మెయన్ ఫీచర్

కొత్త ఊహలు! పాత ఊసులు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరాల రొంపి, కుంభకోణాల కంపు. అయినా నేరస్థులే లేని దేశం మనది. కారంచేడు, వాకపల్లిలలో హత్యలు, అత్యాచారాలు! అయితేనేమి హంతకులెవరూ కారు. కీచకులెవరూ లేరు. దశాబ్దాలుగా నాన్చబడే కేసులు, పరిమళాలు వెదజల్లే తీర్పులు. నిన్నటి కథ, నేటి వ్యథ, రేపటి పథాలే! ఆడపిల్లల్ని ఎలా వలవేసి పట్టాలో, వ్యతిరేకించే తల్లిదండ్రుల్ని విలన్లలా ఎలా ముద్రవేసి హింసించాలో బోధించే సినిమాలు. లొంగని అమ్మాయిల్ని యాసిడ్‌తో, యమకింకర్లుగా (యముడు క్షమించాలి) చూపించే ఎప్పటికీ తెగని సీరియళ్లు! ఇలా మనకు మనమే సాటి! కారెవ్వరూ మనకు పోటీ!
పాలకులకు ఇబ్బంది కలిగించే ఎపిసోడ్లు మరోవైపు. దారిమళ్లించే మియాపూర్ భూకుంభకోణం. దీంతో మిషన్ కథలు, వ్యథలు కొంత విరామాన్ని పొందుతాయి. అంతలోకే చిత్ర విచిత్ర డ్రగ్గు మాఫియాలు బయటపడతాయి. ఎంతవారైనా చట్టానికి చుట్టాలు కారనే ఘీంకారాలు. అంతలోనే అందరూ చుట్టాలే! ఇలా ఈ కథ కంచికి చేరకముందే ఉస్మానియా వంద వత్సరాల సంబురాలు. అధినాయకుడే మాట్లాడని విపత్కర స్థితి. తోడు రైతుల ఏడుపు. అన్నదాతల కన్నీటిని తుడవడానికే ప్రాజెక్టులంటే వినని మూర్ఖులు. భూసేకరణ వ్యతిరేక గళాలు! అభివృద్ధి నిరోధక నిరసనలు. ఇలాంటి వాటి నుంచి దృష్టి మళ్లించడానికే నెలవంకలాంటి ఇవాంక ఆటవిడుపులు, తెలుగు మహాసభలు, భువన విజయాలు. భళ్లున తెల్లారినా, అప్పుడే ముగిసే రాత్రుళ్లు. జనవరి, ఫిభ్రవరి లెక్కించేలోపే డిసెంబర్! నీటి చక్రంలా జీవనయానం. అంతులేని అగాధం. తెరిపిలేని వేదన. అయినా స్వాగతిస్తాం! సంతోషిస్తాం! సంతృప్తి పడుతాం! రాజీపడుతూనే ఉదయించే భానుడికై ఎదురుచూస్తాం! మాటలు మాటలే! చేతల దారి వేరు. ఉపాధి ఉంటేనేమి? పోతేనేమి? ఉద్యోగాలు లేకపోతేనేమి? లే ఆఫ్‌లు టేక్ ఆఫ్ (takeoff)లు కాకపోతేనేమి? హబ్బులు, క్లబ్బులు, పబ్బులుంటే పదివేలే! చుక్కల్లా మెరవచ్చు! విలువలకన్నా వినోదమేగా కావాల్సింది. వైఫైలు, ఉచిత నెట్‌లు... అడుగడుగునా అందుబాటే! కానీ, అడుగంటిన జలం పైకిరాదు. వచ్చినా గొంతు జారదు. అందుకే బాటిళ్లలో నీరు బజారుకెక్కింది. ఇలాంటి మత్తులకే అప్పులు అవసరమంటారు. అసలు అప్పు చేయకుండా అభివృద్ధి ఎలా అంటారు. ఆహా ప్రగతి అంటే ఓహో అనాలి. లేదంటే వెధవ బతుకు! కాదంటే సన్యాసి బతుకు. అయినా కాదంటే సన్నాసి బతుకే!
మనసులోమాట. నెలకోసారి ముత్యాల మూట! సలహాలు, సూచనలు. వెరసి మన్‌కీబాత్! మాట్లాడాల్సిన వాటిపై వౌనం. పక్క దేశంతో స్నేహమంటే ‘ఊ’ అనాలి. ఆగర్భ శతృత్వం అంటే ‘ఆ’ అనాలి. లక్ష్మణరేఖలు ఎప్పుడు దాగుడుమూతలే! ముష్కరులు మూషికాల్లో చొరబడతారు. మన రహస్య వేగులకు మాత్రం ఎప్పుడు ఏనుగుపైన వానలే. మనకు వీరమరణమైతే, వారు ఖతమవుతారు. ఆ పత్రికా కథనాలు మనను హిమాలయాలనెక్కిస్తాయి. ఆరంభమే రాని, అంతమేలేని యుద్ధంకాని యుద్ధం. బోడిగుండువాడు దువ్వెనకై పోట్లాడినట్టు మన సైనికులు ఉత్త పుణ్యానికి మంచులో కూరుకునిపోతారు. విగతజీవులవుతారు. కుటుంబాలకు కుటుంబాలే దిక్కు దివాణం లేకుండాపోతారు. వారికి ఆవేదనే జీవిత పరమార్థం అవుతుంది. అయినా మన నాయకుల పిల్లలు ఎవరూ ఇలా వీరమరణం పొందే ఉద్యోగాలు చేయరు. వీరి దేశభక్తి అలాంటిది. వారసత్వ రాజకీయాలతో, దేశాన్ని చక్రం తిప్పడంలో ఉన్న మజా నిజంగా సైనికులకు తెలిస్తే... ఇది వేసుకోకూడదని ప్రశ్న! అందుకే, భగత్‌సింగ్ నుంచి పూలేదాకా, వివేకానందుడి నుంచి అంబేద్కర్ దాకా ఆదర్శాలెలా ఉండాలో వల్లెవేస్తారు. జనాలకు ఉద్బోధ చేస్తారు. వీరికెవరు ఆదర్శమో ఎప్పుడూ చిదంబర రహస్యమే!
ఒకే దేశం, ఒకే పన్ను! చక్కని నినాదం! కాని, సమానవిద్య, ఒకే తీరు వైద్యం అంటరాని నినాదం. ఇలాంటి ఆలోచనల్ని దరికి రానియ్యని గడసరితనం! స్వచ్ఛ్భారత్! కాదనే ధైర్యం ఎవరికీ లేదు. వసూలు చేసిన సెస్సులో (రూ.16,401) 4001 వేల కోట్లు ఖర్చు కాకున్నా ఫరవాలేదు, కాని బిగ్ ‘బీ’కి ఇస్తున్నదెంత? ఏనాటికీ తేలదు. పోతే, స్వచ్చందంగా ‘బి’ ఎందుకు తెరపై కనపడడో మనకు అర్థమైచావదు. విద్యాహక్కు చట్టం వచ్చి అప్పుడే ఏడేండ్లు దాటింది. చదువుల బడి ఎంత గమ్మత్తో పక్కనపెడదాం! వీధిలో పిల్లలెందుకు కాగితాలు ఏరుకుంటున్నారో ఏడు దశాబ్దాలకు కూడా అర్థంకాని వైనం! అయినా సెస్ వసూలవుతూనే ఉంటుంది. ఇప్పటికే (2006-2017) వసూలైన రూ. 83,497 వేల కోట్లు ఏం చెయ్యాలో తోచని రాజకీయం! అయిదు పద్దులకుగాను వసూలైన రూ. 4,04,831 కోట్లలో ఖర్చు చేసింది రూ.2,23,443 కోట్లే! ఇలా జనాల ముక్కుపిండి వసూలు చేసిన రొక్కాన్ని ఖర్చు చేయకుండా, సంక్షేమ పథకాలకు దారి మళ్లించడం ఈ దేశంలో అనాదిగా జరుగుతున్నది. అరే! సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే తప్పా అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. ఈ సంక్షేమ పథకాల ముసుగులో పబ్లిక్‌రంగ సంస్థల్ని ఎలా బజారుపాలు చేస్తూ తెగనమ్ముతున్నారో మనకు తెలియడం లేదు. ఉద్యోగాలనెలా ఊడబీకుతున్నారో తెలియదు. దళారుల్ని మేపడానికై ఔట్‌సోర్సింగ్ పేరున కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఎలా దోపిడీ చేస్తున్నారో తెలియదు. అయితేనేమి, నాయకులు జీతాలే కాదు, న్యాయకోవిదుల జీతాలు వారికై వారే పెంచుకునే వ్యవస్థ మనది. ఇలా తమకు నచ్చినంతగా వేతనాల్ని నిర్ణయించుకునే వ్యక్తులు ఇంకా ‘గౌరవనీయులైన’ అనే పదాన్ని వారి పేరుకు ముందు వాడేలా జనాల్ని ఎలా మసిపూసి మారేడుకాయ చేసారో ఎన్ని జన్మలెత్తినా మనకు అర్థం కాదు.
పది రూపాయల వస్తాయంటే, వంద రూపాయల పనిని పోగొట్టుకొని ఆధారాలపై, ఆధారాల్ని సమర్పిస్తూ ఆ పది రూపాయలను పొంది తెగ సంతోషించే బాపతు, బళ్లో నేర్చుకోకున్నా గుళ్లు కూడా విలువల్ని కేసులతో తూస్తాయి కాబట్టి, ఆరోగ్యశ్రీ నుంచి ఉపాధి హామీ పథకం దాకా అంతటా మనమే అవుతాం. కారుంటేమి? తెల్లకాలరుంటేమి తెల్లకార్డే మహాభాగ్యమని తలిచే ఘనులు. నోట్ల రద్దుతో కోట్లాది రూపాయల నల్లధనాన్ని వెలికి తీశామని కూడ బతుకుతున్న మోదీకి, బైట్లీకి గాలి జనార్దన్‌లాంటి వాళ్లు ఎన్ని సవాళ్లు, విసిరినా వినిపించదు. కనిపించదు. జనాల్ని దిక్కుమాలిన వారిగా చేసి వారి డబ్బుకు వారే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇంతా చేస్తే, దేశంలోని మొత్తం జనాభాలో పన్ను చెల్లించేవారు రమారమి రెండు కోట్లు (1.7 శాతం) మాత్రమేనా? ఇందులో అత్యధికులు ఉద్యోగులేగా? దేశంలో శఠగోపం పెట్టిన మాల్యా (బ్యాంకు ఎగవేతలో విజయుడు)లాంటివారి నిరర్థక ఆస్తులు రూ. 7.34 లక్షల కోట్లు. ఇవన్నీ వచ్చే బాకీలా! ఏమో? రిజర్వుబ్యాంకు గవర్నర్‌కే కాదు, స్వయాన ఆర్థికశాఖామాత్యులకే తెలియదు. అందుకే కాబోలు ఇలాంటి దోషుల నుంచి బ్యాంకుల్ని రక్షించడానికై అమాయకుల డిపాజిట్లకు ఎసరుపెట్టే ఫైనాన్షియల్ రిసల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (FRDI) అనే ఓ నల్లచట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తలుస్తున్నది. దీంతో విద్యుత్ మాత్రమే కాదు, బ్యాంకులు ఇక నుండి షాక్ కొడతాయి. పైనాన్స్ కంపెనీలు దివాలా తీసి ప్రజలను శంకరగిరి మాన్యాలకు పంపిస్తాయి.
‘్భరతదేశము భాగ్యసీమరా..’ అంటూ ఓ నాలుగు దశాబ్దాల క్రితం సభలల్లో పాట మార్మోగేది. పరిస్థితి ఎంతమారిందో తెలియదు. గాని 2017లో మాత్రం 119 దేశాల్లో ఆకలి రాజ్యంగా భారత్ 100వ స్థానంలో నిలిచింది. మనదేశ గణాంకాల ప్రకారమే కాదు, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారమే ప్రభుత్వం అందిస్తున్న ఆహార సబ్సిడీలు 60 శాతం దాకా జనాలకు చేరడం లేదని. అసోచామ్ (asocham) లెక్కల ప్రకారమే, పంట నూర్పిళ్లు తర్వాత రెండు లక్షల కోట్ల విలువైన ఆహార ధాన్యాలు గోదాముల్లో, ఆరుబయట వృధా అవుతున్నాయి. లక్షలాది మంది దేశవ్యాపితంగా నిద్రపోయే ముందు ఓ ముద్దకూడా లేకుండా ఉంటే, సంవత్సరానికి రూ. 58,000 కోట్ల విలువైన వండిన పదార్థాలు పెద్దల పెళ్లిళ్లలో, ఇతర విందుల్లో, హోటళ్లలో పాచిపోతున్నాయి. ఇలా లెక్కలు పెట్టుకుంటూపోతే కడుపులో దేవినట్లు అనిపించినా ఇది మన ఆహార ఉత్పత్తిలో 7 శాతం. సంవత్సరానికోసారి ప్రభుత్వ లెక్కల్ని సరితూచే ‘కాగ్’ (CAG) ఇలాంటి చేదు నిజాల్ని ప్రతి సంవత్సరం బయటపెడుతూనే ఉంటుంది. వీటిని తీపి గుళికలుగా ప్రభుత్వాలు దిగమింగి, వౌనం వహించడం చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుతం ఉన్న మన ఇ-కామర్స్ (e-commerce) వ్యాపారం రూ. 38.5 బిలియన్ డాలర్ల నుంచి 2018 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనేది అంచనా! అంటే పేటీఎం, కార్డు గీకుతా చేసే కొనుగోలన్నమాట! గత జూలై నుంచి గుండ్, సింపిల్, ట్రాన్స్‌పరెన్సీ (గూడ్స్ సర్వీస్ టాక్స్) అని మోదీ ప్రవచించిన మాటలతో దేశవ్యాపితంగా జిఎస్‌టి(GST))కి రిజస్టర్ చేసుకున్న వ్యాపారులు కేవలం 99 లక్షలేనా? మిగతా వ్యాపారమంతా జిఎస్‌టి పరిధిలోకి ఎందుకు రావడం లేదు? ఇది చీమల్ని కొట్టి పాములకు వేయడం కాదా?
అయితేనేమి? మన ఆర్థిక ప్రగతి అమోఘమే! బడ్జెట్‌లో రెండంకెలంటూ ఉవాచలు. ప్రతీ మూడు మాసాల లెక్కలు 6-7 శాతం దాటవు. అయినా, 2018-19లో 7.7 శాతం దాటదని స్వయాన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) ప్రస్తావిస్తే, కాదుకాదు ఆర్థిక ప్రగతిలో ప్రపంచస్తాయిలో నేడు 7వ స్థానంలోనున్న భారత్ 2018 నాటికి ఫ్రాన్స్, బ్రిటన్‌లను కిందికి తోసి 5వ స్థానానికి ఎదుగుతుందని వరల్డ్ ఎకనమిక్ లీగ్ అప్పుడే ఎరుకల సోది చెప్పేసింది. ఇదంతా నిజంగా జరగాలంటే, మనం నిజంగానే అప్పులు చేయాల్సిందే! ఇలా చేస్తేనే కదా 2027 వాటికి మూడో స్థానంలో వున్న జపాన్ స్థానాన్ని ఆక్రమించగలుగుతుంది. గాడ్జిల్లాలాంటి సినిమాను మన బా,టా వుడ్‌లు తీయగలుగుతాయి. ఆ ఉషోదయం కోసం ఎదురుచూడడం తప్ప ఈ నూతన సంవత్సరంలో చేసేది ఏమీ ఉండకపోవచ్చు!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162