జాతీయ వార్తలు

అసెంబ్లీ సీట్ల పెంపును అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పార్టీ ఫిరాయింపులకు ఊతమిస్తున్న రెండు రాష్ట్రాల శాసనసభల సీట్ల సంఖ్యను పెంచే సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ పొందుపరిచింది, అయితే ఇప్పుడు దీనిని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ముఖ్యమంత్రులు పార్టీ ఫిరాయంపులకోసం దుర్వినియోగం చేస్తున్నందున సీట్లు పెంచే ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడున్న అసెంబ్లీ సీట్లు సరిపోతాయని జైరాం రమేశ్ చెప్పారు. ఝార్ఖండ్, కేరళ రాష్ట్రాల జనాభా మూడేసి కోట్లుండగా ఝార్ఖండ్ అసెంబ్లీ సీట్ల సంఖ్య 84 ఉంటే, కేరళ అసెంబ్లీ సీట్ల సంఖ్య 140. రెండు రాష్ట్రాల్లో సమాన జనాభా ఉంటే అసెంబ్లీ సీట్ల సంఖ్య కూడా సమానంగా ఉండాలి, ఈ లెక్కన ఝార్ఖండ్ అసెంబ్లీ సీట్ల సంఖ్యను 140కి పెంచవలసిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభల సీట్ల సంఖ్యను పెంచేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఝార్ఖండ్ శాసనసభ సీట్ల సంఖ్య పెంచేందుకు ఎందుకు కృషి చేయటం లేదని జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా దాదాపు ఎనిమిది కోట్లు. అసెంబ్లీ సీట్ల సంఖ్య 294. దాదాపు పది కోట్ల జనాభా ఉన్న పశ్చిమ బెంగాల్ శాసనసభ సీట్ల సంఖ్య 294. మహారాష్ట్ర జనాభా దాదాపు పదకొండు కోట్లు కాగా శాసనసభ సీట్ల సంఖ్య 284 మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభాతో పోలిస్తే శాసనసభ సీట్ల సంఖ్య బాగానే ఉన్నదని జైరాం రమేశ్ వివరించారు.
జనాభా అధికంగా ఉండి అసెంబ్లీ సీట్ల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాలపై ఎన్‌డిఏ ప్రభుత్వం దృష్టి సారించాలని జైరాం సూచించారు. ఫిరాయింపులను ప్రోత్సహించే ఎలాంటి పనిని కాంగ్రెస్ చేయదని ఆయన తెగేసి చెప్పారు.
తెలంగాణ శాసనసభలో ఇప్పుడు 119 సీట్లుంటే వీటిని 153కు పెంచవలసి ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్ల సంఖ్యను 225కు పెంచాలన్నది ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు రాష్ట్రాల శాసనసభల సీట్లు త్వరలోనే పెరుగుతాయంటూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో చంద్రశేఖర్ రావు ఇప్పటికే పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకున్నారని, అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచటం ఆపకపోతే మరికొందరు కాంగ్రెస్ శాసనసభ్యులు టిఆర్‌ఎస్‌లో చేరుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, ఏపి అసెంబ్లీలో ప్రతిపక్షం నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచటాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల సీట్ల సంఖ్యను పెంచేందుకు సంబంధించిన సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.