Others

మర్రి చెన్నారెడ్డితో అనుభవాలు, జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని
*
స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండవ విడత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి కొద్దికాలం ముందునుండీ నాకున్న పరిచయంవల్ల, ఆ తరువాత ఆయన దగ్గర సిఎం పిఆర్‌ఓగా పనిచేయడంవల్ల, ఆయనతో నాకున్న అనుబంధానికి సంబంధించిన కొన్ని అనుభవాల జ్ఞాపకాలు అప్పుడప్పుడూ మదిలో మెదులుతుంటాయి. పాలనాపరమైన, మేధోపరమైన వాటిలో కొన్ని పదిమందితో పంచుకుంటే మంచిదనే ఆలోచనే ఈ వ్యాసానికి నాంది. సిఎంగా డిసెంబర్ 3, 1989న చెన్నారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజుల్లో నేను రాజ్‌భవన్‌లో, నాటి గవర్నర్ కుముద్‌బెన్ జోషి దగ్గర, ఆమె అధ్యక్షతన పనిచేస్తున్న ‘చేతన’ అనే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలుచేసే స్వచ్ఛంద సంస్థ అడ్మినిస్ట్రేటివ్- ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్నాను. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, ఆయన ఎపిసిసి అధ్యక్షుడిగా వున్నపుడు, శాసనసభ - లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, ఆకాశవాణి వార్తా విభాగంలో నలభై రోజుల కాంట్రాక్టుమీద నేను తాత్కాలిక విలేఖరిగా పనిచేసే అవకాశం లభించింది. చెన్నారెడ్డి పాల్గొన్న అనేక కార్యక్రమాలను కవర్ చేసే వీలు అలా కలిగింది. అది నన్ను అంతకుముందే వున్న పరిచయానికి అదనంగా ఆయనకు మరింత చేరువ చేసింది.
సిఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన రెండు మూడు రోజుల్లో చెన్నారెడ్డి దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చింది. అప్పట్లో సెల్‌ఫోన్లు లేవు. అధునాతన పరికరాల ఫోన్లు కూడా లేవు. నన్ను వచ్చి కలవమని ఆయన దగ్గరనుండి పిలుపు. ఆయన కోరినట్లే తార్నాకలోని ఆయన ఇంటికి వెళ్లాను. వెళ్లిన కొద్దిసేపటికి ఆయన్ను కలవడం, నాకు ఆయన ఒక పని అప్పజెప్పడం వెంట వెంట జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్షిక ఉత్సవాలకు సిఎం సందేశం రాయమని నన్ను ఆయన ఆదేశించారు. నేనేదో చెప్పబోతుంటే, తనకంతా తెలుసనీ, నన్ను సిఎం పిఆర్‌ఓగా నియమిస్తున్నాననీ చెన్నారెడ్డి అన్నారు. నాకు ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. సరే.. నేను నాకు అప్పగించిన పని పూర్తిచేశాను.. సందేశం రాశాను. తన సహజ శైలిలో.. ‘ఇన్సిపియెంట్’ (నిశషజఔజళశఆ, ౄళ్ఘశజశ జూళ్పళ్యఔజశ జశఆ్య ఘ ఒఔళషజఛిజళజూ ఆకఔళ యూ యూళ) అనే ఒక చిన్న కామెంట్ చేసి సందేశం మీద సంతకం చేశారు. ఆ కామెంటును నేను ఒక సూచనలాగా తీసుకుని, ఆయన ఆలోచనకనుగుణంగా ఆ తరువాత సందేశాలు రాసేవాడిని. ఏనాడూ, ఏ చిన్న సవరణ కూడా చేయకుండా నేను ఆయన ముందుంచిన ప్రతి సందేశం మీద సంతకాలు పెట్టేవాడాయన.
తన దగ్గర పనిచేసిన అధికారులపై ఆయనకున్న విశ్వాసం తిరుగులేనిది.. బహుశా ఇది అరుదైన శైలేమో! ఆయన మా పట్ల ఎలాంటి నమ్మకంతో వ్యవహరించేవారో, అలానే, మేమూ వుండేవాళ్లం. ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన కె.ఆర్.పరమహంస, సంయుక్త కార్యదర్శులు జి.కిషన్‌రావు, ఆర్.ఎం.గోనెల, ఆంతరంగిక కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ముఖ్య భద్రతాధికారి రామచంద్ర రాజుల విషయంలోనూ ఆయనకు అదే నమ్మకం వుండేది. తన దగ్గర పనిచేసిన మమ్మల్ని చాలా విషయాల్లో సంప్రదించడం, సలహాలు - సూచనలు కోరడం జరుగుతుండేది. అవి ఒక్కొక్కప్పుడు చాలా చిన్న విషయాలే కావచ్చు. మరోసారి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాలే కావచ్చు. మా సలహా ఆయన అంగీకరించనూ వచ్చు, లేదా తిరస్కరించనూ వచ్చు. ఆయన దగ్గర పనిచేస్తున్న ‘మా మాట’ అంటే, అది ‘ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మాట’గానే చెలామణి కావాలని ఎన్నో పర్యాయాలు బహిరంగంగానే అంటుండేవారు. అలా అనధికారిక ఆదేశాలు కూడా ఇచ్చారు!
నన్ను చెన్నారెడ్డిగారికి పరిచయం చేసింది పాత్రికేయ మిత్రుడు, నాకు దూరపు బంధువు, పర్సా వెంకట్. 1989 సంవత్సరం పూర్వార్థంలో, మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయనగా, నాటి ఎపి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎన్టీ రామారావును ఓడించగల సమర్థుడైన వ్యక్తికి ఎపిసిసి అధ్యక్షత బాధ్యతలు అప్పజెప్పాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధిష్ఠానం ఆలోచన చేస్తున్న రోజులవి. అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. జలగం వెంగళ్‌రావు కేంద్రంలో పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా, అధిష్ఠానంలో కీలక వ్యక్తిగా స్వర్గీయ హెచ్‌కెఎల్ భగత్ పేరు ప్రచారంలో ఉండేది. రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణకు అధిష్ఠానం దగ్గర బాగా పలుకుబడి వుందని చెప్పుకునేవారు. వీరందరికంటే ఎక్కువగా, స్వతహాగా కాంగ్రెస్ అభిమానినైన నాటి గవర్నర్ కుముద్‌బెన్ జోషికి రాజీవ్ గాంధీతో సాన్నిహిత్యం, ఆయన దగ్గర పలుకుబడి బాగా వుండేది. వీరందరికీ ఇష్టమైన వారే పిసిసి అధ్యక్షుడిగా అయ్యే అవకాశాలు వుండేవప్పుడు. సరిగ్గా ఈ నేపథ్యంలో నాకు చెన్నారెడ్డిగారితో పరిచయం అయింది. ఆ పరిచయం పెరిగింది.
నా పరిచయాన్ని కొనసాగించుకుంటూనే ఆయన పిసిసి అధ్యక్షుడిగా కావడానికి ఎవరెవరి సహాయం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన నేను కూడా నా వంతుగా చేసినపుడు మదిలో ఆదిరాజు మెదిలాడు. అప్పుడు ఢిల్లీలో పాత్రికేయుడిగా మంచి పలుకుబడి సంపాదించుకున్న ఆదిరాజుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన్ను చెన్నారెడ్డి దగ్గరకు ఒక సాయంత్రం తీసుకెళ్లాను. అయితే అంతకుముందు దాదాపు పది పనె్నండేళ్లుగా వారిద్దరిమధ్య సత్సంబంధాలు లేవు. 1978-80 మధ్యకాలంలో మొదటిసారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఆయనమీద కాంగ్రెస్ అసంతృప్తి నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేసినపుడు, ఆ వివరాలను ముందుగానే మీడియా ద్వారా బహిర్గతం చేసి, అగ్నికి ఆజ్యం పోసి, చెన్నారెడ్డికి కోపం కలిగించాడు ఆదిరాజు. ఇద్దరిమధ్యా తీవ్ర వివాదానికి దారితీయడం, ఒకరితో మరొకరు మాట్లాడుకోని పరిస్థితులకు దారితీయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒకరిని మరొకరు ఆహ్వానించారని (వాస్తవానికి ఎవరు ఎవరినీ ఆహ్వానించలేదు) ఇద్దరికీ చెప్పి ఇద్దరినీ కలిపాను నేను.
ఆదిరాజును తన గదిలో చూడగానే చెన్నారెడ్డి ‘‘ఏం ఆదిరాజూ.. ఏం పనిమీద వచ్చావు?’’ అని తన సహజ ధోరణిలో ప్రశ్నించాడు. ‘‘నాకు మీతో ఏం పనిలేదు.. మీరు రమ్మని అడిగితే వచ్చాను’’ అని కోపంగా జవాబిచ్చి, ‘‘డాక్టర్ సాబ్.. ఐ యాం గోయింగ్.. ఇఫ్ యు ఇన్వైట్ మీ అగైన్ అండ్ వాంట్ మీ టు కం, ఐ విల్ సీ’’ అంటూ కుర్చీలోంచి దూకుడుగా లేచాడు. ఇద్దరికీ సర్ది చెప్పడం మా వంతైంది. చివరకు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగింది. పదేళ్ల క్రితం నాటి కోపాలు ఇద్దరూ మర్చిపోయి మాట్లాడుకున్నారు. చెన్నారెడ్డికి తన వంతు సహాయం చేస్తానని మాటిచ్చాడు. అన్నట్లుగానే ఢిల్లీలో అప్పట్లో అధిష్ఠాన వర్గానికి అత్యంత కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్న హెచ్‌కెఎల్ భగత్‌ను, నాటి కేంద్ర పరిశ్రమల మంత్రి జలగం వెంగళ్‌రావును, పార్లమెంటు సభ్యుడు ద్రోణం రాజు సత్యనారాయణను సంప్రదించాడు ఆదిరాజు. ఎవరి ప్రయత్నం ఫలించిందో చెప్పలేం కాని, 1989 ఉత్తరార్థంలో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి స్థానంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం.
చెన్నారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా నియామకం జరగడానికి పూర్వరంగంలో, ఆ విషయానికి సంబంధించి, అధిష్ఠానంతో మాట్లాడడానికి, వాళ్ళను ఒప్పించడానికి, తన వంతు లాబీయింగ్ చేసుకోవడానికి, ఆయన ఢిల్లీ వెళ్లిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు వీడ్కోలు పలకడానికి వెళ్లింది కేవలం నలుగురైదుగురం మాత్రమే. నాకు గుర్తున్నంతవరకు చెన్నారెడ్డి ఢిల్లీలో పదిహేను రోజులు మకాం వేశారు. ప్రతిరోజూ కాకపోయినా అడపా దడపా నాతో మాట్లాడేవారు. అవుననో, కాదనో అనిపించుకునేవరకు ఢిల్లీలోనే వుంటే మంచిదనే అభిప్రాయం నేను వెల్లడించేవాడిని. మొత్తంమీద నియామకం ఖాయం చేసుకునే మరీ వచ్చారు.
(మిగతా రేపటి సంచికలో)
*
-వనం జ్వాలా నరసింహారావు
(మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)