నల్గొండ

రోడ్డు ప్రమాదంలో సద్గురు పివిసి పైప్ ఎండి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, జూన్ 7: కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడుకుంటూ కాసేపట్లో నివాసానికి చేరుకుంటామనుకునేలోగానే రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడగా కారు డివైడర్‌ను ఢీకొని ఒకరు మృతిచెందగా ముగ్గురికి గాయాలైన సంఘటన మంగళవారం మండలంలోని వెలిమినేడు శివారులో చోటుచేసుకుంది. నార్కట్‌పల్లికి చెందిన సద్గురు పివిసి పైప్ పరిశ్రమ ఎండి పసునూరి హరినాథ్(45) తన కూతురు వైష్ణవి, సోదరుడి భార్య శ్రీలత, కూతురు శ్రీప్రియలతో కలిసి కారులో హైదరాబాద్ నుండి నార్కట్‌పల్లికి వస్తుండగా వెలిమినేడు శివారులోకి కారు రాగానే ప్రమాదవశాత్తు కారు రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టింది. ఈఘటనలో కారు పల్టీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న హరినాథ్‌కు తీవ్రగాయాలై కారులోనే మృతిచెందాడు. కారును నడుపుతున్న హరినాథ్, ముందు భాగంలో కూర్చున్న వారు సీటుబెల్టులను పెట్టుకోగా రక్షణ కవచంలా ఉండే ఎయిర్‌బెలూన్‌లు రెండూ తెరచుకున్నా హరినాథ్ ప్రాణాలు కాపాడలేకపోయాయి. కారు పల్టీ కొట్టడంతో తీవ్రగాయాలై కారులోనే మృతిచెందాడు. కారులో ఉన్న ముగ్గురికి గాయాలుకాగా నార్కట్‌పల్లి శివారులోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని రామన్నపేట ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాపు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ యాదగిరి తెలిపారు. మృతుడు పారిశ్రామికవేత్త కావడంతో ప్రమాదస్థలి వద్దకు నార్కట్‌పల్లికి చెందిన వారు పెద్దఎత్తున తరలివచ్చి మృతదేహాన్ని ప్రమాదతీరును చూసి కన్నీటి పర్యంతమైనారు. రహదారి మీదుగా ప్రయాణిస్తున్న ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావులు ఘటనాస్థలిని సందర్శించారు.
శోకసంద్రంలో నార్కట్‌పల్లి
నార్కట్‌పల్లి: పారిశ్రామిక వేత్తగా గ్రామ స్థాయి నుండి జిల్లా వ్యాప్తంగా విస్తరించిన హరినాథ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త నార్కట్‌పల్లి ప్రజలు జీర్ణించుకోలేక శోక సముద్రంలో మునిగిపోయారు. సామాన్య కుటంబంలో జన్మించిన హరినాథ్ అన్నదమ్ముల పరస్పర సహకారంతో పారిశ్రామిక వేత్తగా రాణించడంలో సఫలీకృతమయ్యారు. ఇప్పటికే ఎన్నో అవార్డులందుకున్న ఆయన నార్కట్‌పల్లి ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. దీంతో మంగళవారం ఆయన రోడ్డుప్రమాదంలో మరణించడం అందరిని శోక సంద్రంలో ముంచింది. కుటుంబ సభ్యులతో పాటు, పట్టణ ప్రజలు, స్నేహితులు శోక సంద్రంలో కన్నీరు మున్నీరయ్యారు. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తాసుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, సూర్యాపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, నార్కట్‌పల్లి ఎంపిపి మల్లికార్జున్‌రెడ్డి, జడ్పీటీసి సత్తయ్యయాదవ్, వైస్ ఎంపిపి పుల్లెంల పద్మాముత్తయ్య, సర్పంచ్ అచ్చాలు గౌడ్ తదితరులు హరినాథ్ స్వగృహంలో ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
నేడు నార్కట్‌పల్లిలో అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అంత్యక్రియలు పరిశ్రమ ఆవరణలో బుధవారం జరగనున్నట్లు సంస్థ నిర్వహకులు తెలిపారు. ఈ అంత్యక్రియలలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు జిల్లాల నుండి పలువురు ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు.