్లతో ప్రజారాజ్యం పెట్టినప్పుడు వేలాదిమంది ఆయనకు హారతులు పట్టారు. తిరుపతిలో తొలి సభ నభూతోన భవిష్యతి! ఏ సభలకు వెళ్లినా అన్నయ్యను లక్షలమంది స్వాగతించారు. అప్పుడు ఈ ‘తమ్ముడు’కూడా అన్నయ్య బాటలో నడిచి, కాంగ్రెస్ నేతలను పంచెలూడేలా కొట్టాలన్నంత ఆవేశం ప్రదర్శించారు.
బావమరిది అల్లు అరవింద్ పోటీచేసిన అనకాపల్లి నుంచి ఆంధ్రరాష్ట్రంలో చాలాచోట్ల చిరంజీవి వారసులు కూడా ప్రచారం చేశారు. మరి అంత చేసినా వచ్చిన లక్షలమంది గానీ, అన్నయ్య వచ్చినప్పుడు ఈలలు వేసి గోల చేసిన వేలమంది గానీ, పోటీలు పడి రక్తదానం చేసిన వారు గానీ ప్రజారాజ్యం పార్టీకి ఓటేయలేదు. తనకు గంజీ తెలుసు-బెంజీ తెలుసని ఎంత చెప్పినా అన్నయ్య పార్టీకి జనం 18 సీట్లకు మించి ఇవ్వలేదు. సరే- తర్వాత తన రాజ్యాన్ని ఎక్కువకాలం పాలించలేక అదే అన్నయ్య తన పార్టీని కాంగ్రెస్ మహా సామ్రాజ్యంలో కలిపేసి, కేంద్రమంత్రి పదవితో తృప్తి పడ్డారు. అంతెందుకు? ఎనిమిదేళ్ల క్రితం టిడిపిని వెలిగించేందుకు ఎన్నికల ప్రచారంలో శ్రమదానం చేసిన జూనియర్ ఎన్టీఆర్ సభలకూ ఇసుకేస్తేరాలనంత జనం వచ్చినా, ఓట్లు మాత్రం వేయలేదు. అది వేరే విషయం! అదీ నిజానికి-భ్రమలకు ఉన్న తేడా!!
నిజానికి తాను గోతులున్న దారుల నుంచి 20 లక్షల మంది దీపాలు వెలిగించిన దారిలో ప్రయాణిస్తున్నానని పవన్ అనుకున్నా, అలాంటి అభిప్రాయలే జనాలకూ ఉంటే జనసేన భవిష్యత్తుకు తిరుగుండదు. కానీ జనాభిప్రాయం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రశ్నించేందుకే వచ్చానన్న కల్యాణ్‌బాబు ఇప్పటివరకూ ఎవరిని ప్రశ్నిస్తున్నారో కూడా తనకే అర్ధం కాని అయోమయం! అసలు తన సేన టిడిపికి మిత్రపక్షమో, శత్రుపక్షమో తెలియదు. ‘తెలుగు’గడీ లో సేద తీరుతూ, సర్కారు నుంచి రాచమర్యాదలందుకుని, మంత్రులకూ గగనమయ్యే ముఖ్యమంత్రి దర్శనాన్ని ఎప్పుడంటే అప్పుడు అందుకునే జనసేనాధిపతి, సమస్యల పరిష్కారానికి సంబంధించి సర్కారుపై ‘బంతిపూల యుద్ధం’ చేస్తే జనం నమ్ముతారనుకోవడం భ్రమ.
కాసేపు తనకు పోరాడేంత బలం లేదంటారు. ఎన్నికల్లో నిలబడేంత ఆర్ధిక స్తోమత లేదని వాపోతారు. ఇంకాసేపు పాదయాత్ర చేస్తానని, మళ్లీ అంతలోనే తనకున్న ఇమేజ్ అడ్డంకితో చేయలేమోనని చెబుతారు. అటు సైకిల్ వెనుక సురక్షితంగా కూర్చుని ప్రయాణిస్తూనే, ఇటు దానిని వ్యతిరేకిస్తున్న కంకి-కొడవలితో దోస్తీ చేస్తారు. ఒకసారి తనకు కులం-మతం లేదంటారు. మళ్లీ తాను ‘కాపులబ్బాయి’నని చెప్పుకునే సమయం వచ్చిందంటారు. ఇలా ఒక నిర్దిష్ట అభిప్రాయం లేకుండా ఎన్నికల రంగంలోకి దిగితే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఒక్కటి మాత్రం నిజం. తమ్ముడిలో అన్నయ్యలో లేని ఫైర్ ఉంది. వామపక్ష భావాలూ ఉన్నాయి. సామాజికస్పృహ, అవగాహన కూడా ఉంది. ఎదుటివారిని ఆదుకునే మంచి లక్షణాలూ ఉన్నాయి. అన్నయ్యతో పోలిస్తే ఈ తమ్ముడిలోనే ఉన్నత లక్షణాలు, ఉన్నత భావాలూ ఉన్నాయని సినీజీవులు చెబుతుంటారు. సంతోషమే. కానీ.. ఆ ఫైర్ ఎలా మలచుకోవాలని తెలుసుకోవడమే ముఖ్యం. ఫైర్ ఎప్పటికయినా ఆరిపోకతప్పదు. ఎందుకంటే అది ఫైర్ కాబట్టి! కాకపోతే అన్నయ్య ప్రజారాజ్యం మాదిరిగా తనంతట తాను ఆ ఫైర్‌ను ఆర్పేసుకుంటారా? లేక మరొక పార్టీ ఏమైనా ఆర్పివేస్తుందా అన్నది పవన్ నిర్ణయాలబట్టి ఉంది.
పవన్‌కు రాజకీయ అవగాహన తక్కువ. స్క్రిప్టులతో రాణించే రోజులు పోయాయి. ప్రజలు ఆయన వెంటే ఉండేవారినే కాదు, ఆ పార్టీలో ఎలాంటి వారు తిరుగుతారో కూడా గమనిస్తారు. బౌన్సర్ల మధ్య తిరిగేవారు రాజకీయాల్లో మనుగడ సాగించలేరు. మొన్నామధ్య పవన్ బెజవాడ వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అభిమానులు-బౌన్సర్ల మధ్య సాగింది. విచిత్రంగా జనసేన కార్యకర్తలు కూడా ప్రశ్నలడిగారు. ఎక్కడా నియంత్రణ కనిపించలేదు. ఆయన చుట్టూ బౌన్సర్ల కవచమే కనిపించింది. ఇలాంటి ‘సినిమా వాతావరణం’ నుంచి బయటపడకుండా జనసేనాని అనిపించుకోవడం కష్టం.
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉంది. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అది లేదు. ఇప్పుడు పవన్ వంతు వచ్చే సమయమూ అలాగే ఉంది. కాకపోతే ఆయనకు తన సేనను అధికారంలోకి తీసుకువచ్చే సత్తా ఉందా? లేక ఏదోఒక పార్టీని పుట్టిముంచి, మరో పార్టీని గద్దెనెక్కించే సహాయకారి అవుతారా అన్నదే చూడాలి. ఆయన జనంలోకి వచ్చి, వారిని చదివిన తర్వాత అనుభవంలోకి వచ్చిన విషయాలపై ఏ విధంగా స్పందిస్తారన్న దానిపైనే కల్యాణ్‌బాబు భవిష్యత్తు ఆధారపడి ఉంది. అప్పటివరకూ పవన్ దారి పురోగమనమా? తిరోగమనమా? అన్నది చూస్తూ పరిశీలించాల్సిందే!
* * *
ఈ వారంలో జరిగిన ముద్రగడ-బుచ్చయ్యచౌదరి ముచ్చట ప్రస్తావించుకోదగినదే. మడమ తిప్పని నేతగా పేరున్న ముద్రగడ, తన వియ్యంకుడి వ్యాపార వివాద పరిష్కారం కోసం, తాను రోజూ తిట్టిపోస్తూ, వారానికోసారైనా లేఖ రాసే బాబు పార్టీ ఎమ్మెల్యే గడప చడీచప్పుడు లేకుండా తొక్కడమే వింత. బహుశా ఈ పరిణామాన్ని కాపుజాతి జీర్ణించుకోలేదేమో?! ఒక అపార్టుమెంటు వ్యవహారంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంలో, కాపుజాతిపిత ముద్రగడ తన వియ్యంకుడి పక్షం వహించారు. అందులో తప్పేమీ కనిపించలేదు. అవతల అన్యాయం జరిగిన వాడు కూడా కాపు అయినప్పటికీ, సొంత బంధువుకే న్యాయం చేయనివాళ్లు బయటవాళ్లకేం చేస్తారు? అది కూడా పెద్దమనసుతో అర్ధం చేసుకోకుండా.. వియ్యంకుడి కోసం మడమ తిప్పారంటూ విమర్శలు కురిపించడం తప్పున్నర తప్పే కదా?!
సొంత సమస్యలకు- కాపుజాతి ఉద్యమాలకు సంబంధం ఏమిటన్నది ముద్రగడ వీరాభిమానుల ప్రశ్న. ముద్రగడకు బంధుప్రీతి ఉండకూడదా? ఆయనకూ కుటుంబ జంజాటాలు ఉంటాయి కదా? అన్యాయం జరిగిందంటున్న వాడు కూడా కాపు అయినంత మాత్రాన, అతని పక్షం వహించాల్సిన అవసరం ఏమిటి? ఇంట్లో కాపులకు న్యాయం చేయని నాయకుడు, బయట కాపులకు న్యాయం చేస్తే నాయకుడెలా అవుతారు? ఇవీ ముద్ర‘గాఢాభిమానుల’ ప్రశ్నలు.
నిజమే కదా? ముద్రగడ ఎంత కాపుల కోసం పోరాడుతున్నా, కుటుంబ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. కాకపోతే అసలు తాను రోజూ తిట్టిపోసే బాబు పార్టీ ఎమ్మెల్యే ఇంటి గడప తానెందుకు తొక్కవలసి వచ్చిందోనన్న వివరణ ఇచ్చిఉంటే, కాపులలో ఆయనపై ఉన్న అనుమానాలు తొలగిపోయి ఉండేవి. కానీ ఆ పని ఇంతవరకూ చేయకుండా, ఈ మధ్యలో మీడియాతో మాట్లాడినా, లేఖ రాసినా వియ్యంకుడి కోసం వెళ్లానన్న విషయాన్ని నిజాయితీగా చెప్పి ఉంటే ముద్రగడ ప్రతిష్ఠ పెరిగి ఉండేదేమో! వియ్యంకుడి వ్యాపార సమస్యను చక్కదిద్దేందుకే టిడిపి ఎమ్మెల్యే ఇంటికి రాయబారానికి వెళ్లామని ఆయనతో వచ్చిన బిజెపి ఎమ్మెల్యే చెప్పారే తప్ప, ముద్రగడ ఇంతవరకూ స్పందించకపోవడం వల్ల అనుమానాలను ఆయనే కొని తెచ్చుకున్నట్లయింది కదా? వియ్యంకుడి వ్యవహారంపై వివరణ ఇవ్వకుండా ఆ మరుసటిరోజునే మళ్లీ బాబుకు లేఖ రాసినంత మాత్రాన, టిడిపి ఎమ్మెల్యే ఇంటి గడప తొక్కిన వ్యవహారం కాపుజాతి మర్చిపోతుందనుకోలేం కదా?!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144