జాతీయ వార్తలు
పీఎం-కిసాన్ ఎండమావే !
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూలై 19: దేశవ్యాప్తంగా 2.69 లక్షల మంది లబ్ధిదారులు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద తొలి దశ నగదును పొందలేకపోయారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభకు తెలిపింది. ఈ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల వివరాల్లో ఉన్న పరస్పర విరుద్ధ అంశాలను సవరించాలని రాష్ట్రాలను ఆదేశించినట్టు కేంద్రం వివరించింది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పర్షోత్తం రూపాల రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం వెల్లడించారు. అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని ప్రారంభించాయని పేర్కొంటూ, వీలయినంత త్వరగా ఈ పథకాన్ని ప్రారంభించి, రైతులకు పథకం ప్రయోజనాలు అందేట్టు చూడాలని పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. మణిపూర్, నాగాలాండ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ప్రమాణీకరించిన భూరికార్డులు అందుబాటులో లేని సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. జార్ఖండ్లో 1932 నుంచి భూరికార్డులను తాజాపరచలేదని, అందువల్ల త్వరగా వీటిని తాజాపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగిందని మంత్రి తెలిపారు. కేంద్రం లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో పీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని రెండు హెక్టార్ల లోపు వ్యవసాయ భూమి గల 14.5 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ. ఆరు వేల ఆర్థిక సాయాన్ని మూడు దశల్లో అందజేస్తారు. అంటే ఒక్కో దశలో రూ. రెండు వేల మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటి వరకు మొదటి దశలో దేశంలోని 4.14 కోట్ల మంది రైతుల ఖాతాలకు, రెండో దశలో 3.17 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ. రెండు వేల చొప్పున విడుదల చేయడం జరిగిందని మంత్రి రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. తొలి దశలో రూ. 8290.6 కోట్లు, రెండో దశలో రూ. 6355.8 కోట్లు విడుదల చేసినట్టు ఆయన వెల్లడించారు. 2,69,605 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల వివరాలను సవరించి, పంపించాలని సంబంధిత రాష్ట్రాలను ఆదేశించినట్టు ఆయన ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.