విజయవాడ

ఆదర్శ బాలలు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజు, రమ అన్నా చెల్లెళ్లు. 7వ తరగతి చదువుతున్నారు. క్లాస్ జరుగుతుండగా ప్రిన్సిపాల్ గారు ఒక నోటీసు పంపారు. అందులో ‘పిల్లలూ..! ఇంకొక మూడు నాలుగు నెలల్లో మన స్కూలు వార్షికోత్సవం జరుగుతుంది. మీరు స్వయంగా తయారు చేసిన మోడల్స్ ఆరోజు ప్రదర్శించవచ్చు. వాటికి ఫస్టు, సెకండ్ ప్రైజులు ఉంటాయి. అందరూ మెచ్చినదానికి ప్రత్యేక బహుమతి కూడా ఉంటుంది. ఆ బహుమతి మన వార్షికోత్సవం రోజు మన ఎమ్మెల్యే గారు స్వయంగా మీకు అందజేస్తారు’ అని వుంది. క్లాసులో టీచర్ చదివి అందరికీ వినిపించారు. ఇంటికొచ్చిన రాజు, రమ ఇద్దరూ బుగ్గన చేయి చేర్చుకుని ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా ఆ బహుమతిని గెలుచుకోవాలి. అందుకోసం ఏంచేయాలి? ఈ ఆలోచనలో ఆకలి సంగతి కూడా వారు మర్చిపోయారు.
అది గమనించిన వారి బామ్మ ‘ఏమిరా పిల్లలూ..! ఏమిటి మీ ఆలోచన? ఆకలి కూడా మర్చిపోయారు’ అంటూ వాళ్ల దగ్గరకు వచ్చింది. విషయం తెలుసుకుంది.
‘ఓస్..! ఇంతేనా? కొంచెం కష్టపడితే ఆ బహుమతి మీకే దక్కుతుంది’ అని వాళ్లు ఏంచేయాలో చెప్పింది.
వెంటనే బామ్మ చెప్పినట్లు చెయ్యాలనుకున్నారు. అన్నం తిని పెరట్లోకి వచ్చారు. ఖాళీ స్థలంలో మట్టిని తవ్వగోలతో తవ్వారు. మట్టిని కలియదిప్పారు. పేడను సేకరించారు. కొట్టు నుండి వేపపిండి తెప్పించారు. ఆ మట్టిలో పేడ, వేపపిండి వేసి బాగా కలియతిప్పారు. తరువాత బాగా తడిపారు. రెండు మడులను తయారు చేశారు.
మరుసటి రోజు ఒక మడిలో ఆకుకూర విత్తనాలు చల్లారు. రెండవ మడిలో కూరగాయల విత్తనాలు గుచ్చారు. చక్కగా మట్టి అంతా తడిసేటట్లు రెండు పూటలా నీళ్లు చల్లారు. 3వ రోజు విత్తనాల నుండి మొలకలు వచ్చాయి. అవి చూచి ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఇంట్లో వాళ్లకి చూపించి కేరింతలు కొట్టారు. అలా ఆ మొక్కలు చక్కగా పెరిగి పూతకొచ్చాయి. పూత స్థానంలో చిన్నచిన్న పిందెలొచ్చి కాయలయ్యాయి. రోజూ వాటిని చూచి రాజు, రమ సంతోషంతో కేకలు పెట్టేవారు. ఆనందంతో పరవశించిపోయేవారు. చక్కగా నీళ్లు పెట్టి జాగ్రత్తగా వాటిని పెంచసాగారు.
వార్షికోత్సవం రోజున స్కూలు ఆవరణలో పిల్లలు తయారు చేసిన వస్తువులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరూ ప్రదర్శనలో వస్తువులను తిలకించసాగారు.
రాజు, రమ వంతు వచ్చింది. రాజు ఒక పలచని నూలు వస్త్రంలో చుట్టివున్న మూట విప్పాడు. ఆ వస్త్రం తడిగా ఉంది. నిదానంగా వస్త్రం తొలగించాడు. అందులో నుంచి ఆకుకూరలు! బయటికి తీసి అక్కడున్న వారందరికీ చూపించాడు. రమ తన దగ్గరున్న మూట విప్పింది. అందులో కాయగూరలు! ప్రదర్శన తిలకిస్తున్నవారు క్లాస్ టీచర్ వైపు ప్రశ్నార్థకంగా చూశారు.
అప్పుడు క్లాస్ టీచరు వారికి అసలు విషయం వివరించారు. ‘రాజు, రమ ఈ ఆకుకూరలు, కూరగాయలు ప్రకృతి ఎరువుతో పండించారు. ఎంతో కష్టపడి వారి పెరట్లో సాగు చేశారు. ఈ ఆలోచన వారి బామ్మ గారిది. వార్షికోత్సవం ప్రకటన రోజు నుండి వారు విత్తనం నాటి ఈ ఆకుకూరలు, కూరగాయలు కాయించారు’ అని ఆమె ప్రకటించారు. అది విన్న అక్కడి వారంతా సంతోషంగా చప్పట్లు కొట్టి వారిని అభినందించారు. ప్రిన్సిపాల్ గారు వారికి ఓ ‘ప్రత్యేక బహుమతి’ ప్రకటించారు.
ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిన కూరలు కావటంతో కొందరు సందర్శకులు తమ ఇళ్లకు తీసుకెళ్లబోయారు. డబ్బులు ఇచ్చి తీసుకెళ్లమని రమ వారిని కోరింది. ప్రిన్సిపాల్ గారు కొంచెం కోపంగా చూశారు.
అప్పుడు రాజు ‘క్షమించండి సార్! ఆ డబ్బులు మన స్కూలు ముందు కూర్చున్న అవ్వ కోసం అడుగుతున్నాము. అవ్వ రోజూ శనక్కాయలు, ఉసిరికాయలు, తదితర తినుబండారాలు మాకు అందుబాటులోకి తెచ్చి అమ్ముతుంది. కానీ పాపం! ఆ అవ్వకు సరిగ్గా కళ్లు కనిపించవు. కళ్లజోడుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతోంది. కళ్లజోడు కొనిపెడదామని అనుకున్నాం’ అని చెప్పాడు.
ఆ మాటలు విన్న ఎమ్మెల్యే గారు రాజు, రమ వైపు ఆశ్చర్యంగా చూశారు. వారి భుజం మీద చేయివేసి దగ్గరగా తీసుకుని అభినందించారు. అవ్వకు తాను ఇల్లు కట్టిస్తానని ఆయన మాట ఇచ్చారు. పిల్లలను ఇంత మంచి ఆదర్శవంతులుగా పెంచినందుకు వారి తల్లిదండ్రులను అభినందించారు. బామ్మకు ప్రత్యేకంగా అభినందనలు అందజేశారు.
- బి లక్ష్మీపార్వతి,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9848997103
***

సంస్కృతి

పుష్కర స్నానం... అనంత పుణ్యఫలం
మానవ నాగరికత, సంస్కృతి అభివృద్ధి చెందుతూ వచ్చింది నదీ తీరాల్లోనే. అందుకే మనకున్న ముఖ్యమైన 12 నదులకు ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరం వస్తుంది. గత సంవత్సరం గోదావరి నది పుష్కరాలు జరిగితే, ఈ ఏడాది కృష్ణానదికి పుష్కరాలొచ్చాయి. కృష్ణా పుష్కరాలకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమంటే?.. మనం ప్రతి నిత్యం స్నానం చేసేటప్పుడు చెప్పుకునే శ్లోకంలో ‘గంగేచ యమునేచైవ’ పఠిస్తాం. అయితే ఈ శ్లోకంలో ఎక్కడా కృష్ణవేణి పేరు లేదు. అయినా మనం కృష్ణానదికి పుష్కరాలు నిర్వహిస్తాం. శ్లోకంలో పేరు లేనంతమాత్రాన ఆ నది గొప్పది కాదని భావించక్కర్లేదు. దేశంలోని అతిపెద్ద రెండో పొడవైన నది కృష్ణానది.
మహారాష్టల్రోని పడమటి కనుమల్లో సముద్ర మట్టం నుండి సుమారు 4385 అడుగుల ఎత్తులో పుట్టి మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పారే కృష్ణానది సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లక్షలాది వ్యవసాయ క్షేత్రాలకు, కోట్లాది జంతు జలాలకు ప్రాణాధారమైన జలాలు అందిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది సతారా జిల్లాలోని మహాబలేశ్వరంలో జన్మించింది. ఈ నదితో పాటు వేణా, కుకుద్మతి, సావిత్రి, గాయిత్రి అనే నాలుగు నదులు కూడా పారుతున్నాయి. ఈ అయిదు నదులను ‘పంచగంగలు’ అంటారు.
కృష్ణానది అతి పురాతనమైనది. అనాది కాలం నుండి ప్రవహిస్తోందనటానికి అనేక ఆనవాళ్లున్నాయి. అందుకు మనకు బౌద్ధ జాతక కథల్లో ఉదాహరణలు లభిస్తాయి. కృష్ణానదీ తీరంలోని అమరావతి, నాగార్జునకొండ వంటి బౌద్ధ క్షేత్రాలు క్రీస్తు శకారంభంలో, దానికి పూర్వ కాలంలోనూ చాలా ప్రసిద్ధమైనవి. బౌద్ధ జాతక కథల్లో కృష్ణానదిని ‘కన్నా-వెన్నా’ అని ప్రస్థావించారు. కన్నడ శాసనాల్లో హిరె హొళె (పెద్ద ఏరు), పెర్దొరె (పెద్ద ప్రవాహం), కృష్ణవేణ్నా, కృష్ణవేణి అనే పేర్లతో వ్యవహరించారు. దీని ప్రకారం చూస్తే కృష్ణవేణిలో కృష్ణ వేరు, వేణి వేరునా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అసలు ఈ నదికి కృష్ణా అనే పేరెందుకు వచ్చింది?. మనకు స్కాంద పురాణంలో, మహాబలేశ్వర పురాణంలోనూ దీనికి సమాధానం లభిస్తుంది.
కలియుగంలో అధర్మం పెరిగినప్పుడు ఋషులు బాధలు తట్టుకోలేక తమ కష్టాలను నారదమునీంద్రునితో మొరపెట్టుకున్నారు. నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఆశ్రయించాడు. అప్పుడు బ్రహ్మ ఎన్నో తీర్థాలను సృష్టించాడు. నారదుడు మళ్లీ నారాయణుని ప్రార్థించినప్పుడు నారాయణుని శరీరం నుండి ఓ నది పుట్టింది. అదే కృష్ణానది అయింది. మనకు లభించిన పురాతన శాసనాలను పరిశీలిస్తే కృష్ణానదిని కన్న-పెన్నా, కృష్ణా-వెంణా అని పిలవటం గమనించవచ్చు. దీంతో మనకు కృష్ణే గాని కృష్ణవేణి కాదు. మహారాష్టన్రు వదిలి కర్నాటకలో ప్రవేశించిన తరువాత అది ‘కృష్ణవేణి’ అయింది. అంతవరకు అది కృష్ణ మాత్రమే! ఒక నదిలో మరో నది సంగమించటం వల్ల ఆ నదికి మరొక నది పేరు కూడా కలుస్తుంది. ఉదాహరణకు తుంగ, భద్ర నదులు వేరువేరుగా పుట్టి తరువాత కలిసి ప్రవహిస్తున్నాయి. అలా నదుల కలయికలలో ఏది ప్రధానమైనదో దాని పేరు మొదట వస్తుంది. రెండోది తరువాత చేర్చబడుతుంది. తుంగా, భద్రా నదుల్లో ప్రధానమైనది తుంగా నది, భద్రా నది చిన్నది. అందువల్ల కలిశాక అది తుంగభద్ర అయింది. అలాగే ఇక్కడ కృష్ణ ప్రధానమైనది, దానిలో కలిసే పెన్నా చిన్నది. అది కృష్ణలో కలిసిన తరువాత తన పేరును కోల్పోయి కృష్ణా-పెన్నా రెండు కలిసి కృష్ణవేణి అయింది. కాలక్రమంలో కృష్ణవెన్నా కృష్ణవేణిగా మారి ఉంటుంది. ఇదే నేడు కృష్ణవేణిగా వ్యవహారంలో వుంది. ఇదీ కృష్ణానది పుట్టుక కథ.
కృష్ణానదిలో కలిసే ఉప నదుల్లో కర్నాటకలో మొదట కలిసేది దూదగంగ, తరువాత ఆగరణి, మలప్రభ, ఘటప్రభ నదులు కలుస్తాయి. మలప్రభ, ఘటప్రభ కూడా సహ్యాద్రిలో పుట్టినవే. ఘటప్రభ బిజాపురం బీళగి వద్ద కృష్ణలో కలుస్తుంది. అక్కడ నుండి ముందుకు సాగే కృష్ణ హునుగుంద తాలూకా కూడల సంగమంలో మలప్రభను కలుస్తుంది. ఇలా అనేక ఉప నదులు కృష్ణలో కలవటం విశేషం.
కృష్ణానది పుష్కర మహత్మ్యం
‘కలియుగంలో మానవులు తరించే మార్గం తెలుపమని విష్ణువును బ్రహ్మ కోరగా విష్ణువు తన అంశ వలన కృష్ణని అవతరింపజేసెను. ఆమె రూపలావణ్యాది విశేషములు చూసి బ్రహ్మ ఆశ్చర్యం పొంది తనకు పుత్రికగా ఇవ్వమని కోరగా విష్ణువు కృష్ణను బ్రహ్మకు ఇచ్చెను. అప్పటి నుండి కృష్ణ బ్రహ్మ యొక్క పుత్రికగా పిలువబడుచున్నది. కొంతకాలమునకు భూమి మీద పాపాలు పెరగటం గమనించిన విష్ణువు, పాప పరిహారం కోసం తన పుత్రికను తనకు ఇవ్వమని బ్రహ్మను కోరగా బ్రహ్మ విష్ణువుకు ఇచ్చెను. తనవద్దకు వచ్చిన కృష్ణను భూలోకము నందు ఎవరి వద్ద ఉంచాలి? అని దేవేంద్రాది దేవతలను కోరగా, వారు భూలోకమున పర్వత రూపమున నిలిచి తపస్సు చేయుచున్న ‘సహ్యముని’ని విష్ణువుకు చూపిరి. అంతట దేవతలు ఆ ముని వద్దకు వెళ్లి ‘ఓ మునీంద్రా..! ఈ పర్వత రూపమున ఘోర తపస్సు చేయుచున్నావు. కాని భూమిని ఉద్ధరించటానికి శ్రీమహావిష్ణువు తన రూపమగు కృష్ణతో వచ్చియున్నారు. ఆమెను ఏది కోరిన అది తీర్చగలదు’.. అని పలికిరి. దానికి సహ్యముని నేను శ్రీమహావిష్ణువును చేరుటకే తపస్సు చేయుచుంటిని. నా కోరికను తీర్చుటకు విష్ణువు కృష్ణతో రావటంతో నా జన్మ తరించింది. విష్ణువు, కృష్ణతో సహా నాపై మీరు నివశింపుమ’ని విష్ణువును ప్రార్థించెను. అంతట విష్ణువు అనుగ్రహించి ‘నీ తపస్సు ఫలించినది. నా అంశతో నీపై నివసించెదను. నీ ఉపకారం లోకమునకు పవిత్రత చేకూర్చగలద’ని చెప్పెను. అంతట విష్ణువు శే్వతాశ్వర్థ వృక్షమై అనగా తెల్లని రావిచెట్టుగా మారి సహ్యాద్రి పర్వతముపై నివశించెను. అంత కృష్ణానదియు ఆ వృక్ష అంతర్భాగమున ధవళాకృతి చెంది భూమి మీద ప్రవహించెను. ఈ నది యందు అనేక పుణ్యతీర్థములు కలియుట వలన మిక్కిలి మహత్మ్యము కల్గినదిగా మారెను. కావున కృష్ణానదిలో స్నానం చేసిన అనంత పుణ్యఫలము పొందగలరు’ అని పురాణాలు చెపుతున్నాయి.
12 సంవత్సరాల క్రితం అంటే 2004లో జరిగిన కృష్ణా పుష్కరాలు, గత సంవత్సరం జరిగిన గోదావరి నదీ పుష్కరాలు, అంత్య పుష్కరాల్లోనూ పుష్కర సమయ నిర్ణయంలో పండితుల మధ్య తేడాలు వచ్చాయి. ఈ సమయ నిర్ణయం విషయంలో పండితులు, పంచాంగకర్తల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం (ప్రభుత్వ పంచాంగకర్తలు) కృష్ణానదీ పుష్కరాలను 11-8-2016న గురువారం రాత్రి 09-24 ని. గురుడు కన్యారాశిలో ప్రవేశించటం చేత మరునాడు అనగా 12-08-2016 నుండి 23-08-2016 తేదీ వరకు 12 రోజులను కృష్ణా పుష్కరాలుగా నిర్ణయించారు. కనుక భక్తులు తమ మనోభావాలకు తగినట్లు పుష్కర స్నానం చేయవచ్చు. ఏదిఏమైనా పుష్కర సమయం నిర్ణయంలో వాదోపవాదాలు, వివాదాల వల్ల భక్తుల్లో గందరగోళం ఏర్పడుతుంది. కనుక పండితులు, పంచాంగకర్తలు ఒక నిర్ణయానికి వచ్చి పుష్కర ముహూర్తాన్ని నిర్ణయిస్తే బాగుంటుంది. పుష్కర స్నానం అనంతరం పిండ తర్పణం, ద్వాదశ దానాలు, షోడశ మహాదానాలు వంటివి భక్తిశ్రద్ధలతో ఆచరించాలి.
పుష్కరోత్పత్తి: పుష్కరాల సమయంలో పుష్కరోత్పత్తి గురించి మనం తెలుసుకోవాలి. పుష్కరుడనే బ్రాహ్మణుడు తపస్సు చేసి పరమశివుని మెప్పించి, జలమయతత్వ సిద్ధిని సంపాదించాడు. దీంతో అతనికి సర్వ తీర్థాలకు పావనత్వం కలిగించే అధికారం కలిగింది. దాంతో అతను సర్వదా బ్రహ్మలోకాన బ్రహ్మక మండలంలో నివశించసాగాడు. కొంతకాలానికి బృహస్పతి బ్రహ్మ కోసం తపస్సు చేసి జలమయుడైన పుష్కరుడు తనతో ఎల్లప్పుడూ ఉండేలా వరం కోరాడు. బ్రహ్మ అంగీకరించాడు. కానీ పుష్కరుడు బ్రహ్మను విడిచి రావటానికి అంగీకరించలేదు. అందుకు ప్రతిగా బృహస్పతి ప్రతి సంవత్సరం ఒక రాశి నుండి మరొక రాశి చేరునప్పుడు, ఒక నది నుండి మరో నదివైపు దృష్టి పెట్టినప్పుడు నదికి చేరిన మొదటి 12రోజులు, ఆ నదిని విడుస్తున్నప్పుడు చివరి 12 రోజులు పుష్కరుడు బృహస్పతితో ఉండేలా, మిగతా రోజుల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు ముహూర్తాలు బృహస్పతితో ఉండేలా, మిగిలిన కాలం బ్రహ్మలోకంలో ఉండేలాగ చెప్పాడు.
పుష్కరకాలంలో 12రోజులు 12రకాల దానం చేయటం ఎంతో మంచిది. ఇలా 12రోజులు 12దానాలు చేయలేని పక్షంలో మొదటి రోజు హిరణ్య శ్రాద్ధము, 9వ రోజు అన్నశ్రాద్ధము, 12వ రోజు అశ్రాద్ధము ముఖ్యంగా చేయాలి. అలా అని 12 రోజులు చేయవలసిన దానాలు చేయకుండా మానకూడదు. అలా అవకాశం లేనివారు మాత్రమే పై మూడు దానాలు చేయాలి.
12 సంవత్సరాల తరువాత మరలా కృష్ణానదికి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరం ప్రారంభం అయిన రోజు నుండి పనె్నండు రోజులు ప్రతిఒక్కరూ విధిగా తమకు దగ్గరలోని కృష్ణానదిలో స్నానమాచరించి, ఈ పనె్నండు రోజులు చేయవలసిన దానాలను తమ శక్తికొలది పండితులకు దానం చేసి, వారి ఆశీస్సులు అందుకోవాలి. అలాగే పితృదేవతలకు పిండ ప్రదానాలు, స్నాన, జప, శ్రాద్ధ కర్మలూ చరించాలి. కృష్ణానదిలో పవిత్ర స్నానమనంతరం మహిమాన్విత శ్రీ కనకదుర్గమ్మ తల్లిని, పక్కనే వున్న మల్లేశ్వరస్వామిని దర్శించటం మంచిది. ఇతర ప్రాంతాల్లో కృష్ణానది స్నానం ఆచరించినవారు అనంతరం దగ్గరలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించటం మంచిది. పవిత్ర స్నానంతో పాటు, స్నానఘట్టాల్లో బట్టలు ఉతకటం, షాంపులతో స్నానం చేయటం వంటి పనులతో అపరిశుభ్రం చేయక పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే ఆలయాల్లో ‘క్యూ’ పాటించడం, ఇతర భక్తులకు అసౌకర్యం కలిగించకపోవటం వంటివి చేయటం మన బాధ్యతగా ప్రతి భక్తుడు గుర్తించాలి. దూరప్రాంతం నుండి వచ్చే భక్తులకు చేతనైన సహాయం చేయటం సేవగా భావించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించటం వల్ల అటు పర్యావరణాన్ని, ఇటు మనలోని భక్త్భివాన్ని రెండిటినీ వ్యక్తపరచిన వారమవుతాం.
- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122
***

మనోగీతికలు

స్వీయ రాగం

నీ చూపుల వెనె్నల కిరణాలు
అచ్చొత్తిన లిపిలేని ప్రేమలేఖలు
హృదయంతో చదివా
మనసు పేజీలలో నిక్షిప్తం చేశా
నీ ఊహల పైరగాలి పంపిన
ఆకుపచ్చ చీర
ఒళ్లంతా చుట్టుకున్నా..
నీ జ్ఞాపకాల విహంగాలపై
సంధ్యా కాంతినై ప్రకృతి కాంతనై
శ్రావణ మేఘాలపై పయనించా
నీవు నాకు ఉన్నావనే భావన నింపిన
నిబ్బరపు చేమంతులు
మనసు సెజ్జనిండా నింపుకున్నా
నీ నవ్వుల వెనె్నల దారంతో మలచిన
మాలికా డోలికలలో ఓలలాడి మైమరచా
అణువంత నేను
అనంతమంత నీవు
ఏ నీలిమేఘాల అంచులు దాటి
కడలి అలలా ఎగసి చేరుకోవాలనే
ఆశేకాని - ఆకృతిలేని - ఆలోచనల
సాగరంలో
తీరం చేరేదెపుడో..
దూరం వీడేదెపుడో..!

- కె దేవికా రత్నాకర్,
తెనాలి, గుంటూరు జిల్లా.

కృష్ణవేణీ..!

ఉవిద సావిత్రి శాపాన నుద్భవించె
విష్ణువే కృష్ణరూపాన, వేణియయ్య
పరమ శివుడు తత్‌శాప ప్రభావగరిమ
కలిసి కృష్ణవేణి యగుచు నిలను వెలసె

నల్లని వేణితో కదలు నల్లని సుందర నాగకన్యవా
గొల్లున పెల్లువెల్లువగ గొబ్బున సాగి భయానకంబుగా
తొల్లి; ప్రశాంత చిత్తయయి, ధోరణి మారిచి నిండుచూలుతో
మెల్లగనేగు భూమిని సుమీ! యననొప్పు మనోజ్ఞవైఖరిన్

మల్లికార్జున దేవు మనసార సేవించి
పాతాళ గంగలో ఈతలాడి
నాగార్జునాచార్యు నర్మిలి నర్చించి
శిల్ప చాతురిగాంచి చెన్నుమీరి

వేదాద్రి నరసింహు వింజామరల వీచి
మురువు సొంపునరసి పరవశించి
అమరేశ్వరేశ్వరు అంఘ్రయుగ్మమ్మును
కడలేని భక్తితో కనులకద్ది

కనకదుర్గను కనులార గాంచి కాంచి
సర్వదేవతా చయమునే సంతరించి
ఎండుబారిన బీడుల గుండె తట్టి
వచ్చె పుష్కరకృష్ణ నివాళులిడుడి!
- కలవకొలను సూర్యనారాయణ,
గుంటూరు.
చరవాణి : 9849268659

అమ్మా నాన్న..
ఓ స్మార్ట్ ఫోన్!

అమ్మ ..
మహిళా మండలి నాయకురాలు
నిత్యం సమావేశాలు, పార్టీలు!
నాన్న ..
చేస్తుంటారు లెక్కలేనన్ని వ్యాపారాలు
ఎప్పుడూ తిరుగుతుంటారు దేశవిదేశాలు!
కొడుకు ..
అన్నీ ఉన్నా ఎవరూ లేని అనాథ
ఎవరికీ చెప్పుకోలేడు మనసులోని బాధ!
స్మార్ట్ ఫోన్ ..
తల్లిదండ్రులు వాడికిచ్చిన పెద్ద కానుక
అచ్చటాముచ్చటా అన్నిటికదే ఇక వేదిక!
- సిహెచ్ శర్మ,
విజయవాడ.
చరవాణి : 9440587567

పుష్క(ల)రపర్వ కృష్ణవేణి

సీ: సౌభాగ్య జీవన సౌఖ్యప్రద ‘వ్రత
వరలక్ష్మి’ వౌచు రావమ్మ! నీవు;
సదమల ‘సావిత్రి’ సంస్కృతి రూ‘పార
వింద జయంతి’వై వేగరమ్ము!
శాంత్యహింసాకాంతి సత్య‘మోహన’ గుణ
‘స్వాతంత్య్రలక్ష్మి’వై సాగిరమ్ము!
‘సోదరీ రక్షై’క వేదివై, ‘యజ్ఞోప
వీత పూర్ణిమ’ వౌచు ప్రీతిరమ్ము!
అమృత సత్కళాపూర్ణవై, అన్నపూర్ణ
వౌచు ‘్భ-రత’ పరిమళ వీచికలకు
రాజధానివై ‘పుష్కర’భ్రాజవగుచు
‘కృష్ణవేణీ తరంగిణీ’! ఇలకు రమ్ము!
వందనమ్ములు- సాహితీ చందనములు!!
‘విశాఖ’,
గుంటూరు.
చరవాణి : 9866944287
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com