AADIVAVRAM - Others

అసలైన చిత్రం (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రాజు కళాప్రియుడు. కళాకారుల్ని పోషించేవాడు. అద్భుతమయిన చిత్రాలన్నా శిల్పాలన్నా ఆయనకు ఎంతో ఇష్టం. కళాఖండాల్ని సేకరించడం ఆయనకు హాబీ.
అటువంటి రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఒక గొప్ప చిత్రాన్ని చిత్రించిన వాళ్లకు లక్ష రూపాయలు బహుమతి ప్రకటించాడు. దేశదేశాల నించి ఎందరో చిత్రకారులు వచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం ప్రతిభావంతులైన ఇద్దరు చిత్రకారులు మాత్రమే మిగిలారు.
రాజు వాళ్లిద్దరికీ సకల సౌకర్యాలు కలిగించాడు. వాళ్లకు ఆరు నెలల సమయం ఇస్తున్నానని, ప్రపంచంలో సాటిలేని ప్రకృతి దృశ్యాన్ని చిత్రించాలని ఆదేశించాడు. అది ఎలా ఉండాలో కూడా చెప్పాడు. నిర్మలాకాశం, నిండు చంద్రుడు, వెనె్నల లోకమంతా వ్యాపిస్తోంది. పర్వతాలపై పచ్చని అరణ్యంపై వెండి వెలుగులు ప్రసరిస్తోంది. ఈ దృశ్యాన్ని చిత్రించాలని అది సజీవంగా ఉండాలని, అది చిత్రించినట్లు కాక ప్రాణవంతంగా ఉండాలని అన్నాడు.
ఒక నిలువెత్తు గోడలు రెండు ఎదురెదురుగా ఉన్నాయి. ఆ రెండు గోడలపై చిత్రకారులు చిత్రించాలని రాజు అన్నాడు. చిత్రకారులిద్దరూ సరే నన్నారు. ఆ గోడలకు నిలువెత్తు తెరలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరికీ ఇబ్బంది కలగకుండా చిత్రకారులు ప్రశాంతంగా చిత్రించవచ్చని, రాజు కలిగించిన అనుకూలాలకు చిత్రకారులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
ఆరు నెలలు గడిచాయి. రాజు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశాడు. రాజుతో బాటు సమస్త నగర ప్రజలు ఎదురుచూశారు.
ఆ రోజు రానే వచ్చింది. నగర జనమంతా ఆ చిత్రకారులున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఎందరో రాజుగారి అనుయాయులు, రాజు ఎవరికి ప్రథమ బహుమతి ఇస్తారో లక్ష రూపాయలు ఎవరు గెలుచుకుంటారో అని ఉత్సాహంగా ఎదురుచూశారు.
రాజు సపరివారంగా ఆ పరిసరాలకు చేరుకున్నాడు. మొదటి చిత్రకారుడి గోడకు వున్న తెరను తొలగించారు. ఆ మహాచిత్రకారుడు చిత్రించిన ఆ అపూర్వ చిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. నిండు చంద్రుడు, పర్వతాలు, అరణ్యం వీటి మీదుగా వెనె్నల సాగి తమందరి మీద ప్రతిఫలిస్తున్నట్లు అందరూ అనుభూతి చెందారు. తప్పక మొదటి చిత్రకారుడు చిత్రించిన చిత్రానికే లక్ష రూపాయల బహుమతి అందుతుందని అందరూ భావించారు.
కానీ అందరికీ రెండో చిత్రకారుడు ఎంత అద్భుతంగా చిత్రించాడో అన్న ఉత్సాహం రేకెత్తింది. స్థాణువయి ఆ చిత్రాన్ని పరిశీలిస్తున్న రాజు తేరుకుని అక్కడి నించీ కదిలి ఎదురుగా ఉన్న రెండో గోడ దగ్గరకు వెళ్లాడు. అందరూ ఉద్వేగంగా ఎదురుచూశారు.
రెండో తెర తీశారు. కానీ గోడ దగ్గరే నిల్చున్న చిత్రకారుడు. గోడ నిండుగా అద్దం. ఆ అద్దంలో ప్రతిఫలిస్తున్న మొదటి చిత్రకారుడు వేసిన బొమ్మ. అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆరు నెలలుగా రెండో చిత్రకారుడు చేసిన పని గోడకు అద్దాన్ని అలంకరించడం.
రాజు అద్దంలో ప్రకృతి దృశ్యాన్ని పరిశీలించి, చిత్రకారుడితో ‘దీని ఆంతర్యమేమిట’ని ప్రశ్నించాడు.
రెండో చిత్రకారుడు ‘మహారాజా! మీరు గొప్ప ప్రకృతి దృశ్యాన్ని చిత్రించమని సెలవిచ్చారు. వివరించారు. కానీ ప్రకృతి దృశ్యమన్నది భగవంతుడు చిత్రించింది. అది అనుక్షణ పరివర్తనా శీలం మారుతూ ఉంటుంది. మారుతూ ఉన్నదాన్ని మనసుతో పట్టుకోవడమే కష్టం. ఇక అది కుంచెకెలా వొదుగుతుంది. వెనె్నల సాగుతుంది. చెట్లు కదుల్తాయి. పక్షులు ఎగురుతాయి. వీటిని స్థాణువులుగా చిత్రించలేనని నిర్ణయించుకున్నాను. మీరు ఉద్దేశించింది మొదటి చిత్రకారుడు ఎలాగూ చిత్రిస్తాడు. నేను కేవలం సాక్షీభూతుడుగా ఉండదలచుకున్నాను. అందుకే అద్దాన్ని చిత్రించాను’ అన్నాడు.
రాజు ఆనంద బాష్పాలతో వివేకవంతుడయిన ఆ చిత్రకారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు.
*

- సౌభాగ్య, 9848157909