జాతీయ వార్తలు

సాయం కోసం ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 19: కేరళలో జల విధ్వంసం కొనసాగుతోంది. పది రోజులుగా ఎడతెరిపిలేకుండా కొనసాగుతున్న భారీ వర్షాల వల్ల ఇంతవరకు మృతుల సంఖ్య 197కు చేరుకుంది. త్రిశ్శూర్, ఎర్నాకుళం, ఆల్పుజా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పట్టణాలు, గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కోచి నావల్ ఎయిర్‌పోర్టులో సోమవారం నుంచి విమాన రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ పౌర అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 26వ తేదీ వరకు మూసివేశారు. వరదల తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న ఇదుక్కి జిల్లాలో 43 మంది మృతి చెందారు. మల్లపురం జిల్లాలో 28 మంది , త్రిశ్శూర్‌లో 27 మంది మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే వరద ప్రాంతాల్లో జనం ఆకలి కోసం అవస్థలు పడుతున్నారు. చెంగన్నూర్ పట్టణంలో ఐదు వేల మంది నిరాశ్రయులయ్యారు. వీరికి ఆహార పదార్థాలు అందించేందుకు అధికారులు నానాతంటాలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ప్రజలు ఇంతవరకు నిరాశ్రయులయ్యారు. వీరంతా శిబిరాల్లో గడుపుతున్నారు. మెడ లోతు నీళ్లలో ఉన్న సామానును తలపైన పెట్టుకుని భార్య పిల్లలతో గంటల తరబడి నడుస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరుతున్న వ్యక్తుల దృశ్యాలు కోకొల్లలు. రెండు రోజులుగా తిండిలేకుండా గడిపామని, అతి కష్టంపైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు చేరుకున్నట్లు అరనముల గ్రామానికి చెందిన ఒక మహిళ తెలిపారు. ఎర్నాకుళం జిల్లాలో పరవూరులో ఆరుగురు వ్యక్తులు మరణించారు. చర్చి గోడ కూలిన ఘటనలో వీరు మృతి చెందారని, ఈ సంఘటన గత బుధవారం జరిగినట్లు స్థానికులు చెప్పారు. పరవూరులోనే గత నాలుగు రోజులుగా చర్చి ఆవరణలో ఆరు వందల మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారని, వీరిని పట్టించుకునే వారు లేరని ఒక బాధితుడు విలేఖర్ల బృందానికి చెప్పాడు. వీరికి కనీసం మంచినీరు, బ్రెడ్ కూడా లభించక అలమటిస్తున్నారని, అతి కష్టంపైన నీటిలో ఈదుకుంటూ ఒడ్డున చేరిన ఒక వ్యక్తి విలపిస్తూ చెప్పాడు. కాగా చర్చి గోడ కూలి ఆరుగురు వ్యక్తులు మృతి సంఘటనపై ప్రభుత్వం తమకు సమాచారం లేదని పేర్కొంది. వ్యవసాయ శాఖ మంత్రి విఎస్ సునీల్ కుమార్ మాట్లాడుతూ త్రిశ్శూర్ జిల్లాలో కోలే వద్ద పంట భూములు, ఉప్పొంగిన వరదల వల్ల 42 గ్రామాలు నీట మునిగాయన్నారు. శిబిరాల్లో దాదాపు 2 లక్షల మంది ప్రజలు తలదాచుకుంటున్నారని చెప్పారు. కేరళకు వచ్చే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. కన్యాకుమారి-ముంబాయి సీఎస్‌టీ ఎక్స్‌ప్రెస్‌ను మళ్లించారు. రైళ్ల ట్రాక్‌లు దెబ్బతినడంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా రైళ్లను రద్దు చేయడం లేదా వేరే మార్గాల ద్వారా మళ్ళించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. రాష్ట్రంలో 16వేల కి.మీ రోడ్డు దెబ్బతినడంతో ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు పల్లపుప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించే పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. వేలాది మంది మత్స్యకారులను సహాయక చర్యల్లో భాగస్వాములను చేశారు. కొన్ని చోట్ల బాలికల హాస్టళ్ల వద్ద భవనాలపైనకు చేరుకుని సహాయం కోసం నిరీక్షిస్తున్న బాలికలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రిశ్శూర్ జిల్లాలో ఒక యువకుడు తన తల్లిని, ఇద్దరు పిల్లలను రక్షించాడు. కాని చివరకు నీటిలో తన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆ యువకుడి తండ్రి చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు.