మీకు మీరే డాక్టర్

షుగరువ్యాధిలో శాకాహారం జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఏధి చేసినా అందులో ‘అతి’ ఎక్కువ పాళ్లు ఉంటోందని వైద్య శాస్త్రం హెచ్చరిస్తోంది. ఇది తెలుగు వాళ్ల గురించి మాత్రమే కాదు, ప్రపంచం పోకడకు సంబంధించి చేస్తున్న హెచ్చరిక. ముఖ్యంగా షుగరు రోగులకు శాకాహారం విషయంలో ఈ అతిపోకడల గురించి అణ్ణాపంజారెల్లా అనే డైటీషియన్ న్యూట్రిషనిస్టు 2020 జనవరి 28న ‘వెబ్ ఎం డీ’ జర్నల్లో షుగరు రోగులు శుద్ధ శాకాహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉందని సూచించారు.
కూరగాయల వలన ఆహార పీచు (డైటరీ ఫైబర్) ఎక్కువగా అందుతుంది. అది శుద్ధ మాంసాహారం ద్వారా ఉండదు కాబట్టి ఆహారంలో శాకాలు (కూరగాయలు, ఆకుకూరలు) తప్పనిసరి.
మాంసాహారం ద్వారా విషదోషాలు శరీరంలోకి ఎక్కువ చేరే అవకాశం ఉంటుంది. శాకాహారం ద్వారా విషదోషాల్ని పోగొట్టే యాంటీ-ఆక్సిడెంట్లు ఎక్కువగా శరీరానికి అందుతాయి. కాబట్టి, శాకాహరం మనిషికి తప్పనిసరి. ముఖ్యంగా షుగరు రోగులకు మరీ తప్పనిసరి. ఇలా చాలా ఉపయోగాల్ని శాకాహారం విషయంలో ఏకరవు పెట్టవచ్చు.
విదేశాల్లో మనకులాగా శాక మాంస భోజన విధానం అలవాటు తక్కువ. అన్నంలో మాంసం కూర తినే అలవాటు మనది. కేవలం మాంసం కూర మాత్రమే తినే అలవాటు వాళ్లది. అందుకని కావాలని కూరగాయల సలాడులు తినాలని అక్కడ ఎక్కువ ప్రచారం చేశారు. శాకాహార భోజనంలోనూ, మాంసాహార భోజనంలో కూడా ఎంతో కొంత కూరగాయలు తినే అలవాటు మనకుండటం వలన ఈ సలాడులు తినే విషయంలో మనకు పెద్దగా ప్రచారం జరగలేదు. పాశ్చాత్యుల్ని ప్రతీ విషయంలోను అనుకరించటమే నాగరికత అనుకునే కొందరు విందుభోజనం కమ్మని కూరగాయల్తో కూడుకున్నదైనప్పుడు ప్రత్యేకంగా సలాడుల అవసరం అంతగా ఉండకపోవచ్చు.
కూరగాయలతోనూ, ఆకు కూరలతోనూ చేసుకునే తెలుగువారి వంటకాలలో ఒక విశిష్టత ఉంది. ఒక ఆకుకూర లేదా కూరగాయతో కూర గానీ, పప్పు గానీ, పచ్చడి గానీ చేసుకునేటప్పుడు వాటిలో తగినంత పప్పు, ఉప్పు, కారంతో పాటు కరివేప, కొత్తిమీర, పుదీనా లాంటి జీర్ణశక్తి వర్ధకాలు చేర్చటం, కొద్దిగా నెయ్యి లేదా నూనెతో తాలింపు పెట్టడం, జీడిపప్పు, బఠాణీ గింజలు లాంటి పోషకాలను అదనంగా చేర్చటం, కందిపప్పు లేదా పెసరపప్పు తగినంతగా జోడించటం, తక్కువ ఉష్ణోగ్రత దగ్గర జాగ్రత్తగా వండుకోవటం ఇలాంటి జాగ్రత్తల వలన మన వంటకాలు తేలికగా అరిగేవిగా, పొట్టను పాడుచేయకుండా, పేగుల్ని బలసంపన్నం చేసేవిగా ఉంటాయి. ఇలా వండుకుంటే శాకాహారం అన్ని రోగాల్లోనూ మేలుచేస్తుంది. వ్యాధి త్వరగా తగ్గేలా దోహదపడుతుంది. శుద్ధమాంసాహారానికి ఈ ప్రయోజనాలు తక్కువ.
ఆహార పదార్థాలను కేవలం ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్ల పద్ధతిలో మాత్రమే తూకం వేస్తే మనకు చాలా సమాధానాలు దొరక్కుండా పోతాయి. మాంసంలోనూ, పప్పులోనూ మాంసకృత్తులే ప్రధానంగా ఉన్నప్పటికీ వాటిని వండే తీరులోనూ, తీసుకునే పరిమాణంలోనూ కొంత అవగాహన అవసరం అవుతుంది.
జీర్ణశక్తి మందంగా ఉండటం వలన షుగరు వ్యాధి రేపు వచ్చేది ఇవ్వాళే వస్తుంది. ఈ జీర్ణశక్తిని పదిలపరచుకుంటే ఇవ్వాళ వచ్చే షుగరు వ్యాధిని రేపటికి వాయిదా వేసుకోగలుగుతాం. ఇది చిన్న సూక్ష్మం. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుని షుగరు వ్యాధిని ఒక కంట కనిపెట్టుకుంటూ ప్రతీ వ్యక్తీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే షుగరుతో పాటు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలక్కూడా మేలు కలుగుతుంది.
ఆహార శాస్తవ్రేత్త అణ్ణాపంజారెల్లా అటు శుద్ధ మాంసాహారుల్ని, ఇటు మాంసాహారం పూర్తిగా వర్జించి కేవలం సలాడ్స్ మీద ఆధారపడే వ్యక్తుల్ని ఇద్దర్నీ తప్పుబడుతున్నారు. ""When completely eliminating meat, it's important to eat a variety of plant-based sources of protein to make up for what you're removing from your diet మాంసాహారం పూర్తిగా మానేస్తున్నప్పుడు, అందుకు బదులుగా శాకాహారంలో ప్రొటీన్లు తగినంతగా ఉండేలా చూసుకోవాలి’’ అని దీని భావం. జీడిపప్పు, బాదాం పప్పు లాంటి నట్స్, గుమ్మడి, అవిశ, దోస, ఇలాంటి కాయగూరల గింజలు, చిక్కుడు, బఠాణీ, రాజ్‌మా లాంటి బీన్స్, కంది, పెసర, మినప, శనగలాంటి పప్పు్ధన్యాలన్నీ మాంసానికి ప్రత్యామ్నాయ ధాన్యాలే! కేవలం సలాడులతో కడుపు నింపుకునే మాంస వ్యతిరేకులు తమ ఆహారంలో వీటిని చేర్చుకోకపోతే శుద్ధ శాకాహారం అపకారం చేస్తుందని ఆమె హెచ్చరించారు. ""Try to fill up on foods rich in fiber and antioxidants, like colorful fruits and non-starchy vegetables. This will be key in staying full and meeting your nutrient requirements throughout the day'' కూరగాయలు, ఆకుకూరలు, ఫప్పు్ధన్యాలు, వరి, గోధుమ, రాగి, జొన్న లాంటి ధాన్యపు గింజలు రంగు రంగుల పండ్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవటం వలన పోషక విలువలు తగినంతగా అందుతాయనేది ఆమె సూచన.
షుగరు వ్యాధి విషయంలో ఆమె వేగాన్ (శాకాహార భోజనం) విషయంలో చెప్తోన్న అభ్యంతరంలో ఒక పాయింటు ఉంది. ప్రొటీన్లను వదిలేసి కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తినటం వలన షుగరు వ్యాధిలో అపకారం జరుగుతుంది... అని! అందుకని శాకాహారం మీద ఆధారపడదలచినవారు మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఆహార పీచు (protein, fat and fiber) ఈ మూడింటినీ తగు పాళ్లలో ఉండేలా చూసుకోవటం అవసరం అంటారామె! ప్రొటీన్, ఫాట్, ఫైబర్ కలిసిన ఆహారాన్ని తినాలని ఆమె సూచిస్తున్నారు. షుగరు వ్యాధికి ఇది మరీ అవసరం అని ఆమె నొక్కి చెపుతున్నారు.
తెలుగింటి భోజనంలో మొదట మృదువుగా ఉండే పప్పు, తరువాత కూర, ఆ తరువాత పచ్చడి, తరువాత పులుసు, ఆఖరున మజ్జిగ లేదా పెరుగు ఇలా ఒకదాని తరువాత ఒకటి తినే ఒక ఆహార సంస్కృతి కనబడుతుంది. ఇది పాశ్చాత్యుల భోజన విధానంలో లేదు. నిజానికి ఆమె సూచించినట్టే తెలుగువారి ఆహార విదానం ఉంటుందని ఆమెకు తెలీదు. సమతుల్య ఆహారం (well balanced meals) గురించి ఆమె ఇలా సూచిస్తున్నారు...""for each meal, you fill up half of your plate with non-starchy fruits and veggies, a quarter with a high-fiber carbohydrate, and the remaining quarter with a plant-based protein. కార్బోహైఢ్రేట్లు తక్కువగా ఉండే ధాన్యం, ఒక వంతు పప్పు్ధన్యాలూ ఉండే విధంగా ఒక పళ్లెంలో మూడు వంతులు వడ్డించుకుని, తినాలని ఆమె సూచిస్తున్నారు.
మన ఆహారంలో మసాలాలు, చింతపండు రసం, శనగపిండి కలిపిన పదార్థాలు, వేపుడు కూరలు ఎక్కువగా ఉంటే మనం కూడా పప్పులో కాలేసినట్టే!
ఇప్పుడు మనం తింటోన్న అన్నం పరిమాణాన్ని సగానికి పైగా తగ్గించి కూర, పప్పులతో తినటం శ్రేయస్కరం. షుగరు వ్యాధిలో తీసుకోదగిన జాగ్రత్త ఇది. అన్నం పరిమాణం మూడో వంతుకు తగ్గించి, వీలైతే కొద్దిగా తృణధాన్యాలను చేర్చుకుని బాగా ఎక్కువగా కూర, పప్పు, రోటీ పచ్చడి, పెరుగు పచ్చడి లాంటి వాటితో తక్కిన ఆకలిని తీర్చుకోవటం చెప్పదగిన సూచన.
కూరల్ని వండేప్పుడు నూనె కొద్దిగా వేసి వండుకోవచ్చు. నూనె పోసివండకండి. అన్నంలో కొద్దిగా నెయ్యి (మంచిది దొరికితే) వేసకోవచ్చు. కానీ నెయ్యి పోసుకుని తినకూడదు. కోమలమైన కూరగాయల్ని అధిక ఉష్ణోగ్రత దగ్గర నూనెలో వేయించకూడదు. కుక్కర్‌లో వండకూడదు. మాంసాన్ని మానేసి శాకాహారం తినాలంటే ఇలా జాగ్రత్తగా వండుకోవాలి అనేది ఈ అమెరికన్ డైటీషియన్ సూచన.
తెలుగు వారు ఉదయానే్న తినే టిఫిన్లన్నీ ఝంక్ ఫుడ్స్‌తో సమానమేనని గుర్తించండి. ఉదయం పూట కూరగాయ ముక్కల్లో పెరుగు కలిపి, కొత్తమీర వగైరా చేర్చి తాలింపు పెట్టిన పెరుగుపచ్చడితో కొద్దిగా అన్నం లేదా చపాతీ/పుల్కాలు తినటం ఉత్తమం. వంటకాలలో చింతపండు, అల్లం వెల్లుల్లికి ప్రాధాన్యత తగ్గిస్తే అన్నం తక్కువ, కూర ఎక్కువగా తినటానికి వీలవుతుంది. జీడిపప్పు, బాదాం లాంటివి అప్పుడప్పుడు తగినంతగా తింటూ ఉండండి. పప్పుని తప్పనిసరిగా భోజనంలో ఒక ఐటమ్‌గా తీసుకోండి. కలగూరపప్పు కాకపోతే పెసర లేదా కందిబేడల్తో ‘ఉత్తపప్పు’ వండుకు తినండి. మంచి నెయ్యి దొరికితే కొద్దిగా వేసుకుని తినండి. మాంసానికి ప్రత్యామ్నాయం పప్పే. ఆ ప్రత్యామ్నాయం సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి, ఎక్కువ పప్పుతో అన్నం తినటం మంచిది. పప్పు తింటే గ్యాసు వస్తుందనేది అపోహ. అజీర్తి ఉన్నప్పుడు పప్పు తినకపోయినా గ్యాసు వస్తుంది. ఒక ఆహార ద్రవ్యం కన్నా, దాన్ని వండే విధానమే ఎక్కువ అపకారం చేస్తుంది. శాకాహారంలో ఈ జాగ్రత్త మరీ ఎక్కువ అవసరం కూడా!
ఆహార సమతుల్యత పాటించడం, తక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండుకోవటం, ఎక్కువ నూనె లేకుండా వండుకోవడం, పిండి పదార్థాలను తక్కువగా తినటం అవసరం. అందుకే, మినప్పిండితో వంటకాలకు ప్రాధాన్యత తగ్గించాలి. సమానంగా రాగిపిండి, జొన్నపిండి, సజ్జపిండి ఇలాంటి వాటిలో ఏదైనా ఒక పిండిని గోధుమపిండితో సమానంగా కలిపి రోటీలు వంటివి వండుకోవటం మంచిది. అప్పుడే షుగరువ్యాధిలో శాకాహారం ద్వారా సాధించుకోదగిన ప్రయోజనం సాధించగలుగుతాం.

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com