AADIVAVRAM - Others

జోజో...లాలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనమంతా ఆరోగ్యంగా ఉండాలంటే కావలసినవి రెండే రెండు. ‘కరకర’ ఆకలి వేసి కడుపు నిండా అన్నం తినడమూ, కంటినిండా ఆదమరచి నిద్రపోవడమూను. ఎంతమందికి ఈ రెండూ లభిస్తున్నాయ్? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఉన్నవాడికీ అరగని జబ్బూ, లేనివాడికీ ఆకలి జబ్బూ అన్నాడో సినీ కవి. బాగా కాయకష్టం చేసి - అది మంచి వ్యాయామమైనా సరే - కడుపులో ఆకలి ఆవురావుమంటూంటే తింటున్న ప్రతి మెతుకూ రుచిగా నోటికి హితవై కడుపు నింపుతూంటే వేళపట్టున నిద్రాదేవి ఠపీమని హాజరై మనని ఒడిలోకి తీసుకొని చిచ్చికొట్టదూ! ఆ జీవితం స్వర్గానికి ఓ బెత్తెడు తక్కువేం కాదు మరి!
నిద్ర మీద భావ కవులూ, సినీ కవులూ చాలా కవిత్వమే గుప్పించారు. మరీ అసలు సిసలైన తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య సరేసరి! భార్య భర్తని నిద్రపుచ్చడం గగనతలానికి తీసుకెళ్లారు మల్లాది రామకృష్ణశాస్ర్తీగారు.
‘ఏడు కొండల వాడ వెంకట రమణా.. సద్దు సేయక నీవు నిదురపోవయ్యా - పాలసంద్రపు టలలు పట్టె మంచముగా - పున్నమీ వెనె్నలలు పూల పానుపుగా.. కనుల నొలికే వలపు పన్నీరు జల్లుగా - అన్ని అమరించెనీ అలిమేలుమంగా ॥
ప్రియుడు ఒడిలో సేదతీరి పవ్వళిస్తే మెల్లగా వీచే చల్లగాలి చప్పుడు కూడా ‘రొద’లాగా ప్రియుడికి కలత చెందిస్తుందనీ ప్రియురాలి గడుసు మందలింపు కృష్ణశాస్ర్తీగారి కవితలో విందాం.
‘సడిసేయకో గాలి సడిసేయబోకే - బడలి ఒడిలో రాజు పవ్వళించేనే..
లక్ష్య సాధనలో విఫలమవుతానేమోనని భయపడుతున్న భర్తను లాలిస్తూ, ధైర్యాన్నిస్తూ, వెనె్నల తెల్లదనాన్ని, చిరుగాలి చల్లదనాన్ని, లోకాతీత గాన మాధుర్యాన్నీ రంగరించి భర్తను కర్తవ్యోన్ముఖుణ్ణి చేసి ఉత్తేజపరిచే అందమైన లాలిపాట శ్రీ సదాశివ బ్రహ్మంగారి ఆనవాలు.
రేయిమించెనోయి రాజా హాయిగ నిదురించరా హాయిగ
నిదురించరా/ వెల్లివిరిసే వెనె్నల్లుకాచే - చల్లని చిరుగాలి మెల్లంగా వీచే/ స్వప్నాలలోన స్వర్గాలుకంటూ - స్వర్గాలలో దేవగానాలు వింటూ/ హాయిగ నీవింక ఎదురించవోయి ॥
చీకటి వెంట వెలుగే రాదా కష్టసుఖాలూ ఇంతే కాదా
హాయిగ నీవింక నిదురించవోయి ॥
ఊరిని వదిలిపెట్టి వేరే ఊరికెళ్లిన భర్తకు భార్య చేసుకునే విన్నపాలు దాశరథి గారి మాటల్లో విందాం. భర్త ప్రేమ కూడా భార్యకి నిద్ర రానీయటం లేదట.
కలలనైన నిన్నూ కనులజూతమన్నా
నిదురరాని నాకూ కలలు కూడ రావె
తాపమింక నేనూ ఓపలేను స్వామీ
తరుణిని కరుణను ఏలగ రావా ॥ లేక వీణ॥
భావకవులు సైతం నిద్రను సొంతం చేసుకున్నారు. తెలుగు సాహిత్యంలో చెక్కిన సజీవ శిల్పాలు ఎంకి నాయుడు బావ. వాళ్లు నండూరి వేంకట సుబ్బారావుగారిని లబ్ధిప్రతిష్ఠుణ్ని చేస్తే వాళ్లను నండూరి చిరంజీవులను చేశారు. Eternal Lovers - John Keats మాటల్లో చెప్పాలంటే - Ye be everloving and she be ever fair'.
లేపకే నా ఎంకి లేపకే నిదురా - ఈపాటి సుఖము నేనింత వరకెరగనే
కలలోన నా ఎంకి కతలు సెపుతున్నాది
ఉలికులికి పడుకుంట ఊకొట్టుతున్నాను
కతలోని మనిపల్లె కాసింతలో మారి
కనుకట్టు పనులతో కత నడుపుతున్నాది ॥
తెలివిరానీయకే కల సెదిరిపోతాది
ఒక్కనేవేనీకు పెక్కునీవులు నాకు.
మళ్లీ జాన్ కీట్స్ మాటల్లోనే "Am I awake or asleep?' నాయుడు బావ ప్రేమ జగత్తులో మత్తులో ఉన్నాడు. అందుకే ఎంక చేసేవి ‘కనికట్టు పనులే’ మరి! ఉలికిపడి లేస్తే వాస్తవ జగత్తు. తనకది అక్కరలేదు. ఎంకి మాయా ప్రపంచంలోనే నిద్రిస్తూంటే అంతా, అన్నింటా ఎంకే కనిపిస్తోంది! అహో నండూరీ! అలృగే కలలలో కలత నిదురలో నిదురించే గోపిక కృష్ణుడికిలా విన్నవించుకుంటోంది.
మ్రోగింపకోయ్ మురళి మ్రోగింపకోయ్ కృష్ణ
తీయతేనియ బరువు - మోయలేదీ బతుకు
వలదోయి, అలము నీ కలలోన నిదురింతు
భరమోయి నీ ప్రేమ వరమే నేటి రేయి మ్రోగింపకోయ్‌
కృష్ణశాస్ర్తీగారు కృష్ణ ప్రేమి. ఇక్కడ గోపిక కూడా ప్రేమ మత్తులో త్ఘీరీళచిఖ డ్ఘౄఇళూ లో ఉంది. దీన్ని మధుర ప్రేమ అంటారు. ప్రియురాలిగా భగవంతుడికి కైంకర్యం అన్న మాట.
పరమాత్ముణ్ణి జోకొట్టే అదృష్టం కొద్దిమందిది. ఆ పరమాత్ముడు రాముడు కావొచ్చూ, కృష్ణుడు కావొచ్చు. తన కొడుకుని రాముడిలా ఊహించే ప్రతి తల్లీ కావొచ్చు.
రామాలాలీ మేఘ శ్యామాలాలీ తామరస నయనా దశరథ తనయా లాలీ
ఎంతో ఎత్తు మరిగినావూ ఏవిరా చేతునూ ఇంతుల చేతుల వేడికి నీవూ ఎంతనికందేవు..
ప్రతి తల్లీ చంద్రమాను చూపిస్తూ పిల్లకి ఆము తినిపిస్తూ ‘చందమామ రావె జాబిల్లి రావె..’ అని పిలిచి పాడేటట్లు ఇంటింటా అలవాటు చేసిన అన్నమయ్యే మొట్టమొదటిగా ‘అచ్యుతుణ్ణి’ ‘జో అచ్యుతానంద - జోజో ముకుందా.. రావె పరమానంద రామగోవిందా ॥ అని జోల పాడాడు. ఆ బాణీలో ప్రసిద్ధమైన జానపద పాట ఉంది.
తొలుత బ్రహ్మాండంబు తొట్టెగావించీ
నాలుగూ వేదములు గొలుసులమరించి
బరువైన ఫణిరాజు పానుపమరించే
చెలియ డోలికలోన చేర్చి లాలించీ
అంటూ చెలియ డోలిక వైకుంఠమే అయిపోయింది. ఇవికాక అన్నమయ్య రాసిన 32 వేల సంకీర్తనలలో చాలా జోలపాటలున్నాయి. హరిని ఊయలలూగిస్తూ ‘డోలాయాంచల డోలాయం హరి డోలాయాం’ అన్నాడు. అమ్మవారు అయ్యవారితో నిద్రిస్తుంటే ‘పలుకు తేనెల తల్లి పవళించెను - కలికితనముల విభుని గలిసినది గావా’ అని శృంగారం చిందిస్తూ ముద్దుముద్దుగా వర్ణించాడు అన్నమయ్య.
కష్టాలూ, కడగళ్లూ కుదిపేస్తే సేదతీర్చేది నిద్ర. సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో సుస్వర లతామంగేష్కర్ తొలిసారి తెలుగులో పాడిన పాట చూద్దాం. ‘నిదురపోరా తమ్ముడా.. నిదురపోరా తమ్ముడా - నిదురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా’ అంటూ తమ్ముణ్ణి లాలించే నిద్ర పుచ్చే పాట ఇది. తల్లి నుంచీ వేరుపడిన పిల్లాడికి తిండి సయిస్తుందా, నిద్ర వస్తుందా చెప్పండి. ‘్భగ్యరేఖ’ సినిమాలో అందరి పిల్లల నోటా నానిన ఈ పాటను చూద్దాం. ‘చూడాలని వుంది. అమ్మను చూడాలని ఉంది. పొరపాటు పనులను చేయబోనని నీతో చెప్పాలి - కంటికి నిద్దుర రాదే. నే తింటే నోటికి పోదే. చూడటం మరి కూడదంటే ఏడుపొస్తోందమ్మా’ సుశీల పాడిన కమ్మటి పాట ఈ పాట.
నిద్రలేమితనం ఎంత చెరుపు చేస్తుందో అతి నిద్ర కూడా అంత తగనిదే. భోజన ప్రియుడైన వృకోదరుడు కడుపారా తిని గురకలు తీస్తోంటే కృష్ణుడు అంటించిన చురకలు.
‘మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా
జీవితమున సగభాగమ్మూ నిద్దురకే సరిపోవూ
అతి నిద్రా లోలుడూ తెలివిలేని మూర్ఖుడూ
చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం ॥
కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్ర, ఆరు నెలలు తిండి తినేట్టు వరం పొందాడు. (శాపం కూడానేమో!) వాల్మీకి సృష్టించిన ఊర్మిళ లక్ష్మణుడితో పెళ్లితో కనపడి మరి జాడ కనపడదు. కానీ జనపదంలో ఊర్మిళ లక్ష్మణుడితో అడవికి వెళ్లలేక, లక్ష్మణుడు అడవిలో ఉన్నన్నాళ్లూ పధ్నాలుగేళ్లూ, నిద్రపోయిందట! ఈ పాట ‘ఊర్మిళ నిద్ర’గా ప్రాచుర్యం పొందింది. లక్ష్మణుడు, రాముడూ, సీతలతో అడవికి వెళ్లినప్పటి నుంచి ఊర్మిళ నిద్రపోయిందని సీతే చెబుతోంది పట్ట్భాషేకమయ్యాక రాముడితో.
నాడు మొదలు శయ్యపై కనుమూసీ! నాతి పవళించుచున్నది
ఇకనైన యానతిచ్చీ! తమ్మునీ ఇందుముఖి కడ కంపుడీ!
ఈ విశాల అవనిలో ఇన్ని కోట్ల మంది మనుషులు హాయిగా కండి నిండా నిద్రపోతున్నారా రంటారా?! అబ్బే, లేదనే చెబుతున్నారు పరిశీలకులు. దాదాపు 20 శాతం ప్రజానీకం ప్రపంచకంలో నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లేనట!! ఇంతకు ముందు తరాల్లో ముసలితనం ఆడపులిలా మీద పడుతోంటే శరీర పటుత్వం సన్నగిల్లి, పట్టుమని పది మెతుకులు తినడంతో సరిబుచ్చి, నిద్ర పట్టక ప్రతి రాత్రీ శివరాత్రి కావడం జరుగుతూ ఉండేది. ఇప్పుడైతే పాతిక సంవత్సరాల నిండు యవ్వనవంతులు నిద్రలేమితో బాధపడటం అమితాశ్చర్యం సుమీ! దీనిన శాస్ర్తియ భాషలో ‘అబ్‌స్ట్రిక్టివ్ స్లీప్ ఆప్నియా’ అని అంటారట. ముక్కుపచ్చలారని మూడో ఏటి నుంచే చదువుల వత్తిడి, పదో క్లాసులో పరీక్షల ఒత్తిడి, ఇంటర్‌లో జీవన గమ్యం నిర్ణయించే గ్రూపులతో డాక్టరా, ఇంజనీరా, సి.ఏనా, సివిల్సా అంటూ తలవాచిపోయే వత్తిడి - ఈ వత్తిళ్లన్నీ జమిలిగా, సందోహంతో, సంరంభంగా నిద్రమీద దాడి చేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగస్తులయితే నిజంగా నిశాచరులే. రాత్రిళ్లు పని చేసి, పొద్దున్న ఆలస్యంగా నిద్ర లేవడం చేత జీవనశైలిలో అనేక మార్పులు వచ్చి నిద్ర కరవవుతోంది వారికి. నిద్రలేమిటో బి.పిలూ, షుగర్ల వంటి అనారోగ్యాలు మీద పడుతున్నాయి. నిద్ర లేకపోవడంతో వాహనచోదకులు అనేక యాక్సిడెంట్లు చేయడం చూస్తున్నాం. ధూమపానం, మద్యం సేవనం, మత్తు పదార్థాలు తీసుకోవడం వంటి వ్యసనాలు అనారోగ్యాన్నీ, నిద్రలేమినీ కలిగిస్తున్నాయి.
భార్యాభర్తల ఉద్యోగాల వల్ల చాలామంది పిల్లలకి తల్లిదండ్రులతో గడపటం, కలిసి పడుకోవడం తగ్గిపోతోంది. పిల్లలను పక్కలో పడుకోబెట్టుకుని ‘అనగనగా ఓ ఊళ్లో’ అంటూ తల్లులూ, బామ్మలూ చెప్పే బెడ్‌టైమ్ స్టోరీస్ వింటూ ఆ కథల్లోని రాజులూ రాణులూ తామే అనే తీపికలలు కంటూ నిద్రలోకి జారుకునే పసిడి పసితనం కనుమరుగైంది. ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌వల్ల - పిల్లలు నిద్రనే కాదు కావలసినవెన్నో, విలువైనవెన్నో పోగొట్టుకుంటున్నారు. మితాహారం తిని, తిన్న రెండూ రెండున్నర గంటలకు ప్రశాంతమైన, ఎక్కువ వెలుతురు జొరని పడక గదిలో నిద్రపోవాలి. హత్యలూ, నేరాలూ, ఘోరాలూ, దెయ్యాలను చూపే టీవీ షోలని పూర్తిగా కట్టెయ్యాలి. తేనె ఊటల వంటి, శృతి శుభగమైన పాటలు వింటూ వీనుల విందుగా, మనసు నిండుగా, గుండెల మువ్వల సవ్వడితో ‘రావె నిదురా హాయిగా’ అంటూ నిద్రాదేవిని రెండు చేతులా పిలుస్తూంటే ఆవిడ అక్కున చేర్చక మానుతుందా?!
ఆంగ్లంలో-
Early to bed and early to rise
makes a man healthy, wealthy and wise
అనే సూక్తి ఉంది. నిద్రలేమి అనుభవిస్తున్న వారి బాధను గుర్తించి మార్చి 18ని World sleep dayగా ప్రకటించారు.
‘వెలుగు రాక ముందె వేగ నిదురలెమ్ము
ప్రొద్దుబొడువ నిదుర బోవరాదు
సోమరితనమేల శుచి శుభ్రముల యందు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ!’
-నార్ల చిరంజీవి - ‘తెలుగుపూలు’

-కె.అరుణావ్యాస్