జాతీయ వార్తలు
ఇంత స్పందన ఊహించలేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూన్ 19: రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా ఆయన మంత్రివర్గంలోని 57 మంది మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. 2014 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవంకోసం పిలుపునిచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీఎత్తున స్పందన వ్యక్తమవుతుందని తాను ఊహించలేదని రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఇచ్చిన ఓ సందేశంలో ప్రధాని మోదీ అన్నారు. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మీ స్పందన యోగా పట్ల మన చిత్తశుద్ధిని నిబద్ధతను చాటుతుందన్నారు. చండీగఢ్లో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతుండగా, ఆయన మంత్రివర్గంలోని మంత్రులు వివిధ రాష్ట్రాల్లో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరిలో దాదాపు పదిమంది మంత్రులను వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్కే కేటాయించడం గమనార్హం. గత ఏడాది జూన్ 21న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోగా, ఢిల్లీలోని చరిత్రాత్మక రాజ్పథ్ వద్ద జరిగిన కార్యక్రమంలో 36 వేల మందితో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలను ప్రదర్శించడం తెలిసిందే.
ఈసారి చండీగఢ్లోని క్యాపిటల్ కాంప్లెక్స్లో జరిగే కార్యక్రమంలో మోదీ వేలాది మందితో పాటుగా యోగాసనాలను ప్రదర్శిస్తారు. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలో, జైట్లీ ముంబయిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు విజయవాడలో జరిగే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరవుతుండగా, మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దేశరాజధానిలోనే జరిగే మరో కార్యక్రమంలో పాల్గొంటారు.
150 మంది దివ్యాంగులు కూడా..
చండీగఢ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో దాదాపు 150 మంది దివ్యాంగులు సైతం ప్రధాని నరేంద్ర మోదీతోపాటుగా యోగాసనాల్లో పాల్గొంటున్నారు. దాదాపుగా వీల్చైర్లకే పరిమితమైన 18 మంది మాజీ సైనికులు కూడా వీరిలో ఉండడం గమనార్హం. ఈ కార్యక్రమం కోసం వీరంతా గత నెల రోజులుగా చండీగఢ్లోని గవర్నమెంట్ రిహాబిలేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ (జిఆర్ఐఐడి)లో యోగాలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.
బిఎస్ఎఫ్ జవాన్లతో బాబా రాందేవ్
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని జోధ్పూర్లో అంతర్జాతీయ యోగా కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ రోజు తెల్లవారుజామున రాందేవ్ దాదాపు 3 వేల మంది బిఎస్ఎఫ్ జవాన్లతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దును కాపలా కాసే బాధ్యతను నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్)కు చెందిన భారీ శిబిరం జోధ్పూర్లో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగే యోగా కార్యమ్రాల్లో బిఎస్ఎఫ్తో పాటుగా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్మి లాంటి పారామిలటరీ దళాలు చెందిన 30 వేల మందికి పైగా జవాన్లు పాల్గొంటారని అధికారులు తెలియజేశారు.
విదేశాల్లోనూ యోగా సందడి
లండన్/మెల్బోర్న్, జూన్ 19: రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేసేందుకు బ్రిటన్ రాజధాని లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని యోగా ప్రేమికులు సన్నద్ధమయ్యారు. లండన్లో భారత హైకమిషన్తో పాటు అక్కడి భారత పర్యాటక విభాగ కార్యాలయం బ్రిటన్లోని 14 యోగా సంస్థలతో కలసి ఆదివారం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. దక్షిణాఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఆదివారం యోగా ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. వేలాది మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని యోగా పట్ల తమకు గల ప్రేమాభిమానాలను చాటుకున్నారు. చైనాలో అతిపెద్ద యోగా ప్రదర్శన ఆదివారం జరిగింది. ప్రాంతంలో వుక్సి నగరంలో ఒకే ప్రాంగణంలో 3500మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వుక్సి హాలీవుడ్ స్టూడియో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద యోగా కార్యక్రమం ఇది.
ఎన్నికల నియమావళిపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష
న్యూఢిల్లీ, జూన్ 19: ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరుపుతోంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ధన బలాన్ని ఉపయోగించడంతో పాటు ఉచిత కానుకలు ఇస్తామంటూ ఓటర్లకు ఎరవేయకుండా నిరోధించేందుకు అనుసరించాల్సిన మార్గాలను ఈ కమిటీ సూచించనుంది. ‘ప్రస్తుత ప్రవర్తనా నియమావళి, దాని అమలు తీరుపై అధ్యయనం చేస్తున్నాం. దీని గురించి వివిధ భాగస్వాములతో చర్చించేందుకు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాం. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అభిప్రాయాలను సేకరిస్తాం’ అని సిబ్బంది, ప్రజా, న్యాయ వ్యవహారాల విభాగానికి సంబంధించిన పార్లమెంటరీ స్థారుూ సంఘం చైర్మన్ ఇఎం.సుదర్శన నాచియప్పన్ తెలిపారు.
నల్లధనానికి తాజా ‘కళ్లెం’!
న్యూఢిల్లీ, జూన్ 19: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన వన్-టైమ్ కాంప్లియాన్స్ విండో పథకంలో ఎవరయినా తమ అక్రమాస్తులను వెల్లడించకుండా తప్పించుకోవడం కష్టమని నల్లధనంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) ఎంబి షా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పథకం కింద ఆదాయపు పన్ను శాఖ అన్ని కోణాల నుంచి కట్టడి చేసిందని, అందువల్ల ఈ పథకం కింద నల్లధనాన్ని వెల్లడించకుండా ఉండటం నూటికి నూరు పాళ్లు కష్టమని అన్నారు.
ఈసారి పి-నోట్స్ (పార్టిసిపేటరీ నోట్స్) జారీని కూడా చాలా వరకు నియంత్రించడం వల్ల పన్ను ఎగవేతదారులకు తమ ఆస్తులను, నిధులను ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థల దృష్టిలో పడకుండా దాచుకోవడం కష్టమని జస్టిస్ షా పేర్కొన్నారు. అందువల్ల పన్ను ఎగవేతదారులు ఈసారి తమ నల్లధనాన్ని వెల్లడించాల్సి వస్తుందని ఆయన అన్నారు.
సిపిఎంను
వెంటాడుతున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ, జూన్ 19: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పరిణామాలు సీపీఐ(ఎం)ను ఇంకా వెంటాడుతున్నాయి. దేశ రాజధానిలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపై విస్తృతమైన చర్చ జరిగింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం, దాని కారణంగా వచ్చిన ఫలితాలపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో సిపీయం కేవలం 26సీట్లకే పరిమితమవటం తెలిసిందే. రానున్న కాలంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తును కొనసాగించాలా వద్దా అన్న అంశంపైనా నిర్ణయం తీసుకుంటారు. 101మంది సభ్యులున్న సిపియం కేంద్ర కమిటీ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పనితీరుపైనా సోమవారం చర్చిస్తుంది.