AADIVAVRAM - Others

ఎవర్నీ తక్కువగా చూడకు (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో ప్రతిదీ ప్రత్యేకత సంతరించుకున్నదే. కొన్నిటికి గుర్తింపు ఉంటుంది. కొన్నిటికి ఉండదు. ప్రపంచంలో ప్రతి మనిషీ ప్రత్యేకత వున్నవాడే. ప్రత్యేకత ఉన్నది ప్రదర్శన కోసం కాదు.
ఒక వ్యక్తికి కొన్ని అభిరుచులుంటాయి, రుచులుంటాయి. ఇంకొకరికి మరి కొన్ని ఉంటాయి. వారికి అవి వున్నాయంటే ఎందుకున్నాయని అంటే సమాధానం చెప్పలేం. కొమ్మలోని ఆకుల్లో ఒకదాన్ని పోలింది ఒకటి ఉండదు. మనుషులంతా అంతే.. పోల్చడానికి వీలులేని అసాధారణ లక్షణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి.
మనం చెయ్యాల్సిందల్లా వాటిని ఆమోదించడమే. వాటిని అంగీకరించి వ్యక్తిని గౌరవించడమే.
అన్నీ నాకే తెలుసునన్న అహంభావం పనికిరాదు. ఇతరులకు ఏమీ తెలీదని అనుకోకూడదు. మనుషుల్ని తక్కువగా చూడకూడదు.
ఒక పండితుడు అన్ని శాస్త్రాల్లో గొప్ప పాండిత్యమున్నవాడు. తన మేథస్సుతో ఎందర్నో ప్రభావితం చేశాడు. వాదనలో ఎందరినో ఓడించాడు. తన ప్రతిభా పాటవాల మీద అతనికి అంతులేని నమ్మకం.
పండితుడు తీర్థయాత్రలకు బయల్దేరాడు. ఎప్పుడూ తన వెంట గ్రంథాల్ని తీసుకుపోయేవాడు. సమయం దొరికినపుడు అధ్యయనం చేసేవాడు. అతనిది గొప్ప జ్ఞాపకశక్తి.
ఒక తీర్థయాత్రలో అతను ఒక నదిని దాటాల్సి వచ్చింది. ప్రవాహం ఉధృతంగా ఉంది. తీరం ఒడ్డున పడవ ఉంది. పడవ నడిపేవాడు ఉన్నాడు. అతను పేదవాడు. గోచీ పెట్టుకున్నాడు. జనాల్ని తీరం దాటించి వాళ్లిచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు.
పండితుడు ఒక్కడే ఉన్నాడు. ఇతర ప్రయాణికులెవరూ లేరు. పడవ నడిపేవాడు ‘స్వామీ! ఇంకా ఎవరయినా ఒకరిద్దరు వచ్చాక బయల్దేరుదాం’ అన్నాడు.
పండితుడు ‘లేదు నేను వెంటనే తీరం దాటాలి’ అన్నాడు. అతను పండితుని మాట కాదనలేక పడవను నీళ్లలోకి మళ్లించాడు.
పండితుడు పడవ నడిపేవాణ్ణి పామరుడనుకున్నాడు. చులకనగా చూశాడు. ఆ పేదవాణ్ణి ఆటపట్టించాలనిపించింది.
పేదవాడు జాగ్రత్తగా తెడ్తు వేస్తూ పడవ నడిపే పనిలో వున్నాడు.
పండితుడు ‘ఒరే! నీకు గణితం వచ్చా?’ అన్నాడు. పండితులు పేదవాళ్లని అలాగే పిలిచేవాళ్లు. పేదవాడు ‘అదేంటి సామీ!’ అన్నాడు. పండితుడు ‘జీవితానికి గణితం చాలా ముఖ్యం. పోనీ తర్కశాస్త్రం గురించి నీకు తెలుసా?’ అన్నాడు.
పేదవాడు ‘నేనా మాటే వినలేదు స్వామీ!’ అన్నాడు.
‘పోనీ మీమాంస శాస్త్రం గురించి విన్నావా?’ అన్నాడు. పేదవాడు లేదన్నాడు.
‘పోనీ పురాణాలు, కావ్యాలు, అలంకార శాస్త్రం వీటి గురించి విన్నావా?’ అన్నాడు.
పేదవాడు ‘అక్షరం ముక్క రాని వాణ్ణి, ఇవన్నీ మీలాంటి వాళ్లు చదువుకునేవి నాకెలా తెలుస్తాయి సామీ!’ అన్నాడు.
పండితుడు పేదవాడి పట్ల జాలి ప్రకటించి ‘నువ్వు ఇవన్నీ తెలుసుకోలేకపోతే జీవితంలో చాలా కోల్పోతావు’ అన్నాడు.
పేదవాడు ‘కూలీనాలీ చేసుకుని, పడవ నడుపుకుని బతికే నాలాంటి వాడికి ఇవన్నీ ఎలా వస్తాయి సామీ’ అన్నాడు.
పండితుడు ‘నువ్వు ఎన్నయినా చెప్పు. ఇవన్నీ నీకు తెలియకపోవడం వల్ల నీ సగం జన్మ వ్యర్థమయింది’ అన్నాడు.
ఆ మాటలకు పేదవాడు కొద్దిగా నొచ్చుకున్నాడు. వౌనంగా ఉండిపోయాడు.
అంతలో నదీ ప్రవాహం ఎక్కువయింది. నీళ్లు ఉధృతంగా ప్రవహించసాగాయి. పడవ ఇటూ అటూ కదిలిపోయింది. పండితుడు హడలిపోయాడు.
పేదవాడు ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకుందని గుర్తించాడు. త్వరగా నదిలోకి దూకి తీరాన్ని చేరుకోకుంటే పడవతోపాటు నదిలో పడి కొట్టుకుపోతామని గ్రహించాడు.
పండితుడితో ‘సామీ! ప్రవాహం బలంగా ఉంది. పడవ కొట్టుకుపోతోంది. వెంటనే మనం నీటిలోకి దూకి అవతలి గట్టుకు ఈదాలి. మీకు ఈత వచ్చా?’ అన్నాడు.
పండితుడు ‘అయ్యో! నాకు ఈత రాదే’ అన్నాడు.
పేదవాడు ‘మీ శాస్త్రాలు నాకు రాకపోవడంతో నా సగం జీవితం వ్యర్థమయిందని అన్నారు. ఈత రాకపోవడంతో మీ పూర్తి జీవితమే మునిగిపోతోంది’ అని నదిలోకి దూకాడు. ఈతాడుకుంటూ అవతలి గట్టుకు చేరాడు.
పండితుడు పడవతోపాటు నదిలో మునిగి కొట్టుకుపోయాడు.
*

- సౌభాగ్య, 9848157909