జాతీయ వార్తలు
సరిహద్దుల్లో ఇక లేజర్ గోడలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జనవరి 17: భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కంచెలేని చొరబాట్లకు అవకాశాలున్న ప్రాంతాల్లో త్వరలోనే లేజర్ గోడలను ఏర్పాటు చేయనున్నారు. పఠాన్కోట్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ వైపునుంచి టెర్రరిస్టు చొరబాట్లను పూర్తిగా అరికట్టడానికి ఇలాంటి గోడలను నిర్మించాలని హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద ముఠాలు అంతర్జాతీయ సరిహద్దును దాటి మన భూభాగంలోకి చొరబడకుండా చూడడానికి పంజాబ్లోని నదీ పరీవాహక ప్రాంతాలన్నిటిని కూడా సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) అభివృద్ధి చేసిన లేజర్ వాల్స్తో మూసివేయడం జరుగుతుందని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. లేజర్ పరికరం, డిటెక్టర్కు మధ్య కదలాడే ఏ వస్తువు లేదా మనిషినైనా సరే గుర్తించడానికి ఈ లేజర్ వాల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ ప్రాంతంలోకి చొరబడితే నదిపై ఏర్పాటు చేసిన లేజర్బీమ్ పెద్ద సైరన్ మోగుతుంది.
ప్రస్తుతం చొరబాట్లకు అవకాశం ఉన్న ఈ 40 నదీ పరీవాహక ప్రాంతాల్లో కేవలం 4-5 చోట్ల మాత్రమే లేజర్ వాల్స్ను ఏర్పాటు చేసారు. పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడి చేయడానికి ముందు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు భారత్లోకి చొరబడడానికి ఉపయోగించినట్లుగా భావిస్తున్న హజ్ నదికి చెందిన చొరబాటు ప్రాంతంలో ఎలాంటి లేజర్ వాల్ లేదు. దాదాపు 130 మీటర్ల పొడవున ఉన్న నది ఒడ్డు ప్రాంతంపై నిఘా పెట్టి ఉంచడానికి ఏర్పాటు చేసిన కెమెరా కొంతకాలంగా పని చేయడం లేదని గుర్తించారు. అయితే ఈ నెల 9న ప్రధాని నరేంద్ర మోదీ పఠాన్కోట్ ఎయిర్బేస్ను సందర్శించడానికి ముందు బిఎస్ఎఫ్ ఇక్కడ లేజర్ వాల్ను ఏర్పాటు చేసింది. గత ఏడాది జూలైలో ముగ్గురు ఉగ్రవాదులు పంజాబ్లోని గురుదాస్పూర్లో దాడి జరిపే వరకు ఉగ్రవాదుల చొరబాట్లకు ఆలవాలంగా ఉంటూ వచ్చిన జమ్మూ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న కంచె లేని నదీ పరీవాహక ప్రాంతాల్లో లేజర్వాల్స్ను ఏర్పాటు చేయడాన్ని బిఎస్ఎఫ్ గత ఏడాది ప్రారంభించింది.
పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడి చేసిన టెర్రరిస్టులు తాష్ సరిహద్దు ఔట్పోస్టు సమీపంలో బమియాల్కు దిగువన అయిదు కిలోమీటర్ల వద్ద నదిని దాటి భారత్లోకి ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు. బమియాల్ వద్ద నదికి ఇరువైపులా రెండు బిఎస్ఎఫ్ పోస్టులున్నాయి. ఒక్కో పోస్టు వద్ద ఒక జవాను 24 గంటలూ నదివెంబడి నిఘా పెట్టి ఉంటాడు. అంతేకాకుండా ఈ ప్రాంతమంతటా కూడా హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడం వల్ల అంతా ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు రాత్రిపూట నీళ్లు లేని నదిలో ఒడ్డు వెంబడి కాలినడకన వెళ్లి ఉండవచ్చని, అందువల్లనే బిఎస్ఎఫ్ జవాను దృష్టిలో వారు పడి ఉండక పోవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు బమియాల్ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్కోసం ఉపయోగించే మార్గం కూడా కాదని అధికారులు చెప్తున్నారు. గత 3-4 ఏళ్లలో ఇక్కడ ఒక్కసారి కూడా డ్రగ్స్ పట్టుబడలేదు. కాగా, పఠాన్కోట్ దాడి తర్వాత బిఎస్ఎఫ్ పంజాబ్లోని సరిసద్దు వెంబడి అదనపు బలగాలను మోహరించడంతోపాటు ముఖ్యంగా రాత్రిపూట బోటు పెట్రోలింగ్ను మరింతగా పెంచింది.