దక్షిన తెలంగాణ

అనుభూతిని పంచేదే అసలైన కవిత్వం ( అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుభూతిని పంచేదే అసలైన కవిత్వమని భావించే ప్రముఖ పద్యకవి శ్రీ జి.వి.కృష్ణమూర్తి వృత్తిరీత్యా ఉద్యోగవిరమణ చేసిన ఉన్నత పాఠశాల ప్రధానచార్యులు. గణితశాస్త్ర బోధకులుగా అందరి మన్నన పొందిన ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకున్నారు. ఛందోబద్ధ పద్య రచన చేయడంలో అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న ఆయన రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్‌కు చెందినవారు. శ్రీ వెంకటేశ్వర శతకం, రాజేశ్వర శతకం, వెలుగురేఖలు (పద్య ఖండ కావ్యం), దేవీ శతకములతో పాటు కూబాద్రి క్షేత్ర మహత్మ్యము గ్రంథాలను ప్రకటించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో పాటు అనేక సాహితీ సంస్థల నుండి సన్మాన సత్కారాలు అందుకున్నారు. జగిత్యాల కౌసల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల వారు ఆయనకు పద్య కవి కోకిల బిరుదును ప్రదానం చేశారు. పద్య కవితా సదస్సు అధ్యక్షునిగా వైవిధ్యమైన సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించింది. ఆయనతో జరిపిన ముఖాముఖీ వివరాలు ఆయన మాటల్లోనే పాఠకులకు అందిస్తున్నాం..
**
ఆ మీ రచనా వ్యాసంగాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1989 నుండి రచనలు చేయడం ప్రారంభించాను.

ఆ గణితశాస్త్ర బోధకులైన మీకు పద్య రచనవైపు ఆసక్తి కలగడానికి ప్రేరణనిచ్చింది ఎవరు?
గణిత శాస్తమ్రంటే నాకెంతో ఇష్టం.. గణిత బోధన అంటే మరీ ఇష్టం..అలాగే తెలుగు సాహిత్యమన్నా.. తెలుగు పద్య రచన అన్నా అంతే ఇష్టపడతాను. నేను పద్య రచన వైపు రావడానికి హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు..మా గురువర్యులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వేదాంతాచార్యుల వారు. తరువాత ఛందోబద్ధ పద్య సృజనకు ప్రేరణనిచ్చిన వారు కొత్తపల్లి హైస్కూల్‌లో కలిసి పనిచేసిన హిందీ పండితులు శ్రీ అనంతుల హరికిషన్ రావు గారు. చిన్ననాటి నుంచే పద్యాలను భావ యుక్తంగా, రాగయుక్తంగా పఠించడం అలవాటు చేసుకోవడానికీ వీరిద్దరి ప్రోత్సాహం ఉంది.

ఆ ఇప్పుడు అనుకున్నన్ని పద్యకావ్యాలు వెలువడక పోవడానికి కారణమేమంటారు?
నేడు వచన కవితా ప్రవాహంలో పద్యకావ్య సృజన కొంతమేరకు వెనుకబడి ఉన్న మాట వాస్తవమే! అయినా శతకాలు ఛందోబద్ధంగా వెలుబడుతూనే ఉన్నాయి. అనుకున్నన్ని రాకపోవడానికి కారణం.. ఛందోబద్ధ నియమాల చట్రం వున్నది. పద్యం ఎవరు రాసిన ఛందస్సు పాటించాల్సి వుంది. పైగా వ్యాకరణంపై భాషపై, పదప్రయోగంపై సాధికారత వుండాలి. భావాన్ని ఛందస్సు చట్రంలో బిగించినప్పుడే పద్యమనిపించుకుంటుంది. అందుకే అనుకున్నన్ని వెలువడటం లేదు.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
ఇది చాలా మంచి ప్రశ్న..సాహిత్యం సమాజ హితం కోరేది. సాహిత్యం ఆలోచనామృతం..సామాజిక స్పృహతో పాటు చక్కని సందేశం ఇవ్వగలగేదే కవిత్వం. అది సామాజిక చైతన్యానికి దోహదపడాలి. అనుభూతిని పంచేదే అసలైన కవిత్వమని నేను భావిస్తాను. కవిత్వం హృదయాన్ని మీటగలగాలి. మదిలో కలకాలం నిలిచిపోవాలి. ప్రక్రియ ఏదైనా అందులో కవిత్వం ఉండాలి. అది కవి యొక్క ప్రతిభపై ఆధారపడి వుంటుంది.

ఆ ఇప్పుడొస్తున్న పద్య కావ్యాలపై
మీ అభిప్రాయం?
ప్రస్తుతం పద్య కావ్యాలు..సరళమైన రీతిలో ప్రకటింపబడుతున్నాయి..పూర్వ కవుల వలె ఇప్పటి కావ్యాల్లో గాఢత కొరవడుతోంది. అయితే.. ఆధ్యాత్మిక, భక్తి పూర్వక అంశాలతో పాటు ఈ నాటి పద్యకావ్యాల్లో సమకాలీన సామాజిక సంఘటనలు చోటు చేసుకోవడం స్వాగతించదగింది.

ఆ పద్యకవులకు శిక్షణ అవసరమని
భావిస్తున్నారా?
శిక్షణ దేనికైనా అవసరమే..ముఖ్యంగా పద్యకవులు వ్యాకరణంపై ఛందో నియమాలను తెలుసుకోవడానికి శిక్షణ పొందితే తప్పేమీ లేదు. పూర్వ కవుల పద్య కావ్యాలను బాగా అధ్యయనం చేస్తే..పద్యం యొక్క నడక, శిల్పం, అభివ్యక్తి అంశాలను ఒంట పట్టించుకోవాలి.

ఆ నేడు వెలువడుతున్న వచన
కవిత్వంపై మీ అభిప్రాయం ?
నేడు వచన కవిత్వ ప్రవాహం ఎక్కువైంది. కవుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుభపరిణామమే అయినా.. వచనంలో కవిత్వాంశ గురించి కొంత మంది కవులు పట్టించుకోవడం లేదు. వస్తు ఎంపికలో, ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపులో శ్రద్ధ చూపించాల్సి వుంది.

ఆ మీకు బాగానచ్చిన పద్యకావ్యం?
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘రామాయణ కల్పవృక్షం’.

ఆ మీకు బాగా నచ్చిన పద్య కవి ఎవరు?
ఇది కొంచెం కష్టమైన ప్రశ్న..ఏ కావ్యం చదువుతున్నప్పుడు ఆ కవి గొప్పగా కనపడతాడు. అయితే తొలినాళ్లలో నన్ను ఆకట్టుకున్న కవి శ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తీగారు (కరుణ శ్రీ).

ఆసాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
కవులు, రచయితలను ప్రోత్సహించడానికి సాహితీ పురస్కారాలు అవసరమే.. పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతలను పెంచుతాయి..అయితే పురస్కార ఎంపికలో పారదర్శకత అవసరం. ప్రతిభ గల వారికే నిస్పక్షపాతంగా పట్టం కట్టాలి.

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే
సలహాలు, సూచనలు?
కొత్తగా సాహిత్య సృజనకై కలం పట్టేవారు మొదట అధ్యయనంపై దృష్టి పెట్టాలి. భాషపై పట్టు సాధించాలి. సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. స్పందించే గుణాన్ని అలవర్చుకోవాలి. ఆయా ప్రక్రియల్లోని మెలకువలను తెలుసుకుని రచనలు ప్రారంభించాలి.
**
: చిరునామా :
జి.వి.కృష్ణమూర్తి
ఇం.నం.8-5-434
రాఘవేంద్రనగర్
కరీంనగర్-505001
సెల్.నం.9490182941
**
ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544